భర్తల కొంప ముంచిన ‘పీఎంఏవై’ రుణాలు.. లవర్లతో భార్యలు పరార్‌! | UP: 4 Women Flee With Lovers After Receiving PMAY Money Husbands Shock | Sakshi
Sakshi News home page

భర్తల కొంప ముంచిన ‘పీఎంఏవై’ రుణాలు.. లవర్లతో భార్యలు పరార్‌!

Published Wed, Feb 8 2023 6:10 PM | Last Updated on Wed, Feb 8 2023 7:00 PM

UP: 4 Women Flee With Lovers After Receiving PMAY Money Husbands Shock - Sakshi

లక్నో: ఉత్తర  ప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం డబ్బులు తీసుకున్న నలుగురు వివాహితలు.. తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పరారయ్యారు. భార్యలు చేసిన ఊహించని ఘనకార్యం తెలుసుకొని ఆశ్చర్యపోవడం భర్తల వంతైంది.

‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం.. దీని ద్వారా దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు రుణాలు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద వివిధ వర్గాల వారికి మూడు నుంచి 18 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. అయితే పీఎంఏవై కింద ఇచ్చే రుణాలను కేంద్రం మహిళల పేరు మీదనే అందిస్తుంది. అంటే ఇంటి యజమాని తప్పనిసరిగా మహిళనే అయి ఉండాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న 40 మందికి రుణాలు మంజూరయ్యాయి. అందులో మొదటి విడతగా ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.50,000 చొప్పున నగదును జమచేశారు. అయితే ఈ పథకం కింద రుణాలు పొందిన వారిలో నలుగురు మహిళలు తమ అకౌంట్లకు చేరిన 50 వేల రుపాయలతో కనిపించకుండా పోయారు. భర్తలు వారి కోసం ఆరా తీయగా షాకింగ్‌ విషయం తెలిసింది.

వారి భార్యలు తాము ప్రేమించిన వ్యక్తులతో పరారైనట్లు తెలింది. ఇలా పారిపోయిన వాళ్లలో జిల్లాలోని బెల్హారా, బంకీ, జైద్‌పూర్‌, సిద్ధౌర్‌ నగర పంచాయతీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కాగా భార్యలు పారిపోవడం భర్తల పాలిట శాపంగా మారింది. ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ వింత ఉదంతం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టకపోతే ఇచ్చిన డబ్బులను రికవరీ చేస్తామని జిల్లా అధికారులు బాధిత భర్తలను హెచ్చరించారు.

నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులు నోటీసులు పంపారు. దీంతో కంగుతిన్న భర్తలకు  ఏమి చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. చివరికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తమ భార్యలు ప్రేమించిన వారితో వెళ్లిపోయారని.. వారి బ్యాంక్ ఖాతాలలోకి పీఎంఏవై రెండో విడత రుణాలను జమచేయవద్దని అధికారులకు మొరపెట్టుకున్నారు. మరోవైపు పారపోయిన లబ్ధిదారుల నుంచి సొమ్మును ఎలా రికవరీ చేయాలో తెలియక జిల్లా అధికారులు తలపట్టుకుంటున్నారు.
చదవండి: పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం.. రాహుల్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement