ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు కన్నుమూత | Kalyampudi Radha Krsihna Rao Passed Away In USA | Sakshi
Sakshi News home page

ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు కన్నుమూత

Aug 23 2023 11:45 AM | Updated on Aug 29 2023 5:06 PM

Kalyampudi Radha Krsihna Rao Passed Away In USA - Sakshi

వాషింగ్టన్‌: ప్రఖ్యాత భారత్‌–అమెరికన్‌ గణిత శాస్త్రవేత్త, గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్‌) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు(102) అమెరికాలో కన్నుమూశారు. రాధాకృష్ణారావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. స్టాటిస్టిక్స్‌ రంగంలో సీఆర్‌ రావు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

కాగా సీఆర్‌ రావుకు ఇటీవలె ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్‌ బహుమతితో సమానమైన ‘ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌’ను 2023 సంవత్సరానికి గాను రాధాకృష్ణారావు ఈ ఏడాది మే1 ఆయ‌న‌కు ఈ అవార్డును అందుకున్నారు. 1945లో కలకత్తా మ్యాథమెటికల్‌ సొసైటీలో ప్రచురితమైన సీఆర్‌ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ఇదే గాక భారత స్టాటిస్టిక్స్‌ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్‌ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్‌, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ..
కల్యంపూడి రాధాకృష్ణారావు 1920 సెప్టెంబరు 10న కర్ణాటకలోని హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో విద్యాభ్యాసం సాగింది. ఆంధ్ర విశ్వావిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో ఎంఎస్సీ చేశారు. 1943లో కలకత్తా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో ఎంఏ డిగ్రీ అందుకున్నారు.

ఇంగ్లండ్‌లో  కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కింగ్స్‌ కాలేజీలో 1948లో పీహెచ్‌డీ చేశారు. 1965లో కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి డీఎస్సీ డిగ్రీ స్వీకరించారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్, తర్వాత కేంబ్రిడ్జిలోని ఆంత్రోపాలాజికల్‌ మ్యూజియంలో సేవలందించారు. పలు భారత, విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement