హైదరాబాద్:వినాయక నిమజ్జన శోభా యాత్ర సందర్భంగా ఖైరతాబాద్ లోని గణేశ్ మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. సోమవారం ఖైరతాబాద్ లో ఉన్న భారీ లంబోదరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ క్రమంలో తీవ్ర తొక్కిసలాట జరుగుతోంది. భక్తులు బారికేడ్లను దాటుకుని గణేషుడిని చూసేందుకు యత్నించటంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు తిప్పలు పడుతున్నారు. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాంతో స్వామివారిని దర్శించుకున్న అనంతరం బయటకు వెళ్లేందుకు కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గణేశ్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు సరిగా లేవంటూ భక్తులు మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా ఖైరతాబాద్ గణనాధుడికి సాయంత్రం అయిదు గంటలకు పూలవర్షం కురిపించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. పూలవర్షం కురిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూలను సరఫరా చేస్తుందని వెల్లడించింది. హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. అత్యధికంగా ఈసారి మాత్రమే 60 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం, వచ్చే ఏడాది నుంచి వరుసగా ఎత్తు తగ్గుతూ వస్తుండటంతో ఈసారి పూలవర్షం కురిపించాలని ఉత్సవ కమిటీ కేసీఆర్ను కోరిన విషయం తెలిసిందే.