
పోడియంపైకి వచ్చి విపక్ష ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం బాధాకరమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
సాక్షి, అమరావతి: పోడియంపైకి వచ్చి విపక్ష ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం బాధాకరమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అలాంటివాళ్లు సభకు రావడం దురదృష్టకరమన్నారు. అరాచకం సృష్టించేవాళ్లను చూస్తే బాధగా ఉందన్నారు. ఇలాంటి ఆగడాలను ఎక్కడో ఒక చోట అరికట్టాలని స్పీకర్ అన్నారు. సభ సమష్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ సభ్యుల తీరుపై చర్యలకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తున్నా. అరాచకం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని స్పీకర్ అన్నారు.
చదవండి: కరవు, బాబు ఇద్దరూ కవలలు: సీఎం జగన్
దౌర్జన్యం సరికాదు: అంబటి రాంబాబు
ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సభ్యులు దౌర్జన్యంగా ప్రవర్తించారన్నారు. నచ్చని అంశాలపై నిరసన తెలుపొచ్చు కానీ దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ఏ ఒక్కరోజూ సభ సజావుగా జరిగేందుకు టీడీపీ సభ్యులు సహకరించలేదని అంబటి రాంబాబు మండిపడ్డారు.
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల రభస..
కాగా, అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు నానా రభస సృష్టించారు. పేపర్లు చించి స్పీకర్పైకి విసిరి కొట్టిన అనుచితంగా ప్రవర్తించారు. స్పీకర్ చైర్ వద్దకు వచ్చి దురుసుగా ప్రవర్తించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుల తీరు మారలేదు. సభకు పదే పదే ఆటంకం కలిగించడంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.