
సాక్షి, కృష్ణా : విశాఖ జిల్లా యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మలు టీడీపీని వీడి శనివారం వైఎస్సార్సీపీలో చేరారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వారు కలిసి పార్టీలో చేరారు. వారికి వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయన వెంట జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ డీఎస్ఎన్ రాజు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రాజు, మండలి ప్రధాన కార్యదర్శి శంకర్ రావులతో పాటు వెయ్యి మంది వైఎస్సార్సీపీలో చేరారు. కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. అందుకోసం తాను సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు.