rural
-
అంబరాన్నంటే జానపద సంబరం అక్టోబరు 25-27 దాకా
బెంగాల్లో గ్రామీణ వారసత్వం – సంస్కృతిని అన్వేషించే అవకాశం ఈ అక్టోబర్ నెలలోనే లభిస్తోంది. మొన్నటి దసరా వేడుకల్లో దుర్గా మాత పూజలు, దాండియా నృత్యాల ఆనందాన్ని పొందాం. ఆ ఆస్వాదనకు కొనసాగింపుగా రంగుల కళతో నిండిన మరో ప్రపంచం ఆహ్వానిస్తుంటే... ఎలా మిస్ అవగలం.. ఇష్టమైన హస్తకళల నుండి నోరూరించే వంటకాల వరకు అక్కడ ప్రతిదీ గొప్పగా జరుపుకుంటారు. బెంగాల్ గ్రామాల్లోని వారి గొప్ప వారసత్వం, కనుల విందు చేసే వారి సంస్కృతిలో మనమూ ఇట్టే లీనమైపోతాం. దీనిని గుర్తించిన కోల్ ఇండియా లిమిటెడ్, బంగ్లానాటక్ డాట్ కామ్తోపాటు ఎక్స్ప్లోర్ రూరల్ బెంగాల్ పండుగలు, జాతరల శ్రేణిని మన ముందుకు తీసుకువస్తోంది. దీని ద్వారా బీర్భూమ్, పురూలియా బంకురా, నదియా ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్లో గల 16 గ్రామాలలో ప్రయాణించవచ్చు. ఇక్కడి జానపద సంగీతం, నృత్యం, తోలుబొమ్మలాటలు, హస్తకళల ద్వారా వారి సాంస్కృతిక వారసత్వంలో మనమూ పాల్గొనవచ్చు. అక్టోబర్లో చివరి వారాంతాల్లో ఇక్కడ పండుగ, జాతరలు ఘనంగా నిర్వహిస్తారు. బీర్భూమ్లోని అంత్యంత అట్టహాసంగా జరిగే కాంత మేళా, శాంతినికేతన్ మేళాను సందర్శించవచ్చు. పురూలియాలో చౌ ఉత్సవ్, పాత చిత్రాల మేళాను సందర్శించి, వారి కళను ఆస్వాదించవచ్చు. బురాద్వన్లోని డోక్రా మేళా, చెక్క బొమ్మల మేళాలో షాపింగ్ చేయవచ్చు. ఈ గ్రామీణ జాతర అక్టోబర్ 25 నుంచి 27 వరకు జరుగుతుంది. -
గ్రామీణ విద్యకు వాయిస్ టెక్నాలజీ దన్ను
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధనలో వాయిస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (అలెక్సా) ఆర్ఎస్ దిలీప్ తెలిపారు. అయితే, ఇప్పటికీ దీని ఉపయోగం గురించి చాలా మందికి తెలియదని, ఈ నేపథ్యంలోనే అవగాహన కల్పన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.నాగాలాండ్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాల్లో అలెక్సా ఎనేబుల్డ్ ఎకో స్మార్ట్ స్పీకర్లను ఉపయోగిస్తుండటమనేది వాయిస్ టెక్నాలజీ వల్ల చేకూరే ప్రయోజనాలను తెలుసుకునేందుకు తోడ్పడగలదని చెప్పారు. చదువుపై విద్యార్థుల్లో ఆసక్తి పెరగడానికి కూడా ఈ సాంకేతికత దోహదపడుతోందని దిలీప్ పేర్కొన్నారు. వాయిస్ టెక్నాలజీ మెరుగుపడే కొద్దీ విద్యారంగంలో మరిన్ని వినూత్న సాధనాలు అందుబాటులోకి రాగలవని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభ్యాసం రూపురేఖలు మార్చగలవని ఆయన చెప్పారు. -
గ్రామాల్లో ధరల భారం తీవ్రం
ముంబై: దేశంలో మహమ్మారి కరోనా అనంతరం ఎకానమీ తీవ్ర ఒడిదుడుకులతో రికవరీ అవుతున్న అయిన విధంగానే (ఇంగ్లీషు అక్షరం ‘కే‘ నమూనా) ఇప్పుడు ద్రవ్యోల్బణం పరిస్థితులు నెలకొన్నాయని బ్యాంకింగ్ సేవల దిగ్గజం– హెచ్ఎస్బీసీ నివేదిక ఒకటి పేర్కొంది. కరోనా అనంతరం దేశ ప్రజలందరికీ ఎకానమీ రికవరీ ప్రయోజనాలు ఒకే రీతిగా అందకుండా తీవ్ర అడ్డంకులు నెలకొన్నాయని, అదే విధంగా ఇప్పుడు ద్రవ్యోల్బణ ప్రభావం కొన్ని వర్గాలపై ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలపై తీవ్ర ప్రతికూలత చూపుతోందని వివరించింది. దేశంలో పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం గ్రామీణ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్ఎస్బీసీ ప్రధాన ఆర్థికవేత్త ప్రంజూల్ భండారీ నివేదికలో పేర్కొన్నారు. ప్రధానంగా తీవ్ర వేడి, పంట నష్టం, పశువుల మరణాల కారణంగా అధిక ఆహార ద్రవ్యోల్బణం సమస్యలను గ్రామీణ ప్రాంతం ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. నివేదికలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే.. 👉పలు ఇంధన ధరలను తగ్గించడం ద్వారా ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అయితే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి అనేక ఇంధనాలను సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించరు. దీనివల్ల పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. 👉 ఆహార ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, ఇది ఎంతో ‘‘నిగూఢమైన’’ అంశం. నిజానికి ఆహారాన్ని పండించే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల కంటే తక్కువ ద్రవ్యోల్బణం ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే రైతు ఆదాయాలు దెబ్బతింటున్నందున వారు పట్టణ ప్రొక్యూర్లకు (పంట సేకరణ వ్యాపారులు)తమ పంటలను విక్రయించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సరఫరాలకు దారితీసి, ఆయా ప్రాంతాల్లో ధరల తీవ్రతకు దారితీస్తోంది. 👉ఇక ఇదే సమయంలో తగిన మౌలిక సదుపాయాలు, సరఫరాల వ్యవస్థ పటిష్టత, భారీ దిగుమతుల వెసులుబాటు వంటి అంశాల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు గ్రామీణ ప్రాంతాలకంటే తక్కువ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కలిగి ఉంటున్నారు. 👉 మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల మేలో పట్టణ ప్రాంతాల్లో 4.15 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది. 👉 వర్షాలు తగిన విధంగా లేకపోతే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల తగ్గుదలకు తగిన పాలసీ నిర్ణయాలను తీసుకోకపోవచ్చు. ఇది ఎకానమీపై తీవ్ర ప్రతికూలత చూపుతుంది. 👉జూలై– ఆగస్టుల్లో సాధారణ వర్షాపాతం నమోదుకాకపోతే తీవ్ర ద్రవ్యోల్బణం సమస్య తప్పదు. ధాన్యాగారాల్లో గోధుమలు పప్పుధాన్యాల నిల్వలు ఇప్పటికే తక్కువగా ఉన్నాయి. తగిన వర్షపాతం నమోదుకాకపోతే, 2024లో ఆహార ఒత్తిడి 2023 కంటే అధ్వాన్నంగా ఉండవచ్చు. జూన్లో ఇప్పటివరకు వర్షాలు సాధారణం కంటే 17 శాతం తక్కువగా నమోదయ్యాయి. వాయువ్య ప్రాంతంలో అత్యధికంగా తృణధాన్యాలు పండుతాయి. ఇక్కడ 63 శాతం లోటు వర్షపాతం నమోదుకావడం గమనార్హం. 👉 వర్షాలు సాధారణ స్థితికి వస్తే, ద్రవ్యోల్బణం బాగా పడిపోవచ్చు. దీనితో ఆర్బీఐ సరళతర వడ్డీరేట్ల వ్యవస్థకు నిర్ణయం తీసుకోవచ్చు. సానుకూల అంశాల నమోదయితే మార్చి 2025 నాటికి 0.5 శాతం రెపో రేటు తగ్గింపునకు దారితీయవచ్చు. 👉బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 6.5 శాతం. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలను ఆర్బీఐ పరిశీలిస్తోంది. 👉 ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. కేంద్రం ఆర్బీఐ నిర్దేశిస్తున్నదాని ప్రకారం ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. అంటే ఎగువముఖంగా 6 శాతంగా ఉండవచ్చన్నమాట. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. -
గ్రామీణ బాలికలు.. డాక్టరమ్మలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా వైద్య రంగం వైపే చూస్తున్నారు. 14.2 శాతం మంది డాక్టర్ కావాలనుకుంటే, మరో 25.2 శాతం మంది నర్స్ అవుదామని ఉందని చెప్పారు. అదే మగపిల్లల్లో డాక్టర్ కావాలనుకుంటున్నవారు 4.7 శాతం మందేకావడం గమనార్హం. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చూసినా.. బాలికలు డాక్టర్, నర్స్ లేదా టీచర్ కావాలని కోరుకుంటే, బాలురు పోలీసు, ఇంజనీరింగ్, ఆర్మీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 26 రాష్ట్రాల్లో సర్వే చేసి.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 1,664 గ్రామాల్లో 34,745 మంది 14–18 ఏళ్ల మధ్య వయసున్న బాలురు, బాలికలపై ఈ సర్వే చేశారు. వారి ఉద్యోగ/ఉపాధి ఆశలు, విద్యా ప్రమాణాలు, డిజిటల్ స్కిల్స్, చదువు ను నిజజీవితంలో ఏమేరకు అమలు చేస్తున్నా రనేది పరిశీలించారు. స్కూళ్లు, కాలేజీల్లో చదు వుతున్నవారితోపాటు బయటివారినీ ప్రశ్నించా రు. మొత్తంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనేది చాలా మంది ఆలోచనగా ఉందని, ఆ ప్రకారమే ఉద్యోగం/ఉపాధిపై దృష్టిపెడుతున్నారని కేంద్ర నివేదిక పేర్కొంది. లాక్డౌన్ సమయంలో కష్టాలు ఎదుర్కొన్నందున ప్రభుత్వ ఉద్యోగంపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. మహిళలు చదువుకున్నా ఇంటి పని తప్పదన్న ఉద్దేశంతో.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించింది. హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, వ్యవసాయం వంటి వాటిపై దృష్టిసారిస్తామని బాలికలు పేర్కొన్నట్టు తెలిపింది. లెక్కలు, ఇంగ్లిష్లో వెనుకబాటు తెలంగాణ గ్రామీణ యువతలో 14–18 ఏళ్ల వయసు వారిలో కూడికలు, తీసివేతలు వంటి లెక్కలు చేయగలిగినవారు 21.5 శాతమేనని కేంద్ర నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్పై కనీస అవగాహన ఉన్నవారు 41 శాతమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో పనిచేయడానికి ఆసక్తి చూపనివారిలో బాలురు 18 శాతం, బాలికలు 11.7 శాతం ఉన్నారు. పనిపై ఆసక్తి చూపనివారి విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అంశంలో దేశ సగటు రెండు శాతమే. ఉద్యోగ భద్రతకే గ్రామీణ యువత మొగ్గు ‘‘గ్రామీణ యువత జీవితంలో త్వరగా స్థిరపడాలని, ఉద్యోగ భద్రత కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర నివేదిక చెప్తోంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది పనిని ఎంచుకుంటున్నారు. అయితే సమాజ అవసరాలు కూడా ముఖ్యమే. పరిశోధనలు, ఉన్నత విద్య, వైద్య రంగంలో స్థిరపడటంలో ఆలస్యం కారణంగా తక్కువ మంది వాటివైపు వస్తున్నారు. పనిచేయడానికి ఆసక్తి చూపనివారూ ఎక్కువగా ఉండటం వెనుక కారణాలను అన్వేషించాలి. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వీనర్, ఐఏఎం, తెలంగాణ -
174 మంది విద్యార్థులు.. రూ. 61.27 లక్షలు
రాయదుర్గం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ విద్యార్థులకు చేయూత ఇచ్చేందుకు కొండాపూర్లోని చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు నడుం బిగించారు. అందుకోసం ‘క్లౌడ్ ఫండింగ్ ఫ్లాట్ఫాం ఫ్యూయల్ ఎ డ్రీమ్ డాట్కామ్’ద్వారా నిధులను సేకరించారు. పాఠశాలకు చెందిన 174 మంది విద్యార్థులు స్వచ్చందంగా ముందుకొచ్చి మూడు వారాల్లోనే రూ.61.27 లక్షలు సేకరించడం విశేషం. తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలలో చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాక్–టు–స్కూల్ కిట్ను అందించడమే లక్ష్యంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కిట్కోసం సంవత్సరానికి రూ.900 ఖర్చవుతుంది. గ్రీన్సోల్ అనే ఎన్జీఓ సహకారంతో ఈ కిట్ను తయారు చేయించారు. చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి విద్యార్థి రూ.27వేలు సేకరించడం లక్ష్యం. దీంతో 30 మంది గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే 174 మంది విద్యార్థులు రూ.61.27 లక్షలను సేకరించడంతో 6,800 మంది విద్యార్థులకు మేలు జరగనుంది. -
‘పల్లెవెలుగు’లో మరో రాయితీ టికెట్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల్లో వెళ్లే ప్రయాణికులను బస్సుల వైపు మళ్లించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ. దూరం ప్రయాణించే వారికి రాయితీ టికెట్ను అందుబా టులోకి తీసుకువచ్చింది. కొద్ది రోజుల క్రితం సంస్థ టీ9–60 పేరుతో పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికులకు రూ.100కే రాను పోను రాయితీ టికెట్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దానికి స్పందన తక్కువగా ఉండటంతో, ఇప్పుడు టీ9–30 పేరుతో 30 కి.మీ. పరిధిలో తిరిగే వారికి రూ.50కే రానుపోను వర్తించేలా రాయితీ టికెట్ను ప్రారంభించింది. ఈ టికెట్లు గురువారం నుంచి కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఆటోల్లో ప్రయాణించేవారిపై గురి.. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆటోలను ఆశ్రయి స్తున్నారు. పల్లెవెలుగు బస్సు టికెట్పై రాయితీ ప్రకటిస్తే వారిలో కొందరైనా బస్సులెక్కు తారని ఆర్టీసీ భావిస్తోంది. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లో 30 కి.మీ. నిడివిలో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు మూడున్నర లక్షలుగా ఉంది. అంతకు రెట్టింపు జనం అదే పరిధిలో ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రాయితీ టికెట్ తీసుకుంటే.. రూ.50తో గమ్యం వెళ్లితిరిగి రావచ్చు. దానికి అదనంగా రూ.20 చెల్లించి కాంబి టికెట్ తీసుకుంటే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా అదే టికెట్తో రాను, పోనూ ప్రయాణించవచ్చు. కొద్ది రోజుల క్రితం 60 కి.మీ. నిడివిలో ప్రయాణించేవారికోసం రూ.100కే రానుపోను టికెట్ తీసుకురాగా, 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో దానికి పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది డిపో మేనేజర్లు కోరటంతో కొత్త విధానం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 వరకు టికెట్ల జారీ ఉంటుంది. 30 కి.మీ. పరిధిలో పొరుగు రాష్ట్రంలో ప్రయాణం ఉంటే.. అక్కడ కూడా ఇది చెల్లుబాటు (టీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే) అవుతుందని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త టికెట్కు సంబంధించిన పోస్టర్ను బుధవారం బస్భవన్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్లు ఆవిష్కరించారు. -
18 నెలలుగా పెరగనే లేదు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల సగటు వేతన ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) తెలిపింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో ముగిసిన 18 నెలల కాలంలో వారి వేతనంలో ఎలాంటి ఎదుగుదల లేదని పేర్కొంది. రూ. 14,700 దగ్గరే ఆగిపోయినట్లు వివరించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో సగటు ఉద్యోగి (శాలరీడ్ పర్సన్) నెలవారీ సగటు వేతనం మాత్రం రూ. 20,030 నుంచి 7.5 శాతం పెరిగి రూ. 21,647కు చేరుకున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పీఎల్ఎఫ్ఐ డేటా ప్రకారం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోని దినసరి కూలీ లేదా వేతనం 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 302తో పోలిస్తే 2023–24 తొలి త్రైమాసికంలో రూ. 368కు పెరిగింది. అదే పట్టణ ప్రాంతాల్లోని క్యాజువల్ లేబర్ రోజుకూలీ రూ. 385 నుంచి రూ. 464కు పెరిగింది. దేశంలోని కార్మికశక్తిలో 46 శాతం మంది వ్యవసాయ దిగుబడులపై ఆధారపడి ఉన్నారని... కానీ ఈ ఏడాది తీవ్ర వాతావరణ మార్పులు వారికొచ్చే నెలసరీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని నివేదిక అభిప్రాయపడింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో... పట్టణాల్లో ఉత్పత్తి, సర్వీసెస్, ఇతర రంగాల్లో ఉద్యోగులు కేంద్రీకృతమైనట్లు పీఎల్ఎఫ్ఎస్ నివేదిక వెల్లడించింది. ప్రైవేటులో ఉపాధిలేమి.. పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు ప్రైవేటు రంగంలోని ఐటీ, స్టార్టప్ సెక్టార్లలో ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఉద్యోగులకు అవకాశాలు దక్కకపోవడంతో ఉపాధిలేమి కూడా వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ‘నెలవారీ హైరింగ్ ట్రెండ్స్’ దాదాపు 7 శాతం తగ్గిపోయినట్లు ‘ఫౌండిట్ ఇనసైట్స్ ట్రాకర్’ వెల్లడించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్స్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలోని మొత్తం 27 పరిశ్రమల్లో 10 శాతం ఉద్యోగాల కల్పన తగ్గినట్లు ట్రాకర్ పేర్కొంది. ఏయే రంగాల్లో వృద్ధి... ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ అధ్యయనం ప్రకారం... గతేడాది నుంచి పరిశీలిస్తే కేవలం 9 రంగాల్లో మాత్రమే ఈ–రిక్రూట్మెంట్ కార్యకలాపాలు పెరిగాయి. ఇందులోనూ షిప్పింగ్/మెరైన్ పరిశ్రమ అత్యధికంగా 45 శాతం వృద్ధిని నమోదు చేసింది. డేటా ఆధారంగా వ్యూహాలు రూపొందించుకొనే అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్–పీఆర్ పరిశ్రమలు 28 శాతం రిక్రూట్మెంట్ యాక్టివిటీ పెరుగుదల సాధించాయి. రిటైల్, ట్రావెల్, టూరిజం రంగాలు గతేడాదితో పోచ్చితే 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం... దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరగట్లేదు. దీంతో ఈ ప్రాంతాల్లోని ఉద్యోగుల నిజ వేతనాలు (రియల్ వేజ్) పెరగక ఇబ్బందిపడుతున్నారు. పట్టణ ప్రాంతాలోన్లూ అదే పరిస్థితి నెలకొంది. పైకి చూస్తే వేతనం ద్వారా నిర్ణిత ఆదాయం వస్తున్నట్లు కనిపిస్తున్నా గత నెలతో పోలిస్తే ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జనం చేతుల్లో డబ్బుల్లేక వారి కొనుగోలు శక్తి తగ్గుతోంది. దీనికితోడు ఉపాధి హామీ పనిదినాలు తగ్గడం గ్రామీణ ప్రాంత దినసరి కూలీలపై మరింత ప్రభావం చూపుతోంది. గ్రామీణ భారతంలో సగటు వేతన జీవులు ఉసూరుమంటున్నారు..అత్తెసరు వేతన ఆదాయంతో బతుకుబండిని భారంగా లాగుతున్నారు..పల్లెల్లో చాలీచాలని ఆదాయంతో సర్దుకుంటున్నారు. కేంద్ర గణాంక శాఖ పరిధిలోని నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేతన జీవి సగటు ఆదాయం గత ఏడాదిన్నర నుంచి రూ. 14,700 వద్దే నిలిచిపోయింది. మరోవైపు ఓ ప్రైవేటు సంస్థ చేపట్టిన మరో అధ్యయనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పట్టణ ప్రాంత ఉద్యోగి సగటు ఆదాయం రూ. 21,647గా నమోదైంది. -
గ్రామీణ పేదలకు ఇంటర్నెట్: మైక్రోసాఫ్ట్, ఎయిర్జల్దీ మధ్య ఎంవోయూ
హైదరాబాద్: ఇంటర్నెట్ కనెక్టివిటీ సొల్యూషన్లు అందించే ఎయిర్ జల్దీ, మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపింది. మూడేళ్ల ఎంవోయూపై ఈ రెండు సంస్థలు సంతకాలు చేశాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యానికి దూరమైన పేద ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ను ఇవి అందించనున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోకి కొత్తగా ఎయిర్ జల్దీ విస్తరించనుంది. ఈ రాష్ట్రాల్లో 20వేల కిలోమీటర్ల మేర తన నెట్వర్క్ను విస్తరించుకోవడం ద్వారా ఐదు లక్షల మంది లబ్ధిదారులకు సేవలను అందించనుంది. అలాగే, ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న తొమ్మిది రాష్ట్రాల్లో నెట్వర్క్ను బలోపేతం చేయనున్నట్టు ఎయిర్ జల్దీ తెలిపింది. -
హ్యుందాయ్ కొత్త ప్లాన్స్: గ్రామీణ భారతంపై కన్ను
హైదరాబాద్: డిజిటల్ ఫ్లోట్ వ్యాన్ల ద్వారా గ్రామీణ కొనుగోలుదారులను ఆకర్షించాల ని హ్యుందాయ్ ఇండియా వ్యూహరచన చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన ప్రకారం కారును స్వయంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించడం ఈ చొరవ ఉద్దేశం. ఇదీ చదవండి: 10.25 అంగుళాల టచ్స్క్రీన్తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా? ఇందులో భాగంగా, గ్రాండ్ ఐ10 నియోస్ను వినియోగదారుల ఇళ్ల వద్దకే పంపాలని నిర్ణయించింది. 36 డిజిటల్ ఫ్లోట్లు వచ్చే రెండు నెలల్లో 27 రాష్ట్రాల్లోని దాదాపు 582 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయాలన్నది కంపెనీ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో 61 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయడానికి 4 డిజిటల్ ఫ్లోట్లను సిద్ధం చేసింది. (తనిష్క్ 100 టన్నుల బంగారు మార్పిడి ఉత్సవాలు, ఏకంగా 20 లక్షలమంది) తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలకు బయలుదేరిన డిజిటల్ ఫోట్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభిస్తున్న కంపెనీ ప్రతినిధులను చిత్రంతో తిలకించవచ్చు. ‘‘భారత్ డైనమిక్ మార్కెట్లో చివరి మైలు ను చేరుకోవడానికి వినూత్న విధానాలను అవలంబించాలని మేము విశ్వసిస్తున్నాము. ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాము’’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
గ్రామీణంలో పుంజుకున్న ఎఫ్ఎంసీజీ వినియోగం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం తిరిగి గాడిన పడింది. ఆరు త్రైమాసికాల క్షీణత తర్వాత మార్చి క్వార్టర్లో వృద్ధి నమోదైంది. డేటా విశ్లేషణ సంస్థ ‘ఎన్ఐక్యూ’ ఈ వివరాలను విడుదల చేసింది. ఎఫ్ఎంసీజీ విక్రయాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35%గా ఉంటుందని పేర్కొంది. అయితే ఆరు త్రైమాసికాల తర్వాత అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదు కాలేదు. అతి స్వల్పంగా 0.3 శాతమే పెరిగాయి. కాకపోతే దీన్ని సానుకూలంగా ఐక్యూ నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు 5.3%పెరిగినట్టు వెల్లడించింది. దీనికంటే ముందు గ్రామీణ మార్కెట్ చివరిగా 2021 ఏప్రిల్–డిసెంబర్ కాలంలో వృద్ధిని చూడడా న్ని ఈ నివేదిక ప్రస్తావించింది. మొత్తం మీద మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో అమ్మకాల పరంగా 3.1%, విలువ పరంగా 10.1% వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పుంజుకోవడానికి తోడు, సంప్రదాయ అమ్మకాలు పెరగడం సానుకూల వృద్ధికి దోహదపడింది. ఆహారోత్పత్తులకే ఆదరణ.. ఆహారోత్పత్తుల అమ్మకాలు 4.3 శాతం వృద్ధి చెందాయి. ఆహారేతర వినియోగం కేవలం 0.2 శాతం పెరిగింది. ఆహారం కాకుండా, గృహ సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లలో వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. సంప్రదాయ కిరాణా దుకా ణాల్లో అమ్మకాలు కేవలం 1.9 శాతమే పెరగ్గా, ఆధునిక అంగళ్లు అయిన హైపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు 14.6 శాతం వృద్ధిని చూశాయి. వీధి చివర్లో ఉండే కిరాణా దుకాణాల్లో ఎలాంటి డిస్కౌంట్లు ఉండకపోగా, పెద్ద షాపింగ్ మాల్స్ మంచి ఆఫర్లతో తక్కువ మార్జిన్తో విక్రయిస్తుండడం ఈ పరిణామాలకు నిదర్శనం. ఎఫ్ఎంసీజీలో చిన్న కంపెనీఈలు అమ్మకాల పరంగా 7.2 శాతం వృద్ధిని చూస్తే, పెద్ద కంపెనీలకు ఇది 3.2 శాతంగానే ఉంది. ఇక్కడ కూడా అంతే, చిన్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు తక్కువ మార్జిన్లతో తక్కువ ధరలకు విక్రయిస్తుండడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. -
70 ప్లస్... తగ్గేదేల్యా!.. ఫొటో వైరల్
గోవాలో గ్రామీణ బామ్మలు సర్ఫ్బోర్డులతో సర్ఫింగ్కు వెళితే? అనే ఊహను ఏఐ సాంకేతికతతో నిజం చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఆశిష్ జోస్ అనే యూజర్ ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ‘నానీస్ ఎట్ ది బీచ్’ అని క్యాప్షన్ ఇచ్చిన ఈ ఫోటోపై యూజర్స్ నుంచి రకరకాల కామెంట్స్ వచ్చాయి. ‘ఫొటో కాదు. బామ్మలు నిజంగానే సర్ఫింగ్ చేస్తే ఎంత బాగుండేదో’ అని ఒకరు కామెంట్ రాస్తే, మరొకరు ‘వెండి వొరెల్ వీడియో చూడండి చాలు’ అని సలహా ఇచ్చారు. టెక్సాస్కు చెందిన వెండి వొరెల్ వయసు 70 సంవత్సరాల పైమాటే. ఈ వయసులోనూ సర్ఫింగ్ చేస్తూ ‘ఉమెన్ ఆఫ్ ది వేవ్’గా పేరు తెచ్చుకొని ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. చదవండి: ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే? -
స్టార్టప్లకు స్వర్గధామం.. టీఎస్ఐఆర్ఐఐ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పురుడు పోసుకున్న పలు అంకుర పరిశ్రమలు ఇప్పుడు పల్లెబాట పట్టనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పనకు బాటలు పరిచే అంకుర పరిశ్రమలకు ఆర్థిక చేయూతనందించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ) అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు ఆయా స్టార్టప్లకు రూ.30 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేసే అవకాశాలున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఇందులో ప్రయోగాత్మకంగా చేపట్టే ప్రాజెక్టులకు సైతం సాయం అందుతుందని స్పష్టం చేశాయి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ ఇంపాక్ట్ ఇన్సెంటివ్స్ (టీఎస్ఐఆర్ఐఐ) పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపాయి. ► ఈ పథకం అమలుకు సంబంధించిన బాధ్యతలను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఆర్థిక సాయం సూక్ష్మ, చిన్న, కుటీర, మధ్యతరహా పరిశ్రమలు, వీటికి సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేసే స్టార్టప్ సంస్థలకు వర్తిస్తుందని తెలిపాయి. ఈ పథకానికి సంబంధించి హెచ్టీటీపీఎస్://టీమ్టీఎస్ఐసీ.తెలంగాణ.జీఓవీ.ఐఎన్/టీఎస్ఐఆర్ఐ–ఇన్సెంటివ్స్/ అనే సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న సంస్థలను టీఎస్ఐసీ ఏర్పాటు చేసిన గ్రాస్రూట్స్ అడ్వైజరీ కౌన్సిల్ మూల్యాంకనం చేస్తుందని.. ఆయా సాంకేతికత ద్వారా ఒనగూరే ప్రయోజనాలను విశ్లేషిస్తుందని టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. నగరం నుంచి పల్లెలకు... ► నగరంలో అంకుర పరిశ్రమలకు స్వర్గధామంలా మారిన టీహబ్లో నూతనంగా వందలాది స్టార్టప్లు పురుడు పోసుకున్న విషయం విదితమే. వీటిలో ప్రధానంగా ఐటీ, అనుబంధ రంగాలు, సేవలు, బ్యాంకింగ్, హెల్త్కేర్, ఇన్సూరెన్స్ ఇతర సేవారంగ విభాగానివే అత్యధికంగా ఉన్నాయి. ఈ నూతన పథకంతో స్టార్టప్లు ఇప్పుడు నగరంలోనే పురుడు పోసుకున్నప్పటికీ.. పల్లెలకు తరలివెళ్లనున్నాయి. (క్లిక్: హెచ్ఎండీఏ ప్లానింగ్లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే) ► గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ, హార్టికల్చర్, చేనేత, ఇతర కుటీర పరిశ్రమలకు సాంకేతిక దన్ను అందించడం, వారి ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్టార్టప్లు రూపొందించే టెక్నాలజీ దోహదం చేయనుంది. ఈ సంస్థలు రూపొందించే ఉత్పత్తులు లేదా సాంకేతికత గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఈ పథకం ఉద్దేశమని నిపుణులు చెబుతుండడం విశేషం. -
గ్రామాలకూ డిజిటల్ చెల్లింపులు
ముంబై: చిన్న పట్టణాలు, గ్రామాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో.. పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (పీఐడీఎఫ్) పథకం కింద సెప్టెంబర్ నాటికి 2.46 లక్షల డివైస్లు అందుబాటులోకి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. వీటిలో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్), మొబైల్ పీవోఎస్, జనరల్ పాకెట్ రేడియో సర్వీస్, పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్ ఉన్నాయని వివరించింది. పీఐడీఎఫ్ పథకం కింద యూపీఐ క్యూఆర్, భారత్ క్యూఆర్తోసహా 55,36,678 డిజిటల్ పరికరాలు ఏర్పాటయ్యాయి. పథకంలో భాగంగా విక్రేతలకు అధీకృత కార్డ్ నెట్వర్క్స్, బ్యాంక్లు సబ్సిడీతో పరికరాలను మంజూరు చేస్తాయి. ఈ స్కీమ్ కోసం ప్రస్తుతం రూ.614 కోట్ల నిధి ఉందని ఆర్బీఐ తెలిపింది. -
పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు (కేసీఆర్) ఆదివారం సమీక్ష నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సీఎం సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల తదుపరి లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. వెబ్సైట్ నిలిపివేత! -
స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్గా సోనూ సూద్
సాక్షి, న్యూఢిల్లీ: డిజిస్పైస్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ, స్పైస్ మనీకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటుడు సోనూ సూద్ వ్యవహరించనున్నారు. డీల్లో భాగంగా సోనూ సూద్కు చెందిన సూద్ ఇన్పోమేటిక్స్ (సీఐఎల్) సంస్థకు స్పైస్ మనీలో 5 శాతం వాటాను కేటాయిస్తారు. సోనూ సూద్ను నాన్-ఎగ్జిక్యూటివ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్గా నియమిస్తారు. కరోనా కల్లోలం చెలరేగినప్పు డు, లాక్డౌన్ కాలంలో ఆపన్నులకు అండగా నిలిచిన సోనూ సూద్ కార్యక్రమాల్లో కొన్నింటిని కొనసాగిస్తామని స్పైస్ మనీ తెలిపింది. కోటి మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలను డిజిటల్గా, ఆర్ధికంగా శక్తివంతం చేసే లక్ష్యంతో ఉన్నామని స్పైస్ మనీఫౌండర్ దిలీప్ మోడీ వెల్లడించారు. ఇదే లక్ష్యంతో భాగస్వామిగా సోను సూద్లో ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. గ్రామీణులు తమ ఇళ్లను, కుటుంబాలను విడిచిపెట్టకుండా స్వతంత్ర జీవనోపాధిని సంపాదించేందుకు అవసరమైన సాంకేతిక శక్తిని అందిస్తామని ‘భారత్’ ప్రతి మూలలో స్వావలంబన, వ్యవస్థాపకత, ఆర్థిక పరిపుష్టికి ప్రోత్సహించనున్నామని తెలిపారు. ఆత్మనీర్భర్ భారత్ కోసం , ప్రతీ గ్రామాన్ని డిజిటల్గా బలోపేతం చేయడం కోసం స్పైస్ మనీతో తన అనుబంధం ఉపయోగపడనుందని విశ్వసిస్తున్నానని ఈ సందర్భంగా సోనూ సూద్ తెలిపారు. -
‘సీ’ ఫర్ చోర్.. నెహ్రూ దొంగల ప్రధాని
-
‘సీ’ ఫర్ చోర్.. నెహ్రూ దొంగల ప్రధాని
రాంచీ : జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాల్లో టీచర్ బోధించిన పాఠాలు విద్యావ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. హిందీ అక్షరమాల బోధిస్తున్న సదరు టీచర్ చ- అంటే చోర్( దొంగ) అని, భారత తొలి ప్రధాని పండిట్ జవహార్లాల్ నెహ్రూ దొంగల ప్రధాని అని బోధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్లోని కుతి గ్రామ ప్రభుత్వ పాఠశాల్లో ఈ ఘటన చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాఠశాలకు భవన సౌకర్యం లేకపోవడంతో ఆ టీచర్ చెట్టు కింద బోర్డుపై పిల్లలకు హిందీ అక్షరమాల నేర్పించాడు. ఇందులో భాగంగా చ- అంటే చోర్ అని, చాచా నెహ్రూ దొంగల ప్రధాని అనే వ్యాఖ్యాన్ని చెబుతూ .. పిల్లలతో చెప్పించాడు. ఇలా భోదిస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి మీడియాకు అందించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులను వివరణ కోరగా.. విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యాశాఖ తరుఫున క్షమాపణలు తెలుపుతున్నామన్నారు. అయితే ఇలా టీచర్లు ఇంకిత జ్ఞానం లేకుండా బోధించడం తొలి సారేం కాదు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. అయితే బోధించే పాఠ్యంశంపై అవగాహన లేని టీచర్లు ఎందరో ఉంటున్నారని, వీరంతా పరీక్షల్లో అవతవకలు పాల్పడి ఉద్యోగాలు పొందుతున్నట్లు విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
42,990 కొత్త ఓటర్లు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా 42,990 మం ది ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు. దీంతో గతేడాది 10,02,949గా ఉన్న జిల్లా ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 10,45,939కి చేరింది. ఇందు లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉండడం విశేషం. 4,99,682 మంది పురుష ఓటర్లు ఉండగా, 5,46,178 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 1,974 మంది ఎక్కువగా ఉన్నారు.ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పుల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో.. తాజా వివరాలను జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ అధికారులు బుధవారం విడుదల చేశారు. జిల్లాలో గతంలో 1379 ఉన్న పోలింగ్ స్టేషన్లలో 40 తగ్గించి 1339కి కుదించారు. కొత్తగా ఓటర్ల నమోదుతో పాటు ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కొత్తగా నమోదు, చేర్పులు, మార్పులు, అభ్యంతరాలను స్వీకరించి అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో జాబితాలు ప్రదర్శించారు. అక్కడి నుంచి వివరాలను తెప్పించుకున్న కలెక్టరేట్ అధికారులు తుది జాబితాను బుధవారం విడుదల చేశారు. అత్యధిక ఓటర్లు ‘రూరల్’లోనే.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోనే అత్యధికంగా కొత్తగా ఓటర్లు నమోదయ్యారు. 38,704 మంది కొత్తగా తమ పేరు నమోదు చేసుకోగా, మొత్తం ఓటర్ల సంఖ్య 1,94,481కి చేరింది. అలాగే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1,349 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. 1,95,974తో జిల్లాలోనే అత్యధిక ఓటర్లు గల నియోజకవ వర్గంగా ‘రూరల్’ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం 3,512 మంది కొత్త ఓటర్ల నమోదుతో 1,60,692కి చేరగా, బోధన్ నియోజకవర్గంలో 822 ఓటర్లు తగ్గి 1,66,428కి చేరింది. అలాగే బాన్సువాడ నియోజకవర్గంలో 438 మంది కొత్త ఓటర్లు పేరు నమోదు చేసుకోగా, ఓటర్ల సంఖ్య 1,50,006కు పెరిగింది. బాల్కొండ నియోజకవర్గంలో కొత్తగా 685 మంది పేర్లు నమోదు కాగా, ఓటర్ల 1,78,358కి చేరింది. -
గ్రామీణ అభ్యర్థుల హవా!
- కానిస్టేబుల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు - జిల్లా టాపర్గా నాన్లోకల్ అభ్యర్థి - డి.హాసన్, ఎం.శ్రీనివాసులుకు 2, 3 ర్యాంకులు - పేదింటికి చెందిన మహేష్కు 9వ ర్యాంకు కర్నూలు సిటీ: పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు సత్తా చాటారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో ఈ విషయం రుజువైంది. జిల్లాలో 180 సివిల్, 35 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలకు గతేడాది నవంబరు 8న ప్రిలీమనరీ, ఈ ఏడాది జనవరి 17వ తేదిన మెయిన్స్ పరీక్షలు జరిగాయి. కడప జిల్లాకు చెందిన డి.శ్రీధర్రెడ్డి 154 మార్కులతో నాన్లోకల్ కేటగిరీలో జిల్లా టాపర్గా నిలిచారు. ఆ తర్వాత డి.హాసన్ బాషా 152 మార్కులతో ద్వితీయ ర్యాంకు, 151 మార్కులతో ఎం.శ్రీనివాసులు మూడో ర్యాంకు సాధించారు. బుడగ జంగాల వర్గానికి చెందిన మహేష్ 9వ ర్యాంకు సాధించారు. కూలీ పనికి పోతేగానీ పూట గడవని స్థితిలోని కుటుంబం, మట్టిని నమ్ముకున్న ఓ రైతు ఇంట పుట్టిన బిడ్డలు పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించారు. - పాములపాడు మండలం ఎర్రగూడురుకు చెందిన బుడగ జంగం సామాజిక వర్గానికి చెందిన ఎం.గంగన్న, ఎం.జానమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, కూతురు. గంగన్న వివాహం కాకముందు ఊరూరా తిరుగుతూ సంచార జీవితం గడిపే వారు. జానమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత ఎర్రగూడురులో స్థిరపడ్డారు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించేవారు. అయితే తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన పెద్ద కుమారుడు మధు, కూతురు సుజాత తమ్ముళ్ల చదువు కోసం వారు మధ్యలోనే చదువు మానేశారు. రెండో కుమారుడు ఎం.మహేష్ ప్రస్తుతం కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో జిల్లా స్థాయి 9వ ర్యాంకు సాధించారు. చివరి కొడుకు రాఘవేంద్ర సైతం ఇటీవలే ఆర్మీ ఉద్యోగం సాధించి బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు. - వెలుగోడు మండలం వెల్పనూరుకు చెందిన మాచర్ల వెంకటరమణ, ఎం.నాగలక్ష్మమ్మ దంపతులు వ్యవసాయం చేస్తుంటారు. నాలుగెకరాలు భూమి ఉంది. వీరికి ఇద్దరు కూమారులు. పెద్దవాడు ఎం.శ్రీనివాసులు 151 మార్కులు సాధించి జిల్లాలో మూడో ర్యాంకర్గా నిలిచారు. ప్రాథమిక చదువంతా వేల్పనూరులో సాగింది. నంద్యాల వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో ఇంటర్, కడప కె.ఎస్.ఆర్.ఎమ్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తి చేశారు. మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. హోంగార్డు నుంచి కానిసేబుల్ పోస్టుకు ఎంపిక.. పోలీసు శాఖలో హోంగార్డుగా సేవలు అందిస్తున్న వారు సైతం కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. దేవనకొండ మండలం పూల్లాపురం గ్రామానికి చెందిన డి.రామకృష్ణారెడ్డి 2012 నుంచి హోంగార్డుగా పని చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ ఓపెన్ స్కూల్ విధానంలో పూర్తి చేశారు. హోంగార్డుగా పని చేస్తూ కానిస్టేబుల్ పోస్టులకు ఎస్.వి.ఆర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నాడు. సి.బెళగల్కు చెందిన హరిప్రసాద్, పి.ఆంజనేయులు, ఈ.రామన్గౌడు తదితరులు కూడా హోంగార్డులుగా పని చేస్తూ సివిల్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
– 96.96 శాతం హాజరు – గైర్హాజరైన వారిలో సైన్స్ విద్యార్థులే అధికం కర్నూలు సిటీ: బుధవారం నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరే సమయంపై ముందు నుంచే అధికారులు ప్రచారం కల్పించ పోవడంతో అక్కడక్కడ కొంత ఆలస్యంగా కేంద్రాలకు చేరుకున్నారు. అదే విధంగా మరి కొన్న చోట్ల పరీక్ష సమయానికి చేరుకోలేక పోయిన వారికి అనుమతించక పోవడంతో విద్యార్థులు కన్నీళ్ళు పెట్టుకుంటు వెనుదిరిగారు. 1213 మంది విద్యార్థులు గైర్హాజరు : జిల్లాలో ఉన్న 218 జూనియర్ కాలేజీలకు చెందిన మొత్తం 39963 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు వచ్చాయి. వివిధ కారణాల వల్ల 38750 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 1213 మంది పరీక్షలకు హాజరు కాలేకపోయినట్లు ఆర్ఐఓ తెలిపారు. మొదటి రోజు జిల్లాలో ఎక్కడ కూడా మాల్ ప్రాక్టిస్ కానీ, కాపీయింగ్ జరుగలేదని అధికారులు పేర్కొన్నారు. హాజరుకానివారిలో సైన్స్ విద్యార్థులే అధికం: నిర్ణీత హాజరు శాతం లేని సైన్స్ విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వక పోవడంతో చాలా మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్ట్స్ విద్యార్థులకయితే నిర్ణీత రుసం చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చు. అయితే మంగళవారం బ్యాంకు అధికారుల ధర్నా వల్ల బ్యాంకులు తెరుచుకోలేదు. ఈ కారణంతో మరి కొంతమంది విద్యార్థులు హాల్ టికెట్లు పొందలేకపోవడంతో పరీక్షలు రాయలేకపోయారు. ఈ విషయంపై ముందు నుంచే విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చిరించినా బోర్డు అధికారులు సరైన రీతిలో స్పందించక పోవడం వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేక పోయారని తెలుస్తోంది. నిర్ణీత సమయానికి కేంద్రాలకు...! ఇంటర్ బోర్డు అధికారులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించిన మేరకు కేంద్రాలకు చేరుకున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రమే కొంత ఆలస్యంగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. మరికొన్ని చోట్ల నిర్ణీత సమయానికి చేరుకోలేక పోయారని వెనిక్కి పంపించారు. ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డి నగరంలోని వాసవి, కోల్స్, అమరావతి జూనియర్ కాలేజీలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ... నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. పరీక్షల నిర్వహణపై కళాశాల ప్రిన్సిపల్ సునీతను అడిగి తెలుసుకున్నారు. -
పల్లె–నగరం మధ్య తేడాలు
నగర గీతం అందమైన సహజ ప్రకృతి.. పల్లె – కృతకమైన అందాల ముల్లె.. పట్నం. పల్లె ఆత్మీయతల సంగమం – నగరంలో ఎవరికి వారే ఏకాకి. పల్లెలో స్వచ్ఛమైన ప్రకృతి – నగరంలో సమస్తం కలుషిత భరితం. పల్లెల్లోని మనుషుల మనసుల్లో మలినం లేదు – నగరాల్లో కుట్రలు, దగాలు, వంచనలు. పల్లెల్లో పరిమళించే మానవత్వం – నగరంలో అంతా యాంత్రికత. పల్లెల్లో డబ్బులేకున్నా పరిచయాలతో పనులు సమకూరుతాయి. నగరంంలో పైసా లేకుండా ఏ పనీ జరగదు. పల్లెల్లో పరస్పర గౌరవ మర్యాదలు – నగరంలో ఎవరూ ఎవ్వరినీ లక్ష్యపెట్టరు. నగర జీవికి తీరిక దొరకదు, కోరిక చిక్కదు. ఇక్కడ జీవితం చాలా ఖరీదైంది. ఎంత సంపాదించినా చాలదు. ఎంత డబ్బున్నా అంతకు మించిన విలాసవంతమైన జీవితం ఊరిస్తూ ఉంటుంది. అందుకే ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని డబ్బు సంపాదించాలనుకుంటారు. దీంతో తీరిక సమయం దొరకదు. ఏ కోరికలు నెరవేర్చుకోవడానికి అంత కష్టపడుతుంటారో ఆ అవకాశాలు మాత్రం ఎప్పటికీ అందని ద్రాక్షలాగే ఉండిపోతాయి. ఖరీదైన జీవనశైలి ఇక్కడి మనుషులకు పెను సవాలుగా నిలుస్తుంది. నగర జీవితంలోని ప్రతికూలాంశాలు – కఠిన వర్ణన: జగిత్యాలలో స్వేచ్ఛగా జీవిస్తూ తనకిష్టమైన కవిత్వం, కళారాధనలో హాయిగా గడిపే అలిశెట్టి ప్రభాకర్.. నగర జీవితంలో ఇరుక్కుపోయారు. పేదరికాన్ని, దీనస్థితినే కడుపారా అనుభవించిన ఈ యువ కవి తన అనుభవాలను అక్షరాయుధాలుగా చేసి కవితలు రాశారు. అందుకే ఆయన అనుభవాల్లో నగరంలోని ప్రతికూలాంశాలే ఎక్కువగా ఉన్నాయి. అవి ‘సిటీలైఫ్’ కవితల్లో ప్రతిఫలించాయి. నగరంలో జీవన విధానం: నగరంలో మనిషి జీవితం అంతుచిక్కని అయోమయం. కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటుంది. నిరంతరం ప్రమాదాల అంచున ప్రయాణం. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. కాలంతో పోటీపడుతూ ఉరుకులు–పరుగులు పెట్టడం ఇక్కడి ప్రత్యేకత. ఎవరికీ తీరిక చిక్కదు. తీరని కోరికల చిట్టా పెరుగుతూనే ఉంటాయి. సహజమైన ఆనందం దుర్లభం. అంతా కృత్రిమం, యాంత్రికం, వంచనలమయం. అంతుచిక్కని రసాయనశాల లాంటి నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఈ పద్మవ్యూహం లాంటి నగరంలో ప్రవేశిస్తే బయటపడటం కష్టం. నగరజీవనం సంక్లిష్టంగా మారడానికి కారణాలు: శరవేగంగా పెరుగుతున్న జనాభా వల్ల సౌకర్యాలు సరిపడకపోవడం, అవసరాలు పెరిగిపోవడంతో జీవనవ్యయం ఖరీదవుతోంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి తగినంత డబ్బు సంపాదించడం అవసరమవుతోంది. ఎంత సంపాదించినా చాలడం లేదు. అందుకే పోటీతత్వం పెరుగుతోంది. మనుషుల మధ్య ఆత్మీయతలకు బదులు అంతరం పెరిగిపోతుండటం వల్ల పరస్పరం మర్యాద, నమ్మకం స్థానంలో నిర్లక్ష్యం, వంచన పెరిగిపోతున్నాయి. సంపాదించే యంత్రాలుగా మారుతున్న మనుషుల్లో సున్నితత్వం, సహృదయత కొరవడి అకారణ ద్వేషాలు, పగలు–ప్రతీకారాలు అధికమవుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే. ఒకే కుటుంబంలోని మనుషుల మధ్య కూడా ఆత్మీయతలు లేవు. మమతాభిమానాలు కొరవడ్డాయి. నిర్లక్ష్యం, వేగం, అలసత్వం, బేఖాతరు లాంటి కారణాల వల్ల నిరంతరం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల బారినపడ్డవాళ్లను పలకరించి, పట్టించుకునేవారు కరువయ్యారు. అందరూ కలిసి జీవిస్తున్నా, ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడంతో అందరూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇన్ని వైవిధ్యాల నడుమ గడిచే సిటీ జీవితం ఒక రసాయనశాలగా, పద్మవ్యూహంలా నానాటికీ అంతుచిక్కకుండా సంక్లిష్టంగా తయారవుతోంది. పై అంశాల ఆధారంగా ఏ ప్రశ్న వచ్చినా చక్కగా ఆలోచించి జవాబు రాసేందుకు విద్యార్థులు సంసిద్ధం కావాలి. మాదిరి ప్రశ్నలు 1.నగరగీతం పాఠం ఆధారంగా నగర జీవనంలోని మంచి, చెడులను విశ్లేషించండి? (6 మార్కులు) 2.పల్లె ప్రజలు నగరబాట పట్టడానికి కారణాలేమిటి? (3 మార్కులు) 3.పల్లె.. తల్లి ఒడి, పట్టణం.. ఇనప్పెట్టె. ఈ వాక్యాన్ని సమర్థించండి. 3 మార్కులు) 4.నగర గీతం పాఠం ద్వారా అలిశెట్టి ప్రభాకర్ ఏం చెప్పదలచుకున్నారు? (6 మార్కులు) 5.నగరంలోని ప్రతి మనిషీ పఠనీయ గ్రంథం అని కవి పేర్కొనడంలో అంతరార్థమేమిటి? (3 మార్కులు) 6.నగరాన్ని పద్మవ్యూహమని, రసాయనశాల అని కవి ఎందుకు అన్నాడో వివరించండి. (6 మార్కులు) -
ముగిసిన జన్మభూమి–మా ఊరు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నాల్గో విడత జన్మభూమి– మా ఊరు కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ నెల 2న ప్రారంభమైన ఈ కార్యక్రమం 10 రోజుల పాటు జరిగింది. జిల్లాలో 897 గ్రామ పంచాయతీలు, 270 మున్సిపల్ వార్డులు మొత్తంగా 1167 జన్మభూమి సభలు జరిగాయి. గత ఏడాది జన్మభూమి కార్యక్రమంతో పోలిస్తే ఈ సారి వినతులు తగ్గిపోయాయి. మంగళవారం నాటికి గ్రామీణ ప్రాంతాల్లో వివిధ సమస్యలపై 34,627, పట్టణ ప్రాంతాల్లో 8979 ధరఖాస్తులు వచ్చాయి. -
కిరాణ షాపులకు తక్కువ ధరకే సరుకులు
–రూరల్ రిటైల్ చైన్తో ప్రయోజనం –డీపీఎం వసంత కర్నూలు(హాస్పిటల్): గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న కిరాణాషాపుల్లో విక్రయించేందుకు అవసరమైన సరుకులను తక్కువ ధరకే రూరల్ రిటైల్ చైన్ ద్వారా అందజేయనున్నట్లు డీఆర్డీఏ–వెలుగు డీపీఎం వసంత చెప్పారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రూరల్ రిటైల్ చైన్ కింద జిల్లాలో జూపాడుబంగ్లా, కొత్తపల్లి, బేతంచెర్ల, పెద్దకడుబూరు, దేవనకొండ మండలాలను ఎంపిక చేశారన్నారు. ఈ మండలాల్లో చిన్న చిన్న కిరాణాషాపులను గుర్తించి 50 మందికి పైగా సభ్యులతో మండల నోడల్ స్టోర్గా ఏర్పాటు చేసి మేనేజర్ను నియమిస్తారన్నారు. ఆ మేనేజర్ ద్వారా ఎంపికైన వారిచే రూ.5000ల చొప్పున వాటాధనం కట్టిస్తారన్నారు. అనంతరం జిల్లా కో ఆపరేటివ్ కార్యాలయంలో ఎంపికైన బాడీని రిజిస్టర్ చేయిస్తారని తెలిపారు. ఈ సంఘానికి వ్యాట్, పాన్కార్డు తీసుకున్న అనంతరం ప్రభుత్వం రూ.10లక్షలు మూలధనం ఇస్తుందన్నారు. వాటాధనం, ప్రభుత్వ మూలధనం కలిపి సరుకులను ఉత్పత్తి చేసే కంపెనీల నుంచే టోకుగా సరుకులు కొనుగోలు చేస్తారన్నారు. సంఘంలో సభ్యులైన కిరాణాషాపుల వారు మండల నోడల్ స్టోర్ నుంచి తక్కువ ధరకు సరుకులను కొనుగోలు చేసి విక్రయించవచ్చన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ఈ విధానం జూపాడుబంగ్లాలో అమలు చేస్తున్నామని, మిగిలిన మండలాల్లో సభ్యులను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. -
గ్రామీణ మౌలిక అభివృద్ధికి ముందడుగు
ఈ బడ్జెట్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. నీటిపారుదల సౌకర్యాలు మెరుగు పడటానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనికి తోడు రైతులకు వ్యవసాయ రుణాలకు అత్యధికంగా 9 లక్షల కోట్లు, ఎంఎన్ ఆర్ ఈజీఏ కి అత్యధికంగా 38,500 కోట్లు కేటాయించడం గ్రామీణ ఆర్థిక ప్రయోజనాలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. బడ్జెట్లో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకానికి 19,000 కోట్లు కేటాయించడం.. గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంచడంలో ముందడుగు వేసినట్లేనంటూ రాజ్ నాథ్.. అరుణ్ జైట్లీ బడ్జెట్ ను అభినందించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు ఈ ఏడాది బడ్జెట్ అనుకూలంగా ఉందని, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. అంతేకాక రహదారుల అభివృద్ధికి 55 వేల కోట్లు కేటాయించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. మౌలిక రంగంలో పెట్టుబడులతోపాటు, రైల్వేలో మూలధన వ్యయం కలిపి 2.2 లక్షల కోట్లు అధిగమిస్తుందని హోం మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఈ ఏడు బడ్జెట్ ముఖ్యంగా పేదల పెన్నిధిగా ఉందని, ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆరోగ్య బీమా పథకం ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయం అన్నారు. గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి 2,87,000 కోట్లు కేటాయించడం పంచాయితీరాజ్ సంస్థల బలోపేతానికి దీర్ఘకాలికంగా ఫలితం ఉంటుందని అన్నారు. తయారీ రంగ అభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూడ ఎన్డీఏ ప్రభుత్వం ఈ బడ్జెట్లో అనేక ప్రయోజనాలు కల్పించిందని హోంమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వైద్యానికి కొత్త మొబైల్ యాప్..!
కర్ణాటక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత గర్భిణులు, తల్లీ పిల్లల ఆరోగ్య సేవల్లో సుయోజన యాప్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. పేషెంట్ కు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేందుకు సహకరిస్తోంది. ఎప్పటికప్పుడు గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు, వివరాలను నమోదు చేసుకొని అత్యవసర సమయంలో తక్షణ వైద్యం అందించేందుకు ఈ సింపుల్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మొబైల్ ఆధారిత వైద్య సేవలతో మారుమూల గ్రామాల్లో తక్షణ వైద్యం అందించగల్గుతున్నారు. ఇమ్మునైజేషన్ వంటి వైద్యపరమైన సమస్యలను గుర్తించేందుకు, గర్భిణుల నమోదు, సేవలు అందించడం వంటి వాటిలో ఏఎన్ ఎంలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయితే ఈ సాధారణ మొబైల్ యాప్ తో వారు సమర్థవంతంగా విధులను నిర్వర్తించేందుకు చక్కగా పనికి వస్తోంది. కర్నాటక ఛామరాజ్ నగర్ కు చెందిన రోహిణి రూరల్ ఏరియాల్లో ఏఎన్ఎం గా పనిచేస్తున్నారు. నిజానికి ఆమె తన విధులను నిర్వహించడంలో ఎంతో చురుకుగానూ, ఆసక్తిగానూ ఉంటారు. అయినప్పటికీ ఒక్కోసారి పేషెంట్లకు కావాల్సిన సమాచారాన్ని అందించడంలో కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చేది. క్లిష్టమైన సందర్భాల్లో కీలకమైన కేసుల వివరాలను తెలుసుకోవాల్సి వచ్చినపుడు.. ఆమె ఓ పద్ధతి ప్రకారం వాటిని గుర్తుంచుకోవడం కష్టంగా మారింది. దీంతో ఇటీవల రోహిణి సుయోజన యాప్ వాడకం ప్రారంభించింది. ఈ మొబైల్ బేస్డ్ అప్లికేషన్ వాడకం ప్రసూతి, పిల్లల సంరక్షణ చర్యల్లో ప్రస్తుతం ఆమెకు ఎంతో సహకరిస్తోంది. పరీక్షలు నిర్వహించేందుకు, పరిశోధనలు జరిపేందుకు సుయోజన యాప్ మార్గదర్శకంగా ఉందని రోహణి అంటోంది. ఒక దశలో పనిని వాయిదా వేసే అవకాశం లేనప్పుడు ఎమర్జెన్సీని బట్టి వారికి తక్షణ చికిత్స అందించాల్సి వచ్చినపుడు యాప్ ఎంతో ఉపయోగపడుతోందని రోహిణి చెప్తున్నారు. చిన్న టెక్నాలజీని వాడుకోవడంతో ఎంతోమంది ఏ ఎన్ ఎం లు రోగులకు ప్రత్యేక సేవలు అందించగల్గుతున్నారని కూడ రోహిణి చెప్తోంది. సుయోజన యాప్ ను వెనుకబడిన వారికి సేవలు అందించేందుకు స్వాస్థి హెల్త్ రిసోర్స్ సెంటర్ ప్రవేశ పెట్టింది. కరుణ ట్రస్ట్ , డి. ట్రీ ఇంటర్నేషనల్ సహకారంతో సామాజికంగా వెనుకబడ్డి వర్గాలకు ఈ యాప్ సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అయితే స్వాస్థి ద్వారా ప్రజారోగ్య సేవలు అందించడం ప్రారంభించి సుమారు పదకొండు సంవత్సరాలు అయింది. ప్రస్తుతం సేవలను వివిధ కోణాల్లో అట్టడుగు స్థాయినుంచి సమర్థవంగా అందించేందుకు, ఏ ఎన్ ఎం ల కు పని సులభతరం అయ్యేందుకు ఈ మొబైల్ యాప్ ను వాడకంలోకి తెచ్చినట్లు స్వాస్థి డైరెక్టర్ బాబా కార్కల్ చెప్తున్నారు. పారా మెడికల్ సిబ్బంది తక్షణ వైద్య సేవలు అందించాల్సి వచ్చినప్పుడు సరైన నిర్ణయాన్ని తీసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుంది. ఇది లేని సందర్భాల్లో ఏఎన్ ఎం లు అందించాల్సిన కొన్ని క్లిష్టమైన సేవలను కూడ దాట వేసే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. ఈ మొబైల్ ఆధారిత వైద్య చికిత్స ప్రసవానికి ముందు, ప్రసవానంతరం బిడ్డల రక్షణకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. కొత్తగా పుట్టిన పిల్లల సంరక్షణకు కావాల్సిన కౌన్సెలింగ్ కు, వారి గుండె కొట్టుకునే తీరు గమనించడంతోపాటు ప్రతి లక్షణాన్ని గుర్తించే అవకాశం ఈ యాప్ తో కలుగుతుందని నిర్వాహకులు అంటున్నారు. రామరాజనగర్ జిల్లాలో మార్చి 2014 లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఆసక్తికరమైన యాప్ సేవలు కర్ణాటకలోని నాలుగు జిల్లాలో 31 మంది ఏఎన్ ఎం లు అందిస్తున్నారు. యూజర్ ఫ్రెండ్లీ గా ఈ యాప్ లో కన్నడలో సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ను గురించి ముందుగా దీన్ని వినియోగించే ఏఎన్ ఎం లకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి కాగానే సేవలు అందించడంలో వారికి వచ్చే సమస్యలను తీర్చేందుకు ఓ సూపర్ వైజర్ ను కూడ అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం ఈ యాప్ ను శిక్షణ తీసుకున్న ఏఎన్ ఎం ల మొబైల్స్ లో మాత్రమే ఇన్ స్టాల్ చేస్తున్నారు. అయితే యాప్ ద్వారా సేవలు అందించడం వల్ల ఏఎన్ఎం లకు కొంతవరకు ఇబ్బందులు తగ్గినప్పటికీ ప్రభుత్వ అంగీకారం కోసం మాత్రం వీరి బృందం పోరాటం చేయాల్సి వస్తోంది. యాప్ కోసం నిధులు సమకూర్చిన నలుగురు సభ్యులున్న డి-ట్రీ ఇంటర్నేషనల్ తమ ప్రాజెక్టు మరికొన్ని జిల్లాల్లో ప్రవేశ పెట్టేందుకు యోచిస్తోంది. -
బేస్రేటుకే గ్రామీణులకు గృహ రుణం
- ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయం - రూ. 15 లక్షల వరకూ రుణసౌలభ్యం ముంబై: బేస్రేటుకే (బ్యాంక్ కనీస రుణ రేటు) గ్రామీణులకు గృహ రుణం అందించాలని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. రూ.15 లక్షల వరకూ ఈ రుణ వెసులుబాటు గ్రామీణులకు లభించనుంది. ప్రస్తుతం బ్యాంక్ కనీస రుణ రేటు 9.7 శాతం. మహిళా రుణాలను ఇప్పటికే బ్యాంక్ బేస్రేటుకు ఆఫర్ చేస్తోంది. ప్రభుత్వ రంగంలో తనకు వ్యాపార ప్రత్యర్థిగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు బేస్రేటుకే (9.7 శాతం)గృహ రుణ రేటును అందిస్తున్న నేప థ్యంలో- ఐసీఐసీఐ బ్యాంక్ తన రుణ బేస్ను పెంచుకునేందుకు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టింది. సామాజిక ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా... కాగా తమ నిర్ణయంపై బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాల్ ఒక ప్రకటన చేస్తూ... సమాజంలో మెజారిటీ ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఐసీఐసీఐ బ్యాంక్ కట్టుబడి ఉందన్నారు. తమ 4,052 బ్రాంచీల్లోని 189లో గ్రామీణ రుణాలు లభ్యమవుతాయని తెలిపారు. ‘ఐసీఐసీఐ బ్యాంక్ సరళ్-రూరల్ హౌసింగ్ లోన్’ కింద రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ రుణం లభిస్తోంది. రుణ కాలవ్యవధి 3 నుంచి 20 ఏళ్లు. బేస్రేటు మార్పులకు అనుగుణంగా ఇచ్చిన రుణంపై వడ్డీరేటు కూడా మారుతుంది. గృహ కొనుగోళ్లు, నిర్మాణం, ఆధునీకీకరణలకుగాను గ్రామీణులకు ఈ రుణ సౌలభ్యం ఉంటుంది. -
గండం...!
వేసవి వచ్చిందంటే జిల్లాలో తాగునీటి కోసం ఓ మోస్తరు యుద్ధాలు జరగాల్సిందే. అలాంటిది గత ఏడాది వర్షపాతం మరింత తక్కువ కావడంతో మార్చిలోనే తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. ముందస్తు ప్రణాళికలకు ఇప్పటికైనా బూజు దులుపకపోతే రానున్న రోజుల్లో జిల్లా ప్రజానీకం గుక్కెడు నీటికి కూడా అల్లాడాల్సిన పరిస్థితి తప్పదు. అనంతపురం అర్బన్ : తీవ్ర కరువుతో సతమతమవుతున్న జిల్లాలో ములిగే నక్కపై.. తాటికాయ పడ్డ చందంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నేనున్నానంటూ పలకరిస్తోంది. వేసవి మొదలయ్యేటప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అనంతపురం నగరంతో పాటు జిల్లాలో 547 గ్రామాలకు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా తాగునీటి సౌకర్యాన్ని సత్యసాయి ట్రస్టు ద్వారా కల్పించారు. అయినా జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య సర్వసాధారణంగా మారుతోంది. జిల్లాలో 1003 గ్రామ పంచాయితీల్లో సుమారు 31.18 లక్షల మంది జనాభా ఉన్నారు. వేసవిలో ఒక్కో మనిషికి సగుటున ప్రతిరోజు 2 నుంచి 3 లీటర ్ల తాగునీరు అవసరమవుతుంది.. అలాగే జిల్లాలో ఉన్న 15 ల క్షల పశువులకు రోజుకు ఒక్కో దానికి 10 నుండి 12 లీటర్లు తాగునీరు అవసరమవుతుంది. దీని ప్రకారం గ్రామీణ ప్రాంత అవసరాలకు రోజుకు సుమారు 2.40 కోట్ల లీటర్ల తాగునీరు అవసరం కాగా ప్రస్తుతం 1.80 కోట్ల లీటర్లు మాత్రమే సరఫరా అవుతోంది. మార్చి నెల మొదటి వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మే నెలలో తాగునీటి పరిస్థితి మరింత దారుణంగా ఏర్పడే ప్రమాదం ఉంది. జిల్లాలో సాధారణంగా 502 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి కేవలం 274 మి. మీ. మాత్రమే వర్షపాతం నమోదైంది. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. అడుగంటుతున్న భూగర్భజలాలు జిల్లాలో పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత.. నదీ పరివాహక ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. జిల్లాలో 13,386 తాగునీటి బోరు బావులు ఉండగా. వీటిలో వర్షకాలంలో 1304 బోరు బావుల్లో తాగునీరు లభించగా, 4146 పూర్తిగా అడుగంటి పోయాయి. 216 బోరు బావులు మరమ్మతులకు నోచుకోక దిష్టిబొమ్మలా మారాయి. ప్రస్తుతం జిల్లాలో 302 గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి దాదాపు 1200 ట్యాంక ర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే సుమారు 576 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమైనట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను గుర్తించకపోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో బోరుబావులు మరమ్మతులకు నోచుకోపోవడంతో సుమారు ఒక కిలోమీటరు దూరం నుండి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో వచ్చే వేసవిలో తాగునీటి సమస్య మరింత జఠిలమయ్యే పరిస్థితి ఏర్పడనుంది. ఇప్పటికే పుట్లూరు, యల్లనూరు, కళ్యాణదుర్గం, కదిరి, బుక్కపట్నం, ఓడీ చెరువు, ఎన్పి కుంట త దితర మండలాల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. తెప్పులుగా ట్యాంకర్ల బకాయిలు తాగునీటి సమస్యత్మాక గ్రామాల్లో సుమారు 1200 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ట్యాంకర్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే రూ.4.39 కోట్లు ట్యాంకర్ల యాజమానులకు ప్రభుత్వం బకాయి ఉంది. బకాయిలు చెల్లించకపోతే తాగునీటి సరఫరాను ఆపివేస్తామని ట్యాంకర్ల యాజమానులు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా తాగునీటి సరఫరాను ఆపివేస్తే.. పలు పల్లెల్లో తాగునీటి కోసం విలవిలలాడాల్సిన పరిస్థితి. వచ్చే వేసవిలో తాగునీటి సమస్యనుంచి అధికారులు గట్టెక్కిస్తారో..? లేక మహిళలను ఖాళీ బిందెలతో రోడ్లపై నిలబెడతారో...? వేచి చూడాల్సిందే..! ట్యాంకర్లకు బకాయిలు చెల్లిస్తాం : ట్యాంకర్ల యజమానులకు బకాయిలు చెల్లిస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి ఎస్ కాంతనాథం తెలిపారు. నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపగా.. ఇటీవల రూ. 11 కోట్లు మంజూరు చేసిందన్నారు. వీటితో బకాయిలు చెల్లించి.. బోరు బావుల మరమ్మతులు, ముందస్తు చర్యలు చేపట్టి జిల్లాలో తాగునీటి సమస్యను అధిగమిస్తామన్నారు. -
కౌడిపల్లి నుంచి ‘తెలంగాణ పల్లె ప్రగతి’
రూ.10 లక్షలతో పైలాన్ ఏర్పాటు 13న ఆవిష్కరించనున్న పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: సమీకృత గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కౌడిపల్లి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.10 లక్షలతో కౌడిపల్లిలో ఏర్పాటు చేయనున్న‘ పల్లె ప్రగతి పైలాన్’ను 13న పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు ఆవిష్కరించనున్నారు. ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయంతో చేపట్టిన ఈ పథకం కింద తొమ్మిది జిల్లాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు గాను మొత్తం రూ.653 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.203 కోట్లు కాగా, ప్రపంచ బ్యాంకు రుణం రూ.450 కోట్లు. ఈ పథకం అమలు కోసం 150 మండలాలను ఎంపిక చేశారు. ఈ మండలాల్లో 1,950 గ్రామాలు, 10,600 పునరావాస ప్రాంతాలున్నట్లు అధికారులు తెలిపారు. పల్లె ప్రగతి ఇలా... ఎంపిక చేసిన గ్రామాల్లో సుమారు 2.5 లక్షల ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి వారికి అధునాతన వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్ మెళకువల్లో శిక్షణ ఇప్పించనున్నారు. గ్రామాల్లో ప్రధానంగా ఆధారపడే పాడిపరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకంతో పాటు వరి, తృణధాన్యాల ఉత్పత్తి.. తదితర అంశాల్లో వారికి చేయూతనందించనున్నారు. రైతు సంఘాల ఉత్పత్తులను విక్రయించేందుకు కృషి మార్టులను ఏర్పాటు చేయనున్నారు. గిట్టుబాటు ధర లభించేలా, వారికి మార్కెటింగ్ సదుపాయాలను (రూరల్ అవుట్లెట్స్) కల్పిస్తారు. మానవ అభివృద్ధి సూచికలను పెంచే ప్రణాళికలో భాగంగా ఆయా గ్రామాల్లోని మహిళలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు చేపడతారు. గ్రామాల్లోనూ ‘వన్ స్టాప్ షాప్’ గ్రామాల్లో ప్రజలకు వివిధ రకాల సేవలన్నీ ఒకేచోట లభించేలా సమగ్ర పౌర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వెయ్యి గ్రామాల్లో ప్రత్యేక కియోస్క్లను ఏర్పాటు చేస్తారు. మీ సేవాకేంద్రాల్లో అదించే సాధారణ సేవలతో పాటు అదనంగా.. నగదు బదిలీ సేవలను, ఉపాధి హామీ చెల్లింపులను, పింఛన్లను కూడా వీటిద్వారా పొందవచ్చు. వివిధ ప్రభుత్వ విభాగాలకు ప్రజలు ఇచ్చే అర్జీలు, ఫిర్యాదులు కూడా ఈ కేంద్రాల్లోనే స్వీకరిస్తారు. మహిళా సాధికారతను పెంపొందించే దిశగా.. ఆయా కేంద్రాల నిర్వహణ బాధ్యతలను స్థానికంగా విద్యావంతులైన మహిళలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
గ్రామీణుల హృదయాల్లో.. చెదరని ‘సంత'కం
పల్లె సీమల జీవన చిత్రానికి ప్రతి రూపాలు సంతలు.. గ్రామీణుల ఆత్మీయ అనురాగాలకు అవి ప్రతీకలు .. ‘ఏం సుబ్బన్న మామా.. ఇప్పుడేనా రాటం...బాగున్నావా.... అవును నాగిరెడ్డి ఎద్దలకు మూతి సిక్యాలు కావాలని ఇటొచ్చా.. ఏం రట్నమ్మక్క కూరగాయలు బాగా కాస్సాండాయా... ఏం బాల్లిడ్డి బావ ఎర్రగడ్డలు ఏందీ ఇంత అద్దుమానంగా రేట్లు తగ్గినాయ్..’ అంటూ ఆ పల్లె జనాల పలకరింపులు హృదయానికి హత్తుకుంటాయి. అనుబంధాలను తెలిపే ఆ సంభాషణలు వినసొంపుగా ఉంటాయి. ఎన్ని సూపర్ మార్కెట్లు వచ్చినా.. పల్లె సంతల ముందు బలాదూరే. అందుకే అవి పల్లె ప్రజల హృదయాల్లో చెక్కు చెదరని ‘సంత’కాలుగా నిలిచిపోయాయి. కడప అగ్రికల్చర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి సంతలు కొనసాగుతూనే ఉన్నాయి. వారపు సంత సమయం వచ్చిందంటే చాలు ఆయా ప్రాంతాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. సంచులు తీసుకుని సంతలకు గ్రామీణులు వెళుతుండడం కనిపిస్తుంది. బొట్టు బిళ్ల నుంచి సబ్బు బిళ్ల వరకు.. తాజా కూరగాయలు.. నాటుకోళ్లు అబ్బో సంతల ప్రత్యేకతే వేరు. అన్నీ దొరుకుతాయి.. వ్యవసాయానికి పనిముట్లు, ఇంటి అవసరాలకు వాడే సరుకులు అన్నీ ఈ సంతల్లో లభిస్తాయి. అలాగే వ్యవసాయ ఉత్పత్తులక్రయ విక్రయాలు కూడా ఈ సంతల్లో చేస్తారు. దళారీలు లేకుండా నేరుగా రైతులు, వ్యాపారులు ధరలను చర్చించుకుని, నిర్ణయించుకుని అమ్మకాలు చేసుకుంటారు. దీంతో కొనుగోలుదారులకు చౌకగా వస్తువులు లభించడంతోపాటు,ఆయా గ్రామ పంచాయితీలకు కూడా ఆదాయం వస్తోంది. సూపర్ మార్కెట్లు ఎన్ని వచ్చినా .. ప్రపంచీకరణ నేపథ్యంలో హైటెక్ హంగులతో, కలర్ఫుల్ లైట్లతో చూపరులను కనువిందు చేసే సూపర్ మార్కెట్లు గ్రామాలకు సమీపంలోని పట్టణాల్లో వెలిశాయి. వాటిల్లో ఎన్ని వస్తువులున్నా అవన్నీ గ్రామీణులకు అందుబాటులో ఉండే ధరలు కావు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుపై అక్కడ ట్యాక్స్ వేస్తారు. కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే సంతల్లో ఎలాంటి ట్యాక్స్లు ఉండవు, అక్కడి సంతల్లో ఏ అంగడివారి ధర వారిదే తక్కువ ధరకు సరుకులు లభిస్తాయనే నమ్మకం గ్రామ ప్రజల్లో బలంగా ఉంటుంది. బొట్టు బిళ్ల నుంచి సబ్బు బిళ్ల వరకు, గృహాల్లో వాడే నిత్యావసరాలన్నీ ఒకే చోట వారంలో ఒకరోజు మాత్రమే లభిస్తాయి. ఎన్ని సూపర్ మార్కెట్లు వచ్చినా సంతలు ప్రాభవాన్ని నేటికి కోల్పోకపోవడం విశేషమే కదూ. -
ఖాకీచులాట
వరంగల్ క్రైం : వరంగల్ రూరల్, అర్బన్ పోలీసుల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. జిల్లా పోలీసు శాఖ అర్బన్, రూరల్గా విభజన చెంది మూడేళ్లకు పైగా కాగా... హెడ్క్వార్టర్స్లోకి కొన్ని విభాగాలు ఇప్పటికీ ఉమ్మడిగానే పనిచేస్తున్నాయి. ఇటీవల కొందరు ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలతో ఇరువురి మధ్య భేదాభిప్రాయూలు ఏర్పడ్డాయి. చిన్ని చిన్న విషయాల్లో ఇప్పటికే అనేక మార్లు మనస్పర్థలు వచ్చినప్పటికీ సర్దుకుపోతూ వచ్చారు. కానీ... శుక్రవారం హెడ్క్వార్టర్స్లో జరిగిన సంఘటనతో అర్బన్, రూరల్ పోలీస్ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఉమ్మడి వృత్తి సిబ్బందిపై ఆంక్షలు చిలికిచిలికి గాలివానగా మారి దుమారం చెలరేగింది. అసలు ఏం జరిగిందంటే... ప్లంబర్, కార్పెంటరీ ఇలాంటి వృత్తి ఉద్యోగులు అటు అర్బన్కు, ఇటు రూరల్ కార్యాలయాలకు అవసరం వచ్చిన సమయంలో ఉమ్మడిగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని రోజులుగా వీరిపై అధికారిగా ఉన్న రూరల్కు చెందిన వ్యక్తి ఒకరు అర్బన్కు పనులు చేయొద్దని హుకుం జారీచేశారు. అనేక పర్యాయాలు అర్బన్కు పని ఉన్నప్పుడు సదరు సిబ్బంది వెళ్లకుండా అడ్డుపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇలా పలుమార్లు సిబ్బంది అర్బన్కు చెందిన పనులు చేయకపోవడంతో పనులన్నీ పెండింగ్లో పడ్డాయి. ఈ క్రమంలో సదరు అధికారి ఇలా చేయడం నచ్చని ఒక అర్బన్ అధికారి రూరల్ పోలీస్ పరేడ్కు వెళ్లొద్దని తన ఆధీనంలోని బ్యాండ్ కళాకారులను ఆదేశించారు. దీంతో రూరల్ పరేడ్ బ్యాండ్ ప్రదర్శన లేకుండానే ముగిసింది. ఈ విషయంపై ఆగ్రహించిన రూరల్ ఉన్నతాధికారి ఒకరు ‘మాకు బ్యాండ్ ఇవ్వరా’ అంటూ అర్బన్ అధికారులపై చిందులేశారు. అర్బన్ అధికారి కుర్చీ బయటపడేసి... బ్యాండ్ను అడ్డుకున్న అర్బన్ అధికారికి, ఇదే కేడర్లో ఉన్న రూరల్ అధికారి ఒకే గదిలో నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. గతంలో అర్బన్కు ఈ పోస్టు ఉండేది కాదు. నాలుగు నెలల క్రితమే ఈ పోస్టు మంజూరైంది. మరో బిల్డింగ్ లేకపోవడంతో ఇద్దరు అధికారులకు ఒకే గదిని కేటాయించారు. అయితే శుక్రవారం జరిగిన ఘటన నేపథ్యంలో అర్బన్ అధికారి కుర్చీని రూరల్ అధికారి బయటకు విసిరేయించాడు. సదరు అర్బన్ అధికారికి సంబంధించిన సామగ్రి మొత్తాన్ని బయట పడేయడంతో హెడ్క్వార్టర్స్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అర్బన్, రూరల్ సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పరిస్థితి చేయిదాటుతోందన్న సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులను పిలిపించి విషయం తెలుసుకున్నారు. అర్బన్ అధికారి తనకు జరిగిన అవమానాన్ని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావును కలిసి వివరించారు. దీంతో రూరల్ అధికారులను అర్బన్ ఎస్పీ మందలించినట్లు తెలిసింది. మరో మారు ఇలాంటి వివాదం తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించినట్లు సమాచారం. దయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన గొడవ పోలీస్ శాఖలో హాట్టాపిక్గా మారింది. -
కొనసా...గుతున్న రుణమాఫీ జాబితా
రెండుసార్లు గడువు పొడిగించినా పూర్తి కాని వైనం 11 శాతం మంది వివరాలే సేకరించిన కోర్ బ్యాంకులు మళ్లీ 25వ తేదీ వరకు గడువు పెంపు అప్పటికీ సేకరణ డౌటే! విశాఖ రూరల్: రుణమాఫీ లబ్ధిదారుల వివరాల సేకరణ కొనసా..గుతోంది. ప్రక్రియను ప్రారంభించి రెండు వారాలు దాటినా ఇప్పటికీ పూర్తి కాలేదు. రెండుసార్లు గడువు పొడిగించిన కోర్ బ్యాంకులు కేవలం 11 శాతం మాత్రమే రైతుల వివరాలను సేకరించాయి. దీంతో వివరాల సేకరణకు మూడోసారి ఈ నెల 25వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ జాప్యం జరుగుతోందని బ్యాంకర్లు చెబుతున్నారు. నాన్కోర్ బ్యాంకులు, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్ లేని బ్యాంకు బ్రాంచ్లో రైతుల వివరాలను అప్లోడ్ చేయడానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. దీంతో వారు ఎక్సెల్ ఫార్మాట్లో వివరాలు పొందుపరిచి విశాఖ పరిధిలో ఉన్న బ్రాంచ్ల నుంచి ఎన్ఐసీ వెబ్సైటీలో అప్లోడు చేయాల్సి వస్తోంది. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయాలు చూపించకుండా కావాలనే తాత్సారం చేయడానికి ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2013, డిసెంబర్ 31వ తేదీ వరకు రైతులు పొందిన రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు 31 అంశాలతో కూడిన ప్రొఫార్మాను తయారు చేసి వాటి ఆధారంగా రైతుల నుంచి ఆ వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ భారాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో రైతుల వివరాలను బ్యాంకర్లు ఎన్ఐసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించింది. వాస్తవానికి ఈ నెల 7 నుంచి 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ముందు సూచించింది. కానీ 7వ తేదీ నాటికి ఎన్ఐసీ వెబ్సైట్ను బ్యాంకర్లకు అందుబాటులో ఉంచలేకపోయింది. 11వ తేదీ నుంచి బ్యాంకర్లు ఎన్ఐసీలో రైతుల వివరాలను పొందుపరుస్తున్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఇబ్బందులు ఉన్న బ్యాంకు బ్రాంచ్ల నుంచి వివరాలు అప్లోడ్ చేయడం సాధ్యం కావడం లేదు. 25వ తేదీకీ డౌటే : రెండుసార్లు గడువు పొడిగించినప్పటికీ వివరాల సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో మళ్లీ ఈ నెల 25వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. కోర్ బ్యాంకులు ఇప్పటి వరకు కేవలం 11 శాతం మంది రైతుల వివరాలను మాత్రమే సేకరించాయి. ఇందులో అత్యధికంగా ఎస్బీఐ 99 శాతం వివరాలను సేకరించింది. అలాగే ఆంధ్రాబ్యాంక్ 24 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 64 శాతం, ఐసీఐసీఐ 35 శాతం, ఐడీబీఐ 15 శాతం, కరూర్ వైశ్యా బ్యాంక్ 55 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 75 శాతం, సిండికేట్ బ్యాంకు 27 శాతం మంది రైతుల వివరాలను సేకరించగలిగాయి. మొత్తంగా కోర్ బ్యాంకులు 1.27 లక్షల మంది రైతులకు రుణాలివ్వగా ఇప్పటి వరకు కేవలం 14,443 మంది రైతుల వివరాలను మాత్రమే అప్లోడ్ చేశాయి. నాన్కోర్ బ్యాంకులైన డీసీసీబీ, కో-ఆపరేటివ్ బ్యాంకులు 1.7 లక్షల మంది రైతులకు రుణాలిచ్చాయి. ఈ బ్యాంకులు రైతుల వివరాలను ఎక్సేల్ ఫార్మాట్లో అప్లోడ్ చేయడంతో ఎంత మంది వివరాలు సేకరించాయన్న విషయంపై స్పష్టత లేదు. కేవలం మూడు రోజుల్లో 89 శాతం మంది రైతుల వివరాల సేకరణ అసాధ్యమని అధికారులు సైతం చెబుతున్నారు. -
ఉత్సవ విగ్రహాలు
అధికారాలు, విధులు లేవు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడానికే సమావేశాల కోసమే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గ్రామీణాభివృద్ధిలో వీరి పాత్ర నామమాత్రం. చేతికి ఆరోవేలు వంటివారు. అధికారాలు, బాధ్యతలు, విధులు లేని పదవులు ఇవి. కేవలం ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడం, మండల, జెడ్పీ సమావేశాలకు హాజరు కావడం మినహా అధికారికంగా నిర్వహించే విధులేమిటో చట్టంలో పేర్కొనలేదు. మండల, జిల్లా పరిషత్ విధుల్లోనూ వీరికి కనీసం పర్యవేక్షణ అవకాశం కూడా లేదు. కార్యాలయాల్లో కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా లేదు. కోటి ఆశలతో కోట్లు వెచ్చించి గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రస్తుతం ఉత్సవ విగ్రహాల్లా మారారు. విశాఖ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవేవో వాగ్ధానాలు చేశారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి గెలిచారు. రెట్టింపు సంపాదించవచ్చని భావించారు. గెలిచాక చేతిలో చిల్లిగవ్వ లేదు. జిల్లా పరిషత్లో ఉన్న నిధుల గురించి తెలిశాక వారికి కంటిమీద కునుకులేదు. హామీల మేరకు మండలాల్లో ఏ పనులు చేపట్టాలో తెలియక జిల్లాలోని 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ సభ్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిం ది. వీరి కంటే సర్పంచ్ల పరిస్థితే నయం. పంచాయతీ కార్యాలయం,నిధులు, అధికారాలు ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు అవేవి లేక ఉత్సవ విగ్రహాల్లా మారారు. జెడ్పీలో కోట్లకు కోట్లు బడ్జెట్ ఉంటుందని ఆశించిన జెడ్పీటీసీలు అభివృద్ధి కార్యక్రమాలకే సరిపడని నిధులున్నట్లు తెలుసుకొని విస్తుపోతున్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలో తెలి యక, ప్రజల మధ్యకు వెళ్లలేక కిందామీదా పడుతున్నారు. అధికారదాహంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీటీసీల పరిస్థి తి మరింత దయనీయంగా మారింది. అటువంటి వారిపై అనర్హత వేటుపడడం ఉన్న పదవీ పోయి.. ఎన్నికల్లో చేసిన ఖర్చు తిరిగి సంపాదించుకునే అవకాశం లేక.. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికార పార్టీ సభ్యులుసైతం వారిని పట్టించుకోకపోవడంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారారు. జెడ్పీలో రూ.12 కోట్లు నిధులు జిల్లా పరిషత్లో ప్రస్తుతం రూ.12 కోట్లు నిధులున్నాయి. 13వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.4.5 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.1.5 కోట్లు, సాధారణ నిధులు రూ.5 కోట్లు ఇటీవలే విడుదలయ్యాయి. వీటితో పాటు తలసరి నిధుల కింద మరో రూ.కోటి వరకు వ చ్చింది. ఇంతకు మించి జిల్లా పరిషత్కు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు వచ్చే అవకాశాలు లేవు. వీటిలో రూ.కోటి వరకు గ్రామీణప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం వినియోగిస్తున్నారు. ఆందోళనలో సభ్యులు జెడ్పీటీసీ సభ్యుడు నిర్వహించే విధులు, బాధ్యతలు స్పష్టం చేయలేదు. మండల పరిషత్లలో వీరికి స్థానమే లేదు. ఎంపీపీకి ఓ కార్యాలయం ఉంటుంది. ప్రజల ఓట్లతో నేరుగా ఎన్నికయ్యే జెడ్పీటీసీలకు ఎటువంటి కార్యాలయం ఉండదు. ఎంపీపీ, జెడ్పీటీసీలు వేర్వేరు పార్టీలకు చెందిన వారైనప్పుడు ప్రొటోకాల్ వివాదాలు ఉంటాయి. ఒకప్పుడు జిల్లా ప్రణాళిక కమిటీలు ఉండేవి. వాటిల్లో జెడ్పీటీసీలు సభ్యులుగా ఉండేవారు. నిధుల వ్యయం, తదితర అంశాలపై కొంత అజమాయిషీ సాగేది. ఇప్పుడు ఈ కమిటీలను పూర్తిగా నిర్వీర్యం చేసి జిల్లాఅభివృద్ధి సమీక్ష మండలి(డీడీఆర్సీ)తో పెత్తనం కొనసాగిస్తున్నారు. మండల స్థాయిలోనూ ఎమ్మెల్యేల హవా ఎక్కువగా ఉంటోంది. ఇటు అధికారాలు లేక.. సంపాదించుకొనే మార్గాలు కానరాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు బొమ్మలుగా మారిపోయారు. -
జిల్లాకు 168 క్రషీ కేంద్రాలు
త్వరలో ప్రారంభం కార్యకర్తల నియామకం జిల్లా మహిళా,శిశు అభివృద్ధి సంస్థ సన్నాహాలు విశాఖపట్నం : జిల్లాకు రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమశాఖ 168 బాలల సంరక్షణ(క్రషీ) కేంద్రా లు మంజూరు చేసింది. ఈ మేరకు జిల్లా మహిళా,శిశు అభివృద్ధి సంస్థ కార్యాలయానికి బుధవారం ఉత్తర్వులు వచ్చాయి. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలలో ఇవి ఏర్పాటవుతాయి. అంగన్వాడీ కేంద్రాల మాదిరి ఉంటాయి. ఆరు నెలల నుంచి ఆరేళ్లలో పు వయస్సు ఉన్న పిల్లలకు వీటిల్లో ప్రవేశం కల్పిస్తారు. అంగన్వాడీ కేంద్రాలు లేని చోట, తల్లిదండ్రులు పనుల్లోకి వెళ్లే ప్రాంతాలలో ఎక్కువగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పిల్ల ల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి. పదో తరగతి పాసయి, 21 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్న మహిళలను కార్యకర్తలుగా నియమిస్తారు. వీరికి రూ.3వేల వేతనం ఇస్తారు. జిల్లాలో 22 ఐసీడీఎస్ ప్రాజెక్టులు వున్నాయి. అరకు ప్రాజెక్టుకి 15, డుంబ్రిగుడకు 16, పెదబయలుకి 15, కొయ్యూరుకి 15, చిం తపల్లికి 16, జి.మాడుగులకు 15, జీకేవీథికి 15, పాడేరుకి 13, హుకుంపేటకు 17, అనంతగిరికి 16, ముంచంగిపుట్టుకు15 కేంద్రాలు వంతున మంజూరయ్యాయి. జిల్లాలో ముఖ్యంగా ఉపా ధి హామీ పథకం పనుల్లోకి ఎక్కువగా మహిళ లు వెళ్లే ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఒక కేంద్రంలో ఎంతమంది పిల్లలకైనా ప్రవేశం కల్పిస్తారు. -
దేశ ప్రగతికి పల్లెలే ఆధారం
విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి వంగల అమరనాథ్రామ్ అల్లూరు(ముదినేపల్లి రూరల్) : పల్లెల సౌభాగ్యంపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉందని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వంగల అమర్ నాథ్రామ్ అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి వీవీ గిరి సమీప బంధువు, అమర్నాధ్ తల్లి వంగల వాణీబాయి రామ్ మండలంలోని అల్లూరు గ్రామానికి చెందినవారు. వాణీబాయి రామ్, శివరామ్ దంపతుల జ్ఞాపకార్థం అమర్నాథ్ గ్రామంలో జెడ్పీ హైస్కూల్ నిర్మించారు. హైస్కూల్లో వాణీబాయి రామ్ శత జయంత్యుత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సర్పంచి కోయినాని పద్మావతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు. కన్నతల్లి, జన్మభూమి రుణం తీర్చుకోవడం ఏ స్థాయిలోని వారికైనా కనీస బాధ్యత అన్నారు. గ్రామాల్లో మట్టిలో మాణి క్యాల్లాంటి విద్యార్థులున్నప్పటికీ సరైన మార్గ నిర్ధేశం లేని కారణంగా వారి మేధాశక్తి కనుమరుగవుతోందన్నారు. ఇలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ప్రముఖ రంగాల్లో స్థిరపడిన వ్యక్తులపై ఉందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ విద్యతోనే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని అమర్నాథ్రామ్ నిరూపించారన్నారు. ఎంతో సదాశయంతో స్థానికంగా నిర్మించిన జెడ్పీ హైస్కూల్ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి వీవీ గిరి కుమార్తె, అమర్నాథ్ భార్య శాంతిరామ్ మాట్లాడుతూ పల్లెలు సుభిక్షంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మేధావులు, ప్రభుత్వాలపై ఉందన్నారు. గ్రామస్తులు అమర్నాథ్, శాంతి రామ్ దంపతులను ఘనంగా సత్కరించారు. సోమేశ్వర స్వామి ఆలయాభివృద్ధికి రామ్ దంపతులు రూ.50వేలు, జెడ్పీ హైస్కూల్లో ఫర్నీచర్కు రూ.20వేలు, ప్రతిభ చూపే విద్యార్థులకు రూ.25వేలు విరాళంగా ఇచ్చారు. జెడ్పీ వైస్ చైర్మన్ శాయిన పుష్పావతి, జెడ్పీటీసీ భూపతి నాగకల్యాణి, ఎంపీపీ పోసిన కుమారి, ఎంపీటీసీ చలసాని లక్ష్మీపార్వతి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఈడ్పుగంటి వెంకట్రామయ్య, చలమలశెట్టి రామానుజయ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లా వెంకన్న, పార్టీ మండల అధ్యక్షుడు కొత్తూరి విఠల్, ఎంపీడీవో విద్యాసాగర్, ఎంఈవో సైకం సుబ్రహ్మణ్యం, ఎస్సై వీ సతీష్, ప్రధానోపాధ్యాయుడు డేవిడ్రాజు, దావు నాగరాజు, లక్ష్మణరావు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.