
సాక్షి,సూళ్లూరుపేట/తిరుమల: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం(ఆగస్టు16) స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ3)ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.
కౌంట్డౌన్ ముగియగానే అనుకున్న షెడ్యూల్ ప్రకారం రాకెట్ 9.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం నాలుగు దశల్లో 17 నిమిషాలపాటు జరిగిన రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్ సోమనాథన్ ప్రకటించారు. రాకెట్ ప్రయోగం సక్సెస్ అవడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.

ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్లో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. రక్షణ రంగంతో పాటు విపత్తు నిర్వహణ, ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాల సేవలు ఏడాదిపాటు అందనున్నాయి.
