Member Legislative Assembly (MLA)
-
వారిపై అనర్హత సబబే
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలోని టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ అనర్హులుగా ప్రకటించటాన్ని మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ సత్యనారాయణన్ గురువారం ఈ తీర్పు వెలువరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లుగా గత ఏడాది గవర్నర్కు 19 మంది ఎమ్మెల్యేలు లేఖ అందజేశారు. అయితే వారిలో ఒకరు తిరిగి పళనిస్వామి పక్షాన చేరగా మిగతా 18 మందిపై స్పీకర్ గత ఏడాది సెప్టెంబర్లో అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేటుపడిన ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. స్పీకర్ నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోజాలదని జూన్ 14వ తేదీన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరాబెనర్జీ తీర్పు చెప్పగా, జస్టిస్ సుందర్ మాత్రం స్పీకర్ నిర్ణయం చెల్లదని పేర్కొన్నారు. భిన్నమైన తీర్పులు వెలువడడంతో ఈ కేసు జస్టిస్ సత్యనారాయణన్ ముందుకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్ సత్యనారాయణన్ స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. స్పీకర్ తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. దినకరన్ వర్గానికి షాక్ కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వెలువడటంతో అధికార అన్నాడీఎంకే శ్రేణులు ఆనందంలో మునిగిపోగా, టీటీవీ దినకరన్ వర్గం షాక్కు గురైంది. హైకోర్టు తీర్పు వెలువడగానే ఏఐఏడీఎంకే పార్టీ నేతలు మిఠాయిలు పంచుకుని సందడి చేశారు. పలువురు నేతలు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి అభినందించారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం, గెలుపు ఖాయమని సీఎం పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, మరో ఎమ్మెల్యే మరణంతో ఏర్పడిన రెండు అసెంబ్లీ స్థానాలను కలుపుకుని మొత్తం 20 నియోజకవర్గాల్లో వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుచేసే విషయం, తదుపరి కార్యాచరణపై 18 మంది ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని టీటీవీ దినకరన్ తెలిపారు. ఉప ఎన్నికలు వస్తే పోటీకీ తాము సిద్ధమని దినకరన్ ప్రకటించారు. 2019లోనే అసెంబ్లీకి ఎన్నికలా? మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో కీలక మార్పులు జరగనున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 234 కాగా, జయలలిత, కరుణానిధి మరణంతో సభ్యుల సంఖ్య 232కి పడిపోయింది. ఒక సభ్యుడిని స్పీకర్గా పక్కనపెడితే 231 అవుతుంది. 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను కోర్టు అనర్హులుగా ప్రకటించడంతో మిగిలింది 213 మంది. 20 సీట్లకు ఎన్నికలు జరిగే వరకు బలనిరూపణకు కావాల్సిన ఎమ్మెల్యేలు 107 మంది. పళనిస్వామికి కచ్చితంగా మద్దతు పలికేది 102 మంది ఎమ్మెల్యేలే అని పరిశీలకుల అంచనా. ఏఐఏడీఎంకేలో ఎంతమంది తిరుగుబాటుదారులున్నారో స్పష్టత లేదు. ఇప్పటికిప్పుడు బలపరీక్ష జరిగితే పాలకపక్షం నెగ్గడంపైనా అనుమానాలున్నాయంటున్నారు. బలపరీక్షలో స్పష్టత రాని పరిస్థితుల్లో అసెంబ్లీ రద్దు ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలోని చాలామంది నేతలు ఆశిస్తున్న విధంగా 2019 లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే, తక్షణం బలనిరూపణలో పళని స్వామి ప్రభుత్వం నెగ్గినా ఖాళీ అయిన 20 అసెంబ్లీ స్థానాల ఎన్నికల తర్వాత బలాబలాలు మళ్లీ మారే అవకాశం ఉంది. ఉప ఎన్నికల అనంతరం అసెంబ్లీలో స్పీకర్ను మినహాయిస్తే 233 మంది సభ్యులుంటారు. అప్పుడు మెజారిటీకి 117 సీట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 97 మంది సభ్యుల బలమున్న డీఎంకే.. ఉప ఎన్నికల్లో అన్ని సీట్లనూ గెలుచుకోగలిగితే మెజారిటీ రావచ్చు. లేదంటే మెజారిటీకి దగ్గరిగా వెళ్లొచ్చు. ఆర్కే నగర్లో దినకరన్ విజయం ద్వారా జయలలితకు బలమైన వారసుడిగా ప్రజలు గుర్తించినట్టయింది. డీఎంకే గెలవకపోయినా లేదం టే దినకరన్, అతని అనుచరులు తమ సీట్లను దక్కించుకోగలిగినా పళని ప్రభుత్వం ప్రమాదంలో పడ్డట్టే. ఉప ఎన్నికలు జరిగే 20 సీట్లు అన్ని పార్టీల మధ్య చీలినా కూడా రాజకీయ అనిశ్చితి వెంటాడే ప్రమాదముంది. ఇది కూడా తమిళనాట సత్వర ఎన్నికలకు దారితీస్తుంది. 20 సీట్లకు జరిగే ఉప ఎన్నికలను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్, కమల్హాసన్లు కూడా ప్రభావితం చేయనున్నారు. -
ఆ 27 మంది ఆప్ ఎమ్మెల్యేలు అర్హులే
న్యూఢిల్లీ: లాభదాయక పదవుల వివాదం నేపథ్యంలో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలు అర్హులేనని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం ఢిల్లీలోని అధికార ఆప్కి ఊరట లభించినట్లయింది. లాభదాయక పదవుల్లో ఉన్న కారణంగా ఆప్కి చెందిన 27 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ అందిన దరఖాస్తును రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు. 27 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఢిల్లీలోని సర్కారు దవాఖానల్లో ‘రోగి కల్యాణ్ సమితి’ చైర్మన్లుగా నియమిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం..ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటయ్యే ‘రోగి కల్యాణ్ సమితి’కి ఆప్రాంత ఎమ్మెల్యే చైర్మన్గా ఉంటారు. ప్రతి సమితికి ఏడాదికి రూ.3 లక్షల వరకు గ్రాంట్ను ప్రభుత్వం ఇస్తుంది. -
ఎమ్మెల్యేల అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత కేసులో పళనిస్వామి ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విధించిన అనర్హత వేటును మద్రాస్ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 232 మంది సభ్యులు ఉండగా.. తాజా హైకోర్టు తీర్పుతో సభ్యుల సంఖ్య 214కు పడిపోయింది. ప్రస్తుతం పళనిస్వామి ప్రభుత్వానికి 110 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో ప్రభుత్వ మనుగడకు కావాల్సిన మెజారిటీ పళని ప్రభుత్వానికి దక్కినట్టు అయింది. అయితే, ఈ 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే.. వాటి ఫలితాల ఆధారంగా సమీకరణాలు మారిపోయే అవకాశముంది. తన మద్దతుదారులైన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. అన్నాడీఎంకే పార్టీ విప్కు వ్యతిరేకంగా వ్యవహరించటంతోపాటు.. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ఉద్దేశంతో గవర్నర్ను కలిశారన్న కారణంగా తమిళనాడు స్పీకర్ ధన్పాల్ గతేడాది 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. అయితే, వీరిపై అనర్హత వేటు కేసులో గతంలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది. దీంతో విచారణను మూడో న్యాయమూర్తికి బదలాయించారు. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం తీర్పు వెలువరించారు. దీంతో మూడో న్యాయమూర్తి ఈ కేసును విచారించి.. అనర్హత వేటును సమర్థించడంతో ఎమ్మెల్యేల బహిష్కరణ ఖాయమైంది. -
కాంగ్రెస్.. ఫస్ట్ బ్యాచ్
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఎన్నికల సంగ్రామం ఊపందుకుంటోంది.. అధికార టీఆర్ఎస్కు దీటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తోంది. రొటీన్కు భిన్నంగా ఆ పార్టీ ఢిల్లీ పైరవీలను పక్కనపెట్టి గెలుపు గుర్రాల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గడిచిన మూడు, నాలుగేళ్లుగా ప్రజలతో కలిసి ఉంటున్న వారికి టికెట్లు ఖరారు చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి తొలి జాబితాలో 8 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదిత జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఢిల్లీ తీసుకెళ్లారు. ఈ జాబితాపై ఈనెల 12న ఏఐ సీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తమ్కుమార్రెడ్డితో చర్చించనున్నట్లు తెలిసింది. అనంతరం ఒక టి, రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో భారీగా దెబ్బతింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ స్థాయి నుంచి దిగువ శ్రేణి నాయకత్వం వరకు కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి గులాబీ దళంతో చేరిపోయారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని నడిపించే నాయకులు లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో అంపశయ్య మీదున్న పార్టీకి జీవిగంజి పోస్తూ కొంతమంది నేతలు ప్రజ ల మధ్యే ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే గతంతో పోలిస్తే జిల్లా కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు తక్కువగానే ఉండటంతో ఏకాభిప్రాయం ఉన్న నియోజ వర్గాల అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తూ తొలి జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ సారి దొంతికే అవకాశం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి టికెట్ ఖారారు చేసినట్లు తెలిసింది. నర్సంపేట నుంచి గత సాధారణ ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మొదటి నుంచి కాంగ్రెస్వాదిగా ఉన్న దొంతికి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చి జేఏసీ నాయకుడు కత్తి వెంకటస్వామికి టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యేలకు మరో అవకాశం.. ములుగు నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ నుంచి రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్కకు టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కోయ సామాజిక వర్గానికి చెంది న సీతక్కకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టుం ది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటీకీ ఆమె మొదటి నుంచి ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇక భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి పేరు ఖరారైనట్లే తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2014 ఎన్నికల్లో మధుసూదనాచారి చేతిలో ఓటమిపాలయ్యా రు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. ఆయన ఇదే నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అరూరి రమేష్ చేతిలో ఓడిపోయారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్కు మాజీ మంత్రులు జనగామ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తొలుత ఆయన కోడలు వైశాలి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో పొన్నాల పేరు ఖరారు చేసినట్లు సమాచారం. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం టికెట్ మాజీ మంత్రి గుండె విజయరామారావుకు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో సిద్ధిపేట ఎంపీగా పనిచేసిన ఆయన 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దివంగత సీఎం వైఎస్ ప్రభుత్వంలో పౌర సరఫరా శాఖా మంత్రిగా పని చేశారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఒకరు తొలిసారి.. ఇంకొకరు మలిసారి.. పాలకుర్తి నియోజకవర్గం నుంచి జంగా రాఘవరెడ్డి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. జంగా రాఘవరెడ్డి డీసీసీబీ చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి డాక్టర్ రామచంద్రునాయక్ మరోసారి ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ఆయన సూర్యాపేటలో ఒక ప్రైవేటు నర్సింంగ్ హోం నిర్వహిస్తున్నారు. 2014లో టీడీపీ తరఫున ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. -
గజ్వేల్ నుంచి కేసీఆర్.. 105 మంది అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్ : 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు... భద్రాద్రి కొత్తగూడెం: 1) భద్రాచలం : డా: తెల్లం వెంకట రావ్ 2) పినపాక : పాయమ్ వెంకటేశ్వర్లు 3) అశ్వారావు పేట : తాటి వెంకటేశ్వర్లు 4) ఇల్లెందు : కోరమ్ వెంకయ్య 5) కొత్తగూడెం : జలగం వెంకట్ రావు ఖమ్మం : 6) ఖమ్మం: పువ్వాడ అజయ్ కుమార్ 7) పాలేరు : తుమ్మల నాగేశ్వర్ రావు 8) వైరా : బానోత్ మదన్ లాల్ 9)మధిర : లింగాల కమల్రాజ్ 10) సత్తుపల్లి : పిడమర్తి రవి మహబూబాబాద్ : 11) మహబూబాబాద్ : బానోత్ శంకర్ నాయక్ 12) దోర్నకల్ : డీఎస్ రెడ్య నాయక్ వరంగల్ (రూరల్) : 13) పరకాల : చల్లా ధర్మా రెడ్డి 14) నర్సంపేట్ : పెద్ది సుదర్శన్ రెడ్డి 15) వర్థన్నపేట : అరూరి రమేష్ వరంగల్ ( అర్బన్) : 16) వరంగల్ వెస్ట్ : దాస్యం వినయ్ భాస్కర్ జయశంకర్ భూపాలపల్లి : 17) భూపాలపల్లి : ఎస్. మధుసూదనాచారి 18) ములుగు : అజ్మీరా చందులాల్ జనగాం : 19) జనగాం : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 20) స్టేషన్ ఘన్పూర్ : డా. తాటికొండ రాజయ్య 21) పాలకుర్తి : ఎర్రబెల్లి దయాకర్ రావ్ నల్గొండ : 22) నల్గొండ : కంచర్ల భూపాల్ రెడ్డి 23) మిర్యాలగూడ : ఎన్. భాస్కర్ రావ్ 24) నాగార్జున సాగర్ : నోముల నర్సింమయ్య 25) దేవరకొండ : రమావత్ రవీంద్ర కుమార్ 26) మునుగోడు : కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 27)నక్కిరేకల్ : వేముల వీరేశం సూర్యాపేట్ : 28) సూర్యాపేట్ : గుంతకండ్ల జగదీష్ రెడ్డి 29) తుంగతుర్తి : గ్యాదారి కిషోర్ కుమార్ యాదాద్రి భువనగిరి : 30) ఆలేరు : గొంగిడి సునీత 31) భువనగిరి : పైల్ల శేఖర్ రెడ్డి నిజామాబాద్ : 32) నిజామాబాద్ అర్బన్ : గణేష్ బీగాల 33) నిజామాబాద్ రూరల్ : బాజిరెడ్డి గోవర్థన్ 34) ఆర్మూర్ : ఆశన్నగరి జీవన్ రెడ్డి 35) బాల్కొండ : వేముల ప్రశాంత్ రెడ్డి 36) బోదన్ : షకీల్ అహ్మద్ కామారెడ్డి : 37) బాన్స్వాడా : పోచారం శ్రీనివాస రెడ్డి 38) కామారెడ్డి : గంప గోవర్థన్ 39) జుక్కల్ : హనుమంతు షిండే 40) యాల్లారెడ్డి : ఏనుగు రవీందర్ రెడ్డి అదిలాబాద్ : 41) అదిలాబాద్ : జోగు రామన్న 42) బోధ్ : రాథోడ్ బాబు రావ్ 43)ఖానాపూర్ : రేఖా నాయక్ అసిఫాబాద్ : 44) అసిఫాబాద్ : కోవ లక్ష్మీ 45) సిర్పూర్ కాగజ్ నగర్ : కోనేరు కోనప్ప నిర్మల్ : 46) నిర్మల్ : అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి 47) ముధోల్ : జి. విట్టల్ రెడ్డి మంచిర్యాల : 48) మంచిర్యాల : నాదిపెల్లి దివాకర్ రావ్ 49) బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య 50 ) చెన్నూర్ : బాల్క సుమన్ కరీంనగర్ : 51) కరీంనగర్ : గంగుల కమలాకర్ 52) హుజూరాబాద్ : ఈటెల రాజేందర్ 53) మానకొండూర్ : రసమయి బాలక్రిష్ణ సిరిసిల్ల : 54) సిరిసిల్ల : కేటీ రామారావ్ 55) వేములవాడ : చెన్నమనేని రమేష్ జగిత్యాల : 56) జగిత్యాల : డా. ఎమ్. సంజయ్ కుమార్ 57) కోరుట్ల : కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్ 58) ధర్మపురి : కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి : 59) పెద్దపల్లి : దాసరి మనోహర్ రెడ్డి 60) మంథని : పుట్ట మధుకర్ 61) రామగుండం : సోమారపు సత్యనారాయణ సిద్దిపేట : 62) సిద్దిపేట : హరీశ్రావు 63) దుబ్బాక : సోలిపేట రామాలింగారెడ్డి 64) గజ్వేల్ : కేసీఆర్ 65) హుస్నాబాద్ : సతీష్కుమార్ మెదక్ : 66) మెదక్ : పద్మాదేవేందర్ రెడ్డి 67) నర్సాపూర్ : చిలుముల మదన్ రెడ్డి సంగారెడ్డి : 68) సంగారెడ్డి : చింతా ప్రభాకర్ 69) నారాయణఖేడ్ : భూపాల్రెడ్డి 70) ఆందోల్ : చంటి క్రాంతి కిరణ్ 71) పటాన్చెరు : గూడెం మహిపాల్ రెడ్డి మహబూబ్నగర్ : 72) మహబూబ్నగర్ : శ్రీనివాస్గౌడ్ 73) జడ్చెర్ల : లక్ష్మారెడ్డి 74) దేవరకద్ర : ఆలే వెంకటేశ్వర్రెడ్డి 75) నారాయణపేట్ : రాజేందర్రెడ్డి 76) మక్తల్ : చిట్టం రామ్ మోహన్ రెడ్డి నాగర్కర్నూల్ : 77) నాగర్కర్నూల్ : మర్రి జనార్ధన్రెడ్డి 78) కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు 79) అచ్చంపేట : గువ్వల బాలరాజ్ 80) కల్వకుర్తి : జి. జైపాల్ యాదవ్ వనపర్తి : 81) వనపర్తి : సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి గద్వాల్ : 82) గద్వాల్ : బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి 83) ఆలమూర్ : వల్లూర్ మల్లెపోగు అబ్రహం వికారాబాద్ : 84) పరిగి : కోప్పుల మహేష్ రెడ్డి 85) తాండూర్ : పట్నం మహేందర్ రెడ్డి 86) కొడంగల్ : పట్నం నరేందర్ రెడ్డి రంగారెడ్డి : 87) షాద్నగర్ : అంజయ్య యాదవ్ 88) రాజేంద్రనగర్ : ప్రకాష్ గౌడ్ 89) మహేశ్వరం : తీగల కృష్ణారెడ్డి 90) ఇబ్రహింపట్నం : మంచిరెడ్డి కిషన్ రెడ్డి 91)శేరిలింగంపల్లి: అరికెపూడి గాంధీ 92) ఎల్బీనగర్ : మద్దగోని రామ్మోహన్ గౌడ్ 93) చేవెళ్ల : కాలె యాదయ్య మల్కాజ్గిరి : 94) కుత్బుల్లాపూర్: వివేకానంద 95) కూకట్పల్లి : మాధవరం కృష్ణారావు 96) ఉప్పల్ : సుభాష్ రెడ్డి హైదరాబాద్ : 97) సికింద్రాబాద్ : పద్మారావు 98) సనత్ నగర్ : తలసాని శ్రీనివాస్ యాదవ్ 99) కంటోన్మెంట్ : సాయన్న 100) జూబ్లీహిల్స్ : మాగంటి గోపినాథ్ 101) యాకత్పూరా: సామ సుందర్ రెడ్డి 102) చాంద్రాయణగుట్ట : ఎం. సీతారాం రెడ్డి 103) కార్వాన్ : జీవన్ సింగ్ 104) బహదూర్పురా : ఇయాకత్ అలీ 105) నాంపల్లి : మునుకుంట్ల ఆనంద్ గౌడ్ -
ముందస్తు హడావుడి
సాక్షి, వరంగల్ రూరల్: అసెంబ్లీ రద్దు వార్తల నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యేలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ నెల 6న అసెంబ్లీని రద్దు చేస్తే బుధవారం చివరి రోజు కావడంతో అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలవంటి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడిపారు. బుధవారం రాత్రి వరకు పాల్గొని అధికార కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు జోరుగా శంకుస్థాపనలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్మించిన పలు భవనాలను సైతం ప్రారంభించారు. రూ.111 కోట్ల పనులకు శంకుస్థాపనలు.. జిల్లాలో పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ఒకే రోజు రూ.111.04 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేలు అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ కార్యకర్తలను సమయాత్తం చేశారు. పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి బుధవారం ఒక్కరోజే రూ.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరకాలలో శంకుస్థాపనలు.. దామెర మండలంలో రూ.12 కోట్లతో దామెర క్రాస్ రోడ్డు నుంచి పరకాల రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు రూ.1.25 కోట్లతో నూతన తహసీల్దార్ భవన నిర్మాణం ఆత్మకూరు మండలంలో రూ.20 లక్షలతో కమ్యూనిటీ భవనాలు గీసుకొండ మండలం మచ్చాపుర్ నుంచి లక్ష్మీపురం వయా ఎలుకుర్తి రోడ్డు విస్తరణ పనులు. పరకాల మండలంలో రూ.1.25 కోట్లతో నూతన ఆర్డీఓ కార్యాలయ నిర్మాణం. రూ.1.25 కోట్లతో పరకాల తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం నడికూడ మండలంలో రూ.1.25 కోట్లతో తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం. వర్ధన్నపేటలో.. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ బుధవారం ఒక్కరోజే రూ.75.04 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.11.5 కోట్లతో పర్వతగిరి, నందనం, ఇల్లందలో చెక్డ్యాం పనులు. వర్ధన్నపేట మండలంలో రూ.2.60 కోట్లతో కోనారెడ్డి చెరువు పునరుద్ధరణ పనులు. పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు, హసన్పర్తిలో ఎస్సీ, ఎస్టీ కాలనీలో రూ.44 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు.. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో రూ.1.30 కోట్లతో మజీదుల అభివృద్ధి పనులు. వర్ధన్నపేట మండలంలో రూ.15 కోట్లతో కట్య్రాల నుంచి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన. ప్రారంభోత్సవాలు.. రూ.1 కోటితో నిర్మించిన వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్ నూతన భవనంను ప్రారంభించారు. నర్సంపేటలో.. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం ఖానాపురం మండలంలో రూ.15 లక్షలతో నిర్మించిన మూడు కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు. ప్రతిపాదనలు ఆయా నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో మిగిలిన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను చీఫ్ ప్లానింగ్ కార్యాలయంలో అందించారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన పీఏలు ప్రతిపాదనలను సీపీఓకు అందించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు కలెక్టర్ హరితకు అందించారు. -
కదిలింది గులాబీ దండు
నిజామాబాద్అర్బన్: దారులన్నీ అటు వైపే.. వాహనాలన్నీ ‘ప్రగతి’ సభ వైపే.. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ బిజీబిజీగా కనిపించాయి. గులాబీ జెండాల రెపరెపలతో సందడిగా మారాయి. టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కంగరకొలాన్లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు. వందలాది వాహనాల్లో వారంతా తరలి వెళ్లడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. 1.10 లక్షల మంది తరలింపు.. ప్రగతి నివేదన సభకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 1.10 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 53 వేల మంది సభకు వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులతో పాటు ఇతర వాహనాల్లో ఉదయం నుంచే బయల్దేరి వెళ్లారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యలు, రాష్ట్ర నాయకులు జన సమీకరణ చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి 88 ఆర్టీసీ బస్సులు, 90 ప్రైవేట్ బస్సులు, 240 వరకు కార్లలో 8,700 మంది వరకు తరలివెళ్లారు. బాల్కొండ నుంచి 687 వాహనాల్లో 12,465 మంది, బోధన్ నుంచి 450 వాహనాల్లో 9,700 మంది, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో 425 వాహనాల్లో 11,400 మంది, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో 750 వాహనాల్లో 12,500 మందిని తరలించారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి 16 వేలు, బాన్సువాడ నుంచి 12 వేలు, ఎల్లారెడ్డి నుంచి 12 వేలు, జుక్కల్ నుంచి 11 వేల మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులతో పాటు అద్దె వాహనాల్లో తరలి వెళ్లారు. మొత్తం కామారెడ్డి జిల్లా నుంచి 51 వేల మంది వరకు ప్రగతి నివేదన సభకు బయల్దేరి వెళ్లారు. రహదారులన్నీ గులాబీమయం.. జన సమీకరణ బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో ఎమ్మెల్యేలు రెండు, మూడ్రోజులుగా తమ నియోజకవర్గాల్లోనే తిష్టవేసి జన సమీకరణకు సర్వశక్తులు ఒడ్డారు. జనాన్ని తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 508 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. అలాగే, ప్రైవేట్ వాహనాలు, ట్రాక్టర్లు, సుమోలు అద్దెకు తీసుకుని జనాలను తరలించారు. 44వ జాతీయ రహదారి గులాబీమయంగా మారింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వాహనాలతో హైవే కిక్కిరిసింది. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాన ప్రాంతాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద సీపీ కార్తికేయ ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షించారు. హైవేతో పాటు జిల్లాకు అనుసంధామున్న రాష్ట్ర రహదారులు, వివిధ మండలాల నుంచి జిల్లాకు.. అక్కడి నుంచి జాతీయ రహదారికి వెళ్లేందుకు రూట్మ్యాప్ను రూపొందించారు. ఒక్కో ప్రధాన ప్రాంతం వద్ద సీఐ స్థాయి అధికారి, ట్రాఫిక్ పోలీసులను నియమించారు. -
ప్రగతి నివేదన సభకు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు
భూపాలపల్లి (వరంగల్): జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రగతి నివేదన సభకు భారీగా తరలి వెళ్లారు. శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి పరోక్షంగా, మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే పుట్ట మధు వాహనాలను పంపించి జనాల తరలింపులో సఫలీకృతమయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి సుమారు 100 ఆర్టీసీ బస్సుల్లో 6 వేల మంది, 90 డీసీఎంలలో 5 వేలు, 75 స్కూల్ బస్సుల్లో 3 వేలు, 60 ట్రాక్టర్లలో 1,500, వంద కార్లలో 700 మందిని ప్రగతి నివేదన సభకు తరలించారు. అలాగే మంత్రి చందూలాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను భారీ మొత్తంలోనే తరలించారు. నియోజకవర్గం నుంచి 100 ఆర్టీసీ బస్సులు, 64 ప్రైవేట్ బస్సులు, 25 మినీ బస్సులు, 50 స్కూల్ బస్సులు, 49 డీసీఎంలు, 50 టెంపో టాక్సీలు, 151 టవేరా వాహనాల్లో సుమారు 18 వేల మందిని తరలించారు. అలాగే మంథని నియోజకవర్గంలోని కాటారం, మహముత్తారం, మల్హర్, మహదేవ్పూర్, పలిమెల మండలాల నుంచి 190 ప్రైవేట్ వాహనాలు, 20 స్కూల్, ప్రైవేట్ బస్సులతోపాటు ఇతర వాహనాల్లో సుమారు 3,500 మందిని ఎమ్మెల్యే పుట్ట మధు తరలించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 37,500 మంది ప్రగతి నివేదన సభకు తరలివెళ్లినట్లు సమాచారం. పోటాపోటీగా.. పనితీరు ఆధారంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం టీఆర్ఎస్లో ఊపందుకోవడంతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రగతి నివేదన సభను సవాల్గా తీసుకున్నారు. ఒకరి కంటే ఒకరు పోటీగా వాహనాలను సమకూర్చి జనాలను తరలించారు. ప్రజాప్రతినిధులతో పాటు టికెట్లు ఆశిస్తున్న వారు సైతం తమ బలాన్ని చూపించుకోవడం కోసం తాపత్రయపడ్డారు. అనుకూలంగా ఉన్న మండలాలు, గ్రామాలకు వాహనాలను పంపించి టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలను తరలించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో శాసన సభాపతి మధుసూదనాచారితోపాటు గండ్ర సత్యనారాయణరావు కూడా సభకు ప్రజలను తరలించినట్లు తెలిసింది. ఇబ్బందుల్లో ప్రయాణికులు.. సభ కారణంగా సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జిల్లాలో ఏకైక భూపాలపల్లి బస్డిపోలో 81 బస్సులు ఉండగా అందులో 71 బస్సులు సభకు వెళ్లాయి. -
అసమ్మతి సెగ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అధికార టీఆర్ఎస్లో అసంతృప్తులు భగ్గుమంటున్నారు. కొద్ది రోజులుగా రగులుతున్న అసమ్మతి సెగ తిరుగుబాటుకు దారి తీసింది. తెలంగాణ ఉద్యమానికి, గులాబీ దళపతి కేసీఆర్కు సెంటిమెంట్ జిల్లాలో మంగళవారం ఒకేరోజు మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమనడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణపై ప్రత్యర్థులు బాహాటంగా తిరుగుబాటు చేసి నిరసనలు తెలపగా, వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేష్బాబుపై ఆయన వ్యతిరేకవర్గం వె య్యి మందితో సమావేశం నిర్వహించింది. చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శం కుస్థాపన సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త, సింగిల్విండో డైరెక్టర్ గడ్డం చుక్కారెడ్డి కొబ్బ రికాయ కొట్టేందుకు సిద్ధం కాగా ఎమ్మెల్యే బొడిగె శోభ ఆయనను అడ్డుకుని వెనక్కి నెట్టేయడం వివాదాస్పదమైంది. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్కుమార్ల సమక్షంలో జరిగిన ఈ ఘటన పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రామగుండంలో ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం భేటీ.. రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వ్యతిరేకులు ఏకమయ్యారు. ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్లోని టీవీ గార్డెన్లో సోమారపు అసమ్మతి నేతలంతా మంగళవారం సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ గ్రూప్ రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవల తనపై అవిశ్వాసం పెట్టించి పదవి నుంచి దింపేసిన ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వ్యతిరేక శక్తులను ఏకంగా చేసే పనిలో మాజీ మేయర్ కొంకటి లక్ష్మినారాయణ ఉన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న కోరుకంటి చందర్, కందుల సంధ్యారాణితోపాటు మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, పార్టీ నాయకులు పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమారపు సత్యనారాయణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నేరవేర్చలేదని, ఉద్యమ సమయంలో పార్టీలో పని చేసిన నాయకులను, కార్యకర్తలను పూర్తిగా విస్మరించి, తన చెప్పు చేతల్లో ఉన్న కొంతమందితోనే రాజకీయం చేస్తున్నారని ఈ సందర్భంగా సోమారపుపై ధ్వజమెత్తారు. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించడంతోపాటు డివిజన్ల వారీగా సమావేశాల నిర్వహణకు, కార్యాచరణకు సిద్ధం కావడం టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. వేములవాడలో ఎమ్మెల్యే రమేశ్కు వ్యతిరేకంగా.. వేములవాడ నియోజకవర్గంలో అధికార పార్టీలో అసమ్మతి సెగ పతాక స్థాయికి చేరుకుంది. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు వ్యతిరేక వర్గం వెయ్యి మంది కార్యకర్తలతో మంగళవారం సమావేశమైంది. ఎమ్మెల్యే రమేశ్బాబును తప్పించడమే లక్ష్యంగా ఆపార్టీకి చెందిన దాదాపు వెయ్యి మందికిపైగా కార్యకర్తలు కలసి అదే వేదిక నుంచి బాహాటంగా ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని, జెండాలు మోసి, పార్టీ కోసమే పనిచేస్తున్న తమపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే రమేశ్బాబుకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే బరి నుంచి రమేశ్బాబును తప్పించాలని భీష్మ ప్రతిజ్ఙ చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే రమేశ్ బాబు స్వచ్ఛందంగా వైదొలగాలని కూడా డిమాండ్ చేశారు. వేములవాడలో పార్టీ నాయకత్వం మార్పు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. మంత్రి, ఎంపీల సమక్షంలో చొప్పదండిలో గలాటా.. చొప్పదండిలో సీనియర్ నేతల సమక్షంలోనే పార్టీ నాయకులు వాదులాడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మంగళవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్కుమార్ ముందే ఎమ్మెల్యే శోభ, మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త చుక్కారెడ్డి వాగ్వాదానికి దిగారు. ఎంపీ వినోద్ సూచన మేరకు ఫైర్ స్టేషన్ భవన ప్రారంభోత్సవం వద్ద చుక్కారెడ్డి టెంకాయ కొడుతుండగా ఎమ్మెల్యే శోభ అడ్డుకుని వెనక్కి నెట్టారు. దీంతో అక్కడ కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి రాజేందర్, ఎంపీ వినోద్ వారించడంతో ఎమ్మెల్యే తమ అనచరులతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మంత్రితో చుక్కారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. -
రైతుల కోసం ఆత్మాహుతికైనా సిద్ధం
కడప కార్పొరేషన్: జిల్లాలోని రైతులకు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్, పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనను ఉధృతం చేస్తామని, అవసరమైతే ఆత్మాహుతికైనా సిద్ధపడతామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్నా, రైతాంగాన్ని ప్రభుత్వం ఏ రకంగానూ ఆదుకోవడం లేదన్నారు.దీనివల్ల బాబు వస్తే కరువు మామూలే అన్న పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్, పంట నష్టపరిహా రం ఇవ్వాలని అధికారులు లెక్కలు వేసి పంపిస్తే ప్రభుత్వం ఇంతవరకూ మంజూరు చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ఎందుకు మొండి బకాయిలుగా మార్చుతున్నారు, రైతులు ఏం పాపం చేశారని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విలాసాలు, జల్సాలకు చార్టెడ్ ఫ్లైట్లు, ఎయిర్క్రాఫ్టŠస్లో విదేశీ టూర్లకు ఉన్న డబ్బులు రైతులకు ఇవ్వడానికి లేవా అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ ఇన్సూరెన్స్ కార్యాల యం ఎదుట వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నా చేస్తే కొంత బీమా ఇచ్చారని, మిగిలిందంతా పెండింగ్లో ఉంచారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం వారు కలెక్టర్ హరికిరణ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి న్యా యం చేయాలని కోరారు.ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, మాసీమబాబు, అఫ్జల్ఖాన్, తుమ్మలకుంట శివశంకర్, రాచమల్లు రవిశంకర్రెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం కడప మండల అధ్యక్షుడు ఎం. రాజగోపాల్రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు చల్లా రాజశేఖర్, నా గేంద్రారెడ్డి, సీహెచ్ వినోద్, వేణుగోపాల్నాయక్,నారుమాధవ్, గురుమోహన్, విజయ్ప్రతాప్రెడ్డి, షఫీ, ఖాజా, బోలా పద్మావతి, పత్తిరాజేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, రత్నకుమారి, క్రిష్ణవేణి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాతలపై కరుణ లేకపోవడం దారుణం జిల్లాలో తీవ్ర కరువుకాటకాల వల్ల 3లక్షలకు పైబడి ఎకరాల్లో పంట సాగుచేయలేదు. జిల్లాలోని 51 మండలాను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం అన్నదాతలకు ఎలాంటి సాయం చేయలేదు. కోస్తాలో వరదల వల్ల పంట నష్టపోయిన వారికి హెక్టారుకు 26వేల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించిన సీఎం, కరవు వల్ల నష్టపోయిన రైతులకు ఎలాంటి సాయం ప్రకటించకపోవడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి వల్లే 2012–13 రబీ శనగ పంటకు సంబంధించి 3వ విడతగా రావాల్సిన రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ రాలేదు. 2014 రబీలో రుణాలు రీషెడ్యూల్ చేసుకొని రైతులకు రూ.13.69కోట్ల బీమా పెండింగ్లో ఉంటే ఇందులో కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5.50కోట్లు చెల్లించాలి. 2015 నాటి ఇన్పుట్ సబ్సిడీ ఈనాటికీ రాలేదు. 2010లో అరటి పంట నష్టపోతే ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు నుంచి జిల్లాలోని ప్రాజెక్టులకు నీరివ్వాలంటే ఎస్ఆర్బీసీకి 12వేల క్యూసెక్కులు విడుదల చేయాలి. – వైఎస్ అవినాష్రెడ్డి, కడప మాజీ ఎంపీ రైతుల కష్టాలు సీఎం, మంత్రులకు పట్టలేదు జిల్లాలో లక్షలాదిమంది రైతులు కరువు బారిన పడ్డారు. ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టకుండా లంచాలు, కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తోంది. వైఎస్ ఐదున్నర సంవత్సరాల్లోనే లక్షా యాభైవేలకోట్లతో జలయజ్ఞం చేపట్టి కోటి ఎకరాలకు నీరందించాలని కలలుగన్నారు. ఎక్కడ కృష్ణానీరు, ఎక్కడ తుంగభద్ర ఆ నీటితో జిల్లాలో 8లక్షల ఎకరాల పారుదల జరగాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు దగ్గరా ఒక్క ఇటుక పేర్చలేదు. కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం తప్పా చేసిందేమీ లేదు. 2015, 2016 సంవత్సరాల్లో రుణాలు రీషెడ్యూల్ చేసుకోని రైతులకు ఇన్సూరెన్స్ రాలేదు. ఈ సమస్యలపై వందలసార్లు కలెక్టర్ను కలిశాం. పవర్గ్రిడ్ కార్పొరేషన్ వారితో సమావేశం ఏర్పాటు చేస్తామని ఇప్పటికి చేయలేదు. అధికార యంత్రాగం సీఎం సభలకు జనం తోలడానికే తప్పా మరెందుకూ పనికి రావడం లేదు. – పి. రవీంద్రనాథ్రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పట్టెడన్నం పెట్టలేని స్థితిలో అన్నదాత అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత పట్టెడన్నం పెట్టలేని స్థితిలో ఉన్నాడు. ఇందుకు కారణం చంద్రబాబు ప్రభుత్వమే. గతంలో ఆయన 9ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు జిల్లా రైతులు వరినారు చూడలేదు. ఇన్సూరెన్స్ గూర్చి పార్లమెంటులో లేవనెత్తినా, హైదరాబాద్ ఏఐసీ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ ధర్నా చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. శ్రీశైలంలో నీరున్నా జిల్లాలోని ప్రాజెక్టులకు నీరు విడుదల చేయడం లేదు. ఎన్నికల కోసమే రూ.1000 నిరుద్యోగ భృతి ప్రకటించారు.– కె. సురేష్బాబు, వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కరవు పోవాలంటే బాబు దిగిపోవాలి నలభై ఏళ్లలో ఇలాంటి కరవు చూడలేదు. ధాతు కరువును మించిన కరువుగా ఉంది. ఐదు నియోజకవర్గాల్లో విత్తనమే పడలేదు. చెనిక్కాయ వేయడానికి అదును పోయింది. మనుషులకే తినడానికి తిండి లేదు, ఇక పశువులకు పశుగ్రాసం ఎక్కడినుంచి వస్తుంది. పాల ఉత్పత్తి 75 శాతం తగ్గిపోయింది. కుందూలో 24వేల క్యూసెక్కుల నీరు నెల్లూరుకు పోతోంది. ఆ నీటిని తెలుగుగంగకు మళ్లిస్తే 1.75లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు. నెల్లూరుపై ఉన్న ప్రేమ కడపపై లేదు. జిల్లాపై ఎందుకింత కక్షసాధిస్తున్నారో ఆర్థం కావడం లేదు. ముళ్లు కట్టె తీసుకొని పొడిస్తే తప్పా ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు.– ఎస్. రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే -
కేరళకు విరాళంగా వైఎస్సార్సీపీ శాసనసభ్యుల నెల వేతనం
సాక్షి, అమరావతి: వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగస్టు నెల వేతనంతో పాటు అలవెన్సులను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. కేరళ రాష్ట్ర సీఎం సహాయ నిధి కోసం ఆ మొత్తం అందేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ డ్రాఫ్ట్ (డి.డి) తీసి దానిని వైఎస్సార్సీపీ శాసనసభ కార్యాలయం ఇన్చార్జి ఎస్.శివప్రసాద్కు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. చదవండి: కేరళకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం -
ఉత్తమ ఎమ్మెల్యేలకు పురస్కారాలు
భువనేశ్వర్ : ప్రజా సేవలో నిర్విరామ కృషి చేసిన పలువురు శాసనసభ్యులను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించారు. రాష్ట్ర శాసనసభ సమావేశ మందిరంలో సన్మాన సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల ప్రజలకు విశేష సేవలందించిన ఆయా శాసనసభ్యులను పలు పురస్కారాలతో ముఖ్యమంత్రి సత్కరించారు. మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, నూతనంగా ఎన్నికైన ఆయా శాసనసభ్యులకు మొత్తం మూడు విభాగాల్లో ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి అందజేశారు. రాష్ట్రంలోని సుమారు 24 మంది శాసనసభ్యులకు ఈ గౌరవం దక్కడం విశేషం. ఉత్తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పండిత నీలకంఠ పురస్కారం, మాజీ ఎమ్మెల్యేలకు ఉత్కళ గౌరవ్ మధుసూదనదాస్ అవార్డు,కొత్త ఎమ్మెల్యేలకు ఉత్కళమణి గోపబంధు ప్రతిభా పురస్కారం ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ 3 విభాగాల కింద ఏటా ముగ్గురు చొప్పున 2009 నుంచి 2016 సంవత్సరం వరకు పనిచేసిన సుమారు 24 మంది ఉన్నత ఎమ్మెల్యేలను ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు పురస్కార కమిటీ తెలిపింది.పండిత నీలకంఠ పురస్కారం పొందిన వారిలోవిష్ణుచరణ్ దాస్(2009), డాక్టర్ అరుణ్కుమార్ సాహు(2010), ప్రభాత్రంజన్ బిశ్వాల్(2011), డాక్టర్ ప్రపుల్లమఝి(2012), అమరప్రసాద్ శత్పతి(2013), ప్రమీల మల్లిక్(2014), రణేంద్ర ప్రతాప్ స్వంయి(2015), డాక్టర్ రమేష్చంద్ర చౌ పట్నాయక్(2016) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉత్కళ గౌరవ మధుసూదన్ దాస్ పురస్కారాన్ని మాజీ ఎమ్మెల్యేలు సురేంద్రనాథ్ నాయక్(2009), బింబాధర్ కుంవర్(2010), నిత్యానంద ప్రదాన్(2011), ఉమేష్చంద్ర స్వంయి(2012), విక్రమ్ కేశరి వర్మ(2013), రాజేంద్ర డొలాకియా(2014), సురేంద్రప్రసాద్ పరమాణిక్(2015), చక్రధర్ పాయిక్(2016)లు అందుకున్నారు. ఉత్కళ మణి గోపబంధు ప్రతిభా పురస్కారాన్ని కొత్త ఎమ్మెల్యేలు అయిన సంజయ్కుమార్దాస్ వర్మ(2009), ప్రీతిరంజన్ ఘొడై( 2010), సమీర్రంజన్ దాస్(2011), ప్రశాంత్కుమార్ ముదులి( 2012), విజయ్కుమార్ మహంతి(2013), డాక్టర్ రాజేశ్వరి పాణిగ్రాహి(2014), కెప్టెన్ దివ్యశంకర్ మిశ్రా(2015), ప్రదీప్ పురోహిత్(2016)లు అందుకున్నా రు.కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ప్రతిç ³క్ష నాయకుడు నరసింగ మిశ్రా, అసెంబ్లీ స్పీకర్ ప్రదీప్కుమార్ అమత్, శాసనసభ వ్యవహారాల విభాగం మంత్రి విక్రమ్కేశరి అరూఖ్, శాసనసభ్యులు, మంత్రులు పాల్గొన్నారు. -
నోటి దూల తగ్గించుకుంటే బాగుంటుంది
సాక్షి ప్రతినిధి, వరంగల్: వచ్చే సార్వత్రిక ఎన్నికల టికెట్ల వేట లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఆ ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. మరోసారి కూడా సీట్లు దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కచ్చితంగా టికెట్లు ఇస్తామని, సెప్టెంబర్లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఊగిసలాటలో ఉన్న జనగామ, మహబూబాబాద్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోత్ శంకర్నాయక్, తాటికొండ రాజయ్య కు టికెట్లు ఖాయమైనట్లేనని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కేసీఆర్కు సన్నిహితులుగా పేరున్న భూపాలపల్లి ఎమ్మెల్యే శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ములుగు ఎమ్మెల్యే, గిరిజన పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ భవిష్యత్ నిర్ణయాన్ని వారికే వదిలేసినట్లు సమాచారం. సిట్టింగ్లను పక్కనపెట్టి కొత్త వారికి టికెట్లు ఇస్తే... ఓటర్లకు తప్పుడు సంకేతాలు పో యే ప్రమాదం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సొంత బలం ఉంటుందని, ఆ బలానికి పార్టీ క్యాడర్ కలిస్తేనే సునాయాస విజయం దక్కుతుందని కేసీఆర్ యో చిస్తున్నారు. సిట్టింగ్లను కాదని కొత్తవారికి అవకాశం ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేల బలాన్ని వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమా దం ఉందనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. స్వయంకృతాపరాధమే.. నియోజవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరు, వారికి ఉన్న ప్రజాదరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వివిధ సంస్థల ద్వారా ఆరు సార్లు› సర్వే చేయి ంచారు. ఇవి కాకుండా పోలీస్ ఇంటెలిజెన్స్తో ఎమ్మెల్యేల వ్యక్తిగత ప్రవర్తన, ప్రజలతో మమే కం అవుతున్న తీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తొలి సర్వేలో కొంత వెనుకబడిన జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ తర్వాత సర్వేలో పుంజుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు తేలింది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నోటి దురుసుతనంతోనే వెనుకబడుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికా రులు నివేదించారు. ముఖ్యంగా శంకర్నాయక్ గత హరితహారం సమయంలో మహిళా కలెక్టర్ చెయ్యి పట్టుకోవడం వివాదాస్పదమైంది. ఈ సంఘటన సాధారణ ప్రజలు, మహిళలను ఆగ్రహానికి గురి చేసింది. వెంటనే సీఎం కల్పించుకుని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని పంపించి శంకర్నాయక్తో కలెక్టర్కు క్షమాపణ చెప్పించడంతో ప్రజాగ్రహం కొంత మేరకు చల్లబడింది. ఆ వెంటనే మళ్లీ ఆయనపై కేసు నమోదు చేశారు. గిరిజన నాయకుడు కాబట్టే ఇందంతా చేస్తున్నారంటూ ప్రజలు కొంత మేరకు ఆయనపై సానుభూతి వ్యక్తం చేశారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఆయనకు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానా యక్ కూతురు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత, ఎక్సైజ్ మాజీ అధికారి మోహన్లాల్ ప్రధాన పోటీగా ఉన్నారు. వారినుద్దేశించి శంకర్నాయక్ అక్కడక్కడ ఇషమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారనే సమాచారం ముఖ్యమంత్రి వద్ద ఉంది. నోరు అదుపులో పెట్టుకుంటే ఢోకా లేదు ! జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిది ఇదే తరహా వ్యవహారం. ఆయనకు నియోకవర్గంతో చెప్పుకోదగిన పోటీదారుడు లేడు. కానీ, ఆయన స్వయం కృతాపరాధంతోనే టికెట్కు ఎసరు తెచ్చుకున్నాడనే ప్రచారం ఉంది. మొదటి నుంచి భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నా రు. బతుకమ్మ కుంట ఆక్రమణ విషయంపై కలెక్టర్తో ఘర్షణ పడడంతో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బ ందిగా మారింది. అంతకంటే ముందు కొమురవెల్లి మల్లన్న విగ్రహం మార్పు, వార్తలు రాశారనే కక్షతో ఓ జర్నలిస్టు ప్లాట్లో అడ్డంగా రోడ్డు వేసుకుంటూ వెళ్లడం తదితర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఓ భూమి గొడవ విషయంలో మహిళా వీఆర్వో ఇంటికి రాత్రి వేళ వెళ్లి తమకు అనుకూలంగా రికార్డులు చేయాలని అడగడం కూడా వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత వెంటనే ఆమెకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఇద్దరు నియోజకవర్గంలో బలమైన నాయకులే. కానీ, నోటి దురుసుతనం ముంచుతోందని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే వారికి ఢోకా లేదని ఇంటెలిజెన్స్ అధికారులు నివేదించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాజయ్యపై అంతుపట్టని సీఎం అంతరంగం స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భవిష్యత్పై ముఖ్యమంత్రి అంతరంగం ఇప్పటి వరకు ఎక్కడా బయటపడలేదు. భూపాలపల్లి ఎమ్మెల్యే, శాసన సభ స్పీకర్ మధుసుదనాచారిని పెద్దల సభకు పంపిస్తారనే ప్రచారం ఉంది. అయితే తుది నిర్ణయం ఆయన మీదనే ఆధారపడి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకే ఆయన మొగ్గు చూపుతున్నారు. కొండా దంపతుల కూతురు సుష్మితపటేల్, గండ్ర సత్యనారాయణరావు ఇక్కడి నుంచి ప్రధానంగా టికెట్ను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుసుదనాచారి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. విమర్శల నేపథ్యంలో నియోజకవర్గానికి తన కొడుకులను కొంతదూరం పెట్టి, అభివృద్ధి పనులను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వివాద రహితుడిగా ఆయనకు మంచి పేరే ఉంది. వేలాది మంది తన నియోజకవర్గ ప్రజలను అసెంబ్లీ సమావేశాలను చూపించడం ఆయనకు కొంత కలిసి వచ్చింది. ములుగుపై సీతారాం కన్ను ? ములుగు ఎమ్మెల్యే, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కొడుకు అజ్మీరా ప్రహ్లాద్కు టికెట్ అడిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీటుపై మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిస్తే ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలో చందూలాల్ సలహాలు, సూచనలను స్వీకరించి..కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
అత్యంత గోప్యంగా చంద్రబాబు చేయించిన సర్వే.. లీక్
‘అనంత’ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేయించిన సర్వే నాయకుల్లో గుబులు రేపుతోంది. అత్యంత గోప్యంగా గత జూలైలో చేయించిన ఈ సర్వే రిపోర్టు లీక్ కావడంతో నాయకుల్లో కలవరం మొదలైంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో టిక్కెట్టు దక్కుతుందా? లేదా? అనే ఆలోచన మొదలైంది. 14 అసెంబ్లీ స్థానాల్లో మూడు మినహా తక్కిన చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో కంగుతినడం చంద్రబాబు వంతయింది. మొత్తంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురంలోనే ఈ పరిస్థితి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీలో గతంలో లేని కొత్త సంప్రదాయాలు, పద్ధతులను చంద్రబాబు అవలంబిస్తున్నారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లోనే టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించి, ర్యాంకులను ప్రకటించారు. నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించి, ప్రజలను మరిచిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణకు అప్పట్లో మొదటి ర్యాంకు ప్రకటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారధికి చివరి ర్యాంకు ఇచ్చారు. ఆ తర్వాత 2016లోనూ సర్వే చేయించారు. సర్వే రిపోర్టులు బహిర్గతం చేయడాన్ని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోయారు. వాస్తవ పరిస్థితికి, ర్యాంకుల ప్రకటనకు చాలా వ్యత్యాసం ఉందని, కొంతమందికి టిక్కెట్టు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ర్యాంకులు ప్రకటిస్తున్నట్లుందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీ వివరణ ఇచ్చుకుని పార్టీ కార్యవర్గం, సమావేశాల నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చామని ప్రకటించింది. ఆ తర్వాత సర్వేలు చేయించినా.. ర్యాంకులు ప్రకటించకుండా గోప్యత పాటిస్తూ వచ్చారు. ‘అనంత’లో పార్టీ పరిస్థితిపై 2016లోనే ఆందోళన టీడీపీ బలంగా ఉన్న జిల్లాలలో అనంతపురానికి మంచిస్థానం ఉందని చంద్రబాబు భావిస్తూ వచ్చారు. 2016లో సర్వే రిపోర్ట్ చూసి కలవరపాటుకు గురయ్యారు. వెంటనే ‘అనంత’ ప్రజాప్రతినిధులతో పాటు సమన్వయకమిటీ సభ్యులను అమరావతికి పిలిచి సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితిపై 13 జిల్లాల్లో సర్వే చేయించానని, రాజధాని ప్రాంత పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాలలో పార్టీ బలపడిందని భావిస్తే సర్వే రిపోర్ట్లో 56, 61శాతం పార్టీ పరిస్థితి బాగోలేదని వచ్చి అవాక్కయ్యానని జిల్లా నేతలతో అప్పట్లో చంద్రబాబు చెప్పారు. కానీ అనంతపురం రిపోర్ట్ చూస్తే 90శాతం పైగా పార్టీ దిగజారిపోయిందని రిపోర్ట్ వచ్చిందని అప్పట్లో జిల్లా నేతలను హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీలో నేతల మధ్య విభేదాలతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని, తరచూ సర్వేలు చేయించి, పనితీరు బాగోలేని వారికి టిక్కెట్లు ఇవ్వనని బాహాటంగానే హెచ్చరికలు జారీ చేశారు. తాజా సర్వేతో మరింత దిగజారిన పార్టీ పరిస్థితి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత జూలైలో సీఎం స్వయంగా సర్వే చేయించినట్లు తెలిసింది. అయితే ఈ రిపోర్ట్ తాజాగా లీక్ అయింది. పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలకు సర్వే ఫలితాలు తెలిసిపోయాయి. 14 నియోజకవర్గాల్లో 11 చోట్ల పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని, 2016లోని సర్వేకు, ఇప్పటికి పోలిస్తే పార్టీతో పాటు నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడైనట్లు తెలుస్తోంది. అనంతపురం పార్లమెంట్లో ఒక స్థానం మినహా తక్కిన ఆరు చోట్ల పార్టీకి ఓటమి తప్పదని తేలినట్లు సమాచారం. ఈ ఆరు స్థానాల్లో ఇప్పటికే నలుగురికి టిక్కెట్లు దక్కవని పార్టీ లీకులు కూడా ఇచ్చింది. ఆ జాబితాలో గుంతకల్లు, అనంతపురం, శింగనమల, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడు తక్కిన రెండు స్థానాల్లో ఎవరున్నారనే చర్చ జరుగుతోంది. మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి కాకుండా గుంతకల్లు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీతో పాటు జిల్లాలో కూడా చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ దీపక్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి కూడా కాలవను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీపక్రెడ్డి నేరుగా విమర్శలు సంధిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తే రాయదుర్గం కూడా ఈ జాబితాలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పాటు మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్కు కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వరనే ప్రచారం ఉంది. ఇదే క్రమంలో తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు నియోజకవర్గంలో మునుపటి పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పెద్దారెడ్డి నియామకం వారికి ప్రతికూలంగా మారింది. టీడీపీ జెండా మోసిన కాకర్ల రంగనాథ్, జగదీశ్వర్రెడ్డి, ఫయాజ్ లాంటి నేతలు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా పరిస్థితి గడ్డుగా ఉంది. ఈక్రమంలో జాబితాలో ఉరవకొండ, తాడిపత్రిలో ఏది ఉందనేది స్పష్టత రావాల్సి ఉంది. -
ఓటుపై వేటు
ఓటు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు. అలాంటి హక్కును అధికారులు, అధికార పార్టీ హననం చేస్తోన్నాయి. ఓటు వజ్రాయుధం అని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ప్రచారం చేస్తున్న అధికారులు నమోదైన ఓట్లను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారు. జిల్లాలో ఓట్ల తొలగింపు ప్రక్రియను చూస్తే అధికార యంత్రాంగం టీడీపీ ప్రభుత్వానికి సాగిలపడి తమవంతు సహకారం అందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అధికార టీడీపీ రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అన్ని అడ్డదార్లు తొక్కుతోంది. ఓటుపై వేటుతో కుటిల నీతికి పాల్పడుతోంది. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో పనిచేసే అధికారులను ఉపయోగించుకుంటోంది. జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపుతో టీడీపీ రాజకీయ అవినీతికి పాల్పడుతోంది. అది కూడా ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉండి 2014 ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లోనే అత్యధిక ఓట్లు తొలగించారు. ఒకటి కాదు రెండు కాదు జిల్లాలో ఏకంగా 2.50 లక్షల పైచిలుకు ఓట్లు తొలగించి అధికార పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపింది. ముఖ్యంగా నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోనే 1.73 లక్షల ఓట్లు తొలగించడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఓటర్ల నమోదు, చేర్పులు, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా సాగింది. 2015 నాటికి సిద్ధం చేసిన తుది ఓట్లర్ల జాబితాతో పోలిస్తే 2018 మార్చిలో ప్రకటించిన తుది జాబితాకు భారీగా వ్యత్యాసం ఉంది. డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓట్లు, స్థానికంగా ఉండటం లేదనే రకరకాల సాకులతో జిల్లాలో భారీగా ఓట్లు తగ్గించారు. గతంలో వైఎస్సార్సీపీకి చెందిన నెల్లూరు నగర ఎమ్మెల్యే పి. అనీల్ కుమార్ యాదవ్, పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వామపక్షాల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంతో సహా పదుల సంఖ్యలో ప్రముఖల ఓట్లు గల్లంతు అయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ను కలిసి వినతిపత్రాలు ఇచ్చిన క్రమంలో ప్రముఖుల ఓట్లు తిరిగి జాబితాలో చేరాయి. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు గానూ 7 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. తాజాగా ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన తుది జాబితాలో కోవూరు, కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో స్వల్పంగా ఓట్లు పెరగ్గా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వేలల్లో తగ్గిపోయాయి. దీనిపై గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. 9 లక్షల జనాభాకు 3.33 లక్షల ఓటర్లు వాస్తవానికి నెల్లూరు నగరం, నెల్లూరురూరల్ నియోజకవర్గ పరిధిలో కలుపుకుని జనాభా 9 లక్షల పైచిలుకే ఉంటుంది. ఇది అధికారిక లెక్క. ఈ క్రమంలో 9 లక్షల జనాభా ఉంటే సగటున 60 శాతం జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే 5 లక్షల ఓట్లు ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా రెండు నియోజకవర్గాల్లో కలిపి 3.33 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నారు. 2015 నాటి తుది జాబితాలో నెల్లూరు నగరంలో 2,44,563 మంది ఓటర్లు ఉండగా, 2018 మార్చి తుది జాబితాలో 1,54,920 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 89,643 ఓట్లను తొలగించారు. అది కూడా వైఎస్సార్సీపీకి పట్టు ఉన్న డివిజన్లలోనే భారీగా ఓట్లు పోవటం గమనార్హం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2015లో 2,62,743 ఓట్లు ఉండగా 2018 మార్చి నాటికి 1,78,503 ఓట్లు మాత్రమే ఉన్నట్లు తుది జాబితా ప్రకటించారు. ఇక్కడ 84,240 ఓట్లు తొలగించారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నుంచి ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ నిర్వహించి ఈ ఏడాది మార్చి నాటికి తుది జాబితా ప్రకటించారు. ఈ క్రమంలో బూత్లెవల్ ఆఫీసర్లకు సమగ్ర అవగాహన లేకపోవటం, నగరంలో కొన్ని డోర్ నంబర్లు చిరునామాలు సక్రమంగా లేక గందరగోళంగా ఉండటం, అద్దె ఇల్లు మారే వారు ఉండటం తదితర కారణాలతో భారీగా ఓటర్లను తొలగించారు. అధికారులకు చిరునామా లభించకపోతే ఓటు గల్లంతయినట్లే. నగరంలో, రూరల్లో బీఎల్ఓలకు ప్రాంతాలు కేటాయించారు. బీఎల్ఓలకు కేటాయించిన ప్రాంతాలపై అవగాహన లేకపోవడంతో ఇది మా ప్రాంతం కిందకు రాదని, ఆ ప్రాంతం మా పరిధిలో లేదని ఇంటింటికి పరిశీలన సరిగా నిర్వహించలేదు. ప్రాంతాలపై అవగాహన లేని కారణంగా లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఆధార్, ఫోన్ నంబర్లతో ఓట్ల అనుసంధానం డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ప్రతి ఓటును ఆధార్, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసింది. ఈ ప్రక్రియతో వీటికి చె క్ పెట్టే అవకాశం ఉంది. అడ్రస్ల మార్పులతో ఓట్ల ను తొలగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఓట్లను ఆధార్, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసినప్పుడు అందులోనే ఫోన్ నంబర్లు ఉంటాయి. అడ్రస్లు మారినప్పుడు ఆ ఓటును ఎక్కడికి మార్పు చేయాలనేది బీఎల్ఓలు గుర్తించి, మార్పులు చేర్పులు చేయొచ్చు. ఇందుకు భిన్నంగా అడ్రస్ మారితే.. ఓట్లు అడ్రస్ లేకుండా తొలగిస్తున్నారు. టార్గెట్ వైఎస్సార్ సీపీ కక్ష కట్టి తొలగిస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను కక్ష కట్టి తొలగించారు. గడిచిన కాలంలో ఎన్నడూ లేని విధంగా మా నియోజకవర్గంలో 84 వేల ఓట్లు తొలగించారు. ఇది దేనికి సంకేతం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి నీచ రాజకీయాలు సరికావు. అధికారులు మరోసారి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలి. నియోజకవర్గంలోని ఓటర్లు అందరూ కూడా ఒక్కసారి మీ ఓటు హక్కు నమోదు వివరాలను సరిచూసుకోవాలి. – కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపు రాజకీయాలు సరికాదు ఓటు అనేది ప్రజాస్వామ్యం ద్వారా 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికీ లభించే హక్కు. దానిని కూడా రాజకీయం చేసి భారీగా ఓట్లు తొలగించటం దారుణం. 2014 ఎన్నికల సమయంలో నగర నియోజకవర్గంలో 2.41 లక్షల ఓట్లు ఉంటే ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన జాబితాలో 1.54 లక్షలు ఉన్నాయి. మా నియోజకవర్గంలో అత్యధికంగా 89 వేల పైచిలుకు ఓట్లు తొలగించారు. ముఖ్యంగా పార్టీకి బలం ఉన్న డివిజన్లలో ఓట్లు తొలగించారు. దీనిపై పోరాటం చేస్తాం. – డాక్టర్ పి.అనిల్ కుమార్యాదవ్, నగర ఎమ్మెల్యే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం గ్రామాల్లో లేని వారు, డబుల్ ఎంట్రీలు ఉన్న ఓట్లు తొలగించడం జరిగింది. ఓటు నమోదుకు త్వరలో అవకాశం కల్పిస్తాం. అర్హులైన వారి ఓట్లు నమోదు చేస్తాం. 18 ఏళ్లు నిండిన అందరు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెలలో ఓటర్ల జాబితా ప్రచురిస్తాం. అ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నుంచి ఓటు నమోదు చేపడతాం. ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదా బీఎల్ఓ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కు నమోదు ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రజలందరూ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకుని లేకపోతే దరఖాస్తులు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, డీఆర్ఓ -
దేశంలో అసమ్మతి సెగ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రోజు రోజుకూ పెరుగుతోంది. పార్టీలో వర్గ విభేదాలు సమసిపోయేలా చేయాలని సీఎం ఎంత ప్రయత్నించినా సెగ రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఏం చేయాలో పాలుపోక సీఎం తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పశ్చిమ ప్రకాశంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఫార్ములాను అమలు చేయాలనుకున్న సీఎంకు ఇక్కట్లు తప్పడం లేదు. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు సీఎంకు మరింత తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇక అద్దంకిలో తాజా రాజకీయ పరిణామాలు ప్రధానంగా కరణం బలరాం దూకుడుగా వ్యవహరిస్తుండడం సీఎంను మరింత ఇరుకును పెడుతోంది. పది రోజులుగా ఎమ్మెల్సీ కరణం బలరాం అద్దంకి రాజకీయాల్లో దూకుడు పెంచారు. నియోజకవర్గంలోని సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి, జే పంగులూరు మండలాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో జరిగిన సిమెంటు రోడ్లకు వరుస పెట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అద్దంకి నుంచి రాబోయే ఎన్నికల్లో తామే పోటీలో ఉంటామంటూ కరణం, ఆయన తనయుడు వెంకటేష్లు ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బలరాం తనదైన శైలిలో తాను పార్టీ మారినప్పుడు పదవికి రాజీనామా చేసి వచ్చానని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పదవికి రాజీనామా చేయకుండా పార్టీలు మారడం సరైన సంస్కృతి కాదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్పై పరోక్ష విమర్శలకు దిగుతున్నారు. కరణం, ఆయన తనయుడు వెంకటేష్ల దూకుడుతో సంతమాగలూరు, బల్లికురవ, అద్దంకి, జే పంగులూరు మండలాల్లో వారి అనుచరవర్గం తిరిగి బలరాం చెంతకు చేరుతోంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిన తర్వాత నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు ఆయనకే అప్పగించినట్లు సీఎం ప్రకటించారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి అద్దంకి రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ పరిణామంతో బలరాం వర్గంలో చాలా మటుకు ఎమ్మెల్యే గొట్టిపాటి వైపు వెళ్లింది. ఆ తర్వాత బలరాం కుటుంబం కొద్ది రోజులు అద్దంకి రాజకీయాలకు దూరంగానే ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా బలరాం కుటుంబం అద్దంకి రాజకీయాల్లో జోక్యం పెంచి ఏకంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు దిగడం జిల్లా అధికార పార్టీతో పాటు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలరాం స్పీడు పెంచినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించేందుకు బలరాం సిద్ధమయ్యారు. తాము అద్దంకి నుంచి బరిలో దిగుతామని ఇప్పటికే వారు క్యాడర్కు సంకేతాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే పాత వర్గాన్ని మొత్తం తిరిగి తమవైపు తెచ్చుకునేందుకు దూకుడు పెంచినట్లు తెలు స్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అద్దంకి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గొట్టిపాటి ఉంటారా..? లేక లేక కరణం వెంకటేష్ ఉంటారా..? అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. అధికార పార్టీ క్యాడర్లోనూ ఇదే అనుమానం నెలకొంది. బలరాం దూకుడుతో పాత వర్గాలు తిరిగి ఆయన చెంత చేరుతోంది. అద్దంకిలో బలరాం తిరిగి జోక్యాన్ని పెంచడంపై గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ల దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే బలరాం విషయంలో తెగేదాక లాగడం సరికాదని ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదే అదునుగా బలరాం కుటుంబం సైతం అమీ తుమీకి సిద్ధపడే పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థి గొట్టిపాటా... లేక తామా ... అన్నది తేల్చుకునేందుకు వారు వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఎవరో ఒకరు పార్టీని వీడతారన్న ప్రచారమూ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎటువైపు మొగ్గుతారన్నది వేచి చూడాల్సిందే. చీరాల నియోజకవర్గంలో అసమ్మతి చాపకింద నీరులా కమ్ముకుంది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను మాజీ మంత్రి పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆమంచి అవసరం రీత్యా ముఖ్యమంత్రి ఆయనకు ఇటీవల కాలంలో మరింత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే సునీత, పాలేటి రామారావులు ఆమంచికి పూర్తి స్థాయిలో మద్దతు పలికే పరిస్థితి లేదు. కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కదిరి బాబూరావు మార్పు తధ్యమని టీడీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదంటూ టీడీపీ అధిష్టానం ఇప్పటికే బాబూరావుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డికి టికెట్ ఇస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఇదే జరిగితే బాబూరావు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉందన్న ప్రచారమూ ఉంది. నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న కందుల నారాయణరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం టిక్కెట్టు ఇవ్వదన్న ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఈ నియోజకవర్గం నుంచి మరొక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం ఉంది. ఇదే జరిగితే కందుల వర్గం పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉందన్న ప్రచారమూ సాగుతోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన డేవిడ్రాజు అధికార పార్టీలోకి ఫిరాయించారు. టీడీపీ నేత మన్నే రవీంద్రతో పాటు పలువురు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ డేవిడ్రాజుకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని అధికార పార్టీ వర్గాలే పేర్కొంటుండడం గమనార్హం. దీంతో డేవిడ్రాజు సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ఇక సంతనూతలపాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన నేతలు మాజీ ఎమ్మెల్యే విజయ్కుమార్ను వ్యతిరేకిస్తున్నారు. తమ కనుసన్నల్లో విజయకుమార్ నడవడం లేదన్న అక్కసుతో సదరు నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆయన తనయుడు లోకేషకు సైతం ఇక్కటి నేతలు విజయ్కుమార్ను మార్చాలంటూ పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఇక్కడి పరిణామాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. కొండపి నియోజకవర్గంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, ఆయన సమీప బంధువులు దామచర్ల పూర్ణచంద్రరావు, సత్యతోపాటు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ప్రభావం ఉంది. జనార్థన్ కొండపి ఎమ్మెల్యే స్వామిని వ్యతిరేకిస్తుండగా జనార్థన్ చిన్నాన్న, సోదరుడు స్వామికి మద్దతు పలుకుతున్నారు. దీంతో జనార్థన్ స్వామికి అడ్డుకట్ట వేసేందుకు జూపూడి ప్రభాకర్రావును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్టు ఇస్తారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. కందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఆ తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించడంతో పోతుల, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వర్గాల మధ్య సఖ్యత లేదు. ఇరువురు నేతలు బయటకు సఖ్యతగా ఉన్నా క్యాడర్ మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో పోతుల టీడీపీ టిక్కెట్ ఇస్తే దివి శివరాం వర్గం మనస్ఫూర్తిగా పనిచేసే పరిస్థితి లేదు. -
సీఎం రమేష్తో వేగలేం..!
సాక్షి ప్రతినిధి కడప: తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. ఎత్తుకు పైఎత్తులను కొనసాగిస్తున్నారు.ఎంపీ రమేష్ను నియంత్రించే ప్రక్రియ జోరందుకుంది. క్రమం తప్పకుండా ఫిర్యాదుల పరంపర చేపట్టారు. మొన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంత్రి నారాలోకేష్ ఎదుట ఏకరువు పెట్టగా, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితీష్రెడ్డి కుండ బద్దలు కొట్టారు. ఇక సీఎం రమేష్తో వేగలేం.. కట్టడి చేయండి ..పార్టీ ఉన్నతి కోసం దశాబ్దాలుగా కృషి చేసిన కుటుంబాలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తినట్లు సమాచారం. జిల్లా టీడీపీలో రమేష్ ఓ వర్గానికి నాయకత్వం వహిస్తుండగా, మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మరో వర్గానికి అండగా నిలుస్తున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఈక్రమంలో ఒకరి కంటే మరొకరిది పైచేయి కావాలనే ఆరాటం అధికంగా కన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రాజ్యసభ సభ్యుడు రమేష్ను ఉద్దేశించి ‘పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’స్థాయి కల్గిన వ్యక్తిగా ఘాటుగా విమర్శించారు. వరద వాస్తవికతను బహిర్గతం చేయడంతో ‘తేలు కుట్టిన దొంగలా’మౌనం వహించాల్సిన పరిస్థితి రమేష్ వంతయింది. కాగా ఈ తతంగం వెనుక మంత్రి ఆది ఉన్నారని గ్రహించిన రమేష్ భారీ ఎత్తుగడ వేశారు. ఈక్రమంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఆమరణ దీక్ష తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఉక్కుదీక్షను సీఎం రమేష్ ఎంచుకొని రాష్ట్ర మంత్రి వర్గాన్ని తన దీక్షాశిబిరానికి రప్పించుకున్నారు. వెరసి ఆ దీక్షకు మంత్రి ఆది పడిగాపులు కాయాల్సిన పరిస్థితులను సృష్టించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రాజధానికి చేరిన ఫిర్యాదులు..ఎంపీ రమేష్ ఆమరణదీక్ష చేపట్టినంత కాలం జిల్లా టీడీపీ నాయకులు (మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మినహా) భుజకీర్తులు మిన్నంటాయి. ఆ కార్యక్రమం ముగియగానే యథావిధిగా ‘సిఎం రమేష్ స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’నినాదం తెరపైకి వచ్చింది. మండలస్థాయిలో కూడా ప్రజా పరపతి లేని వ్యక్తి ఇష్టారాజ్యంగా చెలాయిస్తున్నారు, పార్టీని అడ్డుపెట్టుకొని ఆదాయం గడిస్తున్నారు, వర్గ విభేదాలు సృష్టిస్తున్నారంటూ పలువురు నాయకులు ఫిర్యాదు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇదే విషయమై అమరావతిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్కు కూలంకషంగా వివరించినట్లు సమాచారం. రమేష్ను కట్టడి చేయకపోతే జిల్లాలో టీడీపీకి పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సోమవారం సాయంత్రం అమరావతిలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితీష్రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. మా తాత బద్వేల్ వీరారెడ్డి చిత్తశుద్ధితో పార్టీ ఉన్నతి కోసం కష్టపడ్డారు. పార్టీ అడ్డుపెట్టుకొని ఆర్థికంగా సంపాదనపై దృష్టి పెట్టలేదు, వ్యక్తిగత పరపతి కోసం వర్గాలను సృష్టించలేదు, ఎంపీ రమేష్ జిల్లాలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు, మాలాంటి వారు కూడా పార్టీలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొందని ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీని అడ్డుపెట్టుకొని లబ్ధిపొందుతూ పార్టీ కోసం పనిచేయడం లేదని, వ్యక్తిగతంగా జిల్లాలో రమేష్ ప్రజాపరపతి చాలా స్వల్పమని, కట్టడి చేయకపోతే కష్టమేనని తెలిపినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడు సమక్షంలో ఎంపీపై ఫిర్యాదు చేయడంతో సీఎం ఆలకించినట్లు తెలుస్తోంది. గతంలో వాసుకు చెక్పెట్టిన ప్రతిఫలమే... టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిని మార్చాలంటూ గతంలో ఎంపీ రమేష్ దృష్టి సారించారు. ఆస్థానాన్ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, లేదా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిలతో భర్తీ చేయాలనే దిశగా జోరుగా పావులు కదిపారు. ఈక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి కూటమిది పైచేయి కావడంతో రమేష్ ప్రతిపాదన తెరమరుగైందని పలువురు వెల్లడిస్తున్నారు. అందుకు ప్రతిగా రమేష్నాయుడు వైరి పక్షాన్ని ప్రోత్సహిస్తూ అధిష్టానం దృష్టికి నేరుగా ఫిర్యాదు వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు పలువురు వివరిస్తున్నారు. పైగా సాగునీటి ప్రాజెక్టుల్లో రమేష్ దక్కించుకున్న కాంట్రాక్టుల వివరాలు చేపట్టిన పనులు, అందులో లభించిన ప్రతిఫలం రికార్డులతో సహా కొందరు మంత్రి నారా లోకేష్ దృష్టిలో పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి ఆది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎంపీ రమేష్నాయుడుకు చెక్పెట్టుతోన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయాలి
కడప కార్పొరేషన్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్కు వెంటనే నీటిని విడుదల చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ . రఘురామిరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్రెడ్డి, అంజద్బాషా, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్బాబు, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జురెడ్డిలతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 125ఏళ్ల చరిత్ర కలిగి బ్రిటిషు హయాంలో నిర్మించిన కేసీ కెనాల్కు నీరివ్వకపోవడం దురదృష్టకరమన్నారు. వర్షాలు లేక వేలాది ఎకరాలు బీళ్లుగా మారాయని, రైతులు నష్టాలపాలయ్యే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. జిల్లాపై టీడీపీ ప్రభుత్వం ఎందుకింత కక్ష సాధిస్తోందో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలంలో 870 అడుగుల నీటిమట్టం ఉందని, అంటే సుమారు 150 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్కు నీరిస్తున్నామని చెప్పి టీడీపీ నాయకులు పది రోజుల క్రితం రాజోలి స్లూయిస్ వద్దకు వెళ్లి ఆర్భాటంగా నీటిని వదిలారన్నారు. టీడీపీ నాయకుల మాటలు విని రైతులు నారుమళ్లు వేసుకున్నారని, కుందూ పరివాహక ప్రాంతంలో నాట్లు నాటేందుకు సిద్దమవుతున్నారన్నారు. ఈలోపే ఉన్నట్టుండి నీరు ఆపేశారన్నారు. లక్ష ఎకరాల ఆయకట్టు ఉన్న కేసీ కెనాల్కు 2వేల క్యూసెక్కుల చొప్పున ఖరీఫ్ వరకు వదలాలని డిమాండ్ చేశారు. దీనిపై కర్నూలు సీఈకి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇరిగేషన్ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారన్నారు. పైర్లు ఎండిపోయాక నిర్ణయం తీసుకొని ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలంలో పుష్కలంగా నీరున్నప్పటికీ వదలకపోవడం సరికాదన్నారు. విద్యుదుత్పత్తి పేరుతో 40వేల క్యూసెక్కులను నాగార్జున సాగర్కు వదులుతున్నారని, నికర జలాలు కలిగిన కేసీకి ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఈ పరిస్థితి వస్తుందనే 2008లో దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి 2.95 టీఎంసీ సామర్థ్యంతో రాజోలి, 0.95టీఎంసీల సామర్థ్యంతో జొలదరాసి రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారన్నారు. వీటి నిర్మాణం పూర్తి చేయాలని ఎన్ని ఆందోళనలు చేసినా, దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెలుగోడు నుంచి 0–18 కీ.మీ వరకు కాలువలు సరిగా లేవని, ఆ పనులు పూర్తి చేస్తే తెలుగుగంగకు నీరు ఇవ్వచ్చన్నారు. దీనిపై తాము కర్నూలు ఐఓబీ సమావేశంలో చెప్పినా, అసెంబ్లీలో లేవనెత్తినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కడుపు కాలిన రైతులు ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. వెంటనే ఇరిగేషన్ మంత్రి సీఎంతో మాట్లాడి కేసీ కెనాల్కు 2వేల క్యూసెక్కులు, వెలుగోడు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాలేరు నగరి, సర్వరాయసాగర్, వామికొండ, పైడిపాళెం రిజర్వాయర్లకు కూడా నీటిని విడుదల చేయాలన్నారు. వర్షాకాలం ఇంకా చాలా ఉందని, సాగునీటికి నీటిని వదలకుండా విద్యుత్ ఉత్పత్తికి తరలించడం ఎంతమాత్రం సరికాదన్నారు. పదివేల క్యూసెక్కులు విడుదల చేస్తే జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు నీరు వస్తాయన్నారు. నీటిని విడుదల చేయకపోతే రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. కేసీకి నీరిచ్చి రైతులను ఆదుకోవాలి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎస్ .రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్రెడ్డి, అంజద్బాషా, నగర మేయర్ కె. సురేష్బాబు కోరారు. సోమవారం సాయంత్రం వారు జిల్లా కలెక్టర్ హరికిరణ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.అలాగే జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంపగుత్తగా తొలగించిన ఓట్లను మళ్లీ చేర్చాలని వారు కోరారు. ఈ విషయాలపై కలెక్టర్ స్పందిస్తూ ఇరిగేషన అ««ధికారులతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేస్తానని, ఓట్ల తొలగింపుపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
పార్టీ బలోపేతానికి పాటుపడండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తిస్తే వైఎస్ఆర్ పాలనను వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో చూసుకోవచ్చని ఆ పార్టీ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. సోమవారం కర్నూలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి(ఎమ్మిగనూరు), నియోజకవర్గ సమన్వయకర్తలు మురళీకృష్ణ(కోడుమూరు), కాటసాని రామిరెడ్డి(బనగానపల్లె), కంగాటి శ్రీదేవి(పత్తికొండ), హఫీజ్ఖాన్(కర్నూలు), జగన్మోహన్రెడ్డి(ఎమ్మిగనూరు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌరు వెంకటరెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, నియోజకవర్గ నేతలు గంగుల బిజేంద్రారెడ్డి(ఆళ్లగడ్డ), ప్రదీప్రెడ్డి(పత్తికొండ), శిల్పా రవిచంద్రకిశోరరెడ్డి(నంద్యాల), పీఏసీ సభ్యుడు డాక్టర్ మధుసూదన్రెడ్డి, సీఈసీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేకపాటి గౌతంరెడ్డి హాజరై.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. భవిష్యత్లో పార్టీ అనుసరించాల్సి వ్యూహాలు, టీడీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ప్రణాళికలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పటిష్టం కోసం తీసుకోవాల్సిన చర్యలు, బూత్ కమిటీల నియామకాలు, జిల్లా, అనుబంధ కమిటీ పదవుల భర్తీపై సుదీర్ఘ చర్చ సాగింది. పార్టీ బలోపేతం కోసం ప్రజాప్రతినిధులు,ఇన్చార్జ్లు ఇచ్చే సలహాలు, సూచనలను అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని గౌతంరెడ్డి చెప్పారు. సమావేశం ప్రారంభానికి ముందు ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీ పేలుడులో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గౌతంరెడ్డి మాట్లాడుతూ..పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులకు తగు న్యాయం చేస్తామని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి నాయకులు, కార్యకర్తలు కీలకంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా బూత్ కమిటీలు పటిష్టంగా ఏర్పాటు చేసుకుంటే సగం విజయం వరించినట్లేనని చెప్పారు. బూత్ కమిటీల నియామకంలో నిర్లక్ష్యాన్ని పార్టీ అధినేత సహించరని, వారం, పది రోజుల్లో అన్ని బూత్ కమిటీలు, వాటికి కన్వీనర్లను ఎంపిక చేసి పార్టీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక్కో కార్యకర్త కనీసం 50 మందిని పార్టీ వైపు తీసుకొస్తే టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. హత్తిబెళగల్ క్వారీ ఘటనలో ప్రభుత్వ వైఫల్యాలే అధికంగా ఉన్నాయని, క్వారీని వెంటనే సీజ్ చేసి యజమాని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మరోసారి మోసం చేయలేరు
కడప కార్పొరేషన్: ఆరునెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాయిళాలు ప్రకటించి ప్రజలను మరోసారి మోసం చేయలేరని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్బాబు అన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం, రైల్వేకోడూరు, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్బి అంజద్బాషాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు 600లకు పైగా హామీలిచ్చారని,అందులో ఒక్క హామీ నెరవేర్చలేదని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు నిరుద్యోగ భృతి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ఒక కోటి 74లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, నెలకు రూ.2వేల చొప్పున 52 నెలలకు లక్షా 4వేల రూపాయలు ఒక్కో నిరుద్యోగికి ఈ ప్రభుత్వం బకాయి పడిందన్నారు. 52నెలలు పట్టించుకోకుండా రాబోయే నాలుగు నెలలు రూ.1000ల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తే హామీ నెరవేర్చినట్లు అవుతుందా అని సూటిగా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని రాష్ట్రంలో 87,500కోట్లు రైతు రుణాలు ఉంటే కేవలం 11వేల కోట్లు ఇచ్చి మాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో లక్షా 85వేల ఉద్యోగ ఖాళీలుంటే అందులో కేవలం 20వేల బ్యాక్లాగ్ ఔట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏడాది బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేశారని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక 5లక్షల మంది కడుపు కొట్టి వారిని ఇంటికి సాగనంపిందన్నారు. ఎన్నికల ముందు ఐదువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు కేవలం రూ.500కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెబుతున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు చేరువ అవుతూ తమ ప్రభుత్వం ఏర్పడితే ఆయా వర్గాలకు ఏమేం చేస్తుందో వివరిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. దీంతో జగన్ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారని, దీన్ని చూసి సీఎం చంద్రబాబు బెంబెలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్కు భయపడే ప్రభుత్వం తూతూమంత్రంగా ఎన్నికల తాయిళాలు ప్రకటించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తమను మోసం చేశారని ప్రజలంతా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారని, ఇలాంటి కంటితుడుపు చర్యలతో వారిని మరోసారి మోసం చేయలేరని హెచ్చరించారు. సీఎం కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి తన పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. అవి అన్నక్యాంటీన్లు కావని ఎన్నికల క్యాంటీన్లు అని, అది నిరుద్యోగ భృతి కాదు ఎన్నికల భృతి అని ఎద్దేవా చేశారు. ప్రజలు తిరస్కరిస్తారనే పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించలేదని విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యే అధికారుల్ని అసభ్య పదజాలంతో దూషించడం, మరో ఎమ్మెల్యే నియోజకవర్గంలో పాత నేతల్ని కలుపుకోకుండా పనిచేయడం వంటి ఘటనలపై జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గురువారం రేణిగుంట ఎయిర్పోర్ట్లో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్, తహసీల్దార్పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఒక దశలో రాస్కెల్ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ ఘటనపై రెవెన్యూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో సీఎం చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నాం. ఇదే పద్ధతిలో ఉంటే ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. పద్ధతి మార్చుకోండి. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్న తరుణంలో వాటిని సరిదిద్దుకోకుండా కొత్త వివాదాలు తీసుకు వచ్చి పార్టీ ప్రతిష్టను దిగజారుస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీరుపైనా సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జెడ్పీటీసీ సభ్యుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డికి, పోలంరెడ్డికి మధ్య వివాదం నెలకొని ఉంది. కోవూరులో గ్రామదర్శిని కార్యక్రమంలో వీరిద్దరి మధ్య వివాదం ముదిరిపాకన పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి చేజర్ల వర్గానికి చెందిన బూత్ కమిటీ కన్వీనర్లను తొలగించి ఆయన సొంత మనుషులను నియమించుకున్నారు. గ్రామదర్శిని కార్యక్రమానికి పాత నేతలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. దీనిపై చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సీఎంతో పాటు పార్టీ ముఖ్యులు అందరికీ ఫిర్యాదు చేశారు. దీంతో బూత్ కమిటీలు అన్నింటిని రద్దు చేశారు. ఎమ్మెల్యే వ్యవహర శైలి సీఎం వద్ద చర్చ సాగిన క్రమంలో ఎమ్మెల్యే పోలంరెడ్డిని తీరు మార్చుకుని అందర్నీ కచ్చితంగా కలుపుకెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. ఆత్మకూరు రగడపై సీఎంకు నారాయణ ఫిర్యాదు మరో వైపు ఆత్మకూరు నియోజకవర్గ రగడపై మంత్రి పి. నారాయణ సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆత్మకూరు తాత్కాలిక ఇన్చార్జిగా ఆదాల ప్రభాకరరెడ్డిని పార్టీ నేతలు చర్చించుకుని సీఎం ఆమోద ముద్రతో ప్రకటించారు. మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకర్రెడ్డి సోమవారం ఆత్మకూరులో పార్టీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించి ప్రకటించారు. అయితే అక్కడి స్థానిక నేత కన్నబాబు వీటితో నిమిత్తం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మద్దతుగా ఉన్నారు. కొందరు నేతలు ఆత్మకూరులో పార్టీ క్యాడర్ను గందరగోళానికి గురి చేస్తున్నారని నారాయణ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
స్పీకర్, డిప్యూటీ సీఎంలకు సుప్రీం నోటీసు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారంలో తమిళనాడు స్పీకర్ ధనపాల్, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం సహా 11 మంది ఎమ్మెల్యేలకు సోమవారం సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు 4వారాల్లోగా బదులివ్వాలని ఆదేశించింది. పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత విశ్వాస పరీక్ష తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్సెల్వంతోపాటు ఆయనకు మద్దతుగా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఆ 11 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద అనర్హతవేటు వేయాలని డీఎంకే విప్ చక్రపాణి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ నిర్ణయంలో తలదూర్చలేమని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో చక్రపాణి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సైతం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. -
అవిశ్వాసం ఆపేయండి!
సాక్షి, పెద్దపల్లి: రామగుండం అవిశ్వాస రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానం అవిశ్వాసాన్ని ఆపేయాలంటూ అల్టిమేటం జారీచేయగా, హైకమాండ్ ఆదేశానికి కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సూచించారు. అయితే అవిశ్వాసం నోటీసు ఇచ్చాక ఇప్పుడు వెనక్కి తగ్గేదిలేదని, ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గిస్తామని, లేదంటే తమ కార్పొరేటర్ పదవులకైనా రాజీనామా చేస్తామని టీఆర్ఎస్ కార్పొరేటర్లు తెగేసి చెప్పారు. దీంతో రామగుండం అవిశ్వాసం రాజకీయం రసకందాయంలో పడింది. ఎమ్మెల్యేకు కేటీఆర్ ఫోన్ రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై టీఆర్ఎస్ హైకమాండ్ మండిపడింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు ఫోన్చేసి అవిశ్వాసం నిలిపివేయాలని ఆదేశించారు. అవిశ్వాసం పెట్టడం పార్టీ విధానం కాదని, వెంటనే అవిశ్వాసం నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ సందర్భంగా రామగుండం పరిస్థితిని వివరించడానికి ఎమ్మెల్యే ప్రయత్నించినా కేటీఆర్ వినిపించుకోలేదని విశ్వసనీయంగా తెలిసింది. ‘‘అవిశ్వాసం ఆపేస్తారా...అవిశ్వాసం లేకుండా ఆర్డినెన్స్ తీసుకురమ్మంటారా’’ అని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎంకు మేయర్ల ఫిర్యాదు పార్టీ అధిష్టానం అకస్మాత్తుగా అవిశ్వాసం వ్యవహారంపై దృష్టిపెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు కారణమని సమాచారం. శనివారం హైదరాబాద్లో మేయర్లు, కమిషనర్ల సమావేశం జరిగింది. సమావేశానికి రామగుండం మేయర్ లక్ష్మీనారాయణ సహా, ఆరుగురు మేయర్లు హాజరయ్యారు. సమావేశం పూర్తయ్యాక, ఆరుగురు మేయర్లు సీఎం కేసీఆర్ను కలిసి రామగుండం మేయర్పై సొంత పార్టీయే అవిశ్వాసం పెట్టిందంటూ ఫిర్యాదు చేశారు. స్పందించిన కేసీఆర్ అవిశ్వాసం పెట్టడమేంటంటూ అసహనం వ్యక్తం చేశారని, వెంటనే తన రాజకీయ కార్యదర్శి నరసింహారావు, మంత్రి కేటీఆర్లకు ఈ విషయంపై పురమాయించినట్లు సమాచారం. ఈక్రమంలోనే కేటీఆర్, నరసింహారావులు ఎమ్మెల్యే సత్యనారాయణకు ఫోన్చేసి అవిశ్వాసాన్ని ఆపేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధిష్టానం చెప్పింది వినండి: ఎమ్మెల్యే అవిశ్వాసం నిలిపివేసి...కలిసి పనిచేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించింది..అధిష్టానం సూచనను కార్పొరేటర్లంతా పాటించాలి...అంటూ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో టీఆర్ఎస్కు చెందిన 30 మంది కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్ ఫోన్చేసిన విషయాన్ని వివరించారు. ఇంతటితో ఈ వ్యవహారాన్ని ఆపేయాలని కార్పొరేటర్లకు చెప్పారు. వెనక్కి తగ్గేది లేదు: కార్పొరేటర్లు అవిశ్వాసంపై వెనక్కి తగ్గేదిలేదు. నోటీసు ఇచ్చాక..ఇప్పుడు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.స్టాండింగ్ కమిటీ ఎన్నికలప్పుడు లేని హైకమాండ్ ఇప్పుడే వచ్చిందా? మేం అవిశ్వాసానికే కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గిస్తాం. లేదంటే మా కార్పొరేటర్ పదవులకే రాజీనామా చేస్తాం. అంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు తేల్చిచెప్పారు. పార్టీ అధిష్టానం వైఖరిని ఎమ్మెల్యే చెప్పినా.. కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. ఒకదశలో ఎమ్మెల్యేను సైతం ధిక్కరించారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాసాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. రాజకీయం రసవత్తరం అవిశ్వాసం ఆపేయాలని అధిష్టానం ఆదేశించడం...ఎమ్మెల్యే చెప్పినా...కార్పొరేటర్లు ససేమిరా అనడంతో రామగుండంలో రాజకీయం రసవత్తరంగా మారింది. నాటకీయ పరిణామాలతో అవిశ్వాసం రోజుకోమలుపు తిరుగుతోంది. పార్టీ వైరి వర్గాల ఎత్తులు, పై ఎత్తులతో రాజకీయ చదరంగం రక్తికడుతోంది. -
రేపు మూడో జడ్జీ ముందుకు ఎమ్మెల్యేల అనర్హత!
సాక్షి, చెన్నై : తమిళనాడులో దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసు బుధవారం మరోసారి విచారణకు రానుంది. ఈ కేసులో ఇద్దరు జడ్జీలు పరస్పరం వేర్వేరు తీర్పులు వెలువరించడంతో మూడో జడ్జి ముందుకు కేసు బదిలీ అయిన సంగతి తెలిసిందే. మూడో జడ్జి సత్యనారాయణ బుధవారం ఈ కేసును విచారించనున్నారు. దినకరన్ గూటికి ఫిరాయించిన 18మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వేటు చెల్లుతుందా? లేదా అనే దానిపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ వెలువరించే తీర్పు కీలకం కానుంది. ఆయన తీర్పు ఆధారంగా తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారనున్నాయి. గతంలో ఈ కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం భిన్నాభిప్రాయాలతో వేర్వేరు తీర్పులను వెలువరించిన్న సంగతి తెలిసిందే. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో స్పష్టమైన తీర్పు వెలువరించకపోవడంతో ఈ కేసులో అనిశ్చితి తొలగిపోలేదు. దీంతో ఈ కేసు విచారణను మూడో జడ్జికి బదలాయించారు. ఇక గతంలో తీర్పు ఇచ్చిన జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ.. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని పేర్కొనగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం వేరుగా తీర్పునిచ్చారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టు అయింది. 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు పళనిస్వామి ప్రభుత్వ మనుగడకు విషమ పరీక్షగా మారిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఎలా వచ్చినా పళనిస్వామి ప్రభుత్వానికి సంకటం తప్పదన వాదన వినిపించింది. గత సెప్టెంబర్లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అధికార అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దుచేసిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే విప్కు వ్యతిరేకంగా శశికళ అక్క కొడుకైన దినకనర్కు మద్దతు తెలుపడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే, స్పీకర్ నిర్ణయంపై వేటు పడిన ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. -
నిత్య రాజకీయం!
పరిగి: పరిగి నియోజకవర్గం గత కొంతకాలంగా పొలిటికల్ వార్కు వేదికవుతోంది. పల్లెలో రాజకీయ వేడి రాజుకుంది. ఆకర్ష ఎన్నికల పేరుతో అధికార, ప్రతిపక్షాలు చేపడుతున్న చేరికల కోలాహలం సగటు మనిషికి వెగటు పుట్టిస్తోంది. ఎక్కడైనా కేవలం ఎన్నికల సమయంలోనే చేరికలు కనిపించేవి. కానీ ఇక్కడ మాత్రం నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, అధికార టీఆర్ఎస్ తరఫున రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ కొప్పుల మహేశ్రెడ్డి ఒకరితో ఒకరు పోటీ పడుతూ.. గ్రామాల్లో పర్యటిస్తూ రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. దీంతో పరిగి ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంటోంది. చేరిన వారే మళ్లీ మళ్లీ... గతంలో కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే ఆయా పార్టీల నాయకులు చేరికలను ప్రోత్సహించే వారు.. కానీ ఇక్కడ నెలకొన్న పోటీ కారణంగా నిత్యం ఏదో ఒక చోట ఆయా పార్టీల్లో చేరే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం ఆయా గ్రామాల్లో, మండల స్థాయిలో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రమే పార్టీలు మారుస్తుండేవారు. కానీ ప్రస్తుతం ఇది కార్యకర్తలు, ఓటర్ల వరకు వచ్చింది. నాయకులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే పార్టీ రంగు పరిమితమయ్యేది. ప్రస్తుతం మాత్రం గడపగడపకూ రాజకీయ రంగు పులుముతున్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటికీ ఏదో ఓ పార్టీ రంగు రుద్దుతున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఏదో ఒక పార్టీ రంగు కనిపిస్తుంది.. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాలన్నీ పార్టీల ప్రాతిపదికన చీలిపోతున్నాయి. చాలా సందర్భాల్లో చేరిన వారే మళ్లీ మళ్లీ ఒక పార్టీని విడిచి మరో పార్టీలోకి మారుతున్నారు. పని కావాలంటే చేరండి.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలు మొదలుకుని స్థానిక ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీల వరకు తమ నియోజకవర్గ అధి నాయకత్వం మెప్పుకోసం చేరికలను ప్రోత్సహించే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లు, ప్రజలు వారి వద్దకు వచ్చి ఏ చిన్న పని కావాలన్నా.. ముందు మా పార్టీలో చేరండి.. అప్పుడే పనులు చేస్తామని మెలిక పెడుతున్నారు. వారికి కావాల్సిన పని చేసి పెట్టడం దేవుడెరుగు కానీ... పని కావాలని వెళ్లిన మరుసటి రోజే వారి మెడలో కండువా వేసి పార్టీ రంగు పులుముతున్నారు. రోజురోజుకు సగటు మనిషి పై.. సాధారణ ఓటరుపై కూడా చేరికల కోసం ఒత్తిడి పెరుగుతోంది. గ్రామాల్లో ఉండే ప్ర తీ యువజన, కుల సంఘాలకు సైతం పార్టీ రం గు పులుముతూ తమ జెండాలకు జై కొట్టిస్తున్నారు. సంక్షేమం, చట్టాల అమలులోనూ.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా.. ఏదో ఒక పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సిందే. పార్టీల రంగు మరకలంటకుండా సంక్షేమ పథకాలు, కార్పొరేషన్ రుణాలు అందుతాయని కలలో కూడా ఊహించలేని పరిస్థితి నెలకొంది. చాలా వరకు రాయితీ ట్రాక్టర్ల పంపిణీ, ఇతర యంత్ర పరికరాల అందజేతలో అధికార, ప్రతిపక్షాలు ఫిఫ్టీ అనే తరహాలో తమ నాయకులు, కార్యకర్తలకు వీటిని కట్టబెట్టాయి.. తప్ప ఏ ఒక్క చోట పార్టీతో ప్రమేయం లేకుండా లబ్ధి చేకూరిన దాఖలాలు కనిపించటంలేదు. ఇక చట్టాల అమలు విషయంలోనూ ఇరు పార్టీల ఒత్తిడులు తప్పటంలేదు.. ప్రతీ కేసు విషయంలో చట్టాలను అమలు చేసే వ్యక్తులపై తీవ్ర ఇత్తిడి తెస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుత పరిణామాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
‘11 రోజులు దీక్ష.. ఆ రహస్యం ఏమిటో..!’
సాక్షి, కడప : టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్షపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సీఎం రమేష్ హై టెక్ దీక్ష సాగిందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయాలను దారపోసి దీక్ష చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు 11 రోజుల తర్వాత వచ్చి తుస్సు మనిపించాడని ఎమ్మెల్యే అన్నారు. రూ. 10వేల కోట్లు కేటాయిస్తాడేమో అని అందరూ ఆశ పడ్డారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ‘25 సీట్లు ఇస్తే స్టీల్ ప్లాంట్ తెస్తాడట. ఇప్పుడు 19 మంది ఉన్నారు. ఏం ఉద్ధరించావ్? కడప ప్రజలకు అరగుండు గీశాడు. నాలుగేళ్లు కలిసి కాపురం చేసి ఇప్పుడు బీజేపీని మా పార్టీకి అంటగడుతున్నావు. చంద్రబాబు ఎంత తప్పు చేశాడో.. బీజేపీ కూడా అంతే తప్పు చేసింది. తిరుపతిలో హోదా అంటూ హామీలు ఇచ్చారు. 11 రోజుల తర్వాత కూడా సీఎం రమేష్ 5 నిమిషాలు ఎలా మాట్లాడగలిగాడో.. నిపుణులు ఆయనపై రీసెర్చ్ చేయాలి. ఆయన రహస్యం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. అధికారులు పరాకాష్టగా జిల్లా పరిపాలన వదిలేసి కలెక్టర్ కూడా సేవలు చేశారు. 540 ఆర్టీసీ బస్సులు దీక్షకు వాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను కలుపుకుని ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చేస్తోంది. రాకపోతే, వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే 6 నెలలకు శంకుస్థాపన చేస్తాం. 2 ఏళ్లలో ఉత్పత్తి ప్రారంభిస్తాం. ఉక్కు కోసం అందరం రాజీనామా చేద్దాం.. ఉక్కు ఎందుకు రాదో చూద్దాం’ అని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయ దీక్ష.. ఒక హైడ్రామా క్లయిమాక్స్.. సీఎం రమేష్ దీక్షపై వైఎస్సార్సీపీ కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా స్పందించారు. సీఎం రమేష్ రాజకీయ దీక్ష ఒక హై డ్రామా క్లయిమాక్స్ అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. జిల్లా ప్రజలు బాబు ఉక్కు వరాలు తేస్తాడని ఆశించి నిరసపడ్డారు. రాజకీయ లబ్ది కోసమే దీక్షలు అని అంజాద్ బాషా విమర్శించారు. సీఎం చంద్రబాబుకు ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ రావాలని లేదని ఆయన పేర్కొన్నారు. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఆ క్రెడిట్ దివంగత నేత వైఎస్సార్కు వస్తుందని బాబుకు భయమని అన్నారు. కడప ఉక్కు అడ్డుకుంది చంద్రబాబే అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. దీక్షలపై వాళ్ళ ఎంపీలకు ఎంత చులకన భావన ఉందో అందరిరీ తెలిసిపోయిందని అన్నారు. దోచుకో.. దాచుకో అన్నదే వాళ్ళ సిద్ధాంతం అని ఎద్దేవా చేశారు. ఈ దీక్ష వల్ల సీఎం రమేష్ ఏం సాధించుకున్నారో అని నిలదీశారు. మా ప్రభుత్వం రాగానే మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆరు నెలల్లో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తాం.. లేదంటే మేము రాజీనామా చేస్తామని ఎమ్మెల్యే అంజాద్ బాషా అన్నారు. -
సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని బంజారాహిల్స్లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడెకరాల విస్తీర్ణంలో చేపట్టిన నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి సెంటర్ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. దేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ సెంటర్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. శాంతిభద్రతలతో పాటు విపత్తుల నిర్వహణ, పండగలు, జాతరల నిర్వహణ తదితర కార్యక్రమాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించవచ్చని సీఎం చెప్పారు. సీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే. జోషి, డీజీపీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, ఆరూరి రమేశ్, గంగుల కమలాకర్, అరికెపూడి గాంధీ, సంజీవరావు, అర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
గుబులు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : సాధారణ ఎన్నికలు ఈ ఏడాది చివర్లోనే జరుగుతాయనే ప్రచారంతో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్లతో మొదలుకుని.. విపక్షంలో ఉన్న అందరూ ఎన్నికలపైనే దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించడమే కాకుండా ఎలాగైనా గెలిచి తీరాలని తహతహలాడుతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాలను సెంటిమెంట్ పట్టి పీడిస్తోంది. వరుస ఎన్నికల్లో పోటీ చేసిన వారికి చేదు ఫలితాలు ఎదురయ్యే ఆనవాయితీ ఉండగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో కనీసం పార్టీ తరఫున టికెట్టు దక్కని పరిస్థితులు సైతం ఉన్నాయి. ఇంకొందరైతే రాజకీయంగా పలుకుబడినే కోల్పోవడం గమనార్హం. 2014 సాధారణ ఎన్నికల్లో ఎనిమిది మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే అధికారం అనుభవించిన, అనుభవిస్తున్న నేతలకు ఈ సెంటిమెంట్ భయం పట్టుకుంది. వరుస విజయం సాధించడం ద్వారా తమ సత్తా నిరూపించుకోవాలని భావిస్తున్న నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ను అధిగమించి చరిత్రను తిరగరాయాలని ఆయా నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తుండడంతో కాళ్లకు చక్రాలు కట్టుకు ని మరీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతీరోజూ నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో ముగ్గురే.. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ఉన్న ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. రాజకీయంగా చైతన్యం కలిగిన పాలమూరు ప్రాంతంలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయి. ప్రతీ నేత ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తుంటారు. అలా అభ్యర్థుల వ్యూహాలను బట్టి గెలుపోటములు దక్కుతున్నాయి. అయితే చాలా వరకు ఉమ్మడి జిల్లాలో వరుసగా విజయకేతనం ఎగురవేసిన వారు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుసగా గెలిచిన వారు కేవలం ముగ్గురంటే ముగ్గురే ఎన్నికవడం గమనార్హం. వీరిలో కొల్లాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే.అరుణ, కొడంగల్ నుంచి ఎనుముల రేవంత్రెడ్డి మాత్రమే వరుస విజయాలు సాధించారు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో మిగతా ఎనిమిది మంది మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ నియోజకవర్గాల చరిత్ర అంతేనా.. ఉమ్మడి జిల్లాలో ‘సెకండ్ సెంటిమెంట్’ పట్టి పీడిస్తున్న నియోజకవర్గాలు అర డజనుకు పైగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఒకసారి ఎన్నికైన వారు తదుపరి ఎన్నికల్లో గెలిచిన దాఖాలు లేవు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి గడిచిన ఐదు ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా వరుసగా రెండో సారి గెలిచిన దాఖలాలు లేవు. 1994లో ఎడ్మ కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఆతర్వాత 1999 ఎన్నికల్లో జైపాల్యాదవ్ గెలుపొందారు. అనంతరం 2004లో ఎడ్మ కిష్టారెడ్డి గెలుపొందగా, 2009లో జైపాల్యాదవ్ గెలిచారు. ఇక 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన వంశీచంద్రెడ్డి అనూహ్యంగా గెలుపొందారు. అచ్చంపేట నియోజకవర్గం పరిస్థితి కూడా అలాగే ఉంది. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారో.. రాష్ట్రంలో అదే పార్టీ పరిపాలనలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. ఇక వనపర్తి నియోజకవర్గంలో కాస్త భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. వనపర్తి నియోజకవర్గం నుంచి కూడా ఏ ఒక్క అభ్యర్థి వరుసగా రెండుసార్లు గెలిచిన దాఖాలు లేవు. కేవలం 1999తో పాటు 2004లో వరుసగా రెండు సార్లు మాత్రమే చిన్నారెడ్డి గెలవగలిగారు. అలాగే వనపర్తి నుంచి పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఒక్క 2004లో మినహా సదరు పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో అదో సెంటిమెంట్గా మారింది. చరిత్ర తిరగరాసే యోచన.. రాజకీయంగా పాలమూరు ప్రాంతాన్ని వెంటాడుతున్న ‘సెకండ్ సెంటిమెంట్ను ఈసారి ఎట్టి పరిస్థితిల్లో తిరగరాస్తామనే ధీమా పలువురు ఎమ్మె ల్యేలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈసారి ఎన్న డూ లేని విధంగా మొదటి సారి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఏకంగా ఎనిమిది మంది ఉండగా వారి లో చాలా మంది సులువుగా ప్రజల్లో కలిసిపోయా రు. అంతేకాదు మొదటిసారి గెలుపొందడంతో ఎమ్మెల్యేలు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితం గా గెలుస్తామని ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ పునావృతం అవుతుందా.. లే æదా చరిత్రను తిరగరాస్తారా అనేది వేచిచూడాల్సిందే. -
అనర్హత వేటు కేసు.. అనూహ్య పరిణామం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో అనూహ్య పరిణామం నెలకొంది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన దినకరన్ వర్గ ఎమ్మెల్యే ఒకరు.. ఆ పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. రెబల్ ఎమ్మెల్యే తంగతమిళ్సెల్వన్ శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ...‘న్యాయస్థానంపై నమ్మకం పోయింది. న్యాయం చేకూరుతుందన్న ఆశలు ఆవిరయ్యాయి. అందుకే పిటిషన్ను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు. దీంతో దినకరన్ వర్గంలో చీలిక మొదలైందన్న కథనాలు మీడియాలో ప్రారంభం అయ్యాయి. అన్నాడీఎంకే పార్టీ విప్కు వ్యతిరేకంగా వ్యవహరించటంతోపాటు.. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ఉద్దేశంతో గవర్నర్ను కలిశారన్న కారణంగా తమిళనాడు స్పీకర్ ధన్పాల్ గతేడాది 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. వారిలో అండిపట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే తంగతమిళ్సెల్వన్ కూడా ఒకరు. ఉప ఎన్నికలకు వెళ్లినా గెలుపు తనదే అన్న ధీమాలో ఆయన ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు. అయితే గ్రూప్లో చీలిక ప్రచారాన్ని దినకరన్ మాత్రం కొట్టిపారేశారు. ‘పిటిషన్ విషయంలో తంగతమిళ్సెల్వన్ అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. అయినా ఆయన మా వెంటే ఉన్నారు. మా వర్గం అంతా ఐక్యంగానే ఉంది. అంతా ఓకే’ ఆయన కాసేపటి క్రితం ప్రకటించారు. ఒకవేళ కేసులో హైకోర్టు తీర్పు అనుకూలంగా లేకపోతే మాత్రం.. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని దినకరన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తమిళనాడులో దినకనర్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అనిశ్చితి నెలకొంది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించకపోవడంతో విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం... గురువారం విచారణ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తీర్పుపై అనిశ్చితి నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించింది. -
ఎమ్మెల్యేల అనర్హతపై భిన్నాభిప్రాయం
చెన్నై: తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనం లభించింది. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధిస్తూ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ సమర్థించగా.. మరోజడ్జి జస్టిస్ ఎం.సుందర్ వ్యతిరేకించారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో తుది తీర్పు కోసం ఈ కేసు విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేశారు. ఈ కేసును ఎవరు విచారించాలో ప్రధాన న్యాయమూర్తి తర్వాతి సీనియర్ న్యాయమూర్తి నిర్ణయిస్తారని చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ తెలిపారు. మూడో జడ్జి తీర్పు వెలువరించేంత వరకు యథాతథస్థితి అంటే 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కొనసాగుతుందన్నారు. జయలలిత మరణంతో అనిశ్చితి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో తమిళనాట రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. సీఎం పదవి నుంచి పన్నీర్ సెల్వంను తప్పించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని జయలలిత నెచ్చెలి శశికళ భావించారు. దీన్ని పన్నీర్ సెల్వం వ్యతిరేకించారు. దీంతో అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మరోవైపు అనూహ్యంగా శశికళ జైలుకెళ్లడంతో సీఎం పగ్గాలను పళనిస్వామికి అప్పగించారు. శశికళ సోదరి కుమారుడు దినకరన్ కూడా పళనిస్వామికి మద్దతిచ్చారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలసిపోయి శశికళ, దినకరన్లను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా, పన్నీర్ సెల్వం ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పన్నీర్తో చేతులు కలపడాన్ని వ్యతిరేకించిన దినకరన్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి పళనిస్వామికి ఎదురుతిరిగారు. దీంతో ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద ఆ 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ గత సెప్టెంబర్ 18న అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అనర్హత రద్దై ఉంటే ప్రభుత్వానికి ముప్పే ప్రస్తుతానికైతే హైకోర్టు తీర్పు పళనిస్వామి ప్రభుత్వానికి ఊరటనిచ్చినట్టేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే 18 మంది అనర్హులైనందున ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని ప్రతిపక్ష డీఎంకే ఆరోపిస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు రద్దై ఉండి ఉంటే పళని ప్రభుత్వానికి చాలా చిక్కులు వచ్చేవి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు స్పీకర్ మినహా అధికార పార్టీ అన్నాడీఎంకేకు 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడగా.. ప్రతిపక్ష డీఎంకే పార్టీకి 89 మంది, దాని మిత్రపక్షం కాంగ్రెస్కు 8 మంది, ఐయూఎంల్కు ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. దినకరన్ స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ మధ్యే మరో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో దినకరన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 22 అయింది. వీరు డీఎంకే, కాంగ్రెస్ కూటమికున్న 98 ఎమ్మెల్యేలతో కలిస్తే వీరి బలం 120గా మారేది. అప్పుడు అధికార పార్టీ బలం స్పీకర్తో కలిపి 114గా ఉండేది. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయేది. హైకోర్టు తీర్పుపై దినకరన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వ కొనసాగింపునకు వీలు కల్పిస్తోందని వ్యాఖ్యానించారు. -
కువైట్లో ఇఫ్తార్.. హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
కువైట్ : కువైట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పీ. రవింద్రనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. కువైట్ భారత అంబాసిడర్ అయిన హెచ్.ఇ.కే. జీవసాగర్ను శాసనసభ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు కువైట్లో తెలుగు వారి సమస్యలు గురించి మాట్లాడారు. ఈ విషయాలను అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ సభ్యులు అంబాసిడర్తో మాట్లాడుతూ.. కువైట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసే సేవ కార్యక్రమాల ద్వారా తెలుగువారిని ఏ విధంగా ఆదకుంటుందో వివరంగా తెలిపారు. మన ఆంధ్ర వారు కువైట్లో దాదాపుగా 5 లక్షల మంది ఉన్నారు. ఒక కడప జిల్లా నుంచే సుమారు ఒక లక్ష యాభైవేల మంది ఉన్నారని తెలిపారు. అంతేకాక ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి పార్ధివదేహాన్ని స్వస్థలం పంపించాలంటే రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. పేదవారు ఆ ఖర్చును భరించలేరు.. కాబట్టి ఆ ఖర్చును అంబాసి భరించేటట్లు చూడాలన్నారు. ఇక్కడ ఇంట్లో పని చేయడానికి వచ్చే వారికి కొందరు స్పాన్సర్ కష్టాలు పెడుతున్నారు. అలాంటి వారిని ఆదుకుని ఎటువంటి కేసులు లేకుండా ఇండియాకు పంపాలని కోరారు. మహిళలు భారత్ నుంచి కువైట్కు రావాలంటే స్పాన్సర్ మన ప్రభుత్వానికి(అంబాసికి) దాదాపుగా రూ. 2 లక్షలు డిపాజిట్ కట్టాలని నిబంధన ఉంది. దాంతో స్పాన్సర్స్ ఇండియా మహిళను విజ ఇవ్వాలంటే ముందుకు రావడం లేదని ఎమ్మెల్యేలు తెలిపారు. కాబట్టి రూ. 2 లక్షల డిపాజిట్ను తగ్గించాలని అన్నారు. ఇంట్లో ద్రవర్ గ హౌస్ మెయిడ్ అని పిలిచి ఆ పని ఇవ్వకుండా ఎడారిలో గొర్రెలు మేపడానికి నియమిస్తున్నారు. వారు ఎడారిలో పని చేయలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాంటి వారికి రక్షణ కల్పించి తిరిగి స్వస్థలం పంపే ఏర్పాట్లు చేయాలని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ అంబాసిడర్ను ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషాలు కోరారు. దీనిపై అంబాసిడర్ సానుకూలంగా స్పందించి తప్పకుండా అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపారు. -
ఆ ఎమ్మెల్యేల చూపు మా వైపు
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోని చాలా మంది అసంతృప్త నేతలు తమ పార్టీలోకి చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు బీఎస్ యడ్యూరప్ప చెప్పారు. శనివారం బెంగళూరు మల్లేశ్వరంలో రాష్ట్ర బీజేపీ యువ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని, అయితే ఆ ఎమ్మెల్యేల పనితీరు, ప్రాధాన్యాన్ని బట్టి ఎవరెవరినీ పార్టీలో చేర్చుకోవాలనే అంశంపై తమ పార్టీ జిల్లాల నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న అసంతృప్తిని, అసహనాన్ని ఆధారంగా చేసుకుని లాభపడాలని మేము భావించడం లేదు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం వరకు తన మనుగడను నిలపుకోగలదో నాకు తెలుసు. అప్పటివరకు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతిపక్ష పాత్ర చక్కగా పోషిస్తాం. ఎన్నికల్లో కేవలం కొద్ది సీట్లతో అధికారం కోల్పోయాం. ఈసారి చక్కగా పనిచేసి అధికారంలోకి వస్తాం. మేం అనుకుంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రాగలం. కానీ ప్రస్తుతం మా దృష్టి అంతా 2019 లోక్సభ ఎన్నికలపై ఉంది. మరోసారి మా నాయకుడు నరేంద్రమోదీని ప్రధానిని చేసేందుకు కృషి చేస్తాం’ అని యడ్డి తెలిపారు. కుమారకు పట్టం.. దారుణం స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి 37 స్థానాలు గెలిచిన ఒక పార్టీ నేత ముఖ్యమంత్రి కావడం విడ్డూరమని యడ్యూరప్ప విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దారుణం జరగడం ఒక్క కర్ణాటకకే చెల్లిందన్నారు. గతంలో 20–20 నెలల చొప్పున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు బీజేపీకి జేడీఎస్ చేసిన అన్యాయం కాంగ్రెస్ మరచిపోరాదని సూచించారు. మున్ముందు ఈ విషయంలో కాంగ్రెస్ పశ్చాత్తాపపడక తప్పదన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తానని హామీనిచ్చిన సీఎం కుమారస్వామి ఇప్పటివరకు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. గత 15 రోజులుగా మంత్రి విస్తరణతో బిజీగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ నేతలు పాలనను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఈ సారి ఎన్నికల్లో కొద్ది సీట్లతో వెనుకంజలో పడ్డామని, వచ్చే ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ ప్రతాప్ సింహా, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయేంద్ర, ఎమ్మెల్యే అరవింద్ లింబావళి తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరా..! ముగ్గురా..!
సాక్షి, కొత్తగూడెం : ‘నియోజకవర్గాల్లో విపత్కర పరిస్థితులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటే ఎవరూ కాపాడలేరు.’ అని సీఎం కేసీఆర్ అధికార పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించిన నేపథ్యంలో.. జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. పలుమార్లు సర్వేల ద్వారా స్థానిక పరిస్థితులను తెలుసుకుని పనితీరు బాగాలేదని సీఎం హెచ్చరించిన 39 శాసనసభ్యుల్లో జిల్లాకు చెందిన వారు కూడా ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో చేసిన సర్వేల్లోనూ ఎక్కువమంది రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పడం, జిల్లాలోని 5 అసెంబ్లీ సీట్లలో 4 సీట్లు రిజర్వుడు సీట్లే కావడంతో.. ఇక్కడి ఎమ్మెల్యేల్లో, పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కుటుంబసమేతంగా హైదరాబాద్ పిలిచి ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల పార్టీపై ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేకత వల్ల కొంపమునిగే పరిస్థితి ఉందని.. తక్షణమే సానుకూల పరిస్థితి తెచ్చుకునేలా బలం పెంచుకోవాలని అధినాయకత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో పంచా యతీ ఎన్నికల జరిగే అవకాశం ఉండడం, సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండడంతో ఇప్పటికే పొలిటికల్ ఫీవర్ నడుస్తోంది. అన్నిచోట్లా గ్రూపు రాజకీయాలు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక్క కొత్తగూడెం స్థానంలో మాత్రమే టీఆర్ఎస్ విజయం సాధించింది. భద్రాద్రి జిల్లా విషయానికి వస్తే అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీ నుంచి, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కాంగ్రెస్ నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు జిల్లా, మండల, స్థానిక నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం లో పలువురు చేరారు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున చేరారు. దీంతో దాదాపు అన్ని మండలాల్లో అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో వలస వచ్చిన ఎమ్మెల్యేలపై ఉద్యమకారులు, వలస వచ్చిన కొందరు అధికార పార్టీ నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పెత్తనం జిల్లాలోని ఓ రెండు నియోజకవర్గాలకు చెందిన(వలస వచ్చిన) ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు అన్ని విషయాల్లో పెత్తనం చేస్తున్నారని అధికార పార్టీకే చెందిన కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో అన్ని పనులు ఎమ్మెల్యే కుటుంబసభ్యులే కేటాయింపులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పర్సంటేజీలకు పనులు కేటాయిస్తున్నట్లు కార్యకర్తలే వాపోతున్నారు. ఇక మరో నియోజకవర్గంలో బదిలీలు, పోస్టింగ్ల వ్యవహారాలతో పాటు, ఇసుక క్వారీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల వద్ద పర్సంటేజీల వ్యవహారాల్లో నేరుగా సదరు ఎమ్మెల్యే కుటుంబసభ్యులే కథ నడిపిస్తున్నారని తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. ఇక మిషన్ కాకతీయ పనులు, మున్సిపాలిటీలో వచ్చిన 70 రోడ్డు పనుల్లో 60 పనులు బినామీకే అప్పగించారని పలువురు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక కార్యకర్తలకు ఇచ్చిన పనుల్లోనూ ముక్కుపిండి మరీ 10శాతం పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. పైగా సదరు ఎమ్మెల్యేకు నియోజకవర్గంలోని ఏ ఒక్క జెడ్పీటీసీతోనూ సఖ్యత లేకపోవడం తీవ్రతను చెబుతోంది. ఇంకో ఎమ్మెల్యేపై కూడా వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సర్వే నివేదికలు రావడం, అందులో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తుండడంతో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఎంపీ పొంగులేటి బుజ్జగింపులు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేపై అన్ని మండలాల్లో కీలక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉండడంతో నెల రోజుల క్రితం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ప్రత్యేకంగా చర్చలు జరిపి బుజ్జగించినట్లు సమాచారం. మండలాల వారీగా ఆయా వర్గానికి చెందిన కీలక నాయకులను విడివిడిగా పిలిపించుకుని పొంగులేటి మాట్లాడినట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఎంపీ పొంగులేటి సదరు ఎమ్మెల్యే దంపతులను సైతం పిలిపించుకుని పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో పరిస్థితి చేయిదాటిపోతుందని హెచ్చరించడం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా వచ్చిన సర్వే నివేదికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఎమ్మెల్యేల విషయమై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. -
పోరుకు సై!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్థానిక పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీతో గ్రామపంచాయతీ పాలకమండళ్ల పదవీ కాలం ముగియనుంది. నిర్దేశిత గడువులోగా స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో ఎన్నికలు నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుదిజాబితాను విడుదల చేయడంతో పాటు బీసీ ఓటర్ల గణన, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు తదితర అంశాలపై దృష్టి సారించింది. జూన్ 1న స్థానిక రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వేడి రగులుతోంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్లకు ప్రత్యేక అధికారాలు కల్పించిన నేపథ్యంలో బరిలోకి దిగేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ సానుభూతిపరులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాల్లో తిష్ట వేసి ‘గ్రౌండ్’ సిద్ధం చేస్తుం డగా.. విపక్ష పార్టీలు కూడా తమ తమ సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి. పోరుకు గ్రీన్ సిగ్నల్.. గ్రామపంచాయతీ తోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీల పాలకమండళ్ల కాలపరిమితి ముగియనుండడంతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గతంలో మొత్తం 1,148 గ్రామ పంచాయితీలు ఉండగా.. కొత్తగా ఏర్పాటుచేసిన జీపీలతో కలుపుకుని వీటి సంఖ్య 1,684కు చేరింది. అదే వి ధంగా వార్డుల విషయానికొస్తే గతంలో 12,148 ఉండగా.. ప్రస్తుతం 15,361 కి చేరాయి. ఉమ్మడి జిల్లాలో 19,36,445 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పరిపాలన విషయంలో అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చింది. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో స్థానిక పాలకమండళ్లకే పూర్తి అధికారాలు కేటాయించింది. తద్వారా ఈసారి బరిలో నిలిచేందుకు చాలా మం ది ఉత్సుకతతో ఉన్నారు. అదే విధంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల పునర్విభజన తర్వాత తొలిసారిగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పంచాయితీలు, వార్డుల రిజర్వేషన్లను జూన్1న ప్రకటించాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొత్త చట్టం ప్రకారం ఈసారి ఖరారయ్యే రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసానుండటంతో పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్థానికంలో సత్తా చాటితేనే... స్థానిక పోరులో సత్తా చాటేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తద్వారా విపక్ష పార్టీలను సాధారణ ఎన్నికలకు ముందే బలహీనపర్చాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా సామ, భేద, దండోపాయాలను ఉపయోగిస్తోంది. అంతేకాదు స్థానిక ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. స్థానికంలో సత్తా చాటితేనే సాధారణ ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించనున్నట్లు పార్టీ అధిష్టానం చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో తమ తమ నియోజకవర్గంలోని అత్యధిక స్థానాలు గెలుపొందాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు. ఇలా ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎమ్మెల్యేలు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలనే అంటిపెట్టుకొని తిరుగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నే విపక్ష పార్టీలకు చెందిన వారిని టీఆర్ఎస్లోకి చేర్చుకుంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు రైతుబంధు వంటి వాటి ద్వారా జనానికి మరింత చేరువవుతున్నారు. ఉ మ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు ఎనిమిది చోట్ల అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా సాధ్యమైనంత మేర ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. సత్తా చాటుతామంటున్న కాంగ్రెస్.. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఫైనల్స్గా భావిస్తున్న తరుణంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు విపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ కదలికలను ముమ్మరం చేసింది. ఎక్కడిక్కడ గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తూ స్థానిక పోరుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో బలంగా ఉన్నామని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో సత్తా చూపాలని యోచిస్తోంది. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, వనపర్తి, అలంపూర్, గద్వాల, కొడంగల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ఎమ్మెల్యేలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా మిగతా చోట్ల ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలు కూడా తమ సానుభూతిపరులకు మద్దతుగా నిలవాలని యోచిస్తున్నారు. ఫలితంగా ఎక్కువ మొత్తంలో స్థానిక సీట్లు సాధించి వచ్చే ఎన్నికల్లో తమ బెర్త్ను సుస్థిరం చేసుకోవాలని భావిçస్తున్నారు. మిగతా పక్షాలు సైతం.. స్థానిక ఎన్నికల్లో మిగతా విపక్షాలైన బీజేపీ, వైఎస్సార్సీపీ, తెలంగాణ జన సమితి, కమ్యూని స్టు పార్టీలు కూడా తమ తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో గెలిస్తే కేడర్ బలపడుతుందని ఆయా పార్టీలు భావించి వ్యూహాలు రచిస్తున్నాయి. ఒక మోస్తరు సంస్థాగతంగా నిర్మితమైన బీజేపీ కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. పార్టీ అనుబంధ శాఖలను అప్రమత్తం చేసింది. అందుకు అనుగుణంగా చాపకింద నీరు లా చర్యలు చేపడుతోంది. అదే విధంగా వైఎస్సార్సీపీ కూడా గత ఎన్నికల మాదిరిగానే మంచి ఫలితాలు రాబట్టాలని యోచిస్తోంది. అందుకో సం పాలమూరు ప్రాంతంలోని పార్టీ యంత్రాగమంతా శక్తిమేర ప్రయత్నిస్తోంది. నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తమ పట్టును నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో కొత్తగా రాజకీయ రూపాంతం చెంది న తెలంగాణ జన సమితి(టీజేఎస్) కూడా స్థానిక పోరు సమర శంఖం పూరిస్తోంది. పోరులో తలపడేందుకు పకడ్బందీగా అభ్యర్థులను ఎంచుకుంటోంది. అలాగే వివిధ పోరాటాలతో నిత్యం జనం మధ్య ఉండే కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ తమ సత్తాను చాటాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలా అన్ని పార్టీలు రంగంలో దిగడంతో రిజర్వేషన్లు ఖరారు కాకముందే స్థానిక సంస్థల సందడి నెలకొందని చెప్పాలి. -
దేవుని సాక్షిగా
అధికార పక్షం, విపక్షం, కొద్దిసేపట్లో ఎవరు అటు ఇటు అవుతారో తెలియని ఉత్కంఠ, అధికారం నిలుపుకోవాలని ఒకరు, చేజిక్కించుకోవాలని మరొకరి ఆరాటం. అందరి మనసుల్లోనూ ఒకటే కలవరం, ఈ పరిస్థితుల్లో కర్ణాటక అసెంబ్లీ శనివారం తొలిసారిగా కొలువు తీరింది. నూతన సభ్యులు దేవుని సాక్షిగా, రైతుల సాక్షిగా, ఒకరిద్దరు సత్యం సాక్షిగా ప్రమాణం గావించారు. సాక్షి, బెంగళూరు: ఎన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో శనివారం కొత్త ఎమ్మెల్యేలతో శాసనసభ సమావేశం అయింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఎంతో ఉద్వేగంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు సమయానికే అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ ప్రారంభమైన 10 నిమిషాలకు హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష„ý స్థానంలో, బీజేపీ ఎమ్మెల్యే అధికారపక్షం వైపు కూర్చొన్నారు. సభలో హెచ్డీ రేవణ్ణ మాట్లాడుతూ ఐదుగురు చొప్పున ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించాలని ప్రొటెం స్పీకర్ను కోరగా, ఆ మేరకు అనుమతించారు. మధ్యాహ్నం కల్లా ప్రధాన నేతలు సిద్ధరామయ్య, పరమేశ్వర్, జమీర్ అహ్మద్ తదితరులు ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఎమ్మెల్యేలు ఆనంద్సింగ్, సోమశేఖర్రెడ్డి, ప్రతాప్గౌడలు మధ్యాహ్నం వరకు శాసనసభకు హాజరు కాలేదు. మధ్యాహ్నం ఒంటి గంటలోపల చాలా మంది ఎమ్మెల్యేలు ప్రమాణం పూర్తి చేశారు. మీడియా గ్యాలరీలో కూర్చొని జాతీయ నేతలు అనంత్కుమార్, శోభ, గులాంనబీ ఆజాద్, మునియప్ప తదితరులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. ఎమ్మెల్యేలందరూ దేవుడు, రైతుల సాక్షిగా ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకల్లా దాదాపు 195 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం పూర్తి చేశారు. అనంతరం తాత్కాలిక స్పీకర్ గోపయ్య సభను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు. ఇక మధ్యాహ్నం వరకు కూడా ఆనంద్సింగ్, ప్రతాప్ గౌడ ఆచూకీ లభించకపోవడంతో వారు అసెంబ్లీకి వస్తారా లేదా అనే అనుమానం అందరిలో వ్యక్తమయింది. గత బడ్జెట్ సమావేశాల అనంతరం అసెంబ్లీ సమావేశమవడంతో ఎమ్మెల్యేలందరితో శాసనసభ కళకళలాడింది. ఎమ్మెల్యేల ముఖాల్లో ఉత్సాహంతో పాటు ఉద్విగ్నత కూడా కనిపించింది. యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గుతారా?, ఓడిపోతారా?అనే సందిగ్ధం అందరిలోనూ వ్యక్తమైంది. యడ్యూరప్ప దేవునిపై, సిద్ధరామయ్య సత్యంపై సభ ప్రారంభమైన కొద్దిసేపటికి ‘ముఖ్యమంత్రి’ యడ్యూరప్ప మొదటగా ఎమ్మెల్యేగా.. దేవుని పేరిట ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య సత్యప్రమాణంగా ప్రమాణ స్వీకారం గావించారు. కొత్త ఎమ్మెల్యేలతో విధానసభ కార్యదర్శి ఎస్.మూర్తి ప్రమాణం చేయించారు. సాయంత్రం నాలుగు గంటలకు బలనిరూపణ పరీక్ష ముగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో మధ్యాహ్నం 03.30గంటలకు 221 మంది ఎమ్మెల్యేలు చకచకా ప్రమాణం చేశారు. కనిపించకుండా పోయి కాంగ్రెస్ను కలవరపెట్టిన ఎమ్మెల్యేలు ఆనంద్సింగ్, ప్రతాప్గౌడ పాటిల్లు సభ ప్రారంభమవడానికి అర్ధగంట ముందు విధానసౌధలో ప్రత్యక్షమవడంతో హమ్మయ్య అనుకున్నారు. కుమార, డీకే ఒకేసారి జేడీఎస్ నుంచి కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత డీకే శివకుమార్లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయగా, అందరూ ఆసక్తిగా గమనించారు. గత మూడు రోజులుగా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారు. డీకే శివకుమార్ పేరిట ప్రమాణం అసెంబ్లీలో అందరూ దైవం, సత్యం, రైతుల సాక్షిగా ప్రమాణం చేస్తే ఒక్క ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ పేరు మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కుణిగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్. డీకేకు అత్యంత ఆప్తునిగా పేరు పొందిన రంగనాథ్ ఆయన పేరు మీద ప్రమాణం చేయడంతో అందరు ఆసక్తిగా చూశారు. మొదటి సారి ఎన్నికల్లో గెలుపొందిన కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపా శశిధర్ ఎవరి పేరు మీద ప్రమాణం చేయాలో తెలియక కాసేపు సందిగ్ధంలో పడ్డారు. -
కర్నాటకం: హైదరాబాద్ టూ బెంగళూరు
-
అంతరాత్మలున్నాయా?
అక్షర తూణీరం క్యాంప్ కట్టడం ఓ బ్రహ్మవిద్య అని కొందరు, కాదు క్షుద్ర విద్య అని మరికొందరు అంటుం టారు. తన అనుకున్నవాళ్లందర్నీ ఒకచోట మళ్లే యడాన్ని క్యాంప్ రాజకీయం అంటారు. రేపు చేతులెత్తాల్సిన వాళ్లందర్నీ ఒకే తాటిమీద, ఒకే గూట్లో ఉంచడం. వాళ్లని రాచమర్యాదలతో ఆ పది రోజులూ సేవించుకోవడం చిన్న సంగతి కాదు. నరాలు తెగిపోతాయ్. ఎందుకంటే వాళ్లకి బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవ్. సర్వభో గాలు ఉంటాయ్. ఈ క్యాంప్లు గడచిన నలభై ఏళ్లలో చాలా మంచి ఫలితాలు ఇవ్వడంతో బహుళ ప్రాచుర్యం పొందాయి. ఈ క్యాంప్కి చాలామంది ఐచ్ఛికంగా వస్తే, కొద్దిమంది బలవం తంగా తీసుకు రాబడతారు. బడా ఎన్నికల నించి పంచాయతీ స్థాయి దాకా ఈ రాజకీయం నడు స్తోంది. అప్పట్లో మావూరి మున్సబు గారి మామిడితోట క్యాంప్లు పెట్టడా నికి చాలా ప్రసిద్ధికెక్కింది. తాటాకు పందిళ్లు, మడత మంచాలు, పేకాట లకి విశాలమైన గడ్డి పరుపులు ఏర్పా టుగా ఉండేవి. వంటలకి, వార్పులకి అనువైన గాడి పొయ్యిలు, కోరినపు డల్లా ఒళ్లుపట్టి, టెన్షన్ దింపేసే పని వాళ్లు, చేగోడీల నించి చేపల పులుసు దాకా వండి వడ్డించగల వంటవాళ్లు క్యాంప్ని సుభిక్షం, సుసంపన్నం చేస్తుండేవారు. ఈ సంప్రదాయం మన దేశంలో అన్ని దిక్కులా ఉంది. 30 ఏళ్ల క్రితం తమిళనాట ఓ క్యాంప్లో విధివశాత్తు ఉండాల్సి వచ్చింది. మద్రా సులో మెరీనా బీచ్కి దగ్గర్లో పది పన్నెండు అంత స్థుల హోటల్ని ఉన్నట్టుండి క్యాంప్గా మార్చే శారు. నేనందులో నెలవారీ కస్టమర్ని. మిగతా గదులన్నీ తమిళ పంచెలతో, బంగారు చెయిన్లతో నిండిపోయాయి. హోటల్ వారు తమ కిచెన్ని క్యాంపుకి అంకితం చేశారు. నన్ను మాత్రం క్యాంపులో కోరినవన్నీ ఉచితంగా తినెయ్యమ న్నారు. ఫ్రీగా తాగేయచ్చన్నారు. నిజంగా ఆ తిండి ఓ గొప్ప అనుభవం. ఆంధ్రలో కూడా క్యాంప్లు నడపగల సమ ర్థులున్నారు. వారాల తరబడి కప్పలు చెదర కుండా, పిట్టలెగరకుండా కాపాడుకురావడం చిన్న విషయం కాదు. సమాచార వ్యవస్థని పూర్తిగా కట్టిపెట్టాలి. అన్నిరకాల ఆటలతో వాళ్లని ఉల్లాస మరియు వినోద పరచాలి. అవసరమైతే మన వాళ్లని ఆటలో కూచోపెట్టి, అవతలివాళ్లకి కుప్పలు తెప్పలుగా సొమ్ములొచ్చేలా చూడాలి. నిత్యావస రాలైన మందు, మందులు అందిస్తూ ఉపద్రవం రాకుండా చూసుకోవాలి. అవసరమైతే రెండు డైలీ పేపర్లలో నాలుగు పేజీలు జాగ్రత్తగా కల్తీచేసి క్యాంప్ సభ్యులకు హాయిని కలిగించాలి. ఇలా చేస్తేనే ఓసారి రసాభాస అయింది. ఓ సాయంకాల వేళ సిల్కు లాల్చీ ఫెళ ఫెళల్లోంచి నిజం డైలీ పేజీ జారి పడింది. దాంట్లో పెద్దక్షరాల్లో సమాచారం వేరేగా ఉంది. ‘‘ఇంకే వుంది... క్యాంపు మునిగింది’’ అనుకుంటున్నారు కదూ? రెండు మూడు బృహత్ క్యాంపులు నిర్వ హించినాయన చెప్పినప్పుడు నేనూ అలాగే అను కున్నా. ‘‘ఏవుందండీ... జరిగిన చిన్న పొరబా టుకి వంద కోట్లు పెనాల్టీ పడిందండీ. దాదాపు యాభైమంది మోసం చేశారంటూ ఎదురు తిరి గారు. తలొక రెండూ వడ్డించి సరిచేశాం. ఇవన్నీ తప్పదండీ చివరాఖరికి అంతరాత్మ ప్రబోధం అంటారండీ’’ అంటూ ఆర్గనైజర్ నిట్టూర్చాడు! శ్రీరమణ, వ్యాసకర్త ప్రముఖ కథకుడు -
ఇంకా అజ్ఞాతంలోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు..!!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. సంఖ్యాబలం పెంచుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ‘ఆపరేషన్ కమల’తో రంగంలోకి దిగగా.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్లు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ‘అజ్ఞాతం’లోకి వెళ్లడం కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. విజయనగర, మస్కీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి సైతం వారు హాజరుకాలేదు. దీంతో వారు బీజేపీ తరఫు వెళ్లారా? అనే ఆందోళనలు పార్టీలో మొదలయ్యాయి. ఆనంద్ సింగ్ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. అనంతరం విజయనగర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు పోటీ చేసి గెలుపొందారు. బీజేపీకి శాసనసభలో బల నిరూపణకు గవర్నర్ 15 రోజులు గడువు ఇవ్వడంతో కాంగ్రెస్-జేడీఎస్లు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్కు తరలిస్తున్నారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో వారికి బస కల్పిస్తున్నట్లు సమాచారం ఉంది. -
కొచ్చికి కాంగ్రెస్-జేడిఎస్ ఎమ్మెల్యేలు
-
యడ్డీ గట్టెక్కేదెలా..?
న్యూఢిల్లీ: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ముందు బలనిరూపణ పెద్ద సవాలుగా నిలిచింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి బీజేపీ బలం 105 మాత్రమే. మెజారిటీ మేజిక్ ఫిగర్ మాత్రం 112. ఈ పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నెగ్గడమెలా? ఇందుకు సంబంధించి యడ్యూరప్ప ముందు రెండు మార్గాలున్నాయి. అవి.. 1. విపక్ష సభ్యుల గైర్హాజరు విశ్వాస పరీక్ష సమయంలో కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన కనీసం 13 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా చేయాలి. లేదా అసెంబ్లీకి హాజరైనా ఓటింగ్లో పాల్గొనకుండా చూడాలి. దానివల్ల అసెంబ్లీకి హాజరై ఓటేసే ఎమ్మెల్యేల సంఖ్య 209కి పడిపోతుంది. అప్పుడు హాజరైన లేదా ఓటేసిన ఎమ్మెల్యేల్లో యూడ్యూరప్పకు మెజారిటీ(సగం కన్నా ఒకరు ఎక్కువ) లభిస్తే సరిపోతుంది. అంటే 105 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే యడ్యూరప్ప గట్టెక్కుతారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి బీజేపీకి ఇప్పటికే 105 మంది శాసన సభ్యుల మద్దతుంది. గైర్హాజరైన లేదా ఓటేయని ఎమ్మెల్యేలను ఆయా పార్టీలు బహిష్కరిస్తే ఉప ఎన్నికలు జరుగుతాయి. 2. కాంగ్రెస్, జేడీఎస్ల్లో చీలిక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్లో.. ఏ ఒక్క పార్టీ నుంచైనా కనీసం మూడింట రెండొంతుల మంది ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరాలి. ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కాకుండా ఉండాలంటే.. కాంగ్రెస్ నుంచి కనీసం 52 మంది లేదా జేడీఎస్ నుంచి 24 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించాలి. కాంగ్రెస్ నుంచి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు వస్తే బీజేపీ బలం 157 చేరుతుంది. లేదా జేడీఎస్ నుంచి మూడింట రెండొంతుల మంది వస్తే బీజేపీ బలం 129కి చేరుతుంది. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ఫిరాయించేలా ఒప్పించడం కష్టసాధ్యమే. -
రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. తమ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా నిరోధించేందుకు కాంగ్రెస్, జేడీఎస్లు సమాయత్తమయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుధవారం సాయంత్రం నగర శివారులోని అత్యంత ఖరీదైన ఈగల్టన్ రిసార్టుకు తరలించారు. అక్కడ మొత్తం 120 గదులను బుక్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమ ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులోనే ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ చెప్పారు. గత ఏడాది గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ వలసలు నివారించేందుకు కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఈ రిసార్టులోనే ఉంచింది. అప్పుడు ఎమ్మెల్యేల తరలింపులో ప్రధాన పాత్ర పోషించిన శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. 2004 ఎన్నికల్లో హంగ్ ఏర్పడినప్పుడు బీజేపీ 90, కాంగ్రెస్ 65, జేడీఎస్ 58 సీట్లు గెలిచాయి. తమ పార్టీని కాంగ్రెస్, బీజేపీలు చీల్చకుండా జేడీఎస్ తమ ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ రిసార్టుకు తరలించింది. అలాగే కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీతో వెళ్లాలని 2006లో కుమారస్వామి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా క్యాంపు రాజకీయాలు జరిగాయి. -
కర్ణాటకలో రాజకీయ కాక : కేరళ కూల్ ట్వీట్
తిరువనంతపురం : అసలకే వేసవి తాపం, ఆపై కర్ణాటక ఎన్నికల ఫలితాలు. రాజకీయ నేతల్లో మరింత వేడిమి రాజుకుంది. ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠను రేపిన ఈ ఫలితాలు, చివరికి ఎవరికీ స్పష్టమైన మెజార్టీని అందించకుండా మరింత కాకను పుట్టించాయి. దీంతో కాంగ్రెస్, జేడీయూలు కలిసి పొత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. అతిపెద్ద పార్టీగా అవతరించినందున తమను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవాలని బీజేపీ ఆ రాష్ట్ర గవర్నర్ను కోరింది. దీంతో కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరికి వారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేయకుండా గెలిచిన ఎమ్మెల్యేలను రిసార్ట్లకు తరలించాలని జేడీఎస్ వ్యూహాం రచిస్తోంది. కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలిస్తోంది. ఈ రాజకీయ సమీకరణాలతో కర్ణాటక కాక పుట్టిస్తుంటే, దాని పక్కనే ఉన్న రాష్ట్రం కేరళ కర్ణాటక రాజకీయ నేతలకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. సాక్షాత్తూ దేవుళ్ల సొంత రాష్ట్రమైన కేరళ రిసార్ట్స్లో బస చేసి సేద తీరండని ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటనతో గెలిచిన ఎమ్మెల్యేలకు బసతో పాటు తన వ్యాపార లబ్దిని చూసుకుంటోంది. తమ వద్ద అత్యంత సురక్షితమైన, అద్భుతమైన రిసార్ట్స్ ఉన్నాయని, ఎమ్మెల్యేలు ఇక్కడికి రావొచ్చని కేరళ టూరిజం ట్వీట్ చేసింది. ఇక్కడికి వచ్చి రాజకీయ గేమ్ ఆడుకోవాల్సిందిగా కూడా అంటోంది. కర్ణాటక రాజకీయ నేతలకు కేరళ టూరిజం ప్రకటించిన ఈ వినూత్న ఆఫర్కు అనూహ్య స్పందన వస్తోంది. కేరళం టూరిజం చేసిన ఈ ట్వీట్ ట్విటర్ యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్నికల ఫలితాల సందర్భంగా చూసిన బెస్ట్ ట్వీట్ ఇదే అంటూ ఓ ట్విటర్ యూజర్ కామెంట్ పెట్టారు. గాడ్స్ ఓన్ ట్వీట్గా మరో యూజర్ కామెంట్ పెట్టారు. ఇలా కేరళ టూరిజం ట్వీట్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. After the rough and tumble of the #KarnatakaVerdict, we invite all the MLAs to unwind at the safe & beautiful resorts of God's Own Country. #ComeOutAndPlay pic.twitter.com/BthNZQSLCC — Kerala Tourism (@KeralaTourism) May 15, 2018 Gods own tweet. — Movies Dialogues (@MoviesDialogues) May 15, 2018 Award for this 🙏 u guys rock. — Sweekruth B.P (@SweekruthBP) May 15, 2018 -
కన్నడ సిత్రం: ఆయారాం, గయారాంలదే హవా!
కర్ణాటక కొత్త సర్కార్ ఏర్పాటులో ‘ఆయారాం, గయారాం’లే కీలక భూమికను పోషించనున్నారు. గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో తరచుగా పార్టీలు మార్చే ఎమ్మెల్యేలను ఆయారాం, గయారాంలుగా పిలిచేవారు. అయితే గత మూడు,నాలుగు దశాబ్దాల కాలంలో తొలిసారిగా కన్నడ నాట ప్రధాన పార్టీల నుంచి పరస్పర ఫిరాయింపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సారి ఎన్నికల్లో ఇలా మొత్తం 60 మందికి పైగా బరిలో నిలవడంతో వారే నూతన ప్రభుత్వ స్థాపనను నిర్దేశించే స్థితిలో నిలుస్తున్నారు. బీజేపీ, జేడీ(ఎస్)ల నుంచి పార్టీ ఫిరాయించిన వారికి అధికార కాంగ్రెస్పార్టీ టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు వారిలో కొందరు ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీ మారగా, కొందరైతే నామినేషన్ల దాఖలుకు ఒకటి,రెండు రోజుల ముందే చేరినవారున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఈ విషయంలో తానేమి తక్కువ కాదంటూ ఏకంగా 20 మంది ఇతర పార్టీల వారికి కాషాయకండువాలు కప్పేసింది. వీరిలో కొందరిని నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక కూడా చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 8 మంది జేడీ (ఎస్)ఎమ్మెల్యేలు, అయిదుగురు బీజేపీ నాయకులకు టికెట్లు ఇచ్చింది. బీజేపీ ఐదుగురు జేడీ(ఎస్), ఏడుగురు కాంగ్రెస్ నాయకులకు పార్టీ టికెట్లు ఇచ్చి పోటీకి అవకాశమిచ్చింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధానపాత్ర నిర్వహించాలని ఉవ్విళ్లూరుతున్న జేడీ (ఎస్) మొత్తం 22 పార్టీ ఫిరాయింపుదారులకు టికెట్టిచ్చింది. వారిలో 12 మంది కాంగ్రెస్కు, 10 మంది బీజేపీకి చెందినవారున్నారు. కొందరైతే నామినేషన్ల దాఖలు ముగియడానికి కేవలం ఒకటి, రెండు రోజుల ముందే ఆ పార్టీలో చేరారు. తాజా పరిణామాలతో మరింత అయోమయం... ఎవరూ ఊహించని విధంగా నామినేషన్ల గడువు ముగిసే వరకు చోటుచేసుకున్న ఈ పరిణామాలతో అక్కడ రాజకీయ శ్రేణుల్లో సందిగ్ధత ఏర్పడింది. దీంతో ఓటర్ల మనోగతం ఏ విధంగా ఉండబోతున్నదని అంచనా వేయడం తలపండిన రాజకీయ పండితులకు సైతం శక్తికి మించిన పనిగా తయారైంది. ప్రధానపార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు ఎవరిని గెలిపిస్తారనే దానిపై అయోమయం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్)లకు ఈ ఎన్నికలు చావోరేవో అన్నట్టుగా తయారవడంతో సిద్ధాంతాలు, విధానాలు వంటి వాటిని పెద్దగా పట్టించుకోకుండానే చివరి నిముషంలో పార్టీ మారే వారికి టికెట్లు ఇచ్చాయని విమర్శిస్తున్న వారూ ఉన్నారు. మచ్చుకు కొందరు... వారం, పదిరోజుల క్రితం వరకు బీజేపీ ర్యాలీల నిర్వహణలో బిజీగా ఉన్న బీజాపుర జిల్లా బీజేపీ అధ్యక్షుడు విఠల్ కటకదొండ నాగథాన ఎస్సీ సీటు నుంచి సీటు నిరాకరణతో కాంగ్రెస్లో చేరి అక్కడి నుంచే అధికారపార్టీ అభ్యర్థి అయ్యాడు గుల్బర్గాజిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎంవై పాటిల్ కొన్నినెలల క్రితమే ఎన్నికల ప్రచారాన్ని సైతం మొదలుపెట్టినా ఆయన స్థానంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మలికయ్య గుత్తేదార్కు బీజేపీ టికెట్ ఇవ్వడంతో పార్టీ పిరాయించి కాంగ్రెస్ టికెట్పై పోటీచేస్తున్నాడు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బి.ప్రసన్నకుమార్ బెంగలూరులోని పులికేషినగర నుంచి టికెట్ ఆశించారు. అయితే సిట్టింగ్ జేడీ(ఎస్) ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి సిద్ధరామయ్య టికెట్ ఇవ్వడంతో ఆయన కూడా పార్టీ మారి అదే సీటు నుంచి జేడీ(ఎస్) టికెట్పై బరిలో నిలిచాడు. ప్రతీ ఓటు ఎంత కీలకమైనదో అంత కంటే ఎక్కువగా గెలిచే ప్రతీ సీటు ముఖ్యమైనదే. అందువల్ల విజయం సాధించే ‘ఆయారాం, గయారాం’లు తమకు గౌరవనీయులేనన్న ఓ సీనియర్నేత మాటలు అక్కడున్న పరిస్థితులు ఎత్తిచూపుతున్నాయి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆ విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు
వైఎస్సార్ జిల్లా : పులివెందుల ప్రాంతాన్ని టీడీపీ అభివృద్ధి చేసిందని చెప్పుకోవడానికి టీడీపీకి సిగ్గు ఉండాలని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంజద్ బాషా, రవీంద్రనాధ్ రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు కడపలో విలేకరులతో మాట్లాడారు. పులివెందులను అభివృద్ధి ఎవరు చేశారనేది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని చెబుతారని వ్యాఖ్యానించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యం వల్లే పులివెందుల ప్రాంతానికి నీరు వచ్చిందన్నారు. 90 శాతం పనులను వైఎస్ హయాంలోనే పూర్తి చేస్తే కేవలం 10 శాతం పనులు చేసి సొంత డబ్బా కొట్టుకోవడం టీడీపీకి తగదన్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆదినారాయణకు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత నేత వైఎస్సేనని చెప్పుకొచ్చారు. గండికోట ముంఫు బాధితులను అదుకోకుండా పులివెందులకు నీళ్లు ఇచ్చేశాం అని చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దళిత తేజం ద్వారా ఒక్క దళితునికైనా న్యాయం చేసారా అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాజీనామా చేసి కేంద్రంపై పోరాటం చేసింటే బాగుండేదని సూచించారు. చంద్రబాబును ప్రజలు నమ్ముకుంటే ఆయన వాళ్లను నట్టేటా ముంచారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానాన్నీ ఎదుర్కోలేని ప్రధాని మోదీ ఉపవాస దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
గాయకుడిపై నోట్లు కుమ్మరించారు..
అహ్మదాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోట్ల వర్షం కురిపించారు. ఓ ఫోక్ సింగర్పై పోటాపోటీగా కరెన్సీ నోట్లను వెదజల్లారు. అందుకు సంబంధించిన వీడియో ఓ ప్రముఖ మీడియా ఛానెల్లో చక్కర్లు కొడుతోంది. గుజరాత్ ఎమ్మెల్యే అంబరీష్ దర్(ప్రస్తుతం సస్పెండ్ అయ్యారు), బీజేపీ ఎమ్మెల్యే పూనమ్బెన్ మాదమ్ ఇద్దరూ తమ అనుచరులతో కలిసి గిర్ సోమ్నాథ్ పట్టణంలో ఫోక్ సాంగ్ ఫెస్టివల్కు హాజరయ్యారు. అక్కడ సింగర్ కీర్తిదన్ గధ్వి తన ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఇద్దరూ పోటాపోటీగా డబ్బులు వెదజల్లారు. కార్యక్రమం అయ్యాక అదంతా పోగేస్తే రూ.25లక్షలకు పైగానే అని తేలింది. కాగా, బీజేపీ నేతపై మైక్రోఫోన్తో దాడికి పాల్పడినందుకు.. సభా కార్యక్రమాలకు అడ్డుపడినందుకు అంబరీష్ దర్తోపాటు మరో ఎమ్మెల్యే ప్రతాప్ దుధత్ను మూడేళ్లపాటు అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. -
న్యాయపరంగానే ఎదుర్కొందాం
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించిన విషయంలో న్యాయపోరాటం ద్వారానే ముందుకెళ్లాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో ఓటు వేయించేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలు చేపట్టాలని భావిస్తోంది. ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల అనంతరం సోమవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్న కాంగ్రెస్ నేతలు మంగళవారం సీఎల్పీ నేత కె.జానారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్, రేవంత్ రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్అలీతోపాటు మాజీ స్పీకర్లు కె.ఆర్.సురేశ్రెడ్డి, నాదెండ్ల మనోహర్, హైకోర్టు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ హాజరయ్యారు. బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేల భవితవ్యంతోపాటు సోమవారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, రాజ్యసభ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. బహిష్కరణ వేటు పడిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్లతో రాజ్యసభ ఎన్నికల్లో ఓటేయించేందుకు గల అవకాశాలపై చర్చ జరిగింది. ఈ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కొంత అనుకూలంగానే ఉందని, ఆరు వారాలపాటు ఈ ఎమ్మెల్యేల స్థానాల ఖాళీని నోటిఫై చేసే వెసులుబాటు లేకపోవడం, రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ల పత్రాలపై వారిద్దరూ సంతకాలు చేసినప్పటికీ నామినేషన్ తిరస్కారానికి గురికాకపోవడం కూడా కలిసి వస్తుందనే చర్చ జరిగింది. వీటిని పేర్కొంటూ మరోమారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయించారు. ఈ విషయమై కోమటిరెడ్డి, సంపత్లు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. అప్పుడేం చేశామంటే.. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్షాల రాద్ధాంతం సాధారణంగా జరిగే విషయమే అయినా, కాంగ్రెస్ సభ్యుల దాడి వల్ల మండలి చైర్మన్కు గాయం అయిందని చిత్రీకరించి ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించారన్న దానిపై మాజీ స్పీకర్ల నుంచి వివరణ తీసుకున్నారు. ‘నేను స్పీకర్గా ఉన్న సమయంలో రేవంత్రెడ్డి చేసిన దాడి వల్ల అప్పటి మండలి చైర్మన్ చక్రపాణికి గాయమైంది. ఇదే గవర్నర్ నరసింహన్పై హరీశ్రావు చేసిన దాడి విజువల్స్ కూడా పరిశీలించాం. ఆ తర్వాత ఇద్దరు సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, రూల్స్ అన్నింటినీ పరిశీలించి, బీఏసీలో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతే వారిని వారం రోజుల పాటు సస్పెండ్ చేశాం’అని నాదెండ్ల మనోహర్ వివరించారు. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, బీఏసీలో చర్చించకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమేనని ఇద్దరు మాజీ స్పీకర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈనెల 27న హైకోర్టు తదుపరి విచారణ అనంతరం వచ్చే నిర్ణయాన్ని బట్టి ప్రజల్లోకి వెళ్లాలని, అవసరమైతే నల్లగొండ, అలంపూర్లలో భారీ సభలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని నిర్ణయించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది: ఉత్తమ్ భేటీ అనంతరం పీసీసీ చీఫ్ ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, ఈ విషయంలో ఖచ్చితంగా గెలుపు న్యాయం వైపే ఉంటుందని దీమా వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా తమ ఎమ్మెల్యేలను బహిష్కరించారని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తకుండా ఉండేందుకే ప్రతిపక్ష పార్టీకి చెందిన తమను సస్పెండ్ చేశారని, ఇలాంటి ఘటన దేశంలోనే ఎక్కడా జరగలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలంతా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికే ఓటేయాలని, బహిష్కరణకు గురైన తమ ఎమ్మెల్యేలు ఓటేస్తారని అన్నారు. విలాసాలు మానండి: కోమటిరెడ్డి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అదీ దేశంలోనే నిజాయితీ ఉన్న సీఎంగా పేరున్న మమతా బెనర్జీ దగ్గరికి వెళ్లి మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. పార్లమెంటులో ఓ పక్క బీజేపీకి మద్దతిస్తూ మరోపక్క థర్డ్ ఫ్రంట్ అంటున్న కేసీఆర్కు ఈ విషయంలో మమతాబెనర్జీ మొట్టికాయలు వేశారనే వార్తలు వస్తున్నాయన్నారు. మమత సింపుల్గా ఉంటారని, ఆమె కట్టె కుర్చీలో కూర్చుని మాట్లాడుతారని, ఆమెను చూసిన తర్వాతైనా కేసీఆర్లో మార్పు రావాలని, వందల కోట్లు ఖర్చు చేస్తున్న విలాస జీవితానికి స్వస్తి పలకాలని ఎద్దేవా చేశారు. -
‘సర్వే’జన... శాసనసభ్యా..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటివరకు ఏకచ్ఛత్రాధిపత్యం అనుకున్న ‘కోట’ల్లోకి ప్రవే శించేందుకు ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా పోటీ పడుతున్నారు. తేడా వస్తే ఎమ్మెల్యే టిక్కెట్టుకే ఎసరు రావచ్చేమోనన్న సంకేతాలు అధిష్టానం నుంచి అందుతున్నాయి. దీనికితోడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్వయంగా నిర్వహిస్తున్న సర్వేలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సర్వేలు జరిపించి మార్కులు వేసిన ముఖ్యమంత్రి ఈసారి మరింత పకడ్బందీగా క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ జరుపుతున్న ట్లు వస్తున్న వార్తలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అదే సమయంలో వివిధ పార్టీలు, సంస్థలు, యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించిన సర్వేలు అంటూ ‘2019లో గెలిచే ఎమ్మెల్యేలు’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న అంకెలు, లెక్కలు ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు సైతం వివిధ వర్గాల ద్వారా సర్వేలు జరిపించుకునే పనిలో పడ్డారు. ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న పనులను మంజూరు చేయించుకుంటూ, అభివృద్ధి పనుల పేరుతో జనంలోనే ఉండేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఎన్నికల హామీలకన్నా... స్థానిక అంశాలపై దృష్టి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన దళితులకు మూడెకరాల సాగుభూమి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం అమలు వివిధ కారణాల వల్ల ఆశించిన స్థాయిలో ఫలితమివ్వలేదు. మిషన్ కాకతీయ పథకంలో చెరువుల పూడికతీత సైతం పూర్తిస్థాయిలో సాగడం లేదు. మిషన్ భగీరథ కింద ఇంటింటికి రక్షిత మంచినీరు అందించే పథకం కూడా ఆలస్యం అవుతోంది. అదే సమయంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, ఆసరా పింఛన్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతిసేవలు, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు జనం ఆదరణను చూరగొంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇప్పుడు స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యమంత్రి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాలకు వచ్చే ఆదరణ అంతా సీఎంకే వెళుతున్న నేపథ్యంలో ‘మీరేం చేశారు’ అని జనం, విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారు. హైదరాబాద్ సచివాలయం, ప్రగతిభవన్ల చుట్టూ తిరుగుతూ నియోజకవర్గంలో అందరి దృష్టిని ఆకర్షించే పనులు పూర్తి చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, టీఆర్ఎస్ తరుపున గాని నిర్వహించే సర్వేల్లో తమకు మంచి మార్కులు పడేలా చూసుకోవాలని యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యే టిక్కెట్టుతో పాటు గెలుపు కూడా లక్ష్యంగా ప్రజల్లో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీలో టిక్కెట్టు ఆశిస్తున్న నాయకులకు సైతం చెక్పెట్టే ధోరణితో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజకీయ పావులు కదుపుతున్నారు. కొర్టా–చనాఖ బ్యారేజీతో ‘జోగు’ జోష్ దశాబ్ధాల కాలం నుంచి ఎన్నికల ప్రచార అస్త్రంగా మారిన పెన్గంగ కింద కొర్టా–చనాఖ బ్యారేజీ నిర్మాణంలో చొరవ చూపి మంత్రి జోగు రామన్న నియోజకవర్గ ప్రజల దృష్టిని ఆకర్షించారు. 50వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును మంజూరు చేయించి పనులు ప్రారంభించడంలో మంత్రి కృషి గురించి కార్యకర్తలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి అంతర్గత రోడ్లు, మిషన్ భగీరథ పనులు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతూ సర్వేల్లో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ‘డబుల్’ ఇళ్ల నిర్మాణంలో మోడల్ ఐకే రెడ్డి గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నియోజకవర్గం నిర్మల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకం కింద చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. వీటిని మోడల్గా చూపిస్తూ మిగతా లబ్ధిదారులకు సైతం ఇళ్లు నిర్మించి ఇస్తానని చెపుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన రెండో విడత సర్వేలో ఆయన జిల్లాలో రెండోస్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనే కీలకంగా ఉన్నారు. భారీ ప్రాజెక్టులు, ప్రజలతో సాన్నిహిత్యం కోనప్పకు ప్లస్ సీఎం సర్వేల్లో మొదటి స్థానంలో ఉన్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రజలతో సాన్నిహిత్యం ద్వారా తనకు ఎదురులేదనే రీతిలో కొనసాగుతున్నారు. ప్రాణహిత నదిపై రూ.65 కోట్లతో అంతర్రాష్ట్ర గూడెం బ్రిడ్జి, రూ.33 కోట్లతో పెంచికల్పేట బ్రిడ్జిల నిర్మాణంలో ఆయన పాత్ర కీలకం. కుమురంభీం ప్రాజెక్టు 90 శాతం పూర్తి కావడంతో సిర్పూర్ తాలుకాలోని 24వేల ఎకరాలకు త్వరలోనే నీరందించే పనిలో ఉన్నారు. గ్రామీణంతోపాటు పట్టణంపై ‘నడిపెల్లి’ దృష్టి ముఖ్యమంత్రి నిర్వహించిన తొలి విడత సర్వేలో వెనుకంజలో ఉండి రెండో సర్వే నాటికి మెరుగనిపించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మంచిర్యాల పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని 250 పడకలకు అప్గ్రేడ్ చేయించేందుకు రూ.32.15 కోట్లు మంజూరు చేయించడం మంచి పరిణామం. అలాగే లక్సెట్టిపేటలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు రూ.22.50 కోట్లు మంజూరు చేయించారు. మంచిర్యాల ఔటర్రింగ్ రోడ్డు ప్రాజెక్టు, కాలేజ్రోడ్డు నుంచి రూ.125 కోట్లతో అంతర్గాం బ్రిడ్జి మంజూరు కూడా ఎమ్మెల్యే ఖాతాలోకే రానుంది. గూడెం లిఫ్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం కల్పించిన ఆయన ఇప్పుడు గూడెం, కర్ణమామిడి, గుడిరేవు, గుల్లకోటలలో చిన్న తరహా ఎత్తిపోతల ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించే పనిలో ఉన్నారు. ఆర్కేపీ ఓవర్బ్రిడ్జి కల నెరవేర్చనున్న ఓదెలు చెన్నూర్ నియోజకవర్గంలో రామకృష్ణాపూర్ రైల్వేగేట్ వద్ద బ్రిడ్జి నిర్మాణం స్థానికుల దశాబ్ధాల కల. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కృషితో రైల్వే శాఖ ముందుకు వచ్చింది. బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కోసం ఆర్థిక శాఖ నుంచి ఇటీవలే రూ.27.50 కోట్లు మంజూరు చేయించడంలో సఫలమయ్యారు. మందమర్రి సింగరేణి ప్రాంతంలో నెలకొన్న స్థానికుల నివాసాలకు సంబంధించి ఉన్న వివాదాలను సింగరేణి సంస్థతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల పాదయాత్రలు చేపట్టి గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ∙ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నీల్వాయి వాగు మీద వంతెన, నెన్నెల నుంచి జంగంపేట వరకు రోడ్డు నిర్మాణాల కోసం భారీ ఎత్తున నిధులు మంజూరు చేయించారు. ∙ బోథ్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ∙ ముథోల్లో లోకేశ్వరం మండలంలో టిప్రి ఎత్తిపోతల పథకానికి రూ.80 కోట్లు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి కృషి చేశారు. ∙ ఖానాపూర్, ఆసిఫాబాద్లలోని గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎమ్మెల్యేలు రేఖానాయక్, కోవ లక్ష్మి తమవంతు కృషి ముమ్మరం చేశారు. -
ఏంటిది.. ఎమ్మెల్యే సారూ..?
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అసెంబ్లీ సభ్యుల్లో కొందరు తమ నియోజకవర్గం అభివృద్ధి నిధులను ఖర్చు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్నాయి. అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. కోట్లు కుమ్మరించినా.. వాటిని వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారు. 2014–15నుం చి 2017–18 ఫిబ్రవరి వరకు దాదాపు నాలుగు సంవత్సరాల పూర్తి కావస్తున్నా నియోజకవర్గ అభివద్ధి కింద ఐదుగురు ఎమ్మెల్యేలకు మొత్తంగా రూ. 41.25 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో ఎమ్మెల్యేకు ఒక్కొక్కరికి 2014–16 వరకు రెండు సంవత్సరాలు రూ.1.5 కోట్లు చోప్పున సీడీ పీ నిధులు రాగా, 2016–17 నుంచి రూ.3 కోట్లకు పెంచారు. అయితే.. పలువురు ప్ర జాప్రతినిధులు మాత్రం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో నిధులను నియోజక వర్గం ప్రజల అభివద్ధి కోసం ఖర్చు చేయకపోవటంతో బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్నాయి. అభివద్ధి ఖర్చు ఇదే నియోజకవర్గ అభివృద్ధి నిధుల(సీడీపీ)లో భాగం గా ప్రతి ఎమ్మెల్యేకి రాష్ట్ర ప్రభుత్వం 2014–16 ఆర్థిక(రెండు) సంవత్సరాల్లో రూ. 3 కోట్లు విడుదల చేయగా, 2016–17 ఆర్థిక సంవత్సరంలోరూ. 3 కోట్ల అందజేయగా, 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.2.25 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. స్థానిక అవసరాలు, వివిధ అభివృద్ధి పనులను గుర్తించి వీటిని ఖర్చు చేసే వెసులుబాటు ఎమ్మెల్యేలకు ఉంది. ఇందులో 50 శాతం నిధులకు సంబంధించిన పనులను ఎమ్మెల్యే నేరుగా ఆమోదించే అధికారం ఉంది. మిగతా 50 శాతం నిధులు మాత్రం జిలా ఇన్ఛార్జి మంత్రి ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తున్నప్పటికిని, విడుదలైన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయకుండా సర్కారు ఖజానాలో ఉంచారు. నిధుల ఖర్చు రూ.22.35 కోట్లే.. మూడున్నర సంవత్సరాల్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో రూ. 41.25 కోట్లు విడుదల కాగా.. ఇప్పటివరకు కేవలం రూ.22.35 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 515 పనులు పూర్తిచేశారు. వాస్తవానికి గుర్తించిన 630 పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ప్రారంభించిన 115 అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారు. జిల్లాలో అసెంబ్లీ నియోజవర్గాల అభివద్ధి నిధుల వినియోగంలో కుత్బల్లాపూర్, మేడ్చల్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముందువరుసలో ఉన్నారు. ఒక్కొక్క ప్రభుత్వం సీడీపీ నిధులు రూ.8.25 కోట్లు విడుదల చేయగా, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ తన నియోజకవర్గంలో 199 అభివృద్ధి పనులు చేపట్టి రూ. 5.95 కోట్లు నిధులు ఖర్చు చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలి చారు. ,కూకట్పల్లి ఎ మ్మెల్యే మాధవరం కృ ష్ణారావు నియోజకవర్గం లో 41 అభివృద్ధి పనులు చేపట్టి రూ. 4.58 కోట్లు లక్షలు ఖర్చు చేసి రెండో స్థానంలో నిలిచారు. మేడ్చల్ ఎమ్మెలే మలిరెడ్డి సుధీర్రెడ్డి నియోజకవర్గంలో 149 పను లకు రూ. 4.77కోట్లు నిధులు ఖర్చు పెట్టి మూడవ స్థానంలో నిలిచారు. ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ నియోజకవర్గంలో 73 పనులకు రూ.4.12 కోట్లు నిధులు ఖర్చు చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి నియోజకవర్గంలో 53 అభివృద్ధి పనులకు రూ.2.93 కోట్లు లక్షలు ఖర్చు చేసి జిల్లాలో చివరి స్థానంలో నిలిచారు. -
సొంతంగా సర్వేలు.. గెలుపు వ్యూహాలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా పార్టీ సర్వేలో వెనుకబడి ఉన్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. అసలెందుకిలా జరుగుతోంది? నిజంగానే జనాల్లో నాపై వ్యతిరేకత ఉందా? లేదా కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నానా? అన్న సందేహాలు వచ్చాయి. వీటిపై హైదరాబాద్కు చెందిన ఓ ఏజెన్సీతో సర్వే చేయించుకోవాలనుకున్నారు. అంతేకాదు.. అదే సంస్థతో తన అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. నెలరోజుల్లో కార్యాచరణ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వెంట ఇద్దరు ఏజెన్సీ ప్రతినిధులు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఆయన చేసే పనులను ఎప్పటికప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టు చేస్తూ ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో ఇటీవల పార్టీ ఆ జిల్లాలో చేసిన సర్వేలో సదరు ఎమ్మెల్యే టాప్–3 స్థానంలోకి వచ్చారు. ఇలా ఒక్క కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనే కాదు.. రాష్ట్రంలో మరో 35 మంది ఎమ్మెల్యేలు ఇదే దారిలో నడుస్తున్నారు. తమకంటూ సొంత ఎనాలిసిస్ బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యేలే కాదు వారిపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చవిచూసిన ఇతర పార్టీ అభ్యర్థులు సైతం పలు ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇంకేముంది.. పోటాపోటీగా కార్యక్రమాలు, ధర్నాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు! యువత ఓట్లను పొందడంతోపాటు నియోజకవర్గాల్లో జనాలను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పట్నుంచే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. 3 వేల మందితో మాట్లాడి.. ప్రతీ నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు మండలాలు, 120 నుంచి 150 గ్రామాలుంటాయి. ఎమ్మెల్యే నియమించుకుంటున్న ఏజెన్సీ ముందుగా.. నాయకుడి పనితీరు, పార్టీపై అభిప్రాయం, ప్రభుత్వ పథకాలు ఇలా పలు అంశాలపై సర్వే పత్రాలను రూపొందిస్తుంది. తర్వాత ఆ ఏజెన్సీకి చెందిన 10 మంది ఉద్యోగులు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో 20 నుంచి 25 మందిని కలిసి.. ఎమ్మెల్యే, పార్టీ పనితీరు, ప్రభుత్వ పథకాలు, వాటి అమలుపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇలా ఐదు మండలాల్లో సుమారు 3 వేల మందిని సర్వే చేస్తున్నారు. ఎమ్మెల్యేతోపాటు పార్టీ బలం, ప్రభుత్వ పథకాల లబ్ధితో గెలిచే అవకాశాలు, ప్రతికూల అంశాలపై విశ్లేషణ చేస్తున్నారు. తర్వాత ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేయాలో సూచిస్తూ కార్యచరణ ప్రణాళిక అందిస్తున్నారు. నెలకు రూ.4 లక్షలతో డీల్ 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఒకరు ఓ ఏజెన్సీతో సర్వే చేయించుకుంటున్నారు. గతంలో హైదరాబాద్లోని కీలక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. సర్వే సంస్థ ద్వారా తాను గతంలో ఓటమి పాలవడానికి కారణాలు.. పార్టీ, తనపై జనాభిప్రాయం తదితర అంశాలపై అధ్యయనం చేయించుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలు, వాటి ప్రచారం బాధ్యత మొత్తం ఏజెన్సీకి అప్పగించారు. ఇందుకు నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలతో ఏజెన్సీతో డీల్ కుదుర్చుకున్నట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. ఏజెన్సీలు ఏం చేస్తున్నాయంటే.. – తమ సేవలపై ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఎమ్మెల్యేలు, పోటీ చేయబోయే అభ్యర్థులతో ఏజెన్సీలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి – ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లో అభ్యర్థుల పేరిట ఖాతాలు తెరవడం – ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా వెబ్సైట్ ఏర్పాటు, వాట్సాప్ ద్వారా ప్రమోషన్ – నాయకుడు చేసిన ప్రతీ కార్యక్రమాన్ని వీలైనంత ఎక్కువ మంది కార్యకర్తలు, ఓటర్లకు చేరవేయడం – ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి ఎలా ఉండాలి? ఇంకా ఏం చేయాలన్న దానిపై కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ – ప్రత్యేక ఆల్బమ్ రూపొందించడం, అభ్యర్థులపై పాటలు రూపొందించడం, వెబ్ లైవ్చాట్, డైలీ యాక్టివిటీస్ అప్డేట్, ప్రొగ్రామ్ షెడ్యుల్ డిజైన్ చేయడం – బల్క్ సందేశాలు పంపించడం, చేసిన కార్యక్రమాల వీడియోల లింకులను వీటి ద్వారా పంపించడం – ఆఫ్లైన్ మార్కెటింగ్లో భాగంగా కరపత్రాలు డిజైన్ చేయడం, వాటిని పంపిణీ చేయించడం, నెలవారీ సర్వేల తయారీ, అభ్యర్థి గెలుపుకు తీసుకోవాల్సిన కార్యచరణను వ్యూహాత్మకంగా అమలు చేయడం – మహిళా, పురుష ఓటర్లను గుర్తించడం, వారి మొబైల్ నంబర్లు సేకరించి డాటా నిర్వహించడం – అభ్యర్థిపై సానుకూల దృక్పథం జనంలోకి వెళ్లేలా కార్యక్రమాలు రూపొందించడం, ఆకట్టుకునేలా ప్రసంగాలు తయారు చేయడం ఖర్చు భారీగానే.. తమ గెలుపు కోసం అభ్యర్థులు ఏజెన్సీలకు భారీగానే ముట్టజెప్పుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు ప్రధాన ఏజెన్సీలు 35 మంది ఎమ్మెల్యేలు, మరో 30 మంది పోటీ అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకు అవి ప్రతీ నెల రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు వసూలు చేస్తున్నాయి. ప్రతీ ఏజెన్సీ సర్వే సమయంలో 15 మందిని కేటాయిస్తోంది. అలాగే సోషల్ మీడియా అప్డేట్ కోసం మరో నలుగురిని నియమిస్తోంది. ప్రతిరోజూ ఎమ్మెల్యే వెంట మరో ఇద్దరు ఉంటున్నట్టు తెలిసింది. టెక్నాలజీ యుగంలో కీలకం: ప్రస్తుతం టెక్నాలజీ వినియోగం పెరిగిపోవడంతో తక్కువ సమయంలో ఎక్కువ మందికి కార్యక్రమాలు తెలిసేలా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అందుకు దేశవ్యాప్తంగా అనేక సర్వే సంస్థలు, ఏజెన్సీలు అభ్యర్థుల కోసం పని చేస్తున్నాయి. ప్రస్తుతం మేం 10 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఇతర పార్టీ అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మా కార్యచరణ నచ్చితేనే వారు ఒప్పందం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేమెంట్కు ఒప్పుకుంటున్నారు. మా టీంలో ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 10 మందిని నియమించాం. మరో నెలరోజుల్లో పూర్తిస్థాయిలో కార్యచరణ అమలు చేస్తాం. - డాక్టర్ జుబేర్, ఎండీ, మై మీడియా సొల్యూషన్స్ -
త్వరలో ప్రతి గ్రామంలో నేత్ర శిబిరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేత్ర శిబిరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయిం చారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలం దరికీ కళ్ల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయాల న్నారు. అనేక కారణాల వల్ల గ్రామీణ ప్రజ ల్లో కళ్లకు సంబంధించిన సమస్య తీవ్రంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శనివారం ప్రగతిభవన్లో మం త్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వ హించనున్న ఈ నేత్ర శిబిరాలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. -
ఆప్ ఎమ్మెల్యేల వేటుపై సవాలక్ష ప్రశ్నలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లోని ఎన్నికల కమిషన్ ఎవరి ఆదేశాలకు లోబడి పనిచేయని స్వతంత్య్ర సంస్థ. రాజ్యాంగానికి మాత్రమే కట్టుబడి పనిచేసే స్వయం ప్రతిపత్తిగల సంస్థ. పారదర్శకంగా పనిచేయాల్సిన ఈ సంస్థ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలను పరిశీలిస్తే పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో ఒక్కటి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతికి నివేదించడం. అలా నివేదించిందే తడువుగా ఎన్నికల కమిషన్ సిఫార్సులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. సాధారణంగా పాలకపక్షం అండదండలతో రాష్ట్రపతి ఎన్నికవుతారుగనుక పాలకపక్షానికి సానుకూలమైన నిర్ణయం ఆయన తీసుకుంటారని అందరూ భావించేదే. స్వతంత్య్రంగా వ్యవహరించే ఎన్నికల కమిషన్ అలా వ్యహరిస్తుందని ఎవరు అనుకోరు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్కున్న అధికారాలేమిటో టీఎన్ శేషన్ నిరూపించాక.. ఎవరూ అలా భావించడం లేదు. పార్టీలో అసమ్మతి అణచివేయడం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కొంత మంది పార్టీ ఎమ్మెల్యేలను మంత్రుల కార్యాలయాల్లో పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. అది తప్పేకావచ్చు! వారికి ఎలాంటి ద్రవ్యపరమైన ప్రయోజనాలను కల్పించలేనందున ఆ పదవులు ‘జోడు పదవుల’ పరిధిలోకి రావని కేజ్రివాల్ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు వాదిస్తూ వస్తున్నారు. ఆయన ఎందుకైన మంచిదని ‘పార్లమెంటరీ కార్యదర్శుల’ పదవులను అనర్హత చట్టం నుంచి మినహాయిస్తు బిల్లును తీసుకొస్తే ఆ బిల్లును ఆమోదించకుండా రాష్ట్రపతి కొట్టివేశారు. ఇలాంటి బిల్లులను తీసుకొచ్చే అవకాశం రాష్ట్రాలకు ఉంది. అలా కొట్టివేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఈ నేపథ్యంలో 20 మంది ఆప్ శాసనసభ్యులు తమ కొత్త బాధ్యతలు, అంటే పార్లమెంట్ కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహించలేదు. ఇదే కేసులో ‘బాధ్యతలు తీసుకోకముందే వారి పదవులు పోయాయి’ అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. వారికి పదవులే లేనప్పుడు వారికి ‘జోడు పదవుల్లో’ ఉన్నారన్న ఆరోపణ ఎలా వర్తిస్తుంది? నిర్ణయం తీసుకోవడానికి తమ వాదన కూడా వినాలంటూ బాధిత ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు పిటిషన్లు పెట్టుకున్నా ఎన్నికల కమిషన్ ఎందుకు ఖాతరు చేయలేదు ? వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఏ అంశంలోనైనా సరే న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్టు కనిపించాలన్నా సుప్రీం కోర్టు మౌలిక సూత్రాన్నే ఇక్కడ పట్టించుకోకపోతే ఎలా? బాధిత ఎమ్మెల్యేల వాదన వినకుండానే వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ ఎన్నికల కమిషన్ రాష్ట్రపతికి ఎందుకు సిపారసు చేసింది? పైగా ప్రధాన ఎన్నికల కమిషన్ జోతి రెండు రోజుల్లో పదవి విరమణ చేస్తున్న సమయంలోనే తొందరపడి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించిన నాడే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించక పోవడం పట్ల కూడా నాడు ఎన్నికల కమిషన్ వ్యవహారం పట్ల అనుమానాలు తలెత్తాయి. ఒకనాడు ప్రభుత్వాన్నే ధిక్కరించి స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకున్న రాజ్యాంగ సంస్థ ఇప్పుడు ఎందుకు ప్రభుత్వంవైపు మొగ్గుచూపుతోంది? రాజ్యాంగ సంస్థలన్నీ బలంగా ఉన్నప్పుడు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండగలదుగదా! -
కేజ్రీవాల్కు మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందానా ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి తయారైంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం గండం నుంచి బయటపడుదామనుకున్న ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 20మంది తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన సిఫారసును సవాల్ చేస్తూ ఆప్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈసీ సిఫారసుపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇప్పుడేం చేయాలోనని ఆప్ పార్టీ తలబద్దలు కొట్టుకొనే పరిస్థితి తయారైంది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింన విషయం తెలిసిందే. రాజ్యాంగానికి విరుద్ధంగా లాభదాయక పదవుల్ని చేపట్టారని ఈసీ తేల్చి చెబుతూ రాష్ట్రపతికి ఈ మేరకు నివేదికను పంపింది. దీంతో ఈసీ నిర్ణయంపై స్టే తెచ్చేందుకు ఆప్ కోర్టుకు వెళ్లగా ఆ ప్రయత్నం విఫలమైంది. పైగా కోర్టు ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఆప్ను ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ పిలిచినప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లలేదని, ఈసీ ప్రొసీడింగ్స్కు ఎందుకు హాజరుకాలేదని నిలదీసింది. -
కేజ్రీవాల్కు గట్టి దెబ్బ.. 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యాంగానికి విరుద్ధంగా లాభదాయక పదవుల్ని చేపట్టారని ఈసీ తేల్చి చెబుతూ రాష్ట్రపతికి నివేదికను పంపింది. అసలు విషయం.. నిబంధనల ప్రకారం కేజ్రీవాల్ సర్కార్లో ఏడుగురే మంత్రులుండాలి. కానీ, కేజ్రీవాల్ మాత్రం 2015లో 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించి..వారికి కారు, కార్యాలయం, ఇతర వసతులు కల్పించాడు. తద్వారా వారందరికీ కేబినెట్ హోదా ఇచ్చినట్లయింది. పరిపాలనా సౌలభ్యానికే వీరిని పార్లమెంట్ కార్యదర్శులుగా నియమించినట్లు అప్పట్లో కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. పైగా వీరికి ఎటువంటి అదనంగా చెల్లింపులు చేయబోమని చెప్పారు. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించలేదు. ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కావటంతో బిల్లుపై తేల్చాలని రాష్ట్రపతి ఎన్నికల సంఘానికి పంపారు. లాభదాయకమైన జోడు పదవులు అనుభవిస్తున్న కారణంగా ఈ 21 మందిని అనర్హులుగా ప్రకటించాలా వద్దా తేల్చాలని రాష్ట్రపతి ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా 21 మంది ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులిచ్చింది. దీనికి వారు వివరణ కూడా ఇచ్చారు. తరువాతి పరిణామాల నేపథ్యంలో జర్నైల్ సింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. ఇక మిగిలిన 20 మంది ఎమ్మెలపై వేటు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.వేటు పడిన వారిలో అల్కా లాంబ, ఆదర్శ్ శాస్త్రి తదితరులున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తీవ్రమైన రాజకీయ ప్రతికూలత ఏర్పడి కేజ్రీవాల్ సర్కార్ కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
గులాబీ జట్టులో బ్లాక్ లిస్ట్!
సాక్షి, హైదరాబాద్ గులాబీ గూటిలో ఎన్నికల ఫీవర్ అప్పుడే మొదలైందా? కూడికలు, తీసివేతల కసరత్తు జరుగుతోందా? నియోజకవర్గాల పెంపుపై పెట్టుకున్న ఆశలు గల్లంతవడం, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలతో ఆశావహుల జాబితా పెరిగిపోవడంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు టికెట్ల విషయంలో ఇప్పట్నుంచే ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నరలోపే సమయం ఉండటంతో ముందస్తు కసరత్తు మొదలుపెట్టారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశావహులు ఉండటంతో వడపోత కార్యక్రమం మొదలైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని వివిధ సందర్భాల్లో తనను కలుస్తున్న జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెబుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతమయ్యాయని, వివిధ వర్గాల ప్రజల్లోకి చొచ్చుకువెళ్లామని, కనీసం వంద సీట్లు గ్యారంటీ అని పేర్కొంటున్నారు. సిట్టింగ్లు అందరికీ వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నా.. తెర వెనుక మాత్రం నేతలపై కట్టుదిట్టంగా సర్వే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పనితీరు సరిగాలేని వారు, ప్రజల్లో ఆదరణ కోల్పోయిన వారు, నియోజకవర్గాల్లో వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యేల జాబితాతో ఓ బ్లాక్లిస్ట్ తయారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో కనీసం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సర్వేలు, వివిధ వర్గాల ద్వారా తెప్పించుకుంటున్న సమాచారం, నిఘా విభాగాలు అందిస్తున్న నివేదికలతో ప్రజలకు దగ్గరగా ఎవరుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో వారి విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశాలపై అధినేత దృష్టి సారించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ తొలినాళ్ల నుంచి పనిచేస్తున్న నేతలు సహా వెయ్యి మంది దాకా ఆశావహులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి అనుకూలమే కానీ.. సార్వత్రిక ఎన్నికల ముందస్తు కసరత్తులో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా సర్వే జరుగుతున్నట్టు తెలిసింది. అత్యధికంగా నమూనాలు సేకరించడం ద్వారా కచ్చితమైన ఫలితాన్ని రాబట్టొచ్చన్న ఉద్దేశంతో ఈ సర్వే చేస్తున్నారని సమాచారం. ఒక్కో నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో 3 శాతం శాంపిల్స్ తీసుకుని సర్వే చేయిస్తున్నారని, మరో పది రోజుల్లోగా ఈ సర్వే పూర్తవుతుందని అంటున్నారు. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల అనుకూల ఫలితాలు వస్తున్నా.. ఎమ్మెల్యేల విషయానికి వచ్చే సరికి తేడా ఉందని చెబుతున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ సారి ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటున్నారని, మండలాల వారీగా కనిష్టంగా మూడు వేల మందిని నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారని అంటున్నారు. ఒక్కో చోటు నుంచి ఐదుగురు! 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 సీట్లు గెల్చుకుంది. తర్వాత వివిధ పార్టీల నుంచి 25 మంది గులాబీ కండువాలు కప్పుకున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 88కి చేరింది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ఆశతో ఎక్కువ మంది టీఆర్ఎస్ వైపు చూశారు. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేరారు. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే ఉన్న స్థానాల్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో స్థానం నుంచి సగటున నలుగురు, ఐదుగురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో గెలుపు గుర్రాల కోసం వడపోత చేపట్టినట్టు తెలుస్తోంది. బ్లాక్ లిస్టులో ఎవరో..? వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలతోపాటు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని కొన్ని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బ్లాక్లిస్టులో ఉన్నారని అంటున్నారు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో కొన్ని జనరల్ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలూ కూడా ఇందులో ఉన్నారని సమాచారం. సర్వేల ద్వారా సేకరిస్తున్న ఈ సమాచారంతోనే వివిధ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని, ఇప్పటికే ఈ అంశాల ఆధారంగానే చేరికలు జరిగాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సిట్టింగులు అందరికీ టికెట్లు దక్కుతాయని అధిష్టానం పదేపదే ప్రకటిస్తున్నా.. పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో సహజంగానే తమ పరిస్థితిపై ఒకింత స్పష్టత ఉన్న ఎమ్మెల్యేలు పనితీరును మెరుగు పరుచుకోవడం ద్వారా అధినేత కేసీఆర్ మనసు చూరగొనేందుకు నియోజకవర్గాలకే పరిమితమై వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంటున్నారు. -
ప్రజాప్రతినిధులపై సీబీఐ, ఏసీబీ దాడులు జరగాలి
తిరుపతి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో పనిచేస్తున్న అవినీతి నిరోధక సంస్థలైన సీబీఐ, ఏసీబీలు కేవలం ప్రభుత్వ అధికారులపైనే కాకుండా కుంభకోణాలకు పాల్పడే ప్రజాప్రతినిధులపై కూడా దాడులు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. తిరుపతిలో బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగుల జేఏసీ చేపట్టిన సమ్మెలో సంఘీభావంగా బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగులను పట్టుకోవడం మంచిదే అయినప్పటికీ ప్రజాప్రతినిధులుగా ఉంటూ కోట్లాది రూపాయల స్కాంలకు పాల్పడే ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. దీన్నిబట్టి ప్రజాస్వామ్యం ఎక్కడుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుంటూ దశాబ్దాలతరబడి ప్రజల కోసం పనిచేసిన ఉద్యోగులకు ఏవైనా భత్యాలు, సౌకర్యాలు కల్పించాలంటే ఆర్థిక అంశాలతో ముడిపెట్టి ఆలోచించే ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు పెంచేందుకు మాత్రం క్షణం కూడా వెనుకాడవని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూలై నుంచే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేక పవనాలు ఆరంభమయ్యాయని, దానిప్రభావం రానున్న గుజరాత్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఆవేదన ఏంటో వెల్లడించనున్నారని జోస్యం చెప్పారు. ఇంగ్లాండ్లో 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొన్నటి జూన్ ఎన్నికల్లో ఉద్యోగులు, ఓటర్లు సరైన తీర్పునిచ్చి ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నారన్నారు. -
జార్ఖండ్ ఎమ్మెల్యేల వింత కోరిక
రాంచీ: ప్రజాసమస్యలపై చర్చించే అసెంబ్లీలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటున్నారు.. జార్ఖండ్ ఎమ్మెల్యేలు. బయట మద్యం కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, క్యూలలో జనాలు భారీగా ఉండటంతో ఇబ్బందిగా ఉంటోందని, అసెంబ్లీ ప్రాంగణంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. చలి కాలం కావడంతో మద్యం ప్రియులు ఎక్కువయ్యారని, దీంతో ఎమ్మెల్యేల సాయంత్రం పెగ్ అలవాటుకు సమస్యగా మారుతోందని ఓ ఎమ్మేల్యే వాపోయాడు. ఇక జార్ఖండ్ ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్స్ను రద్దు చేసి స్వయంగా లిక్కర్ షాపులను నిర్వహిస్తోంది. ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో ఎప్పుడు చూసిన రద్దీగా ఉంటున్నాయి. దుకాణాల ముందు గొడవలు జరుగుతున్నాయి. దుకాణాలు కేవలం సీటీ శివారులో ఉండటం.. రాత్రి 10 గంటల వరకే అందుబాటులో ఉండటంతో మందుబాబులకు ప్రధాన సమస్యగా మారింది. ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనేత్తాలనుకుంటున్నారు. ఈ విషయంలో స్పీకర్ దినేష్ సాయంతో ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ను ఒప్పిస్తామని ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్ఎమ్) నేత హేమంత్ సోరేన్ కూడా మద్దతు తెలుపుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని తమ ఎమ్మెల్యేలకు సూచించారు. -
‘వాళ్లకూ.. విద్యార్హత ఉండాలి’
సాక్షి, చండీగఢ్ : ప్రజాప్రతినిధులకు కనీస విద్యార్హత ఉండాలని కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అక అడుగు ముందుకేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతను నిర్ణయించాలంటూ.. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. పంచాయితీ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసే వారికి విద్యార్హతను నిర్ణియించాలని కోరుతూ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. పంచాయితీరాజ్ ప్రతినిధులకు కనీస విద్యార్హత లేకపోవడం వల్ల అభివృద్ధి, ఇతర కార్యక్రమాల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన లేఖలే తెలిపారు. -
‘మంత్రులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు..’
సాక్షి, హైదరాబాద్: తాము ప్రతిపాదించిన అంశాలన్నింటిపై చర్చ జరిగేదాకా సభను నిర్వహించాల్సిందేనని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ కార్యదర్శి టి. రామ్మోహన్రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. అసెంబ్లీ లాబీలో గురువారం వారు మాట్లాడుతూ.. చర్చించడానికి 18 అంశాలను మొదట జరిగిన బీఏసీ సమావేశంలోనే ప్రతిపాదించామని భట్టి, రామ్మోహన్ రెడ్డిలు చెప్పారు. ఇప్పటిదాకా 5 అంశాలపై మాత్రమే చర్చ.. ఇప్పటి వరకూ కేవలం ఐదు అంశాలపై మాత్రమే చర్చ జరిగిందని, ఇంకా 13 అంశాలు పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు. సభ ఎన్ని రోజులు జరుపుతారని కాంగ్రెస్ పార్టీని అడగలేదని, ప్రజల సమస్యలకు సంబంధించిన అంశాలన్నీ చర్చించాలని అడుగుతున్నామని భట్టి వెల్లడించారు. సభను ముగించాలని కాంగ్రెస్పార్టీ కోరిందని టీఆర్ఎస్ మంత్రులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. సభను నిరవధికంగా వాయిదా వేయాలని ఎప్పుడూ అనలేదని చెప్పారు. సభ్యుల సంఖ్య ఎక్కువ, అధికారం ఉందనో.. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందనో, అధికారం ఉందనో అసెంబ్లీ చర్చ సందర్భంగా టీఆర్ఎస్ తప్పించుకునే విధంగా వ్యవహరిస్తుందని భట్టి ఆరోపించారు. తాము ప్రతిపాదించిన అంశాలన్నీ చర్చకు రావాలని బీఏసీ సమావేశంలో కోరుతామని భట్టి వెల్లడించారు. సభను ముగించాలని కాంగ్రెస్ పార్టీ కోరినట్టుగా తప్పుడు ప్రచారం మంచిదికాదని, ఇంకా 13 అంశాలపై చర్చించేదాకా సభను నిర్వహించాలని రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. చర్చకు రావాల్సిన అంశాలు.. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల్లో అవకతవకలు, శాంతిభద్రతలు, మహిళలపై వేధింపులు, నయీం కేసు, మియాపూర్ భూములుచ డ్రగ్స్, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, స్వయం సహాయక సంఘాలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ, వైద్యం, జీఎస్టీ ప్రభావం, బీసీ సబ్ప్లాన్ వంటి అంశాలెన్నో చర్చకు రావాల్సి ఉందని వారు అన్నారు. వీటిపై చర్చించే వరకు సభను నిర్వహించాలని రామ్మోహన్ రెడ్డి కోరారు. బీఏసీ సమావేశం శుక్రవారం ఉంటుందని, అధికారకంగా చెప్పారని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. సభను 50 రోజులు నడుపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. -
62 శాతం మంది ఎమ్మెల్యేలపై నేరారోపణలు
సాక్షి, తిరువనంతపురం : దేశంలోని అన్ని శాసనసభల్లోనూ, పార్లమెంట్ సభల్లోనూ నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు సభ్యులుగా ఉన్నారు. దేశంలోని ఇతర శాసనసభలతో పోలిస్తే.. కేరళ ఎమ్మెల్యేలలో నేరారోపణలు ఎదుర్కొంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కేరళలోని మొత్తం 140 మంది ఎమ్మెల్యేలో 87 మంది వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కేరళ శాసనసభకు జరిగిన 2016 ఎన్నికల్లో ఆయా సభ్యులు దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగానే వీరిని గుర్తించారు. వారి జాబితా రూపొందించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాట్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. ఈ 87 మందిలో 27పై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. మరికొందరిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యారోపణలు ఉన్నాయి. ఇందులోనూ కొందరు బెయిల్పై బయట ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాట్ రిఫార్మ్స్ సంస్థ పేర్కొంది. దేశంలోని ప్రజాప్రతినిధుల కేసులపై విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలంటూ కేంద్రాన్ని సుప్రీం ఆదేశించడంతో.. ప్రస్తుతం నేరారోపణలు ఎదుర్కొంటున్న సభ్యులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తనున్నాయి. -
కన్నడ ఎమ్మెల్యేలకు బంగారు బిస్కెట్లు లేనట్లే!
బెంగళూరు: కర్ణాటక విధాన సౌధ భవన వజ్రోత్సవాల (60 ఏళ్లు) సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల ఖర్చును భారీగా తగ్గించుకోవాలని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. రెండ్రోజుల పాటు ఘనంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని ముందుగా భావించారు. ఈ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బంగారు బిస్కెట్లు, ఉద్యోగులకు వెండి ప్లేట్లు ఇవ్వాలని, ఇతర కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు కలిపి రూ. 26 కోట్లు ఖర్చుచేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో వెనక్కు తగ్గిన సీఎం సిద్దరామయ్య.. ఎమ్మెల్యేలకు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదని, రెండ్రోజుల వేడుకలను ఒక్కరోజుకే కుదించి రూ.10కోట్లతోనే ఖర్చులను సరిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 25న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కర్ణాటక ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 1951లో ఈ భవనానికి అప్పటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేయగా 1956లో నిర్మాణం పూర్తయింది. ఇందుకు అయిన మొత్తం ఖర్చు రూ.1.84 కోట్లు. -
డబుల్ జీతం.. ట్రబుల్
ఎమ్మెల్యేలు వివిధ బోర్డుల అధ్యక్షులు. కేబినెట్ మంత్రుల హోదా. అందుకు తగ్గట్టుగా జీత, భత్యాలతో పాటు అన్ని వసతులనూ పొందుతూనే, మరోవైపు ఎమ్మెల్యేలుగా కూడా జీత, భత్యాలను తీసుకుంటున్నారు. ఇలా రెండు చేతులా జీత, భత్యాలను కైంకర్యం చేస్తూ ఖజానాకు కోట్ల రూపాయల నష్టాన్ని కలగజేస్తున్నారు. ఇలా 21 మంది ఎమ్మెల్యేల బాగోతాన్ని విధానసౌధ సచివాలయ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. వారి నుంచి ఆ మొత్తాల్ని రాబట్టే ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్తో సంప్రదించి, ఈ నెల 22న ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. సాక్షి, బెంగళూరు: బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష స్థానంలో ఉన్న వారికి కేబినెట్ హోదాతో పాటు మంత్రులకు ఇచ్చినట్లుగానే ఇంటి అద్దె, ఇంధన భత్యం, వాహన సౌకర్యం, వైద్య పరీక్షల భత్యంతో పాటు ఇంటికి ఫర్నీచర్ను కూడా అందజేస్తారు. కాగా, నిగమ మండలి హోదాలో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి తమకు ఎమ్మెల్యేగా అందే జీత, భత్యాలను తీసుకునేందుకు వీలులేదు. ‘కర్ణాటక విధానమండలి వేతనాలు, నివృత్తి వేతనం, భత్యాల చట్టం– 1956’ ప్రకారం ఇది చట్ట వ్యతిరేకం. అయితే ఈ నిబంధనలను తుంగలో తొక్కి బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా కూడా జీత, భత్యాలను అందుకుంటున్నారు. వీరందరూ అధికార కాంగ్రెస్వారే కావడం విశేషం. రికవరీకి చర్యలు చేపట్టాం ‘గతంలో చాలామంది ఇదే విధంగా ఒక్కరే రెండు, మూడు జీత, భత్యాలను అందుకునేవారు. అయితే ఇప్పుడు అలా చేసేందుకు సాధ్యం కాదు. ఇలా ఒక్కరే అటు నిగమ మండలి హోదాలో, ఇటు ఎమ్మెల్యే హోదాలో నిబంధనలకు వ్యతిరేకంగా జీత, భత్యాలను తీసుకునేవారిని గుర్తించి, వారి నుండి తీసుకున్న మొత్తాన్ని వసూలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం’ అని విధాసౌధ సచివాలయం ఉన్నత స్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. ఆ 21 మంది బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షులు ఎవరంటే... జి.హంపయ్య నాయక్ – తుంగభద్రా అచ్చుకట్టు అభివృద్ధి మండలి మాలికయ్య గుత్తేదార్ – కర్ణాటక గృహ మండలి ఆర్.వి.దేవరాజ్ – కర్ణాటక స్లమ్ అభివృద్ధి మండలి కె.వెంకటేష్ – బీడీఏ రాజశేఖర్ బి.పాటిల్ – భూసేనా నిగమ ఎం.టి.బి.నాగరాజ్ – బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల యోజనా ప్రాధికార ఫైరోజ్ సే– కర్ణాటక పర్యాటక అభివృద్ధి మండలి కె.గోపాల పూజారి – కేఎస్ఆర్టీసీ సి.పుట్టరంగశెట్టి – కర్ణాటక రోడ్ల అభివృద్ధి మండలి రహీం ఖాన్ – రాష్ట్ర గోడౌన్ల ఏర్పాటు మండలి కె.వసంత బంగేర – రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి మండలి బి.ఆర్.యావగల్ – బంగారు గనుల మండలి ఎం.కె.సోమశేఖర్ – కర్ణాటక పట్టు పరిశ్రమల మండలి జె.ఎస్.పాటిల్ – కర్ణాటక నవీకరించగల ఇంధన అభివృద్ధి మండలి శివానంద ఎస్.పాటిల్ – కర్ణాటక నగర నీటి సరఫరా, డ్రైనేజీల మండలి హంపనగౌడ బాదర్లీ – మైసూరు సేల్స్ ఇంటర్నేషనల్ హెచ్.ఆర్.ఆలగూర – కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ డి.సుధాకర్ – కియోనిక్స్ బాబూరావ్ చించనసూర్ – కర్ణాటక సరిహద్దు ప్రదేశాభివృద్ధి మండలి శారదా మోహన్ శెట్టి – కరవావళి ప్రాంత అభివృద్ధి మండలి ఎస్.వై.గోపాల కృష్ణ – డాక్టర్ డి.ఎం.నంజుండప్ప నివేదికల అమలు మండలి -
అంతా మొక్కుబడి తంతు
♦ స్టాండింగ్ కమిటీ సమావేశాల తీరిది ♦ హాజరుకాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు కొరిటెపాడు(గుంటూరు) : జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు గురువారం మొక్కుబడి తంతుగా మారాయి. ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్లో ఏ ఒక్కరూ హాజరు కాలేదు. ఓ ఎమ్మెల్యే మినహా మిగిలిన వారెవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడంతో కోరం కోసం పాట్లు పడ్డారు. జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన గురువారం జరిగింది. జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు అధ్యక్షతన మూడో స్థాయి సంఘ సమావేశానికి చివరి నిమిషంలో రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. తెనాలి జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మీ మాట్లాడుతూ అమృత హస్తం అభాసుపాలవుతోందన్నారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య మాట్లాడుతూ మంగళగిరి ప్రాంత గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారాయని, అంగన్వాడీ సెంటర్లలో ఐదారు మందికి మించి పిల్లలు లేరని చెప్పారు. పంటలకు నీళ్లివ్వరా ? దాచేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ఎం.ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ కెనాల్స్ ఆధునికీకరణ పనులు సరిగా లేవని, నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరొస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పొలాలకు నీరిచ్చే పరిస్థితి లేకపోవటం బాధాకరమన్నారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. మండలస్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లలో సమన్వయ లోపం ఉందని తెలిపారు. 2016–17 సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యంలో 30 శాతం కూడా గృహ నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఉపాధి హామీ పథకం నిధుల నుంచి పంచాయతీ భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని, యజమానులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. పల్నాడు ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యతోపాటు అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకు రాయితీ రుణాలు ముందుకు కదలడం లేదన్నారు. సాగు, తాగునీరు, వైరల్ ఫీవర్లు, విద్యాశాఖలో నెలకొన్న నిర్లిప్తత, పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య తూతూ మంత్రంగా చర్చ జరిగింది. ఒక వైపు జ్వరాలు... మరోవైపు నీటి ఎద్దడి... ప్రస్తుతం వైరల్ ఫీవర్లు జిల్లాను వణికించేస్తున్నాయి. సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని జెడ్పీ చైర్పర్సన్ ఆదేశాలు జారీ చేసినా క్షేత్ర స్థాయి అధికారులు మాత్రమే రావడం గమనార్హం. సమావేశంలో జెడ్పీ సీఈవో బి.నాగార్జునసాగర్, వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్కు దినకరన్ ఎమ్మెల్యేల క్యాంప్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని పుదుచ్చేరి రిసార్టులో గడుపుతున్న దినకరన్ వర్గం 21 మంది ఎమ్మెల్యేలు తమ రాజకీయ మకాంను హైదరాబాద్కు మార్చనున్నట్లు తెలిసింది. సీఎంకు వ్యతిరేకంగా గత నెల 22వ తేదీన గవర్నర్కు లేఖలు అందజేసిన ఎమ్మెల్యేలు.. అప్పటి నుంచి పుదుచ్చేరిలోని ఒక రిసార్టులో ఉంటున్నారు. కొద్దిరోజుల కిందటే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తోడవడంతో దినకరన్ బలం 21కి పెరిగింది. సీఎం వర్గం నుంచి ప్రలోభాలకు గురికాకుండా తన వర్గ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వస్తున్న దినకరన్ ఈ మకాంను శని లేదా ఆదివారం హైదరాబాద్కు మార్చనున్నారు. అనర్హత వేటుపై షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వడంలో భాగంగా ఈనెల 5వ తేదీన 19 మంది ఎమ్మెల్యేలమంతా స్పీకర్ను విడివిడిగా కలుస్తామని దినకరన్ వర్గ ఎమ్మెల్యే తంగతమిళ్సెల్వన్ తెలిపారు. -
పూందమల్లిలో ఉద్రిక్తత
► ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నం ► ఘర్షణకు దిగిన మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేల వర్గీయులు ► నాలుగు కార్లు ధ్వంసం ► భారీగా పోలీసుల మోహరింపు తిరువళ్లూరు: దినకరన్ గ్రూపులో కొనసాగుతున్న పూందమల్లి ఎమ్మెల్యే తన్నీర్కుళం ఏలుమలై తన నిర్ణయాన్ని మార్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే మణిమారన్, ఆయన మద్దతుదారులతో ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహించిన ఏలుమలై వర్గీయులు వారిపై దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. తిరువళ్లూరు జిల్లా, పూందమల్లి అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏలుమలై ప్రస్తుతం దినకరన్ క్యాంపులో ఉంటున్నారు. ఈయనకు జిల్లా కన్వీనర్ పదవి కేటాయిస్తూ దినకరన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏలుమలై తన నిర్ణయం మార్చుకుని ఎడపాడి పళణిస్వామికి మద్దతు ఇవ్వాలని కోరుతూ మణిమారన్ నేతృత్వంలో దాదాపు 50మంది కార్యకర్తలు తన్నీర్కులంలో ఆయన ఇంటిని ముట్టడికి యత్నించారు. దీంతో ఏలుమలై, మణిమారన్ వర్గీయుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపుచేశారు. ఘర్షణలో మణిమారన్ వర్గానికి చెందిన నాలుగు కార్లును ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. కాగా ఘర్షణ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఏలుమలైకు మద్దతుగా స్థానికులు రాస్తారోకోకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం మహిళలను రాస్తారోకోకు ఉసికొల్పిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. నియోజకవర్గంలో తిరగనివ్వం: కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా దినకరన్ ఇచ్చే తాయిలాలకు ఆశపడిన ఏలుమలైను నియోజకవర్గంలో తిరగనివ్వబోమని మణిమారన్ అన్నారు. పార్టీతో సంబంధం లేని దినకరన్ వెంట ఏలుమలై ఎలా వెళతారని ప్రశ్నించారు. -
ఆ ఏడుగురు బీజేపీలోకి..!
సాక్షి, అహ్మదాబాద్: కాంగ్రెస్ బహిష్కరించిన ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు మార్గం సుగమమైంది. పార్టీ నుంచి బహిష్కతులైన వారు.. తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏడుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9వ తేదీన బహిష్కరించిన విషయం తెలిసిందే. వారంతా గురువారం రాత్రి రాజీనామా పత్రాలను సమర్పించినట్లు అసెంబ్లీ స్పీకర్ రమణ్ లాల్ ఓరా వెల్లడించారు. అంతేకాక వీరితో పాటు గతంలో కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆరుగురిలో ముగ్గురు త్వరలోనే బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు తమ బ్యాలెట్ పేపర్లను బీజేపీ చీఫ్ అమిత్ షా కు చూపిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ఏకంగా 14మంది పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్సన్ చేసింది. వీరిలో ఇటీవల కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరిన శంకర్ సింగ్ వాఘెలా కూటమికి చెందిన మహేంద్ర వాఘెలా, రాఘవ్జీ పటేల్, అమిత్ చౌదరీ, బోలాబాయ్ గోహిల్, సీకే రౌల్జీ, కామ్సీ మక్వానా, హకుబా జడేజా ఉన్నారు. కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య ప్రతిష్టాత్మకంగా, ప్రత్యక్ష యుద్దంగా జరిగింది. ఈ ఎన్నికల్లో అమిత్షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు సునాయాసంగా గెలుపొందారు. సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ 44 ఓట్లు సాధించి ఐదోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
అహ్మద్పటేల్కు కష్టాలు
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ తరఫున గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న అహ్మద్ పటేల్కు కష్టలొచ్చిపడ్డాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తుండటం ఆయన్ను కలవరపెడుతోంది. గురువారం ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా.. శుక్రవారం మరో ఇద్దరు ఎమ్మెల్యే తమ రాజీనామా పత్రాలను స్పీకర్కు అందజేశారు. దీంతో పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బలం క్షీణిస్తుండటంతో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో అహ్మద్పటేల్ విజయంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరో వైపు గుజరాత్ నుంచి రాజ్యసభ సీటుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు స్మృతి ఇరానీ కూడా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
పరారీలో పగటి వేషగాళ్లు..
♦ ఎమ్మెల్యే కుటుంబం ఫిర్యాదుతో ♦ జ్యోతిష్యం కార్యాలయాల మూత పరకాల: మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతల పట్ల ఉన్న నమ్మకాన్ని ఆసరా చేసుకున్న కొందరు పగటి వేషగాళ్ల ఉచ్చులో అమాయక ప్రజలు చిక్కుకుంటున్నారు. ఫలితంగా వారికి వేలాది రూపాయలు సమర్పించుకుంటున్నారు. అయితే బాధిత కుటుంబాల్లో సాక్షాత్తు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబం ఒకటి కావడం సంచలనంగా మారింది. వాస్తవానికి కొయదొరల పేరిట రాష్ట్రంలోని అనేక జిల్లాలో మోసాలు జరుగుతున్న బయటకు రావడం లేదు. నాలుగైదు సంవత్సరాలుగా వీరి మోసాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తాము చేసిన తప్పుకు పశ్చాతాపం పడుతూ ఇలాంటి పరిస్థితి మరొకరికి రావొద్దని ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పగటి వేషాగాళ్లు పరారీలో ఉన్నారు. పరకాలలో జ్యోతిష్య కార్యాలయాలు కొయదొరల ముసుగులో పరకాల పట్టణంలో కొందరూ ఏకంగా కార్యాలయాలు తెరిచారు. కార్యాలయాల వద్ద ఆకర్షించే విధంగా ప్లెక్సీలు, సమాచారాన్ని ఏర్పాటు చేశారు. సమాచారంలో ఎలాంటి వ్యాధులైనా తమ వద్ద ఉన్న మూలికలతో నయం చేయడంతో పాటు ముఖం చూసి జ్యోతిష్యం చెప్పుతామని పేర్కొన్నారు. ఎదుటి వారి బలహీనతే ఆసరా.. కొయదొరల్లా కనిపించేల్లా వేషాలు వేసుకుని తెల్లవారుజామున 5గంటల సమయానికి కొందరు ద్విచక్రవాహనాలపై పట్టణంలోని ముందుగా అనుకున్న ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఎవరు ఏ గ్రామానికి ..ఎక్కడికి వెళ్లాలో ముందే నిర్ణయించుకున్న విధంగా బయలుదేరుతారు. వారి బుట్టలో ఏవరైనా పడితే సమీపంలోని తమ జ్యోతిష్యకార్యాలయాలకు చేరుకోవాలని సూచి స్తారు. జ్యోతిష్యం ఉచితంగా చూస్తామంటునే జ్యోతిష్యం చూసే సమయంలో ఎదుటి వారి బలహీనతను ఆసరాగా చేసుకుని భవిష్యత్లో మీ కుటుంబంలో ఏదో కీడు జరుగపోతుందని చెప్పుతారు. దానికి కావాల్సిన మంత్రం మా గురువుల దగ్గర ఉంటుంది. యంత్రాలకు పూజలు చేయాలంటే కొంత ఖర్చు అవుతుందని నమ్మబలుకుతారు. ఫలితంగా భయంతో అమాయకుల నుంచి ఎంతటి వారైనా వారి వలలో చిక్కుకోవాల్సిందే. ప్రచారం కోసం వేలల్లో ఖర్చు జ్యోతిష్యం పేరిట కొందరు కేబుల్ టీవీలో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. వీరి ప్రచారాన్ని చూసిన ప్రజలు మోసపోతున్నట్లు తెలుస్తోంది. జ్యోతిష్యం చూడటానికి డబ్బులు తీసుకునేది లేదంటునే నెలల కొద్ది టీవీల్లో ప్రచారం కోసం వేలాది రుపాయాల ఖర్చుచేస్తున్నారు. ఇంత డబ్బు వీరికి ఎక్కడి నుంచి వస్తుందంటే వీరి వలలో పడిన వారిదేనని తెలుస్తోంది. అయితే జ్యోతిష్యం పేరిట టీవీల్లో ప్రచారాలు వస్తున్న పోలీసు శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ఎవరీ లక్ష్మణ్ రాజ్.. కొయదొరల్లో మూలిక వైద్యంలో పేరున్న వ్యక్తి లక్ష్మణ్రాజ్. తనను ఆశ్రయించి వారి రోగ నివారణ కోసం అడవిలోని మూలికలు సేకరించి నాటు వైద్యం చేసేవాడని, అతడు మృతి చెందన అనంతరం కూడా కొందరు లక్ష్మణ్రాజ్ పేరును వినియోగించుకుంటున్నట్లు సమాచారం. నగరంలోని కరీమాబాద్కు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి లక్ష్మణ్ రాజ్ పేరునే వినియోగించుకుంటున్నారు. హస్తం నర్సింగరావు, పాస్తరం రాజులు సైతం లక్ష్మణ్ రాజ్ పేరు చెప్పుకోవడం గమనార్హం. మోసం చేసిన కేసులో ఇద్దరి అరెస్ట్ వరంగల్: పూజల పేరిట డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులు పస్తం నర్సింహరాజు, పస్తం రాజులను అరెస్టు చేసినట్లు సుబేదారి సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి కూతురు సంరెడ్డి మానసరెడ్డి వద్ద కోయదొరల పేరుతో పూజల కోసం దఫాలుగా రూ.57లక్షలు వసూలు చేశారని తెలిపారు. మళ్లీ డబ్బులు కావాలని ఈనెల14వ తేదీన మానసరెడ్డిని అడగడంతో ఆమె మామ సంరెడిŠడ్ బాల్రెడ్డికి అనుమానం వచ్చి వీరి గురించి విచారించడంతో అసలు విషయం బయట పడిందన్నారు. కోడలు మానసరెడ్డి వద్ద పూజల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు బాల్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఆరెస్టు చేసిన నర్సింహరాజు, రాజుల వద్ద నుంచి డబ్బులు పూర్తిగా స్వాధీనం చేసుకొని కోర్టు హాజరు పర్చగా న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు శ్రీనివాస్ తెలిపారు. -
33 శాతం ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిని మరో రెండు రోజుల్లో దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోబోతోంది. ఈ కాలేజీలో 33 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయంటే ఆశ్చర్యం వేస్తోంది. సోమవారం నాడు జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొననున్న 776 ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలకుగాను 774 ఎంపీలు, 4,078 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ తనిఖీ చేసి ఓ నివేదికను రూపొందించింది. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో 451 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో మహిళల సంఖ్య 9 శాతం మాత్రమే. దేశ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో మహిళలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇంత తక్కువగా ఉండడం మరింత ఆశ్చర్యం. మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో 71 శాతం కోటీశ్వరులున్నారని కూడా నివేదిక వెల్లడించింది. -
మనసు దోచే ‘ఆకృతి’
-
టీఆర్ఎస్లో కొత్త సమస్య!
మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పెరుగుతున్న గ్యాప్ నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యేల్లో ఆందోళన మంత్రులు తమను పట్టించుకోవడం లేదని ఆరోపణ హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో కొత్త సమస్య మొదలైంది. కొత్త నాయకులు, పాత నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పేరుకు ఎమ్మెల్యేలమే అయినా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు తమను అసలు పట్టించుకోవడం లేదనే ఫీలింగ్ చాలామంది ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయలని కేసీఆర్ అంటున్నా కొందరు మంత్రులు ఈ దిశగా సహకరించడం లేదని ఎమ్మెల్యేలంటున్నారు. జిల్లా పర్యటనల సందర్భంగా మంత్రులు, పార్టీ నాయకులు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కచ్చితంగా సమావేశం కావాలని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. కాని మంత్రులు మాత్రం షెడ్యూల్ బిజీగా ఉందని చెప్పి తప్పించుకుంటున్నారని చాలా మంది ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. పనులేమైనా ఉంటే సెక్రటేరియట్కు వచ్చి కలవమని చెప్తున్నారని అంటున్నారు. సచివాలయం వెళ్లినా అక్కడా తమకు మంత్రుల దర్శన భాగ్యం కలగడం లేదని, సమీక్షల్లో బిజీగా ఉన్నామని సమాధానం వస్తోందని మండిపడుతున్నారు. మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు - ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కాని కొందరు స్ధానిక పరిస్థితుల కారణంగా చాలామంది బయటపడటం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపంలో మరో ఆసక్తికర ట్విస్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఒరిజినల్ నాయకులకన్నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చి మంత్రులైన తలసాని, తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలే తమ సమస్యలను సావధానంగా వింటున్నారని చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంటున్నారు. తమతో పార్టీలో మొదటినుంచి పనిచేసిన కొందరు నేతలు ఇప్పుడు మంత్రులైన తరువాత పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. -
సంచలనాల మోత
►డిఫెండింగ్ చాంపియన్ ముగురుజాపై మ్లాడెనోవిచ్ అద్భుత విజయం ►వీనస్, రావ్నిచ్ ఇంటిముఖం పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆదివారం సంచలనాల మోత మోగింది. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)... ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)... పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా)... పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్ మిలోస్ రావ్నిచ్ (కెనడా) ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ అమ్మాయి, 13వ సీడ్ క్రిస్టినా మ్లాడెనోవిచ్ అద్వితీయ ఆటతీరును కనబరిచి 6–1, 3–6, 6–3తో ముగురుజాను మట్టి కరిపించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్లో మ్లాడెనోవిచ్ తన ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఇతర మ్యాచ్ల్లో మాజీ నంబర్వన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–1, 4–6, 6–2తో 2009 చాంపియన్ కుజ్నెత్సోవాను... 30వ సీడ్ తిమియా బాసిన్స్కీ (స్విట్జర్లాండ్) 5–7, 6–2, 6–1తో వీనస్ను ఓడించి క్వార్టర్ ఫైనల్ బెర్త్లను దక్కించుకున్నారు. మూడో రౌండ్ మ్యాచ్ల్లో రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–1తో వితోఫ్ట్ (జర్మనీ)పై, ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 7–5తో లినెట్టా (పోలాండ్)పై గెలిచారు. నాదల్ జోరు... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–1, 6–2, 6–2తో బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మరోవైపు 20వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) 4–6, 7–6 (7/2), 6–7 (6/8), 6–4, 8–6తో మిలోస్ రావ్నిచ్పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో నాదల్తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. మిక్స్డ్ క్వార్టర్స్లో సానియా జంట పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో బోపన్న (భారత్)–క్యువాస్ (ఉరుగ్వే) జంట 6–7 (5/7), 2–6తో జేమీ ముర్రే (బ్రిటన్)–సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతి లో... దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) ద్వయం 6–4, 6–7 (5/7), 2–6తో హారిసన్ (అమెరికా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సానియా మీర్జా (భారత్)–డోడిగ్ (క్రొయేషియా) జంట 6–2, 6–4తో స్వితోలినా (ఉక్రెయిన్)–సితాక్ (న్యూజిలాండ్) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
'గాంధీ'లో ఎమ్మెల్యే భార్యకు షాక్
- తీరు మారని గాంధీ సిబ్బంది వైఖరి హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి సిబ్బంది తీరు మరోసారి వివాదస్పదమైంది. సిబ్బంది నిర్లక్ష్యంపై ఎన్నిసార్లు విమర్శలు వచ్చినా వారు మారడం లేదు. తాజాగా చికిత్స నిమిత్తం గాంధీకి వచ్చిన ఎమ్మెల్యే భార్యను సైతం సిబ్బంది లంచం అడగటం కలకలం రేపుతోంది. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత మంగళవారం తమ సమీప బంధువు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కు వచ్చారు. అయితే ఆమెను అక్కడ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆమే స్వయంగా వీల్ఛైర్ తీసుకొచ్చి అతడిని కూర్చోబెట్టి ఆస్పత్రిలోపలికి తీసుకెళ్లారు. అంతేకాకుండా వీల్ ఛైర్ వార్డులోకి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే భార్యను సిబ్బంది లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. ఒక ఎమ్మెల్యే భార్య పరిస్థితే ఇలా ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా గాంధీ సూపరిండెంట్ కానీ , అధికారులు కానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పలువురు ఎమ్మెల్యేలతో ఆదివారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి అధ్యక్షుడు విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, మేయర్లు బొంతు రామ్మోహన్, నన్నపునేని నరేందర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులపై ఎమ్యెల్యేలతో చర్చించారు. నీటి పారుదల కాల్వల నిర్మాణం, మరమ్మతులు, మిషన్ భగీరథ పనులను ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ పనుల్లో ఎక్కడైన జాప్యం జరిగినా, ఇబ్బంది తలెత్తినా వెంటనే ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని పనులు వేగవంతం జరిగేలా చూడాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజి, పంపుహౌజ్ల నిర్మాణం పూర్తయ్యే లోపు నీటి పారుదల కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టులకు ఇప్పటికే కాల్వలున్నాయని, వాడకం లేక పూడుకుపోయిన ఫీడర్ ఛానళ్లు, పంట కాల్వలకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది చివరకల్లా రాష్ట్రంలోని ప్రతిగ్రామానికి తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. -
మహానాడు వేళ మనోవేదన
►ఉసూరుమనిపించిన బాబు విశాఖపట్నం : విశాఖలో మహానాడు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మనోవేదన మిగిల్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. దీంతో మూడేళ్లుగా నామినేటెడ్ పోస్టుల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కంగుతిన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్వార్థంతో తెలుగుదేశంలోకి జంప్ చేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనకూ అమాత్య పదవి ఖాయమని కలలుగన్నారు. ఈ ముగ్గురికీ మంత్రివర్గంలో ఆ పార్టీ అధినేత మొండిచేయి చూపించారు. బండారు కొన్నాళ్ల పాటు అలకపూని పార్టీ కార్యక్రమాలకు, ముఖ్యమంత్రి సభలకూ దూరంగా ఉన్నారు. నెలరోజుల తర్వాత అలక వీడి మళ్లీ జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వుడా చైర్మన్ పదవి గాని, లేదా కేబినెట్ హోదా ఉన్న ఏదైనా కార్పొరేషన్ పదవి తనకు వస్తుందని ఎంతో ఆశాభావంతో ఉన్నారు. ఇక ఎమ్మెల్యే అనిత కూడా మంత్రి పదవి రాకున్నా నామినేటెడ్ తప్పక వస్తుందని ధీమాగా ఉన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీ ఫిరాయింపు, గిరిజన కోటాలో మంత్రినవుతానని ఊర్రూతలూగారు. కానీ ఆయనకు కూడా బాబు చేయిచ్చారు. విశాఖ పశ్చిమ శాసనసభ్యుడు గణబాబు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి ఏదైనా మంచి కేబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్ పదవి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవుల ప్రసక్తే లేదని తెగేసి చెప్పడంతో ఆశావహులంతా తీవ్ర నైరాశ్యంలో పడ్డారు. మరో పది రోజుల్లో మహానాడు జరుగుతున్నందున వీరంతా ఆ కార్యక్రమానికి ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తారన్నది ప్రశ్నార్థకమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు మహానాడు కమిటీల్లో భాగస్వాములై ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. అధినేత నిర్ణయంపై నామినేటెడ్ పదవులు ఆశించిన ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. -
అసెంబ్లీలో ఎమ్యెల్యేల గాఢనిద్ర
ఓ వైపు దేశమంతటిన్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే జీఎస్టీ బిల్లుపై చర్చ.. మరోవైపు ప్రతిపక్షాల రసాభాస అయినా ఎమ్మెల్యేలకు నిద్రముంచుకొచ్చింది. వాళ్లేదో వారు చర్చించుకుంటారులే? మనకెందుకని ఏంచక్కా కొందరు ఎమ్మెల్యేలు కునుకు బాట పట్టారు. ఈ సీన్ ఎక్కడో తెలుసా? బీజేపీ నేతృత్వంలో ఇటీవల పదవిలోకి వచ్చిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తొలి అసెంబ్లీ సమావేశంలో. లక్నోలోని లోక్ భవన్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం జీఎస్టీ బిల్లుపై చర్చ జరిగింది. ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు ఎంచక్కా కూర్చున్న సీట్లలోనే గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలన్ని మొదటిసారి లైవ్ టెలికాస్ట్ చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారో చూసే అవకాశం ప్రజలకి ఇవ్వాలనే యోగి యోచన మేరకు తొలిసారి ఈ టెలికాస్ట్ ను చేపట్టారు. కానీ తీరా టీవీల ముందు కూర్చుని చూసిన జనాలకి ఈ స్లీపింగ్ సీన్లు దర్శనమిచ్చాయి. నిద్ర మత్తులో జోగుతున్న వారిలో ఆ రాష్ట్ర మంత్రి కూడా ఉన్నారంట. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారి పనితీరు హౌజ్ లో చూడవచ్చని ముఖ్యమంత్రి ఇంతకముందే చెప్పారు. తమ ప్రతినిధుల విషయంలో ముఖ్యమంత్రికి ఉన్న భరోసాకు భంగం వాటిలిస్తూ ఎమ్మెల్యేలు నిద్రపోవడం గమనార్హం. పార్లమెంట్ లో ఇప్పటికే జీఎస్టీ బిల్లులు ఆమోదం పొందాయి. వాటిని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించే ప్రక్రియలో ఉన్నాయి. ఈ బిల్లును ఆమోదించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటుచేస్తున్నాయి. జూలై 1 నుంచి ఈ బిల్లు అమల్లోకి రానుంది. -
సీఎం యోగి స్పీడ్.. పాలనలో కొత్త ఒరవడి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన, కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళ్తున్నారు. ఇక నుంచి ప్రతీవారం ఎమ్మెల్యేలతో పాటు యూపీకి చెందిన ఎంపీలతో సమావేశం కావాలని యోగి నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల సమస్యలను ఆయన తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారు. ప్రతీ శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సచివాలయంలో యోగి ఎంపీలతో సమావేశమవుతారని ఓ అధికారిక ప్రకటనలో తెలియజేశారు. అలాగే ప్రతి సోమ, గురువారాల్లో ఇదే సమయంలో ఎమ్మెల్యేలు ఆయనతో సమావేశం కావచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి సీఎంతో మాట్లాడవచ్చు. కాగా ప్రజాప్రతినిధులు సమావేశానికి ఇతరులను తీసుకురాకూడదని యోగి సూచించారు. -
రంగన్నకు ఆ ఎమ్మెల్యేలు షాక్
చెన్నై: పుదుచ్చేరి ప్రధాన ప్రతిపక్షంలో రాజకీయ అలజడి బయలుదేరింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సొంతగూటికి చేరడానికి సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా ఎమ్మెల్యే టీపీఆర్ సెల్వం కాంగ్రెస్కు మద్దతుగా గళం విప్పడం గమనార్హం. పుదుచ్చేరి కాంగ్రెస్లో ఒకప్పుడు తిరుగులేని నేత ఎన్ రంగస్వామి. ప్రజాబలం కలిగిన ఆయన్ను కాంగ్రెస్ కుటిల రాజకీయాలు వెంటాడాయి. సీఎం పదవి దూరం కావడంతో 2011లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఎన్ఆర్ కాంగ్రెస్ ఏర్పాటుతో అధికార పగ్గాలు సైతం చేపట్టారు. ఐదేళ్ల పాటుగా ఆయన నేతృత్వంలో పుదుచ్చేరి అభివృద్ధి అంతంత మాత్రమే. మంత్రుల అవినీతి భాగోతాలు 2016 ఎన్నికల్లో ముచ్చెమటలు పట్టించాయి. ఆ ఎన్నికల్లో అధికారం దూరం అయ్యింది. 30 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి ఏడుగురు మాత్రమే ఎంపిక అయ్యారు. ప్రస్తుతం ప్రధాన ప్రతి పక్ష నేతగా ఉన్న రంగస్వామికి ఆ ఎమ్మెల్యేలు పలువురు షాక్లు ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. సొంతగూటి వైపు చూపు : ప్రస్తుతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు మాతృగూటి వైపుగా చూస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎన్ఆర్కాంగ్రెస్లో ఉండటం కన్నా, నియోజకవర్గం అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిండం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇందుకు అద్దం పట్టే విధంగా మంగళవారం మంత్రి కందస్వామి నేతృత్వంలో లింగారెడ్డి పాళయంలో జరిగిన సభలో ఆ నియోజకవర్గం ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీపీఆర్ సెల్వం కాంగ్రెస్కు మద్దతుగా ప్రసంగాన్ని అందుకున్నారు. ఇది వరకు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒరిగింది శూన్యమేనని, ఇప్పుడు తమ పనులు చక..చకా సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తనతో పాటుగా పలువురు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నట్టు ఆయన స్పష్టం చేయడం ఎన్ఆర్ కాంగ్రెస్లో చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యేలు ఫిరాయింపులతో కాంగ్రెస్ గూటికి చేరుతారేమోనన్న ఆందోళన రంగస్వామిలో బయలు దేరింది. దీంతో ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు ప్రయత్నాల్ని వేగవంతం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్న తన ఎమ్మెల్యేలను పిలిచి బుజ్జగించేందుకు నిర్ణయించినట్టు ఎన్ఆర్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
దమ్ముంటే రాజీనామా చేయించండి
- సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేలు గౌరు, ఐజయ్య సవాలు - సేవ్ డెమోక్రసీ నిరసనలను విజయవంతం చేయాలని పిలుపు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : దమ్ము, ధైర్యం ఉంటే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తమ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై తమ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము ఎందాకైనా వెళ్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్కు అక్కడి ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తే నానాయాగి చేసిన సీఎం.. ఇప్పుడు ఏకంగా తమ పార్టీ నుంచి నలుగురికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. టీడీపీలో సమర్థులు లేకనే ఇచ్చారేమో చెప్పాలన్నారు. చంద్రబాబు తన కొడుకును దొడ్డిదారిన మంత్రిని చేసుకున్నాడని, దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిపి గెలిపించాలన్నారు. మంత్రివర్గ విస్తరణలో అన్యాయానికి గురైన మైనార్టీలు, గిరిజనులు టీడీపీపై తిరగబడాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య సూచించారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ మద్దయ్య, మహిళా జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్రెడ్డి, వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు. నేడు సేవ్ డెమోక్రసీ నిరసనలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం తీరుకు శుక్రవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన సేవ్ డెమోక్రసీ నిరసనలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఐజయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వాలన్నారు. పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతీ, యువకులు, నిరుద్యోగులు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
కట్టు కథలు చెప్పవద్దు..!
- ప్రజల దాహార్తి తీర్చండి - అధికారులపై ఎమ్మెగ్యే గుమ్మనూరు ఆగ్రహం ఆలూరు: ‘‘ కట్టు కథలు చెప్పకుండా పల్లె ప్రజలకు గుక్కెడు తాగునీటిని అందించండి’’ అంటూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. స్థానిక ఆర్అండ్బీ అథితిగృహం ఆవరణంలో గురువారం ఆలూరు సబ్ డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ డీఈ, జేఈలతో ఆయన సమావేశమైయ్యారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో తాగునీరు దొరకడం లేదని.. ప్రజలు మైళ్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ నాయకులు..తాగునీటి సమస్య తీర్చకుండా పత్రికల్లో ఫొటోల కోసం.. చలివేంద్రాలను ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. కర్నూలు ఎంపీ బుట్టారేణుక..ఆలూరు నియోజకవర్గంలో 200 పైగా బోర్లును తవ్వించారన్నారు. ఎస్ఎస్ ట్యాంకుల నిర్వహణ పేరుతో టీడీపీ నాయకులు డబ్బులు దండు కోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ మొహిద్దీన్, జేఈలు బాలచంద్రాచారి, విఘ్ణవర్ధన్ రెడ్డి, రాంనేలా తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించండి ఉపాధి కూలీలకు వెంటనే వేతనాలు చెల్లించాని అధికారులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సూచించారు. వేతనాలను చెల్లించక పోవడంతో కూలీలు పస్తులతో కాలం గడుపుతున్నారన్నారు. వేతనాలపై త్వరలో డ్వామా పీడీ పుల్లారెడ్డితో చర్చిస్తానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చెప్పారు. -
‘అలా చేయడం రాజ్యాంగాన్ని తూట్లు పొడవటమే’
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి గవర్నర్ నరసింహన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(వీహెచ్) విమర్శించారు. ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా అధికారంలో ఉన్నవారికి గవర్నర్ భజన చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని తూట్లు పొడవడమేనని అన్నారు. ఫిరాయింపుదారులతో ప్రమాణస్వీకారం చేయిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీకి మారడం వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే అసహ్యం వస్తుందని అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతుంటే ప్రధాని మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతర పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమించాలని టీపీసీసీని కోరారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్ను కలుస్తానని వీహెచ్ తెలిపారు. కాగా శనివారం కూడా వీహెచ్ రాజ్భవన్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.