తాండూరు: ఆర్టీసీ అద్దె బస్సు తాండూరు పట్టణ శివారులోని కాగ్నా నది వంతెనపై అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తాపడింది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
తాండూరు: ఆర్టీసీ అద్దె బస్సు తాండూరు పట్టణ శివారులోని కాగ్నా నది వంతెనపై అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తాపడింది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. బస్సు నదిలో పడిపోయిందని స్థానికంగా తీవ్రకలకలం రేగింది. యాలాల ఎస్ఐ రవికుమార్, తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. డిపోకు చెందిన ఓ అద్దె బస్సు (ఏపీ 22 డబ్ల్యూ 7360) తాండూరు డిపో నుంచి నిత్యం మహబూబ్నగర్ వరకు రాకపోకలు సాగిస్తుంటుంది. ఐదు రోజుల క్రితం యాలాల మండలం తిమ్మాయిపల్లి-దౌలాపూర్ మధ్య ఇంజిన్ ఫెయిల్ కావడంతో బస్సును అక్కడే నిలిపివేశారు. గురువారం రాత్రి స్థానికంగా ఓ మెకానిక్ సహాయంతో ఇంజిన్కు తాత్కాలిక మరమ్మతులు చేయించారు.
శుక్రవారం ఉద యం 7.30 గంటల సమయంలో డ్రైవర్ రవి, మెకానిక్ కాశిపతిలు కలిసి బస్సును డిపోకు తరలిస్తున్నారు. కాగ్నా వంతెనపైకి బస్సు ప్రవేశించగానే ఎదురుగా మరో ఆర్టీసీ బస్సు వచ్చింది. ఆ సమయంలో డ్రైవర్ రవి బ్రేక్లు వేయడంతో ఫెయిలయ్యాయి. దీంతో బస్సు అదుపుతప్పి కాగ్నా నది వంతెన పైనుంచి రోడ్డు కిందికి దూసుకువెళ్లింది. అక్కడ చెట్లు, మట్టిదిబ్బలు ఉండటంతో బస్సు ముందుభాగం ఒక వైపునకు ఒరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో డ్రైవర్, మెకానిక్లకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.