
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీఎస్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా టీఆర్ఎస్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) నియమితులయ్యారు. కేబినెట్ ర్యాంకులో అంతర్రాష్ట్ర సంబంధాల సలహాదారుగా ఆయన పనిచేస్తారని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేసింది. ఈ నియామకం తొలుత ఏడాది పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ సలహాదారుగా డీఎస్కు లక్ష రూపాయల జీతం, ఇతర సదుపాయాలు కూడా ఉంటాయని జీఓలో తెలిపారు. అంతే కాకుండా కార్యాలయానికి ఐదుగురు సిబ్బందిని కూడా కేటాయించారు. ఈ నియామకానికి సంబంధించి సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ - డీఎస్కు స్వయంగా తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ ఇవాళ ఉదయం డీఎస్కు ఫోన్ చేసి మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీఎస్ ఇటీవల ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తి అయింది. దాంతో మరోసారి ఎమ్మెల్సీ సీటును ఆయన ఆశించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డీఎస్ జిల్లాకే చెందిన ఆయన శిష్యురాలు ఆకుల లలితకు ఆ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. దాంతో పార్టీ అధిష్టానం తీరు పట్ల ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారు. దీంతో డీఎస్ హస్తం పార్టీకి రాజీనామా చేసి... టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.