
బెంగళూరు: భారత్తో జరిగిన చివరి వన్డేలో తమ ప్రణాళిక సక్సెస్ కాలేకపోవడంతోనే సిరీస్ను చేజార్చుకున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ అన్నాడు. తొలుత మూడొందలకు పైగా పరుగులు సాధించాలనుకున్న ప్లాన్ అమలు కాలేదని, దాంతోనే మ్యాచ్ను కాపాడుకోలేకపోయామన్నాడు. ‘ చివరి వన్డేలో పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. చివరి వరకూ స్పిన్కు అనుకూలంగానే ఉంది. కానీ మేము సాధించిన స్కోరు భారీ స్కోరు కాదు. ఒకవేళ 310 పరుగులు చేసి ఉంటే మా స్పిన్నర్లు మరింత ఒత్తిడి తెచ్చేవారు. ఆగర్ బౌలింగ్ చాలా బాగుంది. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో బ్యాట్స్మెన్పై ఒత్తిడి తెచ్చాడు. (ఇక్కడ చదవండి: ‘రాహుల్ ఔటైన తర్వాత అదే అనుకున్నాం’)
దాంతో భారత్ ఆటగాళ్లకు అతని బౌలింగ్ ఆడటానికి రిస్క్ చేయాల్సి వచ్చింది. మేము స్వల్ప విరామాల్లో రెండేసి వికెట్లను కోల్పోవడం కూడా భారీ స్కోరు చేయలేకపోవడానికి ఒక కారణమైంది. నేను పార్ట్ టైమ్ స్పిన్ వర్కౌట్ అవుతుందని అనుకున్నా. దాంతోనే లబూషేన్తో పాటు నేను కూడా బౌలింగ్ చేశా. కానీ ఆ ప్రణాళిక ఫలించలేదు. ఈ సిరీస్ ఓటమి మాకు చాలా విషయాలు నేర్పింది. భారత్ స్వదేశంలో ఎంతటి గట్టి జట్టు మరోసారి చూపించింది. వరల్డ్ అత్యుత్తమ జట్టును, అందులోనే వారి సొంత గడ్డపై ఓడించమంటే మాకు తెలిసొచ్చింది’ అని ఫించ్ అన్నాడు. (ఇక్కడ చదవండి: కంగారెత్తించాం...)