అక్కచెల్లెమ్మలకు సెల్యూట్‌ | CM YS Jagan Comments In YSR EBC Nestham Event | Sakshi
Sakshi News home page

అక్కచెల్లెమ్మలకు సెల్యూట్‌

Published Thu, Apr 13 2023 4:03 AM | Last Updated on Thu, Apr 13 2023 4:24 PM

CM YS Jagan Comments In YSR EBC Nestham Event - Sakshi

మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం గత 46 నెలల కాలంలో అక్క చెల్లెమ్మలకు సాధికారత కల్పించే దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. తల్లి గర్భంలో ఉన్న శిశువు మొదలు 60–100 ఏళ్ల వయస్సులో ఉన్న అవ్వల వరకు అందరికీ మంచి చేస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్య పోషణతో మొదలు పెడితే వృద్ధాప్య పెన్షన్‌ వరకు అన్ని విధాలా మంచి చేయాలనే తపన, తాపత్రయంతో ముందుకెళ్తున్నాం. రాజకీయంగా నా అక్కచెల్లెమ్మలు పైకి రావాలని, సామాజికంగా, విద్యాపరంగా కూడా సాధికారతను సాధించాలని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘సన్మానాలు అందుకునే వాళ్లు మాత్రమే గొప్ప వాళ్లు కాదు. నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ.. వారి జీవితాలను మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న వారందరి బాగు కోసం నిత్యం చిరునవ్వుతో, గొప్ప బాధ్యతతో శ్రమించే ప్రతి అక్క, చెల్లెమ్మ కూడా గొప్ప వాళ్లే. అందుకే వారందరికీ సెల్యూట్‌ చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇంటింటి దీపాలైన అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆయా కుటుంబాలు బాగుంటాయని చెప్పారు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో బుధవారం ఆయన వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం కింద రెండో విడత నగదు పంపిణీని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 4,39,068 మంది అక్క చెల్లెమ్మలకు రూ.658.60 కోట్లు లబ్ధి చేకూర్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  అత్యంత బరువు బాధ్యతలు భుజాన వేసుకున్న 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అక్క చెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే ప్రతి రూపాయి తమ కుటుంబం బాగోగుల కోసమే ఖర్చు పెడతారని దృఢంగా నమ్ముతు­న్నామ­న్నారు.

అందుకే వారు ఆర్థికంగా నిలదొ­క్కుకునేలా అన్ని విధాలా తోడుగా నిలిచామని తెలిపారు. ‘ఇప్పటికే వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం. అంతటితో ఆగిపోకుండా కాపు అక్కచెల్లెమ్మల కోసం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ప్రారంభించాం. వీరందరితో పాటు ఓసీ వర్గాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు మంచి చేయడం కోసం ఈబీసీ నేస్తం పథకానికీ శ్రీకారం చుట్టాం’ అని చెప్పారు.

ఈ రెండేళ్లలోనే వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ద్వారా పేద అక్క చెల్లెమ్మలకు రూ.1,258 కోట్లు వాళ్ల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు. రెడ్లు, కమ్మ, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, వెలమలు, బ్రాహ్మణులు తదితర ఓసీ కులాల్లో ఉన్నపేద అక్కచెల్లెమ్మలకూ ఇలా మేలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల మేని­ఫె­స్టోలో పెట్టక పోయినా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలు తీసు­కొ­చ్చామన్నారు. ఈ కార్య­క్రమంలో సీఎం జగన్‌ ఏం చెప్పారంటే..

అన్ని విధాలా అండగా నిలిచాం
► ఈ 46 నెలల మీ బిడ్డ ప్రభుత్వంలో అమ్మ ఒడి మొదలు వైఎస్సార్‌ ఆసరా.. వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ కాపు నేస్తం.. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, షాదీతోఫా, కళ్యాణమస్తు.. విదేశీ విద్యా దీవెన వంటి అనేక పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం. 

► అక్కచెల్లెమ్మలకు ఇప్పటి వరకు రూ.2 లక్షల 7 వేల కోట్ల లబ్ధి చేకూర్చాం. ఇందులో రూ.లక్షా 42 వేల కోట్లు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా లంచాలు, వివక్షకు తావు లేకుండా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్లాయని చెప్పడానికి గర్వపడుతున్నాను.

► వైఎస్సార్‌ చేయూత ద్వారా 26,39,703 మందికి రూ.14,129 కోట్లు, వైఎస్సార్‌ కాపు నేస్తం కింద 3.56 లక్షల మందికి రూ.1,518 కోట్లు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 41.77 లక్షల మందికి రూ.40,094 కోట్లు, అమ్మ ఒడి కింద 44 లక్షల 48 వేల మందికి రూ.19,674 కోట్లు జమ చేశాం. ఒక్క వైఎస్సార్‌ ఆసరా ద్వారా మాత్రమే 78 లక్షల 75 వేల మందికి ఇప్పటికే రూ.19,178 కోట్లు వాళ్ల ఖాతాల్లో వేశాం. 

► ఏకంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుంది. మొత్తంగా 30 లక్షల మందికి మంచి చేస్తూ రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తి నా అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్లవుతుంది. పొదుపు సంఘాల్లో ఉన్న 1.02 కోట్ల మంది అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇచ్చాం. 

మార్కాపురానికి వరాల జల్లు 
మీ బిడ్డ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ ఇప్పటికే పూర్తయింది. రెండో టన్నెల్‌ ఈ సెప్టెంబర్, అక్టోబర్‌లో పూర్తి కాగానే మళ్లీ వచ్చి ప్రారంభిస్తాను. గతంలో నాన్న గారు 36 కిలోమీటర్ల ఈ సొరంగాలను 20 కిలో మీటర్లు పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు  ఐదు కిలోమీటర్లు కూడా చేయలేదు. మీ బిడ్డ అధికారంలోకొచ్చాక యుద్ధప్రాతిపదికన ఆ మిగిలిపోయిన 11 కిలోమీటర్లు పూర్తి చేసి,  ప్రాజెక్టును అక్టోబర్‌లో ప్రారంభించనున్నం.  మార్కా­పు­రం నియోజ­కవ­ర్గానికి సంబందించి నా సోద­రు­డు ఎమ్మె­ల్యే కేపీ నాగా­ర్జునరెడ్డి నా దృష్టికి తెచ్చిన వాటికి ఇప్పుడే ఇక్కడే శంకుస్థాపన చేశాం.

ఎన్‌ఎస్‌పీ కెనాల్‌ నుంచి పొదిలి దాకా అంటే 17 కి.మీ. పైపు­లైను ద్వారా పొదిలికి తాగునీరు అందించే కా­ర్యక్రమానికి రూ.50 కోట్లతో పునాది  వేశాం. మార్కాపురం మున్సిపాలిటీలో నీటి పనులకు రూ.5.20 కోట్లతో శ్రీకారం చుట్టాం.   మెడికల్‌ కాలేజీ కోసం భూములిచ్చిన రైతులకు ప్రత్యా­మ్నా­­యంగా ఇచ్చిన 13 ఎకరాల అభివృద్ధికి సంబంధించి ఎకరాకు మరో రూ.3 లక్షలు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నాం. పొదిలి మె­యిన్‌­రోడ్డు, పొదిలిలో డ్రెయిన్‌కు రూ.13 కో­ట్లు మంజూరు చే­స్తాం. రూ.2 కోట్లతో షాదీఖానా, అంబేడ్క­ర్‌ భవనం, బీసీ భవనం మంజూరు చేస్తున్నాం.

మన ఇంటి నుంచే ఆధునిక భారతీయ మహిళ
► విద్యా దీవెన, వసతి దీవెన కింద పిల్లల చదువుల కోసం రూ.13,351 కోట్లు ఖర్చు చేయగలిగాం. సంపూర్ణ పోషణ ద్వారా 35 లక్షల మంది బాలింతలు, గర్భిణులకు.. 6 నుంచి 72 నెలల చిన్నారులకు మంచి చేస్తూ రూ.6,131 కోట్లు ఖర్చు చేశాం. 

► అక్కచెల్లెమ్మలకు భద్రత పరంగా ‘దిశ’ ద్వారా అండగా నిలిచాం. కోటి 17 లక్షల మంది దిశ యాప్‌ వారి ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. నామినేటెడ్‌ పదవుల్లో, నామినేటెడ్‌ ద్వారా ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఏకంగా చట్టం చేశాం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి రావాలని తపన పడుతూ పాలన సాగిస్తున్నాం. 

► ఈ కార్యక్రమంలో మంత్రులు ఆది­మూ­లపు సురేష్, చెల్లుబోయిన వేణు­గో­పాలకృష్ణ, మేరుగు నాగార్జున, వైఎ­స్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మార్కాపురం ఎమ్మె­ల్యే కేపీ నాగార్జునరెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌లు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement