
మోడీ సర్కారుపై శివసేన ఫైర్
ముంబై: రైల్వే చార్జీల పెంపుపై విపక్షాల దాడులు ఎదుర్కొంటున్న ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం తాజాగా స్వపక్షం నుంచి విమర్శల బారిన పడింది. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న శివసేన...రైల్వే చార్జీల పెంపును తప్పుబట్టింది. చార్జీల పెంపుతో సామాన్యుడిపై మోయలేని భారం పడిందని విమర్శించింది.
రైల్వే మంత్రి సదానంద గౌడ మొదటిసారే భారీగా చార్జీలు పెంచారని శివసేన పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణం నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం కాపాడుతుందని ప్రజలు భావించారని, రైల్వే చార్జీల పెంపుతో ఈ నమ్మకం వమ్మయ్యే ప్రమాదముందని అభిప్రాయపడింది.