
ఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు కాంగ్రెస్ నేతలు కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ప్రశంసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను కొనియాడుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ముందు వరుసలో ఉండగా.. ఇక, తాజాగా ఆ లిస్టులోకి కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా చేరిపోయారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఆయన ప్రశంసించడంతో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 విషయమై ఖుర్షీద్ ప్రస్తావిచడంపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత దౌత్య బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండోనేషియాకు వెళ్లిన బృందంలో సల్మాన్ ఖుర్షీద్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రతినిధి బృందంతో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడారు. జమ్ము కశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేయడం అభినందనీయం. ప్రత్యేక హోదా ఇచ్చే రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్, భారతదేశంలోని మిగతా ప్రాంతాల నుంచి జమ్ముకశ్మీర్ వేరుగా ఉందనే భావన చాలా కాలంగా ఉంది. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ భావన ముగిసింది.

దీంతో, జమ్ముకశ్మీర్ కూడా భారత్లోని ప్రాంతమనే భావన ఏర్పడిందన్నారు. ఇదే సమయంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్ము కశ్మీర్లో అభివృద్ధి, ఇటీవల జరిగిన ఎన్నికల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో 65 శాతం ఓటర్ల భాగస్వామ్యం ఉంది. ఇది కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దోహదపడిందని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
ఇదిలా ఉండగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ చేసిన తర్వాత కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు తప్పుబట్టారు. ఆర్టికల్ 370ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ రద్దు కారణంగా జమ్ముకశ్మీర్ ప్రజలకు ఉన్న ప్రత్యేక హక్కులు కోల్పోతారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు.