అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆంధ్ర ప్రాంత పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ తెలంగాణ కార్మికులను రోడ్డున పడేస్తున్నారని సీపీఐ మావోయిస్టు తెలంగాణ కమిటీ, విప్లవ కార్మిక సమాఖ్య (వికాస)లు ఆరోపించాయి.
నల్లగొండ: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆంధ్ర ప్రాంత పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ తెలంగాణ కార్మికులను రోడ్డున పడేస్తున్నారని సీపీఐ మావోయిస్టు తెలంగాణ కమిటీ, విప్లవ కార్మిక సమాఖ్య (వికాస)లు ఆరోపించాయి. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి సమీపంలో ఉన్న ఓసీటీఎల్ సంస్థ యాజమాన్యం మోచేతి నీళ్లు తాగి 500 మంది కార్మికుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ట్రేడ్యూనియన్లు, ప్రజాసంఘాల కార్మిక ద్రోహపూరిత వైఖరిని తాము ఖండిస్తున్నామని వికాస రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ పేరుతో కరపత్రాలు వెలువడ్డాయి. ఈ కరపత్రాలను బుధవారం నల్లగొండలోని ‘సాక్షి’ కార్యాలయానికి పంపారు.
గత 28 ఏళ్లుగా ఓసీటీఎల్ సంస్థలో నెలకు రూ.8వేల కనీస వేతనం కూడా ఇవ్వడం లేదంటూ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్రావు, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కార్మికులను పట్టించుకోలేదని ఆ కరప్రతంలో పేర్కొన్నారు. ఓసీటీఎల్ యాజమాన్యంతో కుమ్మక్కయిన కార్మికులకు ద్రోహం తలపెడుతున్న ఈ కార్మిక ద్రోహులను ఎండగట్టాలని పిలుపునిస్తున్నామని, కార్మికులకు అన్యాయం చేస్తే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓసీటీఎల్ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారిపై పెట్టిన కేసులను రద్దు చేసి తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.