వైఎస్సార్ సీపీ జిల్లా లీగల్ సెల్ కార్యాలయం ప్రారంభం
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని రెడ్డినగర్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా కార్యాలయం గురువారం ప్రారంభమైంది. కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర లీగల్సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క పెదకూరపాడు నియోజకవర్గంలోనే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై 300 పైగా అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పించేందుకు లీగల్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ బాధితులకు జిల్లా లీగల్ సెల్ కార్యాలయం సహాయపడుతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment