బస్టాండ్ లో 10వేల నీలిచిత్రాల సీడీలు స్వాధీనం
చెన్నై : కోయంబేడు బస్టాండులో 10వేల నీలిచిత్రాల సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోయంబేడు బస్టాండులో 5వీ నంబర్ ప్లాట్ఫాంపై శుక్రవారం ఉదయం రెండు పెద్ద సూట్కేసులు అనుమానాస్పదంగా కనిపించాయి. దీని గురించి సమాచారం అందుకున్న కోయంబేడు డెప్యూటీ కమిషనర్ మోహన్రాజ్ ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడికి చేరుకుని సూట్కేసులను తెరచి చూశారు. వాటిల్లో కవర్లు లేకుండా అధిక మొత్తంలో సీడీలు కనిపించాయి.
వీటిని పోలీసులు వేసి చూడగా ఇవన్నీ నీలిచిత్రాల సీడీలని తెలిసింది. సుమారు 10వేల సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఆంధ్రా నుంచి ఇక్కడికి తీసుకువచ్చినట్లు కనుగొన్నారు. కోయంబేడు బస్టాండు నుంచి వస్తువులు తరలించడం అడ్డుకునేందుకు బస్టాండులో పోలీసులు నిఘా చేపడుతున్నారు. అందువల్ల పోలీసులకు భయపడి ఈ సూట్కేసులను విడిచి వెళ్లి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.