● ప్రొఫెసర్ కోదండరాం
జనగామ రూరల్: తెలంగాణ ప్రజలు చైతన్యవంతం అయినప్పటికీ మతతత్వ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో భారత్ బచావో సాధిక్ ఫౌండేషన్ ఆధ్వర్యాన ‘ప్రమాదంలో భారత రిపబ్లిక్–పౌరుల పాత్ర’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్తో కలిసి హాజరయ్యారు. కోదండరాం మాట్లాడుతూ.. మతం దేశంలో ఒక రాజకీయ అంశంగా మారిందని, విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి రావడం ప్రమాదకరమన్నారు. పదేళ్లుగా భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను బీజేపీ అపహాస్యం చేసిందని విమర్శించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వమంటే రైతులను జైలుకు పంపుతున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామ్య బద్ధంగా పాలించే వారిని చట్ట సభలకు పంపాలని కోరారు. కార్యక్రమంలో సాధిక్ అలీ, విద్యావేత్త రియాజ్, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, డాక్టర్ రాజమౌళి, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.