![State Govt Good News For Contractual Employees - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/14/ap.jpg.webp?itok=5w69qIIl)
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సర్క్యులర్ మెమో ద్వారా బుధవారం విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్లో అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
2014 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఏకంగా చట్టంలో సవరణలు తీసుకువచ్చారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు మార్గం సుగమమైంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 10 వేల మందికి మేలు జరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
రెగ్యులరైజేషన్ ఇలా..
2014 జూన్ 2కి ముందు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమితులై అర్హులైన వారందరూ రెగ్యులరైజేషన్కు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా శాఖాధిపతులు, శాఖల్లో మంజూరు చేసిన పోస్టులో రిజర్వేషన్, రోస్టర్ విధానంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమితులైన అర్హులైన వారిని రెగ్యులరైజ్ చేయనున్నారు. అర్హులైన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి ఒక్కో విధానంలో కాకుండా ఆర్థిక శాఖ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. దీంతో వీలైనంత త్వరగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ జరుగుతుంది.
♦ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ దరఖాస్తులను ఆయా శాఖాధిపతులు తొలుత వెరిఫికేషన్ చేసి సర్టిఫై చేయాలి.
♦ ఆ తర్వాత సచివాలయ శాఖలు ఆయా దరఖాస్తులను ధ్రువీకరించి సర్టిఫై చేయాల్సి ఉంటుంది.
♦ పిదప ట్రెజరీస్ డైరెక్టర్ దరఖాస్తులను ఆడిట్ చేసి సిఫార్సు చేయాలి.
♦ చివరగా ఆర్థిక శాఖ (హెచ్ఆర్) విభాగం అర్హులైన ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు ఆమోదం తెలుపుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులు పుట్టిన తేదీ, విద్యా అర్హతలు, కమ్యూనిటీ, మంజూరైన పోస్టులో నియమించారా, లేదా అనే విషయాలను ఆయా శాఖాధిపతులు ్ర«ధువీకరణ
చేయాల్సి ఉంటుంది.
సీఎం జగన్కు ఉద్యోగులుబాసటగా నిలవాలి..
పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్కు ఉద్యోగులందరూ బాసటగా నిలవాలి. దశాబ్దాల కాంట్రాక్టు ఉద్యోగుల కలను నెరవేర్చిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. కొన్ని పత్రికలు, చానళ్లు ప్రభుత్వంపై నిత్యం విష ప్రచారం చేస్తున్నాయి.
ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని అక్కసుతో దించేసే కుట్రను ఉద్యోగులు అడ్డుకోవాలి. ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి 100 మందిని లక్ష్యంగా పెట్టుకుని వాస్తవాలు వివరించాలి. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులు, బడుల రూపురేఖలు మార్చి, ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్న సీఎం జగన్ను మరోసారి గెలిపించుకోవాలి. – ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ జనరల్ అరవ పాల్
20 ఏళ్ల కల సాకారం
కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధికరణకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడం పట్ల ఆనందంగా ఉంది. 20 ఏళ్ల కలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్మీడియెట్ విభాగంలో 3 వేల మందికి, పాలిటెక్నిక్, డిగ్రీ స్థాయిల్లో మరో 1,000 మందికి మేలు జరుగుతుంది. – పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ, కేశవరపు జాలిరెడ్డి, వైఎస్సార్టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు
వేలాది కుటుంబాల్లో సీఎం వెలుగులు నింపారు..
పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. మేనిఫెస్టోలో చేర్చి మరీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మేలు చేశారు. తాజా నిర్ణయం ద్వారా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. మేమంతా ఆయనకు రుణపడి ఉంటాం. – వై.రామచంద్రారెడ్డి, చంద్రమోహన్రెడ్డి, ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు
సీఎం చిత్తశుద్ధికి నిదర్శనం..
కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసులను క్రమబద్ధికరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసులను క్రమబద్ధీకరించిన సీఎంకు మా కృతజ్ఞతలు. – కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ రాష్ట్ర చైర్మన్ కుమ్మరకుంట సురేష్, కో చైర్మన్ కల్లూరి శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment