
సాక్షి, మహబూబాబాద్: లోక్సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్ వేస్తున్నారా... అయితే ఈ నిబంధనలు తప్పక పాటించాల్సిందే. ఎలక్షన్ కమిషన్ సూచించిన నిబంధనల ప్రకారం ప్రతిఒక్కరూ నడుచుకోవాల్సిందే. లేదంటే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికల నామినేషన్లు ఈనెల 18నుంచి 25 స్వీకరిస్తారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నామినేషన్ల స్వీకరణకు కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరణ జరుగుతుంది. ప్రతి అభ్యర్థి నాలుగు నామినేషన సెట్లు దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు రెండు నియోజకవర్గాలకు మాత్రమే నామినేషన్లు వేయవచ్చు. అంతకంటే ఎక్కువ నియోజకవర్గాలకు నామినేషన్లు వేస్తే తిరస్కరించబడతాయి.
జనరల్ స్థానాలకు అయితే డిపాజిట్ 25వేలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే రూ 12,500 డిపాజిట్ చేయాల్సి ఉంది. నామినేషన్కు అఫిడవిట్ ఫారం 26 దాఖలు చేయాల్సి ఉంటుంది. వేరే నియోజకవర్గం అభ్యర్థి అయితే సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఓటర్ లిష్టు జిరాక్స్ సమర్పించాలి. నామినేషన్ హాల్కు కేవలం అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే అవకా«శం ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థి నామినేషన్ కేంద్రం వద్దకు మూడు వాహనాలను ఉపయోగించవచ్చు. 100 మీటర్లదూరంలోనే వాహనాలు నిలుపాలి. డిఎస్పీ నోడల్ ఆఫీసర్గా వ్యవహరించి అన్ని విషయాలను అబ్జర్వేషన్ చేస్తారు. రికగ్నేషన్ పార్టీలకు అయితే ఫారం బీ సమర్పించాల్సి ఉంటుంది. అన్రికగ్నేషన్ పార్టీ అభ్యర్థి అయితే స్వతంత్ర అభ్యర్థులు అయినా 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.