నారాయణపేట: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎరగ్రుట్ట వద్ద గల సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్లను,ఓటింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులందరూ ఈ నెల 8 వరకు వినియోగించుకోవచ్చని తెలిపారు. పోలింగ్ బూత్లను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. సెంటర్ లోపలికి సెల్ ఫోన్లను అనుమతించరాదని అక్కడి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, తహసిల్దార్లు ఉన్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ, లెక్కింపు తదితర ఏర్పాట్లపై అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో ఈవీఎం యంత్రాల లెక్కింపు స్ట్రాంగ్రూమ్ తదితర అంశాలపై ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి పరిశీలించారు. ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నారాయణపేట జిల్లా ఈ వీఎంల పంపిణీ ఓట్ల అనంతరం లెక్కింపు స్ట్రాంగ్ రూమ్ ల పై అధికారుల తో చర్చించారు. కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, అధికారులు ఉన్నారు.