
సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ అరెస్ట్.. విడుదల..
అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.
మధ్యంతర బెయిల్..
అయితే అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ బన్నీ హైకోర్టును ఆశ్రయించారు. బన్నీ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అరెస్ట్ అయిన రోజే నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మరుసటి ఉదయమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం)
అసలే జరిగిందంటే..
ఈనెల 5న అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 చిత్రం విడుదలైంది. అయితే అంతకుముందు రోజే ఈ మూవీకి సంబంధించిన బెనిఫిట్ షోను ప్రదర్శించారు. ఈ షోను వీక్షించేందుకు అల్లు అర్జున్ తన భార్యతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్కు వెళ్లారు. అదే సమయంలో అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్పై కూడా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment