
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సాక్షి, కృష్ణా : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట, రూటు మార్చేశాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం కృష్ణా జిల్లా విసన్నపేటలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సింగపూర్ తరహా పరిపాలన కావాలన్నాడని, ఫాక్ట్ ఫైండింగ్ సమావేశం పెట్టి 74వేల కోట్లు కేంద్రం నుంచి రావాలన్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీ మాయమాటలు చెపుతూ ప్రజలను మభ్య పెడుతోందని వ్యాఖ్యానించారు. తాను అడగకుండానే జాతీయ పార్టీలు వచ్చి అవిశ్వాసానికి మద్దతిచ్చాయన్నారు. రాష్ట్ర హక్కుల కోసం బీజేపీని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
నదులు అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ప్రధానమంత్రి తనకు మెచ్యురిటీ లేదని మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీ నేతలే రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్పై రోజుకొక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై పాండవులు విజయం సాధించినట్లు కేంద్రంపై టీడీపీ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటే ఎవరూ నమ్మొద్దని పేర్కొన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్ధిక సంఘం చెప్పలేదన్నారు. హామీలపై ప్రజల్లో బీజేపీని దోషిగా నిలబెడతామని బాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment