
నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి సినిమా టికెట్లు తప్ప.. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు కనపడట్లేదని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్లకు బడుగు, బలహీన వర్గాలంటే చిన్నచూపని అన్నారు. మంత్రి అప్పలరాజు ఆదివారం గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారికి డాక్టర్లంటే గౌరవంలేదని, అందుకే వారిని హేళన చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు పవన్ కల్యాణ్కు రుచిగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. విభజన హమీలపై కేంద్రం మాటతప్పితే పవన్ ఇప్పుడేందుకు నోరు మూసుకున్నారని మండిపడ్డారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందిస్తొందని అన్నారు. తాము 22 నెలల పాలనకాలాన్ని రెఫరెండంగా భావించి ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. టీడీపీకి ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొన్నారు. తాము తిరుపతి ఉపఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నామని అన్నారు. ఒకవేళ ‘ మేం ఓడిపోతే మా 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు.. టీడీపీ ఓడిపోతే నలుగురు ఎంపీలూ రాజీనామా చేస్తారా?’’ అంటూ పెద్దిరెడ్డి చేసిన సవాల్ను చంద్రబాబుకు స్వీకరించే దమ్ముందా! అని తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు.
Comments
Please login to add a commentAdd a comment