ఊహించని మృత్యువు అంటే ఇదేనేమో! | Sakshi
Sakshi News home page

తిరుపత్తూరులో ఘోర ప్రమాదం.. ఊహించని మృత్యువు అంటే ఇదేనేమో!

Published Mon, Sep 11 2023 9:20 AM

Tirupattur Natrampalli Road Accident news Updates - Sakshi

సాక్షి, చెన్నై: బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై ఈ వేకువ జామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ మినీ వ్యాన్‌ను గూడ్స్‌ లారీ ఢీ కొట్టిన ఘటనలో ఏడుగురు బలయ్యారు. మృతులంతా మహిళలే కాగా.. అనూహ్యా రీతిలో వాళ్లు దుర్మరణం పాలవడం గమనార్హం. 

వెల్లూరు జిల్లా పెర్నాంబట్‌ టౌన్‌ ఓనన్ గుట్టాయ్ ప్రాంతానికి చెందిన 15 మందికి పైగా బృందం మినీ వ్యాన్‌లో మైసూరు పర్యటనకు వెళ్లారు.  గత రాత్రి యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా నాట్రంపల్లి సమీపంలోని నడ్రంపల్లి గ్రామం వద్ద వారి వ్యాన్ చెడిపోయింది. ఆ తర్వాత, వ్యాన్‌లోని వాళ్లంతా హైవేలో ఉన్న కాంక్రీట్‌ దిమ్మెలపై కూర్చున్నారు. ఆ సమయంలో అటుగా వస్తున్న గూడ్స్‌ లారీ ఒకటి.. బ్రేక్‌డౌన్‌లో ఉన్న వ్యాన్‌ను ఢీకొట్టింది.

ఆ వ్యాన్‌ బోల్తా పడడంతో అక్కడ కూర్చున్న మహిళలు నుజ్జునుజ్జు అయ్యారు. అలాగే 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి వాహనదారులు అది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రంగా గాయపడిన 8 మందిని చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement