
ఇండోర్: రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి టైటిల్ కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన విదర్భ జట్టుపై ఢిల్లీ జట్టులో సభ్యుడి గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. విదర్భ టైటిల్ సాధించిన తరువాత తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా ప్రత్యర్థి జట్టును కొనియాడాడు. రంజీ టైటిల్ గెలిచిన విదర్భ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిందని ప్రశంసించాడు.
'ఆద్యంతం ఆకట్టుకుని మొదటిసారి రంజీ టైటిల్ను విదర్భ ఖాతాలో వేసుకుంది. వెల్డన్ విదర్భ. ఆ జట్టుకు మంచి రోజులు రానున్నాయనడానికి ఇది సంకేతం. ఈ టైటిలే కాదు.. భవిష్యత్తులో ఇంతకంటే మంచి విజయాలను విదర్భ సొంతం చేసుకుంటుంది. ఫైజ్ఫజల్ గ్యాంగ్కు అభినందనలు' అని గంభీర్ పేర్కొన్నాడు. అదే సమయంలో ఈ సీజన్లో తమ జట్టు ప్రదర్శన కూడా గర్వించే విధంగానే ఉందన్నాడు. రంజీ ట్రోఫీలో రన్నరప్గా నిలవడం ఎంతమాత్రం అవమానకరం కాదన్నాడు. తమ అత్యుత్తమ ప్రదర్శనతోనే ఫైనల్కు చేరామన్న గంభీర్.. గతం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతామన్నాడు.
సోమవారం ముగిసిన రంజీ ట్రోఫీ ఫైనల్ పోరులో ఢిల్లీపై 9 వికెట్ల తేడాతో గెలిచిన విదర్బ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. తొలిసారి ఫైనల్కు చేరడమే కాకుండా ఏకంగా టైటిల్ను సొంతం చేసుకుని అరుదైన మైలురాయిని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment