
సున్నిపెంటలో భూముల సర్వేపై జేసీ సమీక్ష
శ్రీశైలం: శ్రీశైల మండల కేంద్రమైన సున్నిపెంటలో ప్రభుత్వ భూముల సర్వేపై జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ జెన్కో అతిథి గృహంలో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రెవెన్యూ, అటవీశాఖ, ల్యాండ్ సర్వే, దేవస్థానం అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా.. ఏపీ టూరిజంకు 50 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు సర్వే జరుగుతున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ స్థలాలలో అక్రమ నిర్మాణాలు, స్థలాల ఆక్రమణ, తదితర అంశాలపై కూడా ఆయన చర్చించి ఆక్రమణలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి
బొమ్మలసత్రం: జిల్లాలో పని చేసే పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అధిరాజ్సింగ్రాణా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఇబ్బందులు ఉన్న సిబ్బంది పది మంది సిబ్బంది వినతులు అందజేశారన్నారు. విచారించి వారి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
నాణ్యతా లోపం.. వర్షానికి ఛిద్రం
జూపాడుబంగ్లా: జాతీయరహదారి 340సీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతా లోపంతో చిన్నపాటి వర్షానికే కోతకు గురైంది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి నందికొట్కూరు సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నందికొట్కూరు పట్టణంలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన సర్వీసు రోడ్డు పక్కన ఉన్న సైడ్బర్మ్ భారీగా కోతకు గురైంది. నందికొట్కూరు పట్టణం నుంచి ఆత్మకూరు వైపు వెళ్లే రోడ్డు వెంట తంగడంచ సమీపం వరకు సైడ్బర్మ్ అక్కడక్కడ కోతకు గురైంది. కోట్లాది రూపాయాలతో చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణ పనులను అధికారులు పర్యవేక్షించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
నిలిచిన విద్యార్థి బస్సు
కొత్తపల్లి: కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో విద్యార్థులు, గ్రామీణ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆత్మకూరు నుంచి విద్యార్థులతో కొత్తపల్లి మీదుగా జడ్డువారిపల్లెకు బయలుదేరిన విద్యార్థి బస్సు మధ్యలోనే నిలిచిపోయింది. ఎదురుపాడు బస్టాండ్ సెంటర్కు చేరుకొనే సరికి ఇంజిన్లోని గేర్రాడ్డు సీల్ దెబ్బతిన ఆయిల్ పూర్తిగా కింద పోయింది. దీంతో బస్సు ఆగి పోయింది. కాగా బస్సులో ఉన్న 20 మంది విద్యార్థులు ఇంటికి చేరుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గతంలో ఇలాగే బస్సు మరమ్మతుకు గురై నిలిచిపోయింది. కండీషన్లో ఉన్న బస్సులను నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉర్దూ వర్సిటీకి పాత భవనాలు
కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీకి కర్నూలులోని ఫర్మెన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాత భవనాలు కేటాయించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, రూసా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త ఆదేశాలు జారీ చేశారు. ఉర్దూ వర్సిటీకి ప్రభుత్వ భవనాలను కేటాయించాలని వర్సిటీ ఇన్చార్జ్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పి. ఎస్. షావలి ఖాన్ లేఖ రాశారు. దీంతో రూసా నిధులతో నిర్మించిన నూతన భవనాల్లోకి ఫర్మెన్ కళాశాలను మార్చుకొని పాత భవనాలను ఉర్దూ వర్సిటీకి అప్పగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అందులో ఎప్పటి వరకు అనే సమయం లేకపోవడంతో వర్సిటీ ఇన్చార్జ్ వీసీ మరలా ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఈనెల చివరిలోగా ఉర్దూ వర్సిటీకి పాత బిల్డింగ్స్ను అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు.

సున్నిపెంటలో భూముల సర్వేపై జేసీ సమీక్ష

సున్నిపెంటలో భూముల సర్వేపై జేసీ సమీక్ష

సున్నిపెంటలో భూముల సర్వేపై జేసీ సమీక్ష