
పారిస్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపుపొందిన ఫ్రాన్స్ దేశస్తురాలు లూసిలీ ర్యాండమ్(118) తుది శ్వాస విడిచారు. కోవిడ్ను జయించిన అత్యంత వృద్ధుల్లో ఒకరిగానూ చరిత్ర సృష్టించిన ఈమెను స్థానికులు సిస్టర్ ఆండ్రీగా పిలుస్తారు. 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్లోని ఎలీస్ పట్టణంలో జన్మించిన ఈమె వృత్తిరీత్యా నర్సు. మంగళవారం టౌలూన్ పట్టణంలో ఈమె మరణించారని ఆమె తరఫు ప్రతినిధి వెల్లడించారు. 2021 జనవరిలో ఈమెకు కరోనా సోకింది.
అయితే, పెద్దగా అనారోగ్య లక్షణాలేవీ కనిపించకపోవడం విశేషం. కోవిడ్ను జయించిన బామ్మగా ప్రాచుర్యంపొందారు. ‘కష్టంగా భావించకుండా ఇష్టంగా పనిచేయడమే నా ఆరోగ్య రహస్యం. 108 ఏళ్ల వరకు నా పనులు నేనే చేసుకున్నా. రోజూ ఒక చాక్లెట్ తినడం, ఒక గ్లాస్ వైన్ తాగడం నా అలవాటు’ అని ఆండ్రీ గతంలో చెప్పారు. ర్యాండమ్ మృతి తర్వాత స్పెయిన్లో నివసిస్తున్న 115 ఏళ్ల అమెరికన్ మరియా బ్రాన్యాస్ మొరేరా ప్రపంచంలో అత్యంత వృద్ధ వ్యక్తిగా రికార్డులకెక్కారు.
చదవండి: జనాభాలో చైనాను దాటేశాం