
హైదరాబాద్: మొక్కలు నాటడమే కాకుండా అవి బతికేలా బాధ్యతలు తీసుకోవాలని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. మంత్రి ఎర్రబెల్లి బుధవారం ఈజీఎస్, సెర్ఫ్, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు టార్గెట్ చేరుకోవాలని సూచించారు. ఉపాధిహామీ పథకం కింద కొత్త గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, అలాగే గోడౌన్ల నిర్మాణం కూడా చేపట్టాలని అధికారులకు సూచన చేశారు.
మార్చి 31, 2019లోగా తెలంగాణాను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దాలని కోరారు. 57 నుంచి 64 సంవత్సరాలలోపు ఉన్న కొత్త పింఛన్ దారులను గుర్తించాలన్నారు. స్వయం సహాయక సంఘాల నిధులు సద్వినియోగం జరగాలని కోరారు. గ్రామాల్లో యువతకు జాబ్మేళాలు నిర్వహించాలని అధికారులకు చెప్పారు. స్మశానవాటిక భూకొనుగోలు కోసం రూ.2 లక్షల వరకు నిధులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.