‘మరణ’హోమమే లక్ష్యం! కనీ­సం ఇద్దరు పోలీసులనైనా..? | TDP Conspiracy in Punganur | Sakshi
Sakshi News home page

‘మరణ’హోమమే లక్ష్యం! పోలీసులను చంపి.. ఆపై కాల్పులు ఓపెన్‌ చేయించేలా ప్లాన్‌

Published Mon, Aug 7 2023 4:17 AM | Last Updated on Mon, Aug 7 2023 9:06 AM

TDP Conspiracy in Punganur - Sakshi

చిత్తూరు అర్బన్‌: టీడీపీ అధినేత నేత చంద్రబాబు నాయుడు శనివారం నాటి చిత్తూరు జిల్లా పర్యటనలో మారణహోమమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. కనీ­సం ఇద్దరు పోలీసులను చంపాలని దుర్మార్గపు ఆలోచనలు చేశారు. బాబు పర్యటనకు రెండు రోజుల ముందే ఈ ప్లాన్‌ మొత్తం రూపొందించారు.

పుంగనూరు వద్ద పోలీసులపై దాడులకు తెగబడి అల్లర్లు సృష్టించిన ఘటనకు సంబంధించి పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ చల్లా బాబు అలియాస్‌ చల్లా రామచంద్రారెడ్డి ఈనెల 2వ తేదీన రొంపిచెర్లలో పార్టీ ప్రధాన వ్యక్తులతో ఈ మారణహోమ వ్యూహాన్ని రచించారు.

అతని వ్యక్తిగత కార్యదర్శి గోవర్దన్‌రెడ్డిని పోలీసులు విచారించగా, పూసగుచ్చినట్లు విషయం అంతా వివరించాడని తెలిసి­ంది. ఇది విన్న పోలీసులు షాక్‌కు గురవ్వడంతోపాటు, ఇదేం రాజకీయం అని కాసేపు ఆందోళనకు గురైనట్లు సమాచారం. టీడీపీ నేతలు రూపొందించిన వ్యూహాలు ఇలా ఉన్నాయి. 

ప్లాన్‌–ఎ: పోలీసు కాల్పులు 
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజు రోజుకు జనాదరణ పెరిగిపోయి హీరో అయిపోతున్నాడని చల్లా బాబు తరచూ పార్టీ నేతల వద్ద అక్కసు వెళ్లగక్కేవారు. ఇదే పుంగనూరులో పెద్దిరెడ్డిని జీరో చేయాలని, అదే సమయంలో రాష్ట్రం మొత్తం పుంగనూరు వైపు చూసేలా మారణహోమం జరగాలని సంకల్పించారు. ఈ మేరకు విషయాన్ని పార్టీ పెద్దకు చేరవేసి, ఆయన ఆశీర్వాదం పొందారని తెలిసింది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు పుంగనూరు బైపాస్‌ రోడ్డు వద్దకు వచ్చినప్పుడు.. పుంగనూరు పట్టణంలోకి రావాలని పార్టీ శ్రేణులు పట్టుపట్టాలని, పోలీసులు దీనికి అంగీకరించరని నిశ్చయించుకున్నారు.

అప్పటికే కృష్ణదేవరాయ కూడలికి సమీపంలో సిద్ధంగా ఉంచుకున్న రాళ్లు, మద్యం బాటిళ్లు, బీరు బాటిళ్లు, గుండ్రటి టపాసు బాంబులును పోలీసులే లక్ష్యంగా విసిరేలా కొందరికి బాధ్యత అప్పగించారు. ఇందులో భాగంగా మొత్తం 30 నిమిషాల పాటు దాడి కొనసాగించేందుకు సరిపడా రాళ్లు, ఇతర వస్తువులను పరిసర ప్రాంతాల్లో ఉంచారు. తొలి మూడు నిమిషాల్లో చెప్పులు, వాటర్‌ బాటిళ్లు విసిరితే పోలీసులు తేలిగ్గా తీసుకుంటారని, ఇదే అదునుగా పోలీసుల ఊహకు అందని విధంగా రాళ్లు, టపాసు బాంబులు, మద్యం బాటిళ్లతో పది నిముషాలు దాడులు చేయాలని, ఇందులో ఒకరిద్దరు పోలీసులు చనిపోయినా పర్లేదనే వ్యూహానికి పదునుపెట్టారు.

ఇదే కనుక జరిగితే వెంటనే పోలీసులు కాల్పులు ఓపెన్‌ చేస్తారని, ఈ కాల్పుల్లో కనీసం 30 మంది వరకు టీడీపీ శ్రేణులు మరణిస్తారు.. అప్పుడు దేశం మొత్తం పుంగనూరు వైపు చూస్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం అవుతుంది.. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల ద్వారా ఆందోళనలతో ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చని భారీ కుట్ర పన్నారు. తర్వాత జరిగే ఎన్నికల్లో సానుభూతి వల్ల టీడీపీ ఆటోమేటిక్‌గా గద్దెనెక్కడం ఖాయం అని భావించారు.  

ప్లాన్‌–బీ: అల్లకల్లోలం సృష్టించడం 
ఏ కారణాల వల్లయినా ప్లాన్‌–ఏ అమలుకాని పక్షంలో టీడీపీ నేతలు ప్లాన్‌–బీ కూడా రూపొందించుకున్నారు. పోలీసులు చనిపోకపోయినా, వాళ్లు ఫైర్‌ ఓపెన్‌ చేయకపోయినా ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు మొత్తం ఒక్కసారిగా పుంగనూరు పట్టణంలోకి చొరబడి ఎక్కడికక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్లెక్సీలు చింపడం, పెట్రోలు పోసి నిప్పంటించడం చేయాలి. వెంటనే వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రతిస్పందిస్తాయి. దీంతో చెలరేగే అల్లర్లలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఒకరిద్దరిని మట్టుబెడితే.. వాళ్లు చేసే దాడుల్లో ఆస్తుల విధ్వంసంతో పాటు కొందరు టీడీపీ కార్యకర్తలూ చనిపోతారు.

దీనికంతటికీ కారణం ప్రభుత్వంపై నెట్టేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగాలి. తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలి. రాష్ట్రం మొత్తం ఈ ఘటనలతో హోరెత్తిపోయి శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎండగట్టాలని అనుకున్నారు. ఈ రెండు ప్లాన్ల గురించి టీడీపీలోని ప్రధాన వ్యక్తులకు తప్ప, పార్టీ కార్యకర్తల్లో ఒక్కరికి కూడా తెలియడానికి వీల్లేదని తీర్మానం చేశారు. ఎక్కడా ఈ ప్లాన్ల గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకూడదని అత్యంత గోప్యత పాటించారు. ఈ అల్లర్లకు అవసరమయ్యే వారిని మదనపల్లె, మొలకలచెరువు, సదుం, సోమల నుంచి రప్పించాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా రంగంలోకి దించారు. 

పోలీస్‌ ప్లాన్‌ భళా.. టీడీపీ డీలా.. 
టీడీపీ నేతలు రూపొందించిన మారణహోమ ఉచ్చులో పోలీసులు చిక్కుకునే ఘటన దాదాపు అమలైపోతుందని టీడీపీ పెద్దలు భావించారు. అయితే అల్లర్ల సమయంలో అక్కడ బందోబస్తులో ఉన్న ఓ పోలీసు అధికారి చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. పోలీసులు రక్తమోడుతుండటం చూసిన ఆ అధికారి చలించిపోయి.. గద్గద స్వరంతో ఎస్పీతో మాట్లాడుతూ.. ‘సర్, పరిస్థితి చేయి దాటిపోతోంది. డీఎస్పీల తలలు పగిలిపోతున్నాయి.

సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఇక్కడ ఆర్తనాదాలు పెడుతున్నారు. మనం ఫైర్‌ ఓపెన్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే మీరు కలెక్టర్‌తో మాట్లాడి ఫైర్‌ ఓపెన్‌ చేసేలా ఆర్డర్‌ ఇవ్వండి ప్లీజ్‌. లేకుంటే మనవాళ్లు చనిపోతారు..’ అంటూ బతిమిలాడినట్లు సమాచారం. అప్పుడు టీడీపీ మూకలు రాళ్లు, బాటిళ్లు విసురుతున్న తీరు, వాటి నిల్వల వివరాలు ఆరా తీసి.. పోలీసులు వెంటనే 300 మీటర్లు వెనక్కు వచ్చేయాలని ఎస్పీ సూచించినట్లు తెలిసింది.

దీంతో టీడీపీ శ్రేణులు రాళ్లు, మద్యం బాటిళ్లు నిల్వ ఉన్న ప్రాంతం నుంచి ముందుకు వస్తారని.. అప్పుడు టీడీపీ శ్రేణులను చెదరగొట్టడానికి స్వల్పంగా లాఠీచార్జ్, బాష్ప వాయువు ప్రయోగించాలని ఆదేశించినట్లు సమాచారం. తాను పుంగనూరుకు బయలుదేరానని, తాను అక్కడికి వచ్చే వరకు ఒక్క బుల్లెట్‌ కూడా తుపాకీ నుంచి బయటకు రావడానికి వీల్లేదని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రక్తమోడుతున్నప్పటికీ ఎస్పీ ఆదేశాలను అమలు చేశారు. అల్లరి మూకల్ని దగ్గరకు రప్పించి లాఠీలతో చెదరగొట్టారు. దీంతో టీడీపీ నేతల కుతంత్రాలు, కుట్రలు పటా పంచలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement