ఊ అన్నారా? | Shraddha Kapoor for Pushpa 2 special song | Sakshi
Sakshi News home page

ఊ అన్నారా?

Published Mon, Oct 21 2024 12:05 AM | Last Updated on Mon, Oct 21 2024 12:05 AM

Shraddha Kapoor for Pushpa 2 special song

హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ టైటిల్‌ రోల్‌ చేస్తుండగా, హీరోయిన్‌ శ్రీవల్లిపాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్టు చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. అలాగే మిగిలి ఉన్నపాటలను చిత్రీకరించే పనిలో ఉంది టీమ్‌. ఈ నెలాఖర్లో స్పెషల్‌ సాంగ్‌ను చిత్రీకరించాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఈ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసే హీరోయిన్ల పేర్లలో జాన్వీ కపూర్, మృణాళినీ ఠాకూర్, శ్రద్ధా కపూర్‌ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి.

అయితే శ్రద్ధా కపూర్‌ను యూనిట్‌ సంప్రదించిందని, ఆమే నటించనున్నారని భోగట్టా.  మరి... శ్రద్ధా కపూర్‌ ఊ అన్నారా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్‌’ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘పుష్ప’ సినిమా తొలి భాగం ‘పుష్ప : ది రైజ్‌’లోని స్పెషల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మామ..’లో సమంత మెరిశారు. ఈ సాంగ్‌ ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ‘పుష్ప 2’లోని స్పెషల్‌ సాంగ్‌ ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. తొలి భాగానికి సంగీతదర్శకత్వం వహించిన దేవిశ్రీ ప్రసాద్‌ ‘పుష్ప: ది రూల్‌’కూ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement