
సాక్షి, మంగళగిరి: ఏపీలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 20,034 నిర్ధారణ కాగా, 82 (.41 %) మరణాలు సంభవించాయి. తాజాగా ఏపీలో పాజిటివ్ రేటు 17.3 శాతంగా ఉంది. 24 గంటల్లో 1,17,784 పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో 533 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. కోవిడ్ రిపోర్ట్ మంగళవారం విడుదల చేశారు. 21,857 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే 20,017 నిండిపోయాయని తెలిపారు.
104 కాల్ సెంటర్కు 16,856 కాల్స్ వచ్చాయని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 9 లక్షలు వ్యాక్సిన్ డోసులు ఈనెల 15వ తేదీలోపు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. వ్యాక్సినేషన్లో మీడియా, బ్యాంక్ సిబ్బందికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. రెమిడెసివర్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో 14,030 రెమిడెసివర్ డోసులు ఇచ్చామని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 21,898 డోసెస్ అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే 12 వేలు రెమిడెసివర్ డోసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు 446 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామని, 3 ట్యాంకర్లు ఈరోజు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కోవిడ్ తీరుపై రేపు మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరగనుందని అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, కోవిడ్ కేసులు , పేషేంట్స్ను కోవిడ్ కేర్ సెంటర్స్ తరలింపుపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.