![YSRCP MLA Abbayya Chowdary Reaches Dwaraka Tirumala By Walk - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2019/05/31/kotaru-padayatra.jpg.webp?itok=mntB1yan)
సాక్షి, దెందులూరు : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లి దేవాలయం నుంచి పాదయాత్రగా ద్వారకా తిరుమల చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంతో పాటు, దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు నా కృతజ్ఞతలు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలన విజయవంతంగా సాగాలంటూ పాదయాత్ర చేశా. ఈ అయిదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గ ప్రజలకు ‘నవరత్నాలు’ పూర్తి స్థాయిలో అందేలా కృషి చేస్తా.’ అని హామీ ఇచ్చారు. కాగా టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్పై అబ్బయ్య చౌదరి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగంలో సుమారు 17 ఏళ్లు అనుభవం ఉన్న ఆయన...రాజకీయాలపై ఆసక్తితో వైఎస్సార్ సీపీలో చేరారు. దెందులూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు.