‘వేదిక’ చీఫ్‌గా కోదండరాం?  | Kodandaram is the Chief of Mahakutami Vedika? | Sakshi
Sakshi News home page

‘వేదిక’ చీఫ్‌గా కోదండరాం? 

Oct 9 2018 1:25 AM | Updated on Jul 29 2019 2:51 PM

Kodandaram is the Chief of Mahakutami Vedika? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్‌ల కూటమికి ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’అని పేరు పెట్టుకున్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ)లో భాగంగా ఈ వేదిక ఏర్పాటు చేయాలని కూటమి నిర్ణయం తీసుకుంది. ఈ కూటమికి చైర్మన్‌గా టీజేఎస్‌ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేరును భాగస్వామ్య పక్షాలన్నీ ఏకగ్రీవంగా ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా వేదిక పేరుతో రాష్ట్రమంతటా ప్రచారం చేయాలని కూటమి పార్టీలు కోదండరాంను కోరుతున్నాయి. కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలును పర్యవేక్షించేందు కు వేదిక పనిచేస్తుంది.

ఈ వేదిక చైర్మన్‌గా ఉండేందుకు కోదండరాం ఒప్పుకున్నారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. నాలుగైదు రోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన చేసేలా.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మిగిలిన భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఒకసారి ప్రకటన జరిగితే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కార్యక్రమాన్ని కోదండరాంకే అప్పగించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. టీడీపీకి 14, టీజేఎస్‌కు 5, సీపీఐకి 3 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ 20, సీపీఐ 8 స్థానాలకోసం పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోదండరాంకు సీట్లసర్దుబాటు వ్యవహారాన్ని అప్పగించాలనేది ఉత్తమ్‌ కుమార్‌ వ్యూహంగా కనబడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement