
'సమగ్ర సర్వేను ప్రధాని సైతం మెచ్చుకున్నారు'
హైదరాబాద్: తెలంగాణ స్థితిగతులు తెలుసుకునేందుకే సమగ్ర సర్వే నిర్వహించినట్లు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. బంగారు తెలంగాణ కోసం...భవిష్యత్ ప్రణాళిక నిర్దేశించుకునేందుకు సర్వే చేసినట్లు ఆయన అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలలో విపక్షాలు లేవనెత్తిన ఆరోపణలకు ఈటెల సమాధానమిచ్చారు. సంకుచిత ఆలోచనతో సమగ్ర సర్వే జరగలేదని... ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ప్రధాని మోదీ సైతం మెచ్చుకున్నారన్నారు.
విపక్షాలు మంచిని ప్రశంసించాల్సిందిపోయి విమర్శలు చేయటం తగదన్నారు. సర్వే వల్ల తెలంగాణలో పండుగ వాతావరణం, సమైక్య భావన, మానవ సంబంధాలు పెంపొందాయని ఈటెల అన్నారు. వైషమ్యాలతో రగిలే కుటుంబాలు కూడా ఈ సర్వేలో కలిసిపోయాయని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో అనర్హులను ఏరివేసేందుకే సర్వే నిర్వహించినట్లు తెలిపారు.