
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. 2019 మార్చి 29తో ఏపీ, తెలంగాణలలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్ 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలకు ఎన్నిక జరిపే ప్రక్రియలో భాగంగా.. ఎన్నికల సంఘం అక్టోబర్ 1వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. అర్హులందరికీ నవంబర్ 6వ తేదీ వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు తెలిపింది. 2019 జనవరి 1వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. జనవరి నెలాఖరు వరకు ఆ జాబితాపై అభ్యంతరాలను, వినతులను స్వీకరించనున్నట్టు తెలిపింది. 2019, ఫిబ్రవరి 20న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్టు వెల్లడించింది.
ఏపీలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు:
1. ఉభయగోదావరి జిల్లాలు (పట్టభద్రుల) - కలిదిండి రవికిరణ్ వర్మ
2. కృష్ణా, గుంటూరు (పట్టభద్రుల) - బొద్దు నాగేశ్వరరావు
3. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం (ఉపాధ్యాయుల) - గాదె శ్రీనివాసులు
తెలంగాణలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు:
1. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ (పట్టభద్రుల) - స్వామిగౌడ్
2. వరంగల్, ఖమ్మం, నల్గొండ (ఉపాధ్యాయుల) - పూల రవీందర్
3. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ (ఉపాధ్యాయుల) - పాతూరి సుధాకర్ రెడ్డి