2027 మార్చి 1నుంచి జన గణన | India to begin next Census in 1 April 2026 | Sakshi
Sakshi News home page

2027 మార్చి 1నుంచి జన గణన

Jun 5 2025 5:13 AM | Updated on Jun 5 2025 5:30 AM

India to begin next Census in 1 April 2026

 దేశంలో తొలిసారిగా జన గణనతోపాటు కుల గణన

హిమాలయ పర్వత ప్రాంతాల్లో 2026 అక్టోబర్‌ 1నే శ్రీకారం  

కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన  

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జన గణనతోపాటే కుల గణన దిశగా అడుగులు పడుతున్నాయి. 2027 మార్చి ఒకటో తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జనాభా లెక్కల సేకరణలో అంతర్భాగంగా కులాల వారీగా జనాభా గణాంకాలు కూడా సేకరించాలని నిర్ణయించడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈసారి రెండు దశల్లో జన గణన నిర్వహించనున్నారు. హిమా లయ పర్వత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 2026 అక్టోబర్‌ 1న జన గణన ప్రారంభించాలని నిర్ణయించారు. జన గణన, కుల గణన అంశాన్ని ఈ నెల 16వ తేదీన గెజిట్‌లో ప్రచురించే అవకాశం ఉంది.  

16 ఏళ్ల తర్వాత మళ్లీ జన గణన  
సెన్సెస్‌ యాక్ట్‌–1948, సెన్సెస్‌ రూల్స్‌–1990 ప్రకారం దేశంలో ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కల సేకరణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా 2011లో జన గణన జరిగింది. దేశంలో 121 కోట్లకు పైగా జనాభా ఉన్నట్లు అప్పట్లో తేలింది. జనాభా వృద్ధి రేటు 17.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. 2021లో మళ్లీ జన గణన జరగాల్సి ఉండగా కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల అనివార్యంగా వాయిదా పడింది. 16 ఏళ్ల  తర్వాత మళ్లీ జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 

ఈసారి జరిగే జన గణనకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. కులాల జనాభా లెక్కల కూడా సేకరించబోతున్నారు. కుల గణన కోసం వివిధ రాజకీయ పారీ్టలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. బిహార్, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కుల గణన నిర్వహించాయి. దీంతో దేశమంతటా ఈ ప్రక్రియ ప్రారంభించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. కుల గణన వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తే ఆయా వర్గాలకు మేలు జరుగుతుందని మేధావులు, నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కుల గణనకు ఆమోదం తెలిపింది.  

1971 నుంచి లోక్‌సభ సీట్ల సంఖ్య యథాతథం  
దేశంలో లోక్‌సభ నియోజకవర్గాలు, రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం పెండింగ్‌లో ఉంది. జన గణన పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు. తాజా జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు మారే అవకాశం ఉంది. అన్ని నియోజకవర్గాల్లో జనాభా దాదాపు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. అయితే, నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందా? లేదా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల సేకరణ జరిగిన ప్రతిసారీ నియోజకవర్గాల సంఖ్య, సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయాలి.

 1976 నుంచి నియోజకవర్గాల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకుండా నిలిపివేశారు. జనాభాను నియంత్రణను ప్రోత్సహించాలన్నదే దీని అసలు ఉద్దేశం. వాస్తవానికి నియోజకవర్గాల సంఖ్య పెంపుపై నిషేధం 2001 దాకానే అమలు కావాలి. కానీ, 2026 దాకా పొడిగించారు. 2001 తర్వాత నియోజకవర్గాల సరిహద్దులు, ఎస్సీ, ఎస్టీల రిజర్వ్‌డ్‌ స్థానాల్లో మార్పులు జరిగినప్పటికీ మొత్తం నియోజకవర్గాల సంఖ్య మారలేదు. ఈ సంఖ్య 1971 నుంచి 543గానే కొనసాగుతోంది. అప్పటితో పోలిస్తే దేశ జనాభా రెండు రెట్లకు పైగానే పెరిగింది. నియోజకవర్గాల సంఖ్యలో మాత్రం మార్పులేదు.  

దక్షిణాది రాష్ట్రాల ఆందోళన  
మరోవైపు జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య పెంచితే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తరాదిన జనాభా పెరగడం, దక్షిణాదిన తగ్గడమే ఇందుకు కారణం. ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యను యథాతథంగా కొనసాగించి జనాభా లెక్కల ఆధారంగా పునరి్వభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు 26 సీట్లు కోల్పోతాయని, ఉత్తరాది రాష్ట్రాలకు అదనంగా 31 సీట్లు లభిస్తాయని అంచనా. ఒకవేళ 2019లో ప్రతిపాదించినట్లుగా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 848కు పెంచి, పునరి్వభజన చేపట్టినా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement