ఇరాక్లోని వివిధ ప్రాంతాలు నిత్యం బాంబు పేలుళ్లతో దద్ధరిల్లుతుందని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది.
ఇరాక్లోని వివిధ ప్రాంతాలు నిత్యం బాంబు పేలుళ్లతో దద్ధరిల్లుతుందని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. నిన్న చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల వల్ల దాదాపు 10 మంది మరణించారని తెలిపింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించింది.
దియాల ప్రావెన్స్లో అత్యంత రద్దీగా ఉండే మీడియా కేంద్రం సమీపంలో రోడ్డు పక్కన ఉంచిన బాంబు పేలి ఐదుగురు మరణించగా, 11 మంది తీవ్ర గాయాలపాలైయ్యారని చెప్పింది. అలాగే సదియహ్ పట్టణంలోని మార్కెట్ వద్ద ఉంచిన బాంబు విస్పోటనంలో ముగ్గురు మరణించారని,11 మంది గాయపడ్డారని చెప్పింది. మకదాదియ నగరంలో ఓ పోలీసుపై కొందరు ఆగంతకులు జరిపిన కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మరణించాడని తెలిపింది.
ఫల్లజ నగరంలో పార్క్ చేసిన కారు పేలి ముగ్గురు గాయపడ్డారని పోలీసు వర్గాలు వెల్లడించాయని పేర్కొంది. హమామ్ అలీ పట్టణం పోలీస్ ఉన్నతాధికారి బాంబు పేలుడు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారని, అయితే కొద్దిపాటి గాయాలు ఆయనకు తగిలాయని వెల్లడించింది. బాంబు పేలుళ్ల వల్ల పోలీసు జీపులు ధ్వంసమైన ఘటనలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని మీడియా పేర్కొంది.