
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టించే ప్రకటనలు తదితర అక్రమ వ్యాపార విధానాలను అవలంబిస్తున్న ఎడ్టెక్ కంపెనీలకు ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. పరిశ్రమలో ప్రధాన సంస్థలు స్వీయ నియంత్రణలు పాటించని పక్షంలో కఠిన మార్గదర్శకాలను తీసుకురావలసి ఉంటుందని హెచ్చరించింది. ఎడ్టెక్ విభాగంలో నకిలీ రివ్యూలు పెరగడంతో వీటిని అరికట్టేందుకున్న అవకాశాలపై వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక సమావేశంలో చర్చించారు.
ఇండియా ఎడ్టెక్ కన్సార్షియం(ఐఈసీ), తదితర పరిశ్రమ సంబంధ సంస్థలతో రోహిత్ కుమార్ చర్చలు నిర్వహించారు. దేశీ ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్(ఐఏఎంఏఐ) ఆధ్వర్యంలో ఐఈసీ నడుస్తోంది. ఈ సమావేశానికి ఐఈసీ సభ్యులతోపాటు ఐఏఎంఏఐ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ జాబితాలో అప్గ్రేడ్, అన్అకాడమీ, వేదాంతు, గ్రేట్ లెర్నింగ్, వైట్హ్యాట్ జూనియర్, సన్స్టోన్ తదితరాలున్నాయి.