
యువీ.. ఓ బ్రాండ్ నేమ్!
సూర్యాభాయ్... ఓ వ్యక్తి కాదు... ఓ బ్రాండ్... ఏ ముహూర్తాన సినిమాలో పూరీ జగన్నాథ్ ఈ మాట చెప్పించాడో గానీ... ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు ఐపీఎల్లో ఇదే మంత్రాన్ని పఠించింది. ఐపీఎల్-8 కోసం జరిగిన వేలంలో యువరాజ్కు రూ.16 కోట్లు ఇచ్చి కొనుక్కుంది. భారత జట్టులో లేని ఓ ఆటగాడి కోసం ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇంత మొత్తం ఎందుకు వెచ్చించింది?
ఆసియాలోనే అతి పురాతన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదైన కంపెనీలలో 1079 కంపెనీల విలువ... యువరాజ్కు ఐపీఎల్ ద్వారా ఏడాదికి దక్కే మొత్తం కంటే తక్కువ. ఆశ్చర్యంగా అనిపించినా భారత్లో క్రికెట్ మార్కెట్కు ఉన్న శక్తి ఏమిటో యువరాజ్ సింగ్ ద్వారా బయటపడింది. అసలు 45 రోజుల పాటు క్రికెట్ ఆడితే ఇంత డబ్బు వస్తుందా అని ప్రపంచం ఆశ్చర్యపోయింది.
అయితే ఢిల్లీ కూడా ఆషామాషీగా ఈ నిర్ణయం తీసుకోలేదు. వాళ్ల లాజిక్ వాళ్లకుంది.
ఠ ఐపీఎల్ ప్రారంభమై ఏడేళ్లు గడిచినా ఢిల్లీ డేర్డెవిల్స్ ఇప్పటిదాకా ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ప్రతిసారీ అనేకమంది స్టార్స్ను తీసుకుని ఆడినా ఇప్పటిదాకా సానుకూల ఫలితం లేదు.
ఠ ఢిల్లీ జట్టు యజమాని జీఎంఆర్ సంస్థ.
ఈ జట్టు ఐపీఎల్ సందర్భంగా పలు రకాల మార్కెటింగ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు గత సీజన్లో తమ స్టార్ క్రికెటర్లను మెట్రో ైరె ళ్లో తిప్పింది. అలాగే సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా ప్రతి ఏడాదీ ఆ జట్టుకు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. గత సీజన్లో ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ ఆ పాత్ర పోషించాడు.
ఠ గత ఏడాది దినేశ్ కార్తీక్, పీటర్సన్ లాంటి క్రికెటర్లకు భారీ మొత్తాలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఆట పరంగా ఢిల్లీ ఆఖరి స్థానంలో నిలిచింది. అలాగే పీటర్సన్, కార్తీక్ లాంటి వారి కోసం అభిమానులు పెద్దగా ఎగబడలేదు.
ఠ కాబట్టి ఈ సీజన్ కోసం ఢిల్లీకి ఓ స్టార్ క్యాంపెయినర్ కావాలి. తమ బ్రాండ్ను నిలబెట్టే క్రికెటర్ కావాలి. భారత జట్టులోని పెద్ద స్టార్స్ అంతా ఏదో ఒక జట్టుతో ఉన్నారు. ఇక అభిమానులను ఆకర్షించగలిగిన ఒకే ఒక్క క్రికెటర్ యువరాజ్ సింగ్. కాబట్టి తన కోసం ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు సిద్ధమైంది. గత సీజన్లో ఆడిన పెద్ద ఆటగాళ్లను వదులుకోవడం వల్ల వాళ్ల దగ్గర అందుబాటులో కూడా భారీ మొత్తం (39.75 కోట్లు) ఉంది. ఠ గతంలో కేవలం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కార్యకలాపాలు చేసిన డేర్డెవిల్స్... ఇప్పుడు యువీ ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకోవచ్చు.
-సాక్షి క్రీడావిభాగం
ఆటలోనూ తక్కువ కాదు
యువరాజ్ ఒక బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాదు... ఆట పరంగానూ ఈ పంజాబ్ క్రికెటర్ను తక్కువ అంచనా వేయకూడదు. ఈ సీజన్లో రంజీలో అతను వరుసగా 3 సెంచరీలు కొట్టాడు.
భారత్ గత ప్రపంచకప్ గెలిచిన సమయంలో భారత్కు కోచ్గా వ్యవహరించిన గ్యారీ కిర్స్టెన్ ఇప్పుడు ఢిల్లీకి కోచ్. ఆటగాడిగా యువరాజ్ విలువ ఏంటో ఆయనకు తెలుసు. తనదైన రోజున ఒక్క ఓవర్లోనే మ్యాచ్ ఫలితాన్ని మారుస్తాడు. అతను ఒక్క సీజన్ మొత్తం ఫామ్లో ఉంటే ఢిల్లీకి ఐపీఎల్ టైటిల్ గెలవడం కూడా కష్టం కాదు. కాబట్టి కిర్స్టెన్దీ యువీ ఎంపికలో కీలక పాత్ర.
వదిలేసిన వాళ్ల పుణ్యమే...
నిజానికి ఢిల్లీ కూడా రూ. 16 కోట్లు పెట్టాల్సి వస్తుందని అనుకోని ఉండదు. బెంగళూరు గత సీజన్లో రూ.14 కోట్లు ఇచ్చింది. ఈసారి అంత ఇవ్వడం అనవసరం అనుకుంది. దీంతో యువీ వేలంలోకి వచ్చాడు. అయితే వేలంలో అనూహ్యంగా బెంగళూరు కూడా యువీ కోసం ప్రయత్నించింది. అంటే, ఆటగాడిగా యువరాజ్ అవసరం అని బెంగళూరు భావించింది.
మరోవైపు ఢిల్లీ కూడా పట్టుదలగా ఉండటంతో రేటు పెరుగుతూ పోయింది. బెంగళూరు రూ.15.5 కోట్లకు కూడా ముందుకు వచ్చింది. అంటే గత ఏడాది మొత్తం రూ.14 కోట్ల కంటే అదనంగా మరో కోటిన్నర రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక్కడ కూడా ఢిల్లీ తగ్గలేదు. రూ.16 కోట్లకు కొనుక్కుంది. మొత్తం మీద బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఢిల్లీకి బాగా ఖర్చయింది.