
ఢాకా : ఆసియా కప్ హాకీలో భారత్ జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. మలేషియాతో గురువారం(19న)ఢాకాలో జరిగిన మ్యాచ్లో 6-2 తో ఇండియా జట్టు విజయం సాధించింది. మొదటి నుంచి టీం ఇండియా ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబరిచారు. కొత్త కోచ్ జోయెర్డ్ మరిన్ మార్గదర్శకంలో కుర్రాళ్లు బాగా రాణిస్తున్నారు.ఆరంభం నుంచి మన ఆటగాళ్లు అందివచ్చిన అవకాశాలను గోల్స్ గా మలుచుకుని విజయానికి బాటలు వేశారు.
మలేషియాపై ఘనవిజయంతో భారత్ సూపర్ ఫోర్కు చేరుకుంది. రెండు మ్యాచ్లతో నాలుగు పాయింట్లు సాధించింది. టీమిండియా అద్భుత ప్రదర్శనతో మలేషియాను కంగు తినిపించింది. సూపర్ ఫోర్ దశ ఫైనల్ మ్యాచ్లో ఇండియా జట్టు శనివారం(21వ తేదీన) పాకిస్తాన్తో తలపడనుంది. ఆకాశ్దీప్ సింగ్, ఎస్కె ఉతప్ప, గుజరాత్ సింగ్, ఎస్వీ సునీల్, సర్దార్ సింగ్లు తమ ప్రదర్శనతో గోల్స్ సాధించారు. మలేషియా జట్టులో రజి రహీమ్, రమ్దాన్ రోస్లీలు గోల్స్ కొట్టారు. గత బుధవారం జరిగిన మ్యాచ్లో ఇండియా- దక్షిణ కొరియా జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. చివరకు ఆ మ్యాచ్లో రెండు జట్లు 1-1 గోల్స్ సాధించిన విషయం తెలిసిందే.