jika virus
-
జికాతో శంషాబాద్ ఎయిర్పోర్టులో రెడ్ అలర్ట్
హైదరాబాద్: భారత్లోనూ జికా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్టులో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో బాపూనగర్కు చెందిన ముగ్గురికి జికా వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ ధృవీకరించిన విషయం విదితమే. బాధితుల్లో ఇద్దరు గర్భిణులు ఇటీవలే ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిచ్చారని గుజరాత్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. -
భారత్కు జికా ముప్పు
ఈ ఏడాది జనవరి 4నే జికా వైరస్ గుర్తింపు ► డబ్ల్యూహెచ్ఓకు ఆలస్యంగా సమాచారమిచ్చిన భారత్ ► దేశంలోని 20 లక్షల చ.కి.మీ. ప్రాంతం జికా వ్యాప్తికి అనుకూలం భారత్కు జికా వైరస్ ముప్పు పొంచి ఉందా? దేశంలో తొలిసారిగా గుజరాత్లో 3 కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. మన దేశంలో జనవరిలోనే జికా వైరస్ను గుర్తించినా.. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ బయటకు వెల్లడించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. భారత్లో తొలిసారిగా జికా కేసుల్ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించాకే విషయం బయటకు తెలిసింది. భారత్లో జికా వైరస్ వేగంగా వ్యాపించే అవకాశాలున్నట్లు ఏడాది క్రితమే హెచ్చరికలు వచ్చాయి. ఏప్రిల్, 2016లో ఆక్స్ఫర్డ్ వర్సిటీ జికా వైరస్ వ్యాప్తిపై ఒక నివేదిక విడుదల చేసింది. ఆసియాలోని 142 కోట్ల మంది ప్రజలు.. జికా వైరస్ సులువుగా వ్యాప్తి చెందే ప్రాంతాల్లో నివసిస్తున్నారని హెచ్చరించింది. ఇక భారతదేశంలోనైతే 20 లక్షల చదరపు కి.మీ. ప్రాంతం జికా వైరస్ వ్యాప్తికి అనుకూలమని పేర్కొంది. అయితే భారత ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ముప్పు ముంచుకొచ్చింది. డబ్ల్యూహెచ్ఓ సమాచారం ప్రకారం.. జికా వైరస్ను ఈ ఏడాది జనవరి 4నే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ గుర్తించింది. భారత ప్రభుత్వం మాత్రం మే 15న డబ్ల్యూహెచ్ఓకు సమాచారం అందించింది. జికా 2015లో దక్షిణ అమెరికాలో వెలుగులోకి వచ్చింది. 2016లో బ్రెజిల్ తీవ్రంగా ప్రభావితమైంది. ఎల్లో ఫీవర్పై పరిశోధన చేస్తుండగా.. 1947లో జికా వైరస్ను ఉగాండాలో కనుగొన్నారు. రేసస్ కోతుల్లో దీన్ని గుర్తించారు. ఉగాండా, టాంజానియా, నైజీరియాల్లో మనుషులకు ఈ వైరస్ వ్యాపించినట్లు నిర్ధారించారు. వ్యాప్తి ఇలా.. జికా వైరస్ వ్యాప్తికి ప్రధాన వాహకం ఎడీస్ దోమ.. డెంగ్యూను వ్యాపింపచేసే ఎడీస్ ఈజిప్టీ వల్ల కూడా సోకవచ్చు. నిల్వ ఉండే నీటిలో ఈ దోమలు ఎక్కువగా వ్యాపిస్తాయి. వైరస్ సోకిన వ్యక్తితో శారీరక కలయిక ద్వారా కూడా వ్యాపిస్తుంది. శిశువులో మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం వైరస్ సోకిన మహిళ గర్భం దాల్చితే పిల్లలు చిన్న తలలతో (మైక్రోసెఫాలి) పుడతారు. న్యూరాన్లు తగ్గడం, మెదడు నిర్మాణంలో కీలకమైన కణాల ఉత్పత్తి ఆగిపోవడంతో సమస్య తలెత్తుతుంది. తల్లి నుంచి సోకే ఈ వైరస్ పిండం ఎదుగుదలను అడ్డుకుంటుంది. వైరస్ ప్రభావం అధికంగా ఉంటే గర్భంలోనే శిశువులు మరణించవచ్చు. బ్రెజిల్లో∙4వేల మందికిపైగా చిన్నారులు మైక్రోసెఫాలితో జన్మించారు. దోమల నివారణే మార్గం: ప్రపంచ ఆరోగ్య సంస్థ జికాకు పూర్తి స్థాయి వైద్యం అందుబాటులో లేదు. వైరస్ వ్యాప్తికి కారణమైన దోమల్ని నిర్మూలించడమే నివారణ మార్గమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దోమలు గుడ్లను పెట్టే ప్రాంతాల్ని నిర్మూలించడంతోపాటు, దోమల నియంత్రణకు ఇతర ప్రత్యామ్నాయాల్ని అవలంబించాలంది. వైరస్ ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. లక్షణాలు ఈ వైరస్ సోకినవారికి జ్వరం, తలనొప్పి, ఒంటి మీద దద్దుర్లు, కీళ్ల నొప్పులు, కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలు ఉంటాయి. కీళ్ల నొప్పులు, తలనొప్పి కొన్ని రోజుల నుంచి వారాల వరకూ ఉండవచ్చు. కొందరిలో పెద్దగా ఎలాంటి లక్షణాలు కన్పించవు. జికా బారిన పడితే గులైన్ బార్ సిండ్రోమ్ సోకే ప్రమాదముంది. ఈ సిండ్రోమ్ వస్తే వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ... శరీరంలోని కణాలపై దాడి చేస్తుంది. దీంతో కండరాలు క్షీణించి పక్షవాతం వచ్చే ప్రమాదముంది. బ్రెజిల్, బొలీవియా, కొలంబియా, పరాగ్వే, అమెరికా వర్జిన్ ఐలాండ్స్, వెనిజులా, ప్యూర్టోరికో తదితర దేశాల్లో ఈ వ్యాధి అధికంగా వ్యాపించింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్లో జికావైరస్
-
భారత్లో జికావైరస్
న్యూఢిల్లీ: ప్రమాదకర జికా వైరస్ భారత్లోనూ ప్రవేశించింది. గుజరాత్లోని అహ్మదా బాద్ సిటీలోని బాపూనగర్ ప్రాంతంలో ముగ్గురికి జికా వైరస్ సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) శనివారం నిర్ధారించింది. వైరస్ బారినపడిన వారిలో గర్భిణి, 64 ఏళ్ల వృద్ధుడు, బాలింత ఉన్నారు. సాధారణ నిర్ధారణ పరీక్షలో భాగంగా అహ్మదాబా ద్లోని బీజే వైద్యకళాశాల ఆధ్వర్యంలో 93 రక్తనమూనాలపై ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ జరపగా వైరస్ ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో పాజి టివ్గా తేలిన శాంపిళ్లపై మళ్లీ నిర్ధారణ కోసం పుణెలోని ల్యాబ్లో టెస్టులు చేశారు. నిర్ధారణ పరీక్షల వివరాలను డబ్ల్యూహెచ్వోకు పంపించామని, వైరస్ జాడను నిర్ధా రిస్తూ అక్కడి నుంచి సమాచారం వచ్చిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. -
కన్నీటి ద్వారా జికా వ్యాప్తి
వాషింగ్టన్: కళ్లు.. కన్నీళ్లకు రిజర్వాయర్లు అని మనకు తెలుసు. కానీ ఇవే కళ్లు.. జికా వైరస్ను కూడా భద్రంగా దాచుకుంటాయి. అయితే కన్నీళ్ల ద్వారా బయటకు వచ్చే ఈ వైరస్.. ఆ తర్వాత విశృంఖలంగా విస్తరిస్తుందని పరిశోధనల్లో తేలింది. కన్నీటి ద్వారా జికా వైరస్ వ్యాపించ గలదని ఎలుకల కన్నీటిపై చేసిన పరిశోధనల్లో అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. పెద్దలకు జికా కన్నీటి ద్వారా సోకితే.. వెంటనే కళ్లు ఎర్రబడి.. కాసేపట్లోనే మెదడు పాడైపోతుందని వెల్లడైంది. గర్భంలో ఉన్న చిన్నారులకు జికా సోకితే.. పుట్టిన తర్వాత అంధత్వం వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
ఆర్ఎన్ఏ వ్యాక్సీన్తో ఏ వ్యాధికైనా చెక్ చెప్పొచ్చు...
మొన్నటికి మొన్న చికెన్ గున్యా.. నిన్న హెచ్1ఎన్1.. నేడు ఎబోలా, జికా వైరస్ ఇలా కొత్తకొత్త వ్యాధులు ముంచుకొస్తున్న తరుణంలో మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ చల్లటి వార్త మోసుకొచ్చారు. అన్ని రకాల సంక్రమిత వ్యాధులకు విరుగుడుగా పనిచేసే వ్యాక్సీన్లను అభివృద్ధి చేసేందుకు వీరు ఓ వినూత్నమైన పద ్ధతిని ఆవిష్కరించారు. జీవ కణాల్లోని ఆర్ఎన్ఏతో కేవలం వారం రోజుల్లో ఎలాంటి వ్యాధికైనా వ్యాక్సీన్ను అభివృద్ధి చేయవచ్చునని వీరు నిరూపించారు. ఆర్ఎన్ఏ పోగును వైరస్, బ్యాక్టీరియాలతోపాటు ఎలాంటి పరాన్న భుక్కు ప్రొటీన్గానైనా మార్చేయవచ్చునని తెలిపారు. ఇవి కణాల్లోకి ప్రవేశించినప్పుడు ఉత్పత్తి అయ్యే ప్రొటీన్లు శరీర రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేసి నిర్ధిష్ట వ్యాధికారక వైరస్, బ్యాక్టీరియాలను అడ్డుకుంటుందని ఎంఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డేనియల్ ఆండర్సన్ తెలిపారు. ఎలుకల ద్వారా ఎబోలా, ఇన్ఫ్లుయెంజాలతో పాటు మలేరియా కారక బ్యాక్టీరియాపై ప్రయోగాలు జరిపి పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించామని ఆయన వివరించారు. సాధారణ వ్యాక్సీన్ల తయారీకి ఎంతో సమయం పడుతుంది. కొన్ని వ్యాధులకు సంబంధించినంత వరకు వ్యాక్సీన్లు ప్రమాదరకంగానూ మారవచ్చు. అంతేకాదు సాధారణ వ్యాక్సీన్లు ఆశించిన స్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఆర్ఎన్ఏ వ్యాక్సీన్లతో ఈ చిక్కులు ఉండవు. జీవకణాలు స్వయంగా వ్యాధిని ఎదుర్కొనే ప్రొటీన్లను ఉత్పత్తి చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా స్పంది స్తుంది. ఆర్ఎన్ఏలతో వ్యాక్సీన్లు అభివృద్ధి చేయవచ్చునన్న ఆలోచన శాస్త్రవేత్తల్లో 30 ఏళ్లుగా ఉన్నా వాటిని జీవకణాల్లోకి చేర్చడం ఎలా అన్న అంశంపై స్పష్టత లేకపోయింది. నానోస్థాయి కణాలతో ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ అడ్డంకిని అధిగమించారు. -
రియో ఒలింపిక్స్ను తరలించండి
అంతర్జాతీయ నిపుణుల విజ్ఞప్తి మియామీ: జికా వైరస్ కారణంగా ఆగస్టులో జరగనున్న రియో ఒలింపిక్స్ను తరలించడం లేదా ఆలస్యంగా నిర్వహించడం చేయాలని అంతర్జాతీయ డాక్టర్లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు 150 మంది అంతర్జాతీయ నిపుణులు ఓ లేఖపై సంతకాలు చేశారు. ప్రస్తుతం గేమ్స్కు ఆతిథ్యమిస్తున్న రియో.... బ్రెజిల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రెండో నగరంగా నమోదైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గేమ్స్ కోసం వచ్చే ఐదు లక్షల మంది విదేశీ పర్యాటకుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటకులు ఇక్కడి నుంచి తిరిగి స్వదేశాలకు వెళ్లిన తర్వాత కూడా ఆయా దేశాల్లో జికా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అంతగా లేని దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలు పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశముందన్నారు. -
జికా వైరస్పై అలర్ట్
♦ రాష్ట్ర వ్యాప్తంగా రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటుకు సన్నాహాలు ♦ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మెడికల్ టీమ్స్ ♦ దోమల నివారణకు రాష్ట్ర వైద్య యంత్రాంగం ప్రత్యేక చర్యలు సాక్షి, హైదరాబాద్: దోమను చూస్తే జనం వణికిపోతున్నారు. జికా వైరస్ సోకుతుందేమోనని బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో దోమల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ప్రపంచంలో 22 దేశాల్లో జికా వైరస్ ప్రబలడం, ఆసియా ఖండంలో మొదటి కేసు చైనాలో నమోదు కావడం, జికా వైరస్ విజృంభణ కారణంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. జికా వైరస్ సోకకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ స్పందించి రాష్ట్రవ్యాప్తంగా రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్(ఆర్ఆర్టీ)ను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. ఆర్ఆర్టీలో ఒక అంటువ్యాధుల నిపుణుడు, ప్రజారోగ్య స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, మెడికల్ లేదా పీడియాట్రిక్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ ఉండేలా చూడాలని సూచించింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకటి, రెండురోజుల్లో వైద్య బృందాలను ఏర్పాటు చేయనుంది. విద్య, పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమం, మున్సిపల్, గిరిజన, పరిశ్రమలు తదితర శాఖల అధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి జికా సోకకుండా చర్యలు తీసుకోనుంది. అయితే, జికా వైరస్ వల్ల వచ్చే వ్యాధి నివారణకుగాని, తగ్గించడానికిగాని ప్రత్యేక వ్యాక్సిన్, మందు అందుబాటులో లేవని స్పష్టం చేసింది. జికా సోకిన వ్యక్తి లక్షణాలు జికా వైరస్ సోకిన వ్యక్తికి జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు, కండ్లకలక వంటి లక్షణాలుంటాయి. నవజాత శిశువులు, గర్భిణులు, న్యూరోలాజికల్ సమస్యలున్నవారికి ఇది త్వరగా సోకుతుందని కేంద్రం తెలిపింది. షుగర్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, రోగ నిరోధకశక్తిలేనివారు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అయితే, తెలంగాణలో కంగారు పడాల్సిన పనిలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ అంటువ్యాధుల విభాగం జాయింట్ డెరైక్టర్ డాక్టర్ డి.సుబ్బలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. -
డోన్ట్వర్రీ... బీ రెడీ జికా
రేండేళ్ల క్రితం వరకూ ఎబోలా! అంతకుముందు చికెన్గున్యా, బర్డ్ఫ్లూ, డెంగ్యూ!! ఇప్పుడు జికా వైరస్!!! క్యూ కట్టినట్టుగా ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఎందరినో చుట్టుముడుతున్నాయి. ఎంతో మంది ఉసురు తీసుకుంటున్నాయి.అయితే ఊరట కలిగించే అంశం ఏమిటంటే... ఇప్పటికింకా భారత్లో జికా వైరస్కు సంబంధించి ఒక్క కేసూ నమోదు కాలేదు. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది కాబట్టి మనమూ అప్రమత్తం కావాలి. అవగాహన కలిగి ఉండాలి. జికావైరస్పై అవగాహన కోసం ఈ కథనం. జికా వైరస్కు సంబంధించిన మొదటి కేసు గత మేలో బ్రెజిల్లో నమోదయ్యింది. అప్పట్నుంచీ అది దక్షిణ, మధ్య అమెరికా ప్రాంతాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందింది. ఒక ఉపద్రవంలా విస్తరించింది. ఆ ప్రదేశాల్లో అది మహమ్మారిలా మారడంతో ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. జికా తెచ్చే ముప్పు ఇది జికా వైరస్... దోమల ద్వారా వ్యాపిస్తుంది. గర్భిణులకు ఈ వైరస్ సోకితే, అది వారి గర్భంలోని పిండం మెదడును కుంచించుకుపోయేలా చేస్తుందని భావిస్తున్నారు. దాంతో కుంచించుకుపోయిన మెదడుతో పసిపాపలు పుడతారని అనుకుంటున్నారు. ఇక మరికొన్ని సందర్భాల్లో అది కాలక్రమంలో అవయవాలన్నింటిపైనా మెదడు అదుపు తప్పిపోయే గులియన్ బ్యారీ సిండ్రోమ్ వంటి ఆటోఇమ్యూన్ జబ్బులకు దారి తీసి, నవజాత శిశువులకు ప్రాణాంతకమూ కావచ్చని అంచనా. ఇలా మన సొంత రోగ నిరోధక వ్యవస్థే మనపై దెబ్బతీసేలా చేస్తుందది. ఇదీ విస్తృతి... దాదాపు 15 లక్షల మంది బ్రెజిలియన్లకు జికా వైరస్ సోకింది. అందులో మెదడు కుంచించుకుపోయిన కేసులు 3,700. ఇలా మెదడు కుంచించుకుపోవడాన్ని వైద్య పరిభాషలో ‘మైక్రోసెఫాలీ’ అంటారు. తల్లికి వ్యాధి సోకితే పుట్టే పిల్లల తల చాలా చిన్నదిగా ఉంటుంది. మెదడు అభివృద్ధి, వికాసం... ఈ రెండు అంశాలూ చాలా తక్కువ. ఇది జికా వైరస్ కలగజేసే దుష్ర్పభావమని వైద్య, పరిశోధన వర్గాల అంచనా. ఈ లక్షణాలను చూశాక... దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాల్లోని అనేక భాగాల్లో మెడికల్ అత్యవసర స్థితిని ప్రకటించారు. దోమలను అదుపు చేయడానికి జరుగుతున్న యుద్ధంలో సాక్షాత్తూ సైనిక బలగాలు పాలుపంచుకుంటున్నాయి. కనిపించని ఉపద్రవం... ఈ ఫిబ్రవరిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదటి కేసు నమోదయ్యింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి యూఎస్కూ, యూఎస్ నుంచి ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకూ ప్రయాణాలు నిత్యం ముమ్మరంగా జరుగుతుంటాయి. దాంతో కొద్ది వ్యవధిలోనే ఇతర ప్రాంతాలకూ వ్యాపించవచ్చనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇక మరో భయం ఏమిటంటే... ఈ వైరస్ సోకినప్పుడు తొలి దశల్లో ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించవు. దాంతో అంతర్గతంగా జరుగుతున్న నష్టం గురించి అంచనా ఉండదు. ఫలితంగా నష్టనివారణ చర్యలు చేపడదామన్నా అవకాశమే ఉండదు. అప్పట్లో పరిమిత ప్రాంతాల్లోనే... మొదట్లో జికా వైరస్ ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకూ, కొన్ని పసిఫిక్ సముద్ర భూభాగాలకు మాత్రమే పరిమితిమైంది. ఈ వైరస్ కలిగించే ఉత్పాతాలనూ, స్వరూప స్వభావాలనూ అధ్యయనం చేసి, దానికి కారణమైన ‘జికా’ అనే ఈ వైరస్ను 1947లో తొలిసారి కనుగొన్నారు. ‘ఈడిస్ ఈజిప్టై’ అనే దోమ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇదే దోమ డెంగ్యూ వ్యాధినీ, చికన్గున్యానూ వ్యాప్తి చేస్తుంది. ఇది పగటివేళల్లో కుట్టే దోమ. ఎక్కువ ఎత్తులో ఎగరలేదు. సాధారణంగా ఇళ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మంచి నీళ్లలో గుడ్లు పెట్టి, అక్కడ అభివృద్ధి చెందుతుంటుంది. దోమ కుట్టాక వైరస్ చేరితే... ఈ దోమకాటు వల్ల ఒంట్లోకి వైరస్ చేరితే... కొద్దిగా జ్వరం, ఒంటి మీద దద్దుర్లు (ర్యాష్), కళ్లు కొద్దిగా ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తొలి 14 రోజులు (రెండు వారాల పాటు) ఉంటాయి. ఇప్పటికైతే మన దేశంలో లేదు... మన భారత భూభాగంపై ఇప్పటివరకూ జికా వైరస్ సోకిన ఏ కేసూ నమోదు కాలేదు. అయితే మన దేశంలోని చాలా ప్రదేశాల్లో నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలుంటాయి. అలాంటి చోట్ల నీళ్లు నిల్వ పెట్టుకోడానికి అవకాశాలు ఎక్కువ. దాంతో ఈ వైరస్ను వ్యాప్తి చేసే ఈడిస్ ఈజిప్టై రకం దోమలు అక్కడ పెరిగేందుకు అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉంటాయి. అందుకే నీటి ఎద్దడి వల్ల నీళ్లను నిల్వ చేసుకునే భారతీయ ప్రాంతాల్లో ఉండే గర్భిణులను అక్కడి స్థానిక ఆరోగ్య సంస్థలు అప్రమత్తం చేస్తున్నాయి. పొరుగుదేశాలలో ఉన్న పరిస్థితులను వివరించి, సమస్యపై అవగాహన కలిగిస్తున్నాయి. ఇలా నివారణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నివారణ కోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలను రూపొందించి వారికి వివరిస్తున్నాయి. కొన్ని చోట్ల వ్యాధి నిర్ధారణకు అవసరమైన ‘కిట్లు’ అందుబాటులో ఉంచుతున్నాయి. ఒకసారి వ్యాధి సోకితే మాత్రం దాన్ని తగ్గించడానికి చికిత్స లేదు. కానీ నివారణ టీకాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఈ ఆగష్టు నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకూ ఈ టీకాను అందుబాటులోకి తేవాలని సంకల్పించినట్లు పూణేలోని కొలంబియా ఆసియా హాస్పిటల్కు చెందిన నిపుణుడు మహేశ్ లాఖే తెలిపారు. అయితే ఈలోపు ప్రజలందరూ తామే అప్రమత్తం అయి నివారణ చర్యలు తీసుకోవడం ప్రధానమని మరో నిపుణులు ఓమ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఆయన తన ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ప్రజలకు జికావైరస్ పట్ల ఉన్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. అపోహలను దూరం చేస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ‘ప్రజల్లో ఈ వైరస్ పట్ల ఆందోళన ఉండటం చాలా సహేతుకమైనదే. ఎందుకంటే డెంగ్యూను వ్యాప్తి చేసే దోమే, దీన్ని వ్యాప్తి చేస్తుంది కాబట్టి వాళ్ల భయాలు అర్థవంతమైనవే’ అంటారాయన. అదృష్టవశాత్తూ మన దేశంలో జికా వైరస్ లేకపోయినా... ముందుజాగ్రత్త కోసం అవగాహన కలిగి ఉండటం చాలా మంచిది. లక్షణాలు చాలా మందిలో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించవచ్చు. కాకపోతే కొద్దిపాటి జ్వరం, ఒంటిపై దద్దుర్లు, కీళ్లనొప్పులు, కళ్లకలక (కళ్లు ఎర్రబారడం) వంటివి కనిపిస్తాయి.కొంతమందికి కండరాల నొప్పులూ కనిపించవచ్చు. మరికొందరిలో తలనొప్పి ఉంటుంది. ఒకసారి వైరస్ సోకాక, లక్షణాలు కనిపించడానికి కొద్ది రోజులు మొదలుకొని, వారం, రెండు వారాల వరకూ వ్యవధి పట్టవచ్చు.వైరస్ సోకితే, అది వ్యాధికి గురైన వారి రక్తంలో కొన్ని రోజులు మొదలుకొని, కొన్నాళ్ల వరకూ ఉండవచ్చు. అంటే లక్షణాలు బయటకు కనిపించకపోయినా, వ్యాధి వ్యాప్తి చేసే పరిస్థితిలో వారు ఉంటారు. చికిత్స వ్యాధి సోకిన తర్వాత నిర్దిష్ట చికిత్స ప్రక్రియ లేదు. ఇతర వైరల్ జబ్బుల విషయంలో ఇచ్చే మందులే దీనికీ ఇస్తున్నారు. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ దీనికి టీకా (వ్యాక్సిన్)ను రూపొందించినట్లు పేర్కొంది. అయితే అది ఇంకా ప్రీ-క్లినికల్ ప్రయోగదశల్లో ఉందనీ, చాలా త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పింది. ఇది ప్రాణాంతకమా? వ్యాధి సోకినప్పుడు కనిపించే లక్షణాలు ప్రాణాంతకం కాదు. అవి సాధారణ ఒళ్లునొప్పులూ, తలనొప్పులే. కానీ వ్యాధి సోకిన తర్వాత కలిగే దశలు చాలా ప్రమాదం. అవి మన రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ వ్యాధులను కలగజేయవచ్చు. ఆ తర్వాత రోగికి గులియన్ బ్యారీ సిండ్రోమ్, మెదడు కుంచించుకుపోయే మైక్రోసెఫాలీ వంటి ప్రమాదకరమైన కండిషన్స్ రావచ్చు. డెంగ్యూ, చికన్గున్యాలతో పోల్చినప్పుడు తేడా... సాధారణంగా డెంగ్యూ, చికన్గున్యా, జికా... ఈ మూడు వైరల్ వ్యాధుల లక్షణాల్లోని చాలా అంశాలు ఒకదానితో మరొకటి పోలి ఉంటాయి. ఉదాహరణకు దద్దుర్లు, కళ్లు ఎర్రబారడం, కంటి ఇన్ఫెక్షన్లు, కండరాల నొప్పులు అన్ని వ్యాధుల్లోనూ కనిపిస్తాయి. వ్యాధి కనిపిస్తున్న దేశాలు దక్షిణ అమెరికా ఖండానికి చెందిన చాలా దేశాలు. {బెజిల్లో దీని దుష్ర్పభావం చాలా ఎక్కువ. పోర్టారికో, కొలంబియా, బార్బడోస్, బొలీవియా, అమెరికన్ సమోవా లాంటి చోట్ల కూడా జికా వైరస్ విస్తృతంగానే ఉంది. ఇప్పుడిప్పుడే మెక్సికో, యూఎస్ఏలోనూ కేసులు కనిపిస్తున్నాయి.ఇది ఈడిస్ ఈజిప్టై అనే దోమతో వ్యాప్తి చెందుతుంది. ఇవే దోమలు డెంగ్యూ, చికన్గున్యాలనూ వ్యాప్తి చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23 దేశాలలో జికా వైరస్ ఉత్పాతాన్ని సృష్టిస్తోంది. గర్భవతులు పాటించాల్సిన నివారణ చర్యలివి... గర్భవతుల రక్తంలోకి ఈ వైరస్ చేరితే అది కడుపులోని శిశువుకూ సోకి ప్రమాదం కలిగించవచ్చు. అందుకే గర్భిణులు దోమలు కుట్టకుండా ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి.ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు, పొడవు చేతుల కుర్తాలు ధరించాలి.దోమలను పారదోలే ‘మస్కిటో రెపెల్లెంట్స్’ ఉపయోగించాలి. ఈ దోమలు పగలూ కుడతాయి... కాబట్టి పగటి వేళ కూడా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ శివరాజు సీనియర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ జికా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన భారత్! దేశీయంగా టీకా రూపకల్పన మన దేశ వ్యాక్సిన్ రూపకర్తలలో ఒకటైన భారత్ బయోటిక్ సంస్థ జికా వైరస్ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ రెండు ‘వ్యాక్సిన్ క్యాండిడేట్స్’ను రూపొందించి, ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపింది. ఇందులో ఒకటి వైరస్ను నిర్వీర్యం చేసి రూపొందించే ‘ఇనాక్టివేటెడ్ క్యాండిడేట్’ కాగా, మరొకటి కొన్నింటి సమ్మేళనం అయిన ‘రీకాంబినెంట్’. ఇక ఇవి చికిత్సకు మందులా ఇచ్చే ముందర నిర్వహించే ‘ప్రీ-క్లినికల్’ దశలో ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. రాబోయే ఐదు నెలల్లో ఈ ప్రీ-క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తామని రూపకర్తలు వివరించారు. ఆ తర్వాత నియంత్రణ అధికారుల నుంచి తగిన అనుమతులు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము రూపొందించిన వ్యాక్సిన్స్ వివరాలన్నీ భారతీయ ఔషధాలు, ఇతర చికిత్స ప్రక్రియలను నియంత్రించే అత్యున్నత సంస్థ అయిన ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ సంస్థకు కొద్ది రోజుల క్రితమే నివేదించినట్లు భారత్ బయోటెక్ సంస్థకు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. త్వరలోనే తాము ప్రధాని నరేంద్రమోడీకి సైతం విషయాలను విడమరచి చెప్పి, తమ టీకాకు తగిన అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు వివరించారు. ‘‘ఎబోలా వ్యాక్సిన్ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో తాము రెండో దశ ప్రయోగాలను అధిగమించి, మూడో దశకు నేరుగా వెళ్లామనీ, ఇప్పుడు కొద్ది మందిలో (శాంపుల్) నమూనా ప్రయోగాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ కృష్ణ ఎల్లా చెప్పారు. తమ ప్రయోగాల ద్వారా రూపొందిన వ్యాక్సిన్ పూర్తి స్థాయి అనుమతులు లభించడానికి దాదాపు 6-8 నెలల సమయం పట్టవచ్చని డాక్టర్ ఎల్లా అంచనా. ఎలా రూపొందిస్తారీ వ్యాక్సిన్లు... ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లో కొన్ని రసాయనాలు, ఉష్ణోగ్రత, రేడియేషన్ వంటి అంశాలతో వ్యాధిని కలిగించే వైరస్ మైక్రోబ్ను మృతిచెందేలా చేస్తారు. ఇక రీకాంబినెంట్ వైరస్లో మన పరిజ్ఞానం సహాయంతో కొన్ని డీఎన్ఏలను సమ్మిళితం చేస్తారు. ‘జికా’ విశేషాలు ఉగాండాలో దోమల బెడద ఎక్కువగా ఉండే ‘జికా అరణ్యం’ పేరిట జికా వైరస్కు ఆ పేరు పెట్టారు. ఊళ్లలో తిరిగే కోతులకు జికా వైరస్ సోకినట్లుగా తొలినాళ్లలో గుర్తించారు. అప్పట్లో ఈ వైరస్ మనుషులపై పెద్దగా ప్రభావం చూపిన దాఖలాల్లేవు. 1950లలో భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే కొద్ది ప్రాంతాల్లో మాత్రమే మనుషుల్లో జికా వైరస్ జాడ కనిపించేది.ఇటీవలి కాలంలో జికా వైరస్ భూమధ్యరేఖకు దూరంగా ఉండే ఆయన ప్రాంతాలైన లాటిన్ అమెరికన్ దేశాలు, అమెరికా, యూరోప్లోని కొద్ది ప్రాంతాల్లో మనుషులకు సోకినట్లు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దాదాపు ఏడు దశాబ్దాల కిందట గుర్తించిన ఈ వ్యాధి ఇటీవలే ఎందుకు ఎక్కువగా వ్యాపిస్తోందనే దానికి కచ్చితమైన కారణాలేవీ బయటపడలేదు. అయితే, వాతావరణ మార్పుల వల్ల... ముఖ్యంగా భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్) వల్ల ఈ వ్యాధి ఆయన ప్రాంత దేశాల్లోనూ విస్తరిస్తోందని భావిస్తున్నారు. -
కొలంబియాపై ‘జికా’ దెబ్బ
ముగ్గురిని బలిగొన్న వైరస్ అధికారికంగా తొలిసారి ప్రకటన బొగోటా: ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ కొలంబియా దేశంలో మృత్యుఘంటికలు మోగించింది. ఈ వైరస్ కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. జికా కారణంగా ఈ మరణాలు సంభవించాయని ఆ దేశం ధ్రువీకరించింది. ఇలా ధ్రువీకరించడం తొలిసారి కావడం విశేషం. కొలంబియా జాతీయ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన ద్వారా మరణాల విషయాన్ని శుక్రవారం వెల్లడించింది. జికా వైరస్ కారణంగా అత్యంత అరుదైన నరాల వ్యాధి (గుల్లెన్ బారె సిండ్రోమ్) బారిన పడి వారు ముగ్గురు మృత్యువాత పడ్డారని తెలిపింది. ఈ వ్యాధి సోకిన వారు మృత్యువాత పడటం తక్కువైనా.. అది మాత్రం ప్రమాదకరమైనదేనని వైద్యులు చెబుతున్నారు. గర్భిణులకు ఈ వైరస్ సోకితే పుట్టే పిల్లలు చిన్న తలతో పుట్టడం జికా లక్షణాల్లో మరొకటి. దీనిపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం స్పందిస్తూ.. జికా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న లాటిన్ అమెరికా దేశాల్లో గర్భిణులకు అబార్షన్, మహిళలకు గర్భనిరోధక విధానాలను ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా దేశాల్లో అబార్షన్ తీవ్రమైన నేరం. తల్లికి ప్రమాదకరమైన పరిస్థితి అయితే తప్ప అబార్షన్కు అక్కడి చట్టాలు అంగీకరించవు. మహిళలు గర్భం దాల్చవద్దని ఐక్యరాజ్యసమితి విభాగం ఎలా చెబుతుందని అక్కడి మహిళలు మండిపడుతున్నారు. -
జికా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయో
ప్రి-క్లినికల్ ట్రయల్స్ దశలో జికావాక్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్ను నివారించే రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి జికా వాక్సిన్గా ‘జికావాక్’ రికార్డులకు ఎక్కుతుందన్న ధీమాను భారత్ బయోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. జికావాక్ వివరాలను తెలియచేయడానికి బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జికావైరస్ నివారణకు సంబంధించి తొలి పేటెంట్కు దాఖలు చేస్తున్న కంపెనీ తమదేనన్నారు. ఏడాదిన్నర నుంచి దీనిపై పరిశోధనలు చేస్తున్నామని, ప్రస్తుతం ఇది ప్రి క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని, ఒకటి రెండు వారాల్లో ప్రిక్లినికల్ పరీక్షలు మొదలు పెడతామన్నారు. డబ్ల్యూహెచ్వో హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ను త్వరితగతిన విడుదల చేయడానికి అవకాశమిస్తే ఒకటి రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందన్నారు. దోమల నుంచి వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి ఇప్పుడు లాటిన్ అమెరికాను గడగడ లాడిస్తోంది. ఇది ఇంచుమించు మెదడు వ్యాపు వ్యాధిని పోలి ఉంటుందోన్నారు. ఇంతవరకు 13 లక్షల మంది ఈ వ్యాధి బారినపడితే అందులో 4,500 మంది పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించినట్లు గణాంకాలు చెపుతున్నాయి. -
లైంగిక చర్య ద్వారానూ జికా వైరస్
అమెరికాలోని టెక్సాస్లో నమోదైన తొలి కేసు మియామి: అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట జికా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ఇప్పుడే చెప్పడం తొందరపాటే అయినప్పటికీ చాలా సందర్భాల్లో వైరస్ల వ్యాప్తిలో వాతావరణం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. అధిక ఉష్ణోగ్రతతో దోమ మరిన్ని దోమల్ని ఉత్పత్తి చేస్తుందని వారు చెబుతున్నారు. గర్భిణుల పాలిట శాపంగా.. జికా వైరస్ గర్భిణుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ వైరస్ గర్భిణుల నుంచి పిల్లలకు సోకి ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది. ఈ వైరస్తో సంభవించే మైక్రోసెఫలీ అనే వ్యాధి పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జికా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించవద్దని గర్భిణులకు డబ్ల్యూహెచ్వో సూచిస్తోంది. లైంగిక చర్య ద్వారా కూడా... ప్రపంచ దేశాలను వణికిస్తున్న జికా వైరస్ లైంగిక చర్య ద్వారా కూడా వ్యాప్తి చెందుతోంది. టెక్సాస్లో ఈ విధంగా జికా సోకిన తొలి కేసు నమోదైంది. ఈ మేరకు అమెరికా ఆరోగ్య విభాగ వర్గాలు ధ్రువీకరించాయి. ఇప్పటివరకూ ఈ వైరస్ దోమల ద్వారానే సోకుతుందని భావించారు. తాజాగా వైరస్ సోకిన వారితో లైంగిక చర్య ద్వారా కూడా సోకుతుందని తేలింది. ఈ మేరకు అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డెరైక్టర్ డాక్టర్ టామ్ ఫ్రీడెన్ ఓ ఈ మెయిల్లో స్పష్టం చేశారు. జికా డివైస్తో రక్షణ దోమల నుంచి వ్యాపిస్తోన్న జికా వైరస్ నుంచి ఓ డివైస్ రక్షణ క ల్పిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. జికాతో పాటు చికున్ గున్యా, డెంగీ, యెల్లో ఫీవర్లకు కారణమైన దోమల నుంచి రక్షించుకునేందుకు ఈ డివైస్ ఉపయోగపడుతుందని మెడికల్ ఎంటమాలజీ జర్నల్లో పేర్కొన్నారు. -
'జికా వైరస్ను ఎదుర్కొనేందుకు చర్యలు'
హైదరాబాద్: రాష్ట్రంలో జికా వైరస్ తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్టు రాష్ర్ట వైద్య ఆరోగ్యాశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో తన నివాసంలో మాట్లాడుతూ... పగటి పూట కుట్టే దోమ ద్వారా డెంగ్యూ తరహాలో ఈ వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఈ వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించడంతో పాటు... వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించేలా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. గర్భిణీ స్త్రీలు విదేశీ ప్రయాణాలు చేయడం ఆరోగ్యకరం కాదన్నారు. గర్భిణీలో గులియన్ బారీ సిండ్రోమ్ వంటి నాడీ సంబంధ సమస్యలు కనిపించినా.. ప్రసవాల్లో తల చిన్నగా శిశువు జన్మించినా అత్యవసర చికిత్సనందించాలని కామినేని తెలిపారు. ఈ సమావేశంలో వైద్యా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ కెవీ సత్యనారాయణలు పాల్గొన్నారు.