● ఉచిత వైద్య శిబిరం
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని తిమ్మాపూర్లో గురువారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మేడ్చల్ మెడిసిటీ ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న 135 మందికి వైద్య పరీక్షలు నిర్వహిహించి మందులు ఇచ్చామని మార్కెటింగ్ ఇన్చార్జి కుమారస్వామి తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు వినయ్, శ్రేయ, పూజిత తదితరులు ఉన్నారు.
● ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
పెద్దశంకరంపేట(మెదక్): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ అవనీష్రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు ఇంటర్ ఫస్ట్ఇయర్లో 119 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్లో 48 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది అభిలాష్, అంజయ్య తదితరులున్నారు.
చిన్నశంకరంపేటలో..
చిన్నశంకరంపేట(మెదక్): ఇంటర్ సప్లిమెంటరి ఎగ్జామ్స్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 12 వరకు ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
● గాలి బీభత్సం
పాపన్నపేట(మెదక్): మండలంలో గురువారం వీచిన జోరు గాలితో పలు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. దీంతో రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. లక్ష్మినగర్, యూసుఫ్పేట, కుర్తివాడ, మిన్పూర్ శివారులో వీచిన హోరు గాలికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. దీంతో వాహనాల రాక పోకలు కొంత నిలిచి పోయాయి. స్థానికులు, సిబ్బంది వాటిని తొలగించి రోడ్డు క్లియర్ చేశారు.
● ఆర్థికసాయం
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందంపేట గ్రామాంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డ తప్పెట సాయికిరణ్ కుటుంబానికి తోటి స్నేహితులు రూ.28వేల ఆర్థిక సాయం అందించారు. మృతుడికి భార్య ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కార్యక్రమంలో టెన్త్క్లాస్మెట్స్, ఎంపీటీసీ శివకుమార్ ఉన్నారు.
● దొంతిలో కళాజాత ప్రదర్శన
శివ్వంపేట(నర్సాపూర్): నేరాల నియంత్రణలో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు గురువారం రాత్రి మండల పరిఽధిలోని దొంతి గ్రామంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా అపరిచితుల ఫోన్కాల్స్, సైబర్ మోసాలు, మత్తు పదార్థాల నియంత్రణ తదితర అంశాలపై కళాజాత బృందం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఉన్నారు.
● విద్యుత్ షాక్తో మూడు గేదెలు మృతి
టేక్మాల్(మెదక్): విద్యుత్ షాక్తో మూడు గేదెలు మృతి చెందిన సంఘటన టేక్మాల్లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... టేక్మాల్ గ్రామానికి చెందిన నడోల్ల శంకరయ్య, లక్కాకుల మల్లప్పకు చెందిన మూడు పాడి గేదెలు మేతకు వెళ్లాయి. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. గ్రామ శివారు ప్రాంతంలోని వ్యవసాయ పొలం వద్ద బుధవారం రాత్రి విద్యుత్ తీగలు తెగిపడగా సరిచేయకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోయారు. రూ.2లక్షల ఆస్తినష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
సంక్షిప్త వార్తలు