
సాక్షి, షాద్నగర్: ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను పోలీసుల విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే ప్రజాగ్రహం కారణంగా వారిని కోర్టులో ప్రవేశపెట్టడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో మండల మెజిస్ట్రేట్ పాండునాయక్, డాక్టర్లు నేరుగా షాద్నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపారు. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించేందుకు పోలీసులు భారీ బందోబస్త్ను ఏర్పాటు చేశారు. ఆందోళకారులు పెద్ద ఎత్తన అక్కడికి చేరుకోవడంతో వారి కంటపడకుండా నిందితులను తరలించేందుకు దాదాపు పదికి పైగా వాహనాలను సిద్ధం చేశారు. పటిష్ట బందోబస్త్ నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇదిలావుండగా పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 5 గంటలుగా ఆందోళకారులు పెద్ద ఎత్తన నిరసనల వ్యక్తం చేస్తున్నారు. పోలీస్స్టేషన్లోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో.. స్టేషన్ ప్రధాన గేటుకు తాళం వేశారు. పోలీసుపై కోపంతో చెప్పులు విసురుతున్నారు. ఆందోళకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అంతకీ అదుపులోకి రాకపోవడంతో స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. తాజా పరిస్థితిని షాద్నగర్, చేవెళ్ల, శంషాబాద్ ఏసీపీలు పర్యవేక్షిస్తున్నారు.