పాత్రధారి జైలుకు వెళ్లాడు.. సూత్రధారీ వెళ్లక తప్పదు | no one cant escape from cash for vote | Sakshi
Sakshi News home page

పాత్రధారి జైలుకు వెళ్లాడు.. సూత్రధారీ వెళ్లక తప్పదు

Published Fri, Jul 3 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

no one cant escape from cash for vote

 సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో  ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు దీంతో సంబంధం ఉన్నవారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తెలంగాణ మంత్రులు పేర్కొన్నారు. ఈ కేసులో పాత్రధారి జైలుకు వెళ్లాడని, సూత్రధారి కూడా వెళ్లక తప్పదన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్ రెడ్డి గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ఎన్టీఆర్ ఆశయాలకు ఎప్పుడో నీళ్లొదిలిందని, ఇప్పుడున్న నేతలు స్వార్థంతో  అటు ఎన్టీఆర్, ఇటు పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని అన్నారు. రూ. 10 వేలు  లంచం తీసుకుంటే మంత్రిని సస్పెండ్ చేసిన పార్టీలో రూ.50 లక్షలు లంచం ఇచ్చిన వారికి హారతులు పడుతున్నారని తుమ్మల ఎద్దేవా చేశారు.

ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కేసులో బెయిల్ వస్తే గొప్ప వ్యక్తికి స్వాగతం పలికినట్లు చేయడం విడ్డూరమని పోచారం వ్యాఖ్యానించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే డబ్బులు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి ఇరికించారని బుకాయిస్తున్నారని అన్నారు. రేవంత్‌కు బెయి ల్ మాత్రమే వచ్చిందని మళ్లీ జైలుకు వెళ్లక తప్పదన్నారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోలేరని, అసలు కథ ముందుందని, రెండు రోజుల్లో ఏం జరుగుతుందో రుచిచూస్తారని మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement