కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు | Rent Farmers To Credit cards are eligible | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు

Jul 6 2015 1:52 AM | Updated on Oct 8 2018 7:48 PM

కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు - Sakshi

కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు

కౌలు రైతులందరికీ బ్యాంకు రుణాలను అందించే ఉద్దేశంతో.. ప్రభుత్వం కొత్తగా రుణ అర్హత కార్డు (ఎల్‌ఈసీ)లను అందజేయనుంది.

మీ సేవ కేంద్రాల ద్వారా జారీకి రెవెన్యూశాఖ ఏర్పాట్లు
కార్డున్న వారికే పథకాల లబ్ధి
ఈ ఏడాది కొత్తగా 2.5 లక్షల మందికి కార్డులు
పాత కార్డులున్న రైతులకు పునరుద్ధరణ
ప్రతి కార్డుకు ‘ఆధార్’ అనుసంధానం

సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులందరికీ బ్యాంకు రుణాలను అందించే ఉద్దేశంతో.. ప్ర భుత్వం కొత్తగా రుణ అర్హత కార్డు (ఎల్‌ఈసీ)లను అందజేయనుంది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.20 లక్షలమంది కౌలురైతులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే రుణ అర్హత కార్డులున్న 2.70 లక్షల మందికి ఈ ఏడాది వాటిని పునరుద్ధరించనున్నారు. కార్డులు లేని సుమారు 2.5 లక్షల మంది కౌలు రైతులకు వాటిని కొత్తగా అందజేయాలని సర్కారు తాజాగా నిర్ణయించింది. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సబ్సిడీతో అందజేస్తున్న విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లను ఇకపై కౌలు రైతులకూ అందజేయనుంది.

బ్యాంకుల ద్వారా పంట రుణాలతో పాటు, మార్కెట్ యార్డుల్లో పంటలను నిల్వ ఉంచుకునే సదుపాయం, కనీస మద్దతు ధరను పొందే అవకాశం.. తదితర అంశాల్లోనూ వారికి బాసటగా నిలవాలని భావిస్తోంది. బ్యాంకుల రుణాలు ఇప్పటివరకు భూముల యజమానులకే అందుతున్నాయని, వాస్తవానికి వ్యవసాయం చేస్తున్న రైతులకు అందడం లేదని ప్రభుత్వం గుర్తించింది. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా, వారి అనుమతి పొందిన కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వీటిని జారీ చేయనుంది.
 
ప్రయోజనాలు ఇలా..

రుణ అర్హత కార్డులను పొందనున్న కౌలురైతులకు ఇకపై బ్యాంకుల నుంచి పంట రుణాలతో పాటు ప్రభుత్వం రైతాంగానికి అందిస్తున్న వివిధ రకాల సబ్సిడీలు, మౌలిక సదుపాయాలను పొందేందుకు వీలు కలగనుంది. ప్రకృతి విపత్తులతోగానీ, వ్యవసాయ పరికరాల లోపం వల్ల గానీ పంట నష్టపోతే బీమా ద్వారా పరిహారాన్ని పొందవచ్చు. ఈ కార్డులను ఆధార్‌కు అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలను మరింత పటిష్టంగా అమలుచేయొచ్చని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. భూమిపై హక్కును క్లెయిం చేసుకునేందుకు గానీ, సమర్థించుకునేందుకు గానీ ఈ కార్డులను సాక్ష్యంగా వినియోగించుకునేందుకు వీలు కాదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.మీ సేవ ద్వారా ఎల్‌ఈసీలు జారీ
కౌలు రైతులకు ఎల్‌ఈసీలను మీ సేవకేంద్రాల ద్వారా అందించేందుకు రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేసింది. వీటిని పొందాలనుకునే/ రెన్యువల్ చేసుకోవాలనుకునే వారు దరఖాస్తులను సమీపంలోని మీ సేవకేంద్రాల్లో, గ్రామ లేదా, మండల రెవెన్యూ కేంద్రాల్లో ఉచితంగా పొందవచ్చు. దరఖాస్తులో కౌలుకు తీసుకున్న భూమి వివరాలతో పాటు తమ ఆధార్/రేషన్ కార్డు/ఓటర్ ఐడీ/పాన్ కార్డు నంబర్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా నమోదు చేయాలి.

కార్డు పొందేందుకు రూ.35 రుసుము చెల్లించాలి. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గ్రామసభ ద్వారా అధికారులు విచారణ చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయిన 15 రోజుల్లో కొత్త/ రెన్యువల్ కార్డులను మీసేవ కేంద్రాల నుంచే పొందవచ్చు. ఈ కార్డు ఏడాది (జూన్ 1 నుంచి మే 31 వరకు) మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ప్రతిఏటా రెన్యువల్ చేయించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement