
బ్రస్సెల్స్/బీజింగ్: డ్రాగన్ దేశం చైనా అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) దేశాల అధినేతలు విమర్శించారు. వ్యాపార, వాణిజ్యం, సైనిక శక్తి, మానవ హక్కుల విషయంలో చైనా వైఖరిని ఖండించారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో తాజాగా నాటో సమావేశంలో 30 దేశాల అధినేతలు పాల్గొన్నారు. ప్రపంచ భద్రతకు చైనా ఒక సవాలుగా పరిణమించిందని ఒక ఉమ్మడి ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. చైనాను ప్రత్యర్థి దేశంగా పరిగణించేందుకు నాటో అధినేతలు ఇష్టపడనప్పటికీ ఆ దేశ నిరంకుశ విధానాలను మాత్రం తప్పుపట్టారు.
‘నాటో’లో యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు సభ్యత్వం ఉంది. అమెరికా అధ్యక్షుడి హోదాలో జో బైడెన్ పాల్గొన్న తొలి నాటో సమావేశం ఇదే. ఇటీవల జీ7 శిఖరాగ్ర సదస్సులో చైనాకు వ్యతిరేకంగా గళమెత్తిన బైడెన్..‘నాటో’ భేటీలోనూ అదే స్వరం వినిపించారు. కాగా, నాటో’ విడుదల చేసిన ప్రకటనను డ్రాగన్ దేశం ఖండించింది. తాము ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటామని గుర్తుచేసింది. ముప్పు ఎదురైతే మాత్రం తమను తాము రక్షించుకుంటామని తేల్చిచెప్పింది.
చదవండి: దారుణం: కొడుకులపై తండ్రి కాల్పులు.. ఒకరి మృతి