ప్రధానికే ప్రాణభయమా? మరి దేశం పరిస్థితి!
-
క్యూ లైన్లలో నిలబడ్డ కోటీశ్వరులేరి?
-
రాజ్యసభలో వాడీవేడి చర్చ
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. ప్రధాని మోదీ రాజ్యసభకు రావడంతో ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యులు మొదట మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పెద్దనోట్ల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు తనను కొంతమంది బతుకనివ్వకపోవచ్చునని, తనకు ప్రాణభయం ఉందని ప్రధాని మోదీ పేర్కొనడాన్ని సమాజ్వాదీ ఎంపీ నరేశ్ అగర్వాల్ తప్పుబట్టారు. సాక్షాత్తూ ప్రధానికే ప్రాణభయం ఉంటే.. దేశాన్ని ఎవరూ కాపాడుతారని ఆయన ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలే కష్టాలు పడుతున్నారని, బ్యాంకుల ముందు క్యూలైన్లలో కోటీశ్వరులు ఎవరైనా నిలబడ్డరా కేంద్రాన్ని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో రెండో ఎమర్జెన్సీ విధించినట్టయిందని విమర్శించారు.
ఎమర్జెన్సీ సమయంలోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి నివేదికలు అందాయని, కానీ ఆ తర్వాత ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసనని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెద్దనోట్లను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో పెద్దనోట్ల రద్దులాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే లోక్సభ, రాజ్యసభ అనుమతి తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. ఏసీబీలో విజయ్ మాల్యాలాంటి పెద్దలకు రూ. 7వేల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనాన్ని ఎప్పుడు తీసుకొస్తారని ప్రశ్నించారు. కనీసం ఆర్థకమంత్రి జైట్లీని సైతం విశ్వాసంలోకి తీసుకోకుండా పెద్దనోట్ల రద్దును ప్రకటించారని విమర్శించారు. బ్యాంకుల నుంచి నగదు విత్డ్రాపై ఆంక్షలు పెడితే.. ప్రజలు మిమ్మల్ని నిషేధిస్తారని మోదీ సర్కార్ను హెచ్చరించారు.