
సాక్షి, ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు బయల్దేరారు. మూడురోజులపాటు ఆయన అక్కడ పర్యటిస్తారు. సతీసమేతంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్తున్న సంగతి తెలిసిందే.
ద్వైపాక్షిక ఒప్పందాల బలోపేతం ప్రధానాంశంగా అమెరికా పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. అలాగే అమెరికా చట్ట సభలో ప్రసంగంతో పాటు అక్కడి వ్యాపారవేత్తలు, భారతీయ ప్రముఖులతో ప్రధాని భేటీ అవుతారు. అలాగే.. అధ్యక్ష భవనం వైట్హౌజ్లో జరగబోయే అధికారిక విందు కార్యక్రమానికీ హాజరు కానున్నారు.
బుధవారం(జూన్ 21) ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా.. ఐక్యరాజ్యసమితి భవనంలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తారు.
జూన్ 22వ తేదీన అమెరికన్ కాంగ్రెస్(పార్లమెంట్)లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. భారత్ తరపున ఈ గౌరవం రెండుసార్లు అందుకున్న తొలి ప్రధాని మోదీనే.
శుక్రవారం, వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్లో వ్యాపారవేత్తలతో పాటు వందల మంది ప్రవాస భారతీయులు పాల్గొనే సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు.
ఇక భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలు ఈ పర్యటనలోనే జరగనున్నాయి. ఈ చర్చల్లోనే ఇండో ఫసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ(IPEF)లోకి భారత్ను అమెరికా ఆహ్వానించే అవకాశమూ లేకపోలేదు.
రక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్–అమెరికా చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయి. అయితే.. మోదీ అమెరికా పర్యటనలో ఇదే అంశంపై విస్తృతంగా చర్చలు జరిగే అవకాశం లేకపోలేదు.
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL).. GE-F414 జెట్ ఇంజిన్ను భారత్లో తయారు చేసేందుకు జనరల్ ఎలక్ట్రిక్తో మల్టీ మిలియనీర్ డాలర్ ఒప్పందం జరిగే అవకాశం ఉంది.
అమెరికాలో పర్యటిస్తున్న మూడో భారత ప్రధాని నరేంద్ర మోదీ. 1963 జూన్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, 2009 నవంబర్లో మన్మోహన్ సింగ్లు భారత ప్రధాని హోదాలో అగ్రరాజ్యంలో పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment