ఐదడుగుల దూరంలో ఆగిన ముప్పు! | RTC bus accident in bhadradri kothagudem district | Sakshi
Sakshi News home page

ఐదడుగుల దూరంలో ఆగిన ముప్పు!

Published Sun, Aug 12 2018 2:50 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

RTC bus accident in bhadradri kothagudem district - Sakshi

బూర్గంపాడు: ఐదు అడుగుల దూరంలోనే పెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓ ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పి వాగు సమీపంలో 30 అడుగుల లోతుల్లోకి పడిపోయింది. బస్సు చెట్టుపైకి దూసుకుపోవడం.. కొంతమేర వేగం తగ్గడంతో పెను ప్రమా దం తప్పింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక–నాగినేనిప్రోలు గ్రామాల మధ్యన ఉన్న పెదవాగు వద్ద చోటుచేసుకుంది. కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు భద్రాచలం నుంచి విజయవాడకు 35 మంది ప్రయాణికులతో వెళ్తోంది. పెదవాగు బ్రిడ్జి వద్ద ఉన్న గోతిని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

బోల్తా పడే సమయంలో అప్రోచ్‌ రోడ్డుకు దిగువన చెట్టుపైకి దూసుకుపోయింది. దీంతో కొంతమేర బస్సు వేగం తగ్గి పెదవాగు ఒడ్డున పడిపోయింది. ఐదు అడుగుల దూరంలోనే పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదంలో 15 మం దికి తీవ్రంగా గాయాలయ్యాయి. సత్తుపల్లికి చెందిన వృద్ధురాలు రాజేశ్వరి, భద్రాచలానికి చెందిన హనుమంతరావు, వీరునాయక్, ముప్పు ప్రసాద్, రాజమండ్రికి చెందిన నాగేంద్రబాబు, సావిత్రి, భూపాలపల్లికి చెందిన రాజమండ్రి వెంకటేశ్వర్లు, పినపాక పట్టీనగర్‌కు చెందిన కొట్టె లక్ష్మి, భిక్షం దంపతులు, సారపాకకు చెందిన పర్వీన్, కౌనిన్, రాజ్యలక్ష్మి, కండక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, తమిళనాడుకు చెందిన చెన్నప్ప, కొత్తగూడేనికి చెందిన మల్లికార్జున్‌ తీవ్రం గా గాయపడ్డారు. 

క్షతగాత్రులను 108 వాహనంలో భద్రాచలం సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. రెడ్డిపాలెం, సారపాక వాసులు ప్రయాణికులను రక్షించేం దుకు జోరువానలో కూడా శ్రమించారు. క్షతగాత్రులను మోసుకుంటూ రోడ్డుపైకి తీసుకొచ్చారు. అప్రోచ్‌ రోడ్డు దిగువన ఉన్న చెట్టు దగ్గరికి వెళ్లి బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. పెదవాగు బ్రిడ్జిపై పడిన గొయ్యిని అధికారులు పూడ్పించకుండా నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement